Previous Page Next Page 
వేగుచుక్క పేజి 32


    "లేదమ్మా లేదు! నా కొడుకు నా అనసూయ కడుపులో పిండంగా ఉండగానే నన్ను అండమాన్స్ తీసుకొచ్చేశారు అప్పటినుంచీ ఇక్కడే....."

    అంటూ నెమ్మదిగా దగ్గరకొచ్చి, పింగాణీ బొమ్మను తాకి చూసినట్లు అతి జాగ్రత్తగా  ఆమె బుగ్గలను తాకి చూశాడు ఆయన.

    "నా మనవరాలివా నువ్వు! నీ పేరేమిటన్నావూ?"

    "అనూహ్య!"

    "అనూహ్య! అనూహ్య!" అనుకున్నాడు ఆయన. తర్వాత నెమ్మదిగా అడిగాడు-

    "మీ నాన్న పేరేమిటమ్మా?"

    "శంకరావు" అంది అనూహ్య జాలిగా. తన కన్న కొడుకు పేరు కూడా తెలియదన్నమాట ఈయనకి. ఆమెకి ఇదంతా కలలాగా ఉంది. నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఎప్పుడో చనిపోయాడనుకున్న తాతయ్య హఠాత్తుగా ఇక్కడ కనబడటమేమిటి?

    దీర్ఘంగా నిట్టూర్చాడు సీతాపతి.

    "కొడుకుని చూసుకోకుండానే మనవరాలిని చూస్తూ వుంటే ఎలా ఉందో తెలుసా అమ్మా! చిన్నతనంలో చదువుకునే రోజుల్లో ఒక్కొక్క సారి రెండేసి క్లాసులు ఒక్కసారిగా పైకి నెట్టేసి డబుల్ ప్రమోషన్ ఇస్తారు చూడు! అలా ఉంది! జీవితంలో డాబుల్ ప్రమోషన్ వచ్చినట్లు...." ఆయన గొంతు రుద్దమయింది.

    "అందరూ నువ్వు చనిపోయావనే అనుకుంటున్నారు తాతయ్యా! ఏం జరిగింది అసలు?"

    "నీకు నిన్న చెప్పాను కదూ సాగర్! నువ్వు చెప్పు అమ్మాయికి."

    నిన్న జరిగినదంతా గుర్తువచ్చింది సాగర్ కి. చెట్ల వెనక  కనబడుతున్న ఆకారాన్ని వెదుక్కుంటూ వెళ్ళాడతను అది  తననే గమనిస్తోంది తమ ఆగింది. తను కదిలితే కదిలింది, మెల్లి మెల్లిగా అర్థమయింది సాగర్ కి, తన ముందు నిలబడి ఉన్నది తనలాంటి మనిషేనని. బాగా వయసుమళ్ళిన మనిషి. ఆయన కళ్ళార్పకుండా చాలాసేపు సాగర్ ని పరిశీలనగా చూశాడు. తర్వాత, "నువ్వు కూడా అండమాన్ సెల్యులార్ జెయిల్లో ఖైదీవా? సెల్ నెంబరెంత?" అని అడిగాడు. ఒక్కొక్క పదం, గుర్తు తేచుకుని పలుకుతున్నట్లు, "ఏ నేరం చేశావు నువ్వు బ్రిటిష్ వాళ్ళ మీద బాంబు వేశావా? వందేమాతరం అని వందసార్లు అరిచావా? ఏం నేరం చేశావు నువ్వు?"

    ఆయన మాట్లాడుతున్నదేమిటో కొద్ది క్షణాల సేపు అర్ధంకాలేదు సాగర్ కి. తర్వాత గ్రహించాడు, ఆయన ఏదో భ్రమలో ఉన్నాడని. ఆయనకి దైరం కలిగేలా మాట్లాడుతూ, ప్రశ్నలు వేసి నమ్మశక్యంగాని నిజాలను తెలుసుకున్నాడు. అద్భుతమైన కట్టు కథలాంటిది. ఆయన చెప్పిన వృత్తాంతం.

    "కాదు! మీరే చెప్పాలి! మీ మనవరాలి చిన్నప్పుడు వళ్ళో కూర్చోబెట్టుకుని కథలు చెప్పడం మిస్సయిపోయారు మీరు. ఇప్పుడింక ఆ ముచ్చట తీర్చుకోవచ్చు నిశ్చింతగా" అన్నాడు నవ్వుతూ.

