ఎలాంటి సందేహం లేదు. మురళి మద్రాస్ వెళ్ళిన విషయం తెలీసి సాలెగూటి కొచ్చాడు. ఈ రోజుతో వాడి నాటకానికి అర్జంటుగా తెర పడిపోతుంది.
మెట్లు త్వరత్వరగా దిగి కిందకు వెళ్ళాడతను. నరసింహాన్ని కోపంగా చూశాడు మురళి.
"ఈ ఘూర్ఖాని తీసి పారెయ్ మని చెప్తే వినవేం ? నేనెప్పుడు ఇంటికొచ్చినా పేచీగానే వుంది వీడితో-"
ఘూర్ఖా నరసింహం రావటం చూసి మురళికి దారి ఇచ్చాడు.
మురళి లోపలికొచ్చి హాల్లోనే కూలబడ్డాడు.
"రాధా ! టీ తీసుకురా ! అర్జంట్!" అన్నాడతను.
రాధ బయటికొచ్చి అతనిని చూసి నివ్వెరపోయింది.
"అదేమిటి, మీరు మద్రాస్ వెళ్ళలేదా !" అంది ఆశ్చర్యంగా.
ఆ మాటలు మురళికి చిరాకు కలిగించినయ్.
"నేను మద్రాస్ వెళ్ళటం ఏమిటి ?"
"మీరు మద్రాస్ వెళ్తానన్నారుగా ఇందాక ?"
"నేనన్నానా ?"
"అవునండీ ! అలా మాట్లాడతారేమిటి ? ఇంతకు ముందేగా సూట్ కేస్ తీసుకెళ్ళిందీ ?"
మురళి ఆశ్చర్యంగా నరసింహం వేపు చూస్తూ లేచినుంచున్నాడు.
"కొంపదీసి వాడు మళ్ళీ రాలేదుకదా ?"
నరసింహం నవ్వాడు.
"ఒరే హరికృష్ణా ! ఇంతకాలం జాగ్రత్తగా మానేజ్ చేశావ్. ఇప్పుడు మాత్రం పప్పులో కాలేశావ్. మా మురళి ఇందాకే మద్రాస్ వెళ్ళాడు. ఆ విషయం పాపం నీకు తెలిస్చావలేదు. లే - నీ ఆఖరిక్షణాలు దగ్గర పడ్డాయ్." అన్నాడు నరసింహం.
"ఏమిటి నువ్ మాట్లాడేది ? నేను మురళిని మావయ్యా ! వాడు మళ్లీ మిమ్మల్ని మోసం చేశాడు."
"నీ ఆటలు ఇంక సాగవని ఓసారి చెప్పాను కదా ! ఒరే రంగా-" అంటూ అరిచాడు నరసింహం. లోపలి గదిలో దాగున్న రంగా పరుగుతో వచ్చి మురళీని రెక్కలు విరిచి పట్టుకున్నాడు.
"ఒరే హరికృష్ణా ! ఇంక నీ నాటకానికి తెరపడిందన్నాను కదా ! అంచేత నటించటం ఆపేయ్ ! నన్ను ఇంతవరకూ ఎవరూ ఫూల్ చేయలేదు. చేసిన వాడెవడూ తప్పించుకోనూ లేదు. లేకపోతే నీ భరతం పడతానికి కొంచెం టైమ్ ఎక్కువ పట్టింది..."
"నీకు పిచ్చెక్కింది ! నేను మురళినేనని చెప్తున్నా వినిపించుకోవేం ? కావాలంటే మనద్దరికి గుర్తుగా ఈ పులిగోరు వేశావ్ గా నా మెళ్ళో - చూడు-" అంటూ తన మెడలోని పులిగోరు తీసి నరసింహానికి చూపించాడతను.
నరసింహం మళ్ళీ నవ్వాడు.
"ఒరేయ్- నువ్ చాలా తెలివిగలాడివని నేను వప్పుకుంటున్నా కదా ! అంచేత ఇంక నీ తెలివితేటల ప్రదర్శన ఆపెయ్__" అంటూ రంగాతో "ఒరే రంగా ! ఇంకా చూస్తావేమిట్రా... వీడికివ్వాల్సిన గౌరవ మర్యాద లిచ్చేయ్ !"
రంగా పాంట్ జేబులోనుంచి కట్టి తీశాడు.
"నేను ఆరోజు పొరబాటున వదిలి తప్పుచేశాన్రా ! ఇప్పుడు తప్పుని సరిజేసుకుంటాను- నువ్వు నా దగ్గర ఏ మాత్రం తెలివితేటలు చూపించకు" అంటూ అతని గుండెలమీద కత్తిమొన ఉంచాడు.
మురళి పాలిపోయిన మొఖంతో రాధవేపు చూశాడు.
రాధ పరుగుతో మురళి దగ్గరకు నడిచింది.
"నాన్నా ఒకవేళ అతను- వారేనేమో- నాకు భయంగా ఉంది ! అప్పుడే అతన్నేమీ చేయకండి !" అంది కలవరపాటుతో.
"నీకు అనుమానం అఖ్ఖర్లేదమ్మా వీడు మన మురళి మాత్రం కాదు - నాకు తెలుసు కదా !"
"ఎలా తెలుసు మీకు ?"
"మురళి ఇంతకుముందే కదా మద్రాస్ వెళ్ళాడు ?"
"ఆ మాట నిజమే కానీ...నాకంతా అయోమయంగా ఉంది" పోనీ ఆయన వచ్చేవరకూ ఇతనిని బంధించి ఉంచితే..."