    అక్కడి వాతావారణంలో చిక్కగా అలుముకుని ఉన్న మెలో డ్రామాని తగ్గించడానికి అతను చేసిన మొదటి ప్రయత్నం అది.

    "పదండి! గుహకి వెళుతూ మాట్లాడుకుందాం" అన్నాడాయన దారి తీస్తూ.

    నడుస్తూ చెప్పడం మొదలెట్టాడు.

    ఆయన చెబుతున్న ఆ సమాచారాన్ని చెవులప్పగించి వింటున్నారు అనూహ్య, సాగర్.

    "స్వాతంత్ర్యోద్యమ సమయంలో........గాంధీజి పిలుపునందుకుని అహింసా మార్గంతో ఉద్యమం మొదలెట్టినవాళ్ళు కొందరయితే, సర్దార్ భగత్ సింగ్, చంద్రశేఖర అజాద్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ లను ఆదర్శంగా పెట్టుకుని ఆయుధాలు పట్టుకున్నవాళ్ళు మరికొందరు.

    వాళ్ళలో ఒకడు సత్యం. నాకంటే చిన్న అతను. కానీ దేశభక్తిలో నాకంటే మిన్న.

    అమాయకులైన భారతీయ రాజకీయ ఖైదీలపై తప్పుడు కేసులు  బనాయించి ఉరికంబమెక్కిస్తున్న ఒక పోలీసాఫీసారుపై తను తయారుచేసిన నాటు బాంబు విసిరాడు సత్యం. ఆ సమయంలో అతనితో బాటు నేనూ ఉన్నాను.

    ఇద్దరం దొరికిపోయాం పోలీసులకి. విచారణ తర్వాత అండమాన్స్ కి తీసుకొచ్చారు మమ్మలి.

    అండమాన్స్ సెల్యులార్  జెయిలంటే బ్రిటిషువాళ్ళు నిర్మంచిన భూలోక నరకమన్న మాట.

    అందులోపడ్డ మరుసటి రోజునుంచీ తప్పించుకోవడం ఎలాగా అనే ధ్యాసే సత్యానికి.

    తప్పించుకుపోయి, తెల్లదొరలను అదరగొట్టాలి, బెదరగొట్టాలి, తరిమికొట్టాలి. అది తప్ప మరో ఆలోచన లేదు అతనికి.

    ఒక రోజున ఖైదీలనందరినీ పశువుల మందలాగా  అడవిలోకి తోలుకుపోయి అక్కాడ  గొడ్డుచాకిరీ చేయించారు. ఖైదీలందరికీ పాదాలకీ, నడుములకీ కలుపుతూ ఇనుప చట్రాలు బిగించి ఉండేవి.

    ఆ రోజున అవి తొలగించారు, పని చేయించడం కోసం.

    వార్డెన్ కొంచెం ఆదమరిచి ఉన్న సమయంలో పిల్లిలా నా దగ్గరకు వచ్చాడు సత్యం ఇద్దరం చెట్ల గుబురులోకి పరిగెత్తాం.

    "ఇలా ఎక్కడికెళతాం? ఎంతదూరం వెళతాం?" అన్నాను నేను సందేహంగా.

    "వీరసావర్కర్ మనలాగే అండమాన్స్ జేయిల్లో నుంచీ తప్పించుకుని సముద్రాన్ని ఈది మెయిన్ లాండు చేరలేదా? అలాగే మనమూ చేరుకోగలం? ఆత్మవిశ్వాసం అద్భుతాలు చేయిస్తుంది!" అన్నాడు సత్యం.

    ఈ లోగా మేం తప్పించుకుపోయామని గ్రహించారు అధికార్లు. వేటకుక్కలని ఉసి గొలిపారు. మమ్మల్ని తరుముతూ వచ్చాయి కుక్కలు తుపాకులు శబ్దాలు వినబడ్డాయి.

    ఒక బుల్లెట్ నిప్పుకణికలా నా పాదాన్ని రాసుకుంటూ పోయింది.

    అలాగే కుంటుతూ పరిగెత్తి సముద్రంలో దూజేశాను. సత్యం ఎటు వెళ్ళాడో తెలియదు. కానీ అతను వెనక్కిపోయే ఘటం కాదని నాకు తెలుసు.

    ఉప్పునీళ్ళు తగిలి నిప్పులా మండుతున్న కాలితోనే చాలా మైళ్ళు ఈడాను నేను.

    చివరికి ఇంక ఈదడం అసాధ్యమనిపించింది. కనబడిన ఒక ద్వీపం చేరి ఒళ్ళెరుగని ఆయాసంతో పడిపోయాను. నాలుగు రోజుల పాటు మగతలో ఉన్నాను.

    ఆ అడవిలో ఉన్న మూలికల ప్రభావం ఆ వాతావరణంలో, ఆ నీటిలో ఉందేమో నాకు తెలియదు. మొత్తానికి గాయం సెప్టిక్ కాకుండా తగ్గిపోయింది.

    అది మొదలు!

    అప్పటి నుంచీ వేటాడబడుతున్న జంతువులా బతుకుతున్నాను ఈ  అడవుల్లోనే. ఏ క్షణంలో ఏ ఇంగ్లీషు పోలీసు వచ్చి నన్ను తిరిగి సెల్యులార్ జెయిల్లో పెడతాడో అన్న భయమే.

    ఇంగ్లీషు వాళ్ళ పీడ దేశానికి తొలగిందని, ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చిందనీ నాకు తెలియదు, నిన్న  సాగర్ చెప్పేదాకా."

    సాగర్ కీ, అనూహ్యకి గుండె నీరయిపోయింది.

    భ్రమలో ఉండిపోయి, బంగారం లాంటి జీవితాన్ని ముప్పావు భాగం వ్యర్ధం చేసేసుకున్నాడు ఈయన, దాదాపు నలభై ఏళ్ళపాటు ఈ  అడవుల్లోనే జంతువులా బతికాడు!

    భర్త బతికి ఉండీ  వైధవ్యం అనుభవించింది అనసూయమ్మ.

    ఎంత చిత్రమైనదీ విధి.

    "నిన్న అడగడం మర్చిపోయాను సాగర్ బాబూ మన గాంధీగారు బాగున్నారా?" అన్నాడు సీతాపతి.

    నిట్టూర్చాడు సాగర్. "గాంధీ గారిని గాడ్చే అనే ఉన్మాది స్వాతంత్ర్యం వచ్చిన మరు సంవత్సరమే  కాల్చి చంపేశాడు సీతాపతిగారూ! ఆయన నిర్మాణ దినాన్ని జాతీయ శెలవుదినంగా వాటిస్తున్నారు.

    ఆ ఒక్క రోజే ఆయన గుర్తువచ్చేది ప్రజలకీ, నాయకులకీ కూడా.

    జనం గాంధీజీనీ, ఆయన సందేశాలనీ మర్చిపోయారు. ఆయన చూపిన దారిలో నడవడం మానేశారు.

    కానీ, వీధి వీధికీ ఆయన విగ్రహాలు మాత్రం వెలిశాయి. ఎలక్షన్లో పార్టీల జండాలు ఆ విగ్రహాల మెడలకీ, చేతులకీ, కాళ్ళకీ ఉచ్చుల్లా బిగిస్తారు.

    అందుకు మాత్రమె పనికి వస్తున్నాయి ఆ విగ్రహాలు సీతాపతిగారూ. అంతే."

    "సుభాష్.......సుభాష్ చంద్రబోస్?"

    "ఆయన జపాన్ దగ్గర విమాన ప్రమాదంలో చనిపోయారు."

    "నెహ్రూ, ప్రకాశం, పట్టాభి, పటేల్?"

    "ఆ దేశభక్తులందరూ వెళ్ళిపోయారు సీతాపతిగారూ తరం మారింది! దేశాభుక్తలు తయారయ్యారు ఇప్పుడు!

    మీలాంటి త్యాగధనులు వీర విహారము చేసిన రాజకీయాలు ఇవాళ వీధి  గూండాల వినోదంగా మారాయి. బ్లాక్ మనీ గాళ్ళ చేతిలో వ్యాపార సాధనంగా మారాయి."

    చాలాసేపు మౌనంగా ఉండిపోయారు సీతాపతిగారు. ఆయన  కన్నా కలలన్నీ కళ్ళముందే  భగ్నమయిపోయినట్లయింది.

    "పరిస్థితులు అంత ఘోరంగా మారితే ఇంక నేను మాత్రం వచ్చి చేసేదేముంది బాబూ! నువ్వు చెబుతున్నది వింటుంటేనే గుండె చెరువయి  పోయింది. ఇంక వచ్చి స్వయంగా చూస్తే ఈ ముసలి గుండె ఆగిపోతుందేమో! అయినా స్వాతంత్యం వచ్చాక ఈ ముసలి వాడి అవసరం దేశానికి ఏముంటుంది నాయనా?"

    తల అడ్డంగా ఊపాడు సాగర్.

    "మీరు రావాలి సీతాపతిగారూ, పుట్టుకతోనే వృద్దులయినట్లు నిజంగా ఉండి నైతిక  విలువలు మర్చిపోతున్నట్లున్న ఈ తరానికి, వందేమాతరం అని ఎలుగెత్తి అరుస్తూ సర్వస్వం త్యాగం చేసిన మీ తరం రోజులు గుర్తు తెచ్చి స్ఫూర్తిని కలిగించాలి.

    దేశంకోసం  త్యాగం చేసి, దేశ సేవ అన్నది యోగంగా భావించిన వాళ్ళే నాయకులయ్యేవారు మీ రోజుల్లో భోగులూ, పదవీకాంక్ష రోగులూ మాత్రమే నాయకులవుతున్నారు ఇప్పుడు.

    త్యాగానికి ఉదాహరణ అయిన మీరూ, మీ వృత్తాంతం జనానికి తెలిసి ఉత్తేజం రావాలి.

    దేశానికి మీలాంటి వాళ్ళ అవసరం  ఇదివరకటికంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది సీతాపతిగారు దేశానికి మీరు కావాలి.

    "మీరు మాతో రావాలి."

    ఏదో గుర్తువచ్చినట్లు అన్నాడు సీతాపతి.

    సత్యం సత్యం ఎక్కడున్నాడు ఇప్పుడు?"

    "ప్రస్తుతం నాయకులలో ఆ పేరుతో ఎవరూ లేరు."

    "సత్యం పక్కనఉంటే, అద్భుతాలు చెయ్యవచ్చు మనం అన్నట్లు ఈ సంగతి చెప్పావా అమ్మాయికి?"

    "ఏం సంగతి?" అంది అనూహ్య.

    ఆయన గుంభనంగా నవ్వి,  ఆప్యాయంగా ఆమె చేతిని పట్టుకుని ముందుకు నడిచాడు.

    గుహ పైభాగంలో పెద్ద అటకలా ఉంది రాతి ఆకృతి.

    దాన్ని చేరుకోవడానికి రాళ్ళు మెట్లాలా అమర్చి ఉన్నాయి.

    నెగడులో  కాలుతున్న కట్టెను చేత్తో పట్టుకున్నాడు ఆయన. మెట్లుఎక్కి పై  భాగం చేరుకున్నారు.

    పైకి ఎక్కగానే అనూహ్య కళ్ళు జిగేలుమన్నాయి.

    అక్కడ___

    వజ్రాలు, వైఢూర్యాలూ మరకత మానిక్యాలూ, పుష్యరాగ గోమేధి కాలూ, నీలాలు, కెంపులు, పచ్చలు, ముత్యాలూ, పగడాలు__

    బంగారం!

    బంగారపు దిమ్మలు, కణికెలు, అచ్చులు, తీగెలు, ఆభరణాలు.

    ప్రపంచంలో అక్కడకాక మరొక్కచోట మాత్రమే అంత బంగారపు నిలువ ఉంది!

    అది ఫోర్ట్ నాక్స్ అమెరికా దేశపు బంగారపు రిజర్వులు దాచే స్థలం.

    మనుషులు మొయ్యలేనంత బంగారం ఉంది అక్కడ. 

    నాణాలు!

    బంగారపువి, వెండివి రకరకాల దేశాలవి, రకరకాల సామ్రాజ్యాలవి, గుండ్రటివి, నలుచదరపువి, ఆరుకోణాలతో ఉన్నావి, రకరకాల భాషలతో వాటిపై ముద్రించి ఉంది.

    సాగర్ మామూలుగానే ఉన్నాడు. కానీ అనూహ్య మాత్రం దిగ్భ్రమలో చాలాసేపటివరకూ తేరుకోలేకపోయింది.

    సీతాపతి మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు.

    "సంవత్సరాల తరబడి ఈ ద్వీపంలో ఒంటరిగా తిరుగుతూ ఏకాంతంతో పిచ్చేత్తిపోకుండా ఉండడానికి ఏదో ఒక వ్యాపకం కల్పించుకునే వాణ్ని.

    కింద నుంచి తెల్లటి కందకంలా కనబడుతున్నది. పై నుంచి చూస్తే ఏనుగు బొమ్మలా కనబడుతుందని చాలా సంవత్సరాల తర్వాత గమనించాను నేను.

    ఈ కుర్రాడు సాగర్. దాన్ని గంటలోనే గమనించాడుట పాదరసం లాంటి బుర్ర కదూ!

    అడుగులు వేస్తూ దాని చుట్టు కొలత ఎంత ఉందో కనుక్కోదలుచుకున్నాను. ఏమీ తోచకే అలా చేస్తున్నప్పుడు అప్రయత్నంగా ఈ నిధి ఆ చూకీ  దొరికింది. ఏనుగు బొమ్మ కుంభస్థలం దగ్గర ఉంది అది.

    దాన్ని తవ్వడానికి నాలుగు నెలలు పట్టింది నాకు. ఇక్కడికి మొయ్యడానికి ఆరునెలలు పట్టింది. స్వాతంత్ర్య పోరాటానికి పనికి వస్తుందని ఇక్కడ భద్రంగా దాచాను. ఎలాగైనా మా సత్యానికి ఇది అప్ప చెబితే అతను దాన్ని  దేశంకోసం తెలివిగా ఖర్చుపెడతాడనుకున్నాను. దేశానికి స్వాతంత్ర్యం వచ్చేసిందిగా ! ఇంకెందుకు ఇది" అన్నాడాయన.

    సాగర్ విషాదంగా నవ్వాడు.

    "దేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చిందిగానీ ఆర్ధిక స్వాతంత్ర్యం ఇంకా రాలేదు సీతాపతిగారూ. దయనీయ స్థితిలో దారిద్ర్యరేఖకు అట్టడుగున ఉన్నారు ముప్పాతికమంది ప్రజలు. వేలకోట్ల రూపాయల విదేశీ బుణభారంతో కృంగిపోతోంది దేశం."

    ఈ నిధితో విదేశీ రుణాలని ఒక్క రోజులో తీర్చేయ్యవచ్చు సీతాపతిగారూ దెబ్బతో దేశానికి ఆర్థికి స్వాతంత్ర్యం వచ్చేస్తుంది.

    ఈ నిధి భారతదేశంలో భాగమైన అండమాన్స్ లోనే దొరికింది కాబట్టి, ఇది నేరుగా ప్రభుత్వానికే చెందాలి చట్ట ప్రకారం!

    "ఈ నిధిని ఏ ఒక్క మనిషీ తనకు ఇష్టంవచ్చినట్లు ఖర్చు పెట్టడానికి వీలు లేదు. మీరు చెబుతున్న ఆ సత్యంగారు ఎంత దేశాభిమాని అయినా ఘటికుడయినా కూడా మొత్తానికి మీ శ్రమ వృధా పోలేదు సీతాపతిగారూ మీరు మాకు కనబడకపోతే ఈ నిధిని కనుక్కోవడం దాదాపు అసంభవం అయి ఉండేది"

    కొంచెంసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు సీతాపతి.

    "ఇంగ్లీషువాళ్ళు ఇంకా మన  దేశాన్ని ఏలుతున్నారని నేను భ్రమపడడానికి మరో కారణం ఉంది" అన్నాడు నెమ్మదిగా.

    "ఏమిటది?"

    "ఈ ద్వీపానికి అప్పుడప్పుడు ఇంకా తెల్లతోళ్ళు రావడం జరుగుతూనే ఉంది"

    తెల్లబోయాడు సాగర్.

    "తెల్ల తోళ్ళా?"

    "అవును విదేశీయులు! వాళ్ళేం చేసి వెళుతున్నారో నాకు  తెలుసు. నాతో రండి! తమాషా చూపిస్తా."

    గుహ కింద భాగంలో సొరంగంలా ఉంది. దాన్లోనుంచి చాలాసేపు నడిచారు. కాలుతున్న కట్టె వెలుతురులో వాళ్ళనీడలు వాళ్ళకే భయానకంగా కనబడుతున్నాయి.

    ఆ సొరంగం పద్మవ్యూహం లాంటి గుహల్లోకి  దారితీసింది. వాటిలోనే అనూహ్య చిక్కుకుపోయింది నిన్న. అవన్నీ ఇంటర్ కనెక్టేడ్.

 Previous Page Next Page