ఇన్ స్పెక్టర్ వివరంగా తీసుకున్న స్టేట్ మెంట్ లో తను ఎందుకు వెళ్ళిందీ, ఏం చేసిందీ చెప్పింది. సాయంత్రం ధర్మారావు వచ్చాడు. "నేను మేజిస్ట్రేట్ తో మాట్లాడానమ్మాయ్. రేపు విడుదల చేస్తారు" అని చెప్పాడు. ఆమెకు సంతోషం వెయ్యలేదు. విడుదల అంటే పూర్తి స్వేచ్చ కాదు. కోర్టుకి వెళ్ళాలి. బోనులో నిలబడితే కేసు విచారణే నాలుగు సంవత్సరాలదాకా పడుతుంది. ఉద్యోగం లేదు. లాయరు ఖర్చులు- రసం పీల్చిన చెరుకులా అయ్యాక జడ్జిమెంట్ వస్తుంది అటో ఇటో.
"అమ్మాయ్, చక్రధర్ పిలిచిన ఆహ్వానం మీద ఆ ఇంటికి వెళ్ళినట్టుచెప్పితే బావుంటుందేమో".
"అంటే?"
"సిగ్మా ఇన్వెస్ట్ మెంటు రహస్యాల కోసం వెళ్ళినట్టు చెప్పటం ఎందుకూ అని".
ఆమె కన్నార్పకుండా అతనివైపు చూసింది. పాపం ఆ వృద్ధుడు రిటైర్ అవబోయేముందు అనవసరమైన చిక్కుల్లో ఇరుక్కోవటం ఎందుకూ అని ఆలోచిస్తున్నాడు. తనవరకు రానంతవరకూ ప్రతిమనిషీ, త్యాగశీలుడే, మంచివాడే. అంత ప్రాణాలకు తెగించి తనను కాపాడవలసిన అవసరం ఆయనకు లేదు. ఆ మాట అనుదీప్ చెప్పాడు.
అనుదీప్.
అవును, అనుదీప్ ఏమయ్యాడు?
ఇంతసేపూ అతను గుర్తు రాలేదేమిటి? ఆ మెస్మరిస్టయినా తనని జైలు నాలుగ్గోడల మధ్యనుంచీ బయటకు తీసుకుపోకూడదూ? అనుదీప్ ఎక్కడున్నావ్ నువ్వు?
* * *
మొదటిరోజు శాస్త్రి, కుటుంబానికి వింధ్యప్రాంతపు ఈ ప్రదేశాలన్నీ చూపాడు. కూతుళ్ళిద్దరూ ఆ ప్రాంతాన్ని బాగా ఎంజాయ్ చెయ్యటం అతనికి సంతృప్తి నిచ్చింది. గోవా తీసుకెళ్లకుండా తన అనవసరమయిన ఉత్సుకతతో ఫ్యామిలీని ఇక్కడకు తీసుకురావటం తప్పుచేశానా అన్న గిల్టీ ఫీలింగ్ వుంటే అది పోయింది.
మరుసటిరోజు ఎంక్వయిరీలో పడ్డాడు.
ఎప్పుడో ఎనిమిది సంవత్సరాల క్రితం తాలూకు ఫోటోతో ఒక మనిషి గురించి ఎంక్వయిరీ చెయ్యటం, నూతిలో సూది గురించి వెతకటం లాటిదని తెలిసినా అతడు చెయ్యవలసిన ప్రయత్నం మానలేదు.
చిరుగాఁవ్! పేరులాగే చిన్నవూరు. అయినా ఆ ఫోటోని ఎవరూ చెప్పలేకపోయారు. ఆ మరుసటిరోజే ఝాన్సీ ప్రయాణం. ఈ అర్థంలేని ప్రయాసతో దొరికిన నాలుగురోజుల శెలవూ వృథాచెయ్యదల్చుకోలేదు అతడు. అలా అని ప్రయత్నమూ మానలేదు. ఆఖరి ప్రయత్నంగా ఖుందేర్ గాఁవ్ వెళదామనుకున్నాడు.
చిరుగాఁవ్ కి నాలుగు కిలోమీటర్ల దూరంనుంచీ అడవి ప్రారంభమౌతుంది. ఇలా ఇరుకయిన బాట. పర్వతాల మధ్యకి సాగిపోతుంది. అక్కడ కొన్ని గిరిజన తండాలున్నాయి. జలపాతాలూ, కొండలమధ్య దట్టమైన అడవీ, దుర్భేద్యమైన ప్రాంతంగుండా సన్నటి కాలిబాట.... అది దాటాక కొండ కవతలివైపున వుంది ఖుందేర్ గాఁవ్.
గిరిజా తండాలవరకూ ఒక బస్సు రోజు కొకసారి వెళుతుంది. అయితే అది ఎక్కడ ఆగిపోతుందో ఎవరికీ తెలీదు. ఏ పార్టుకాపార్టు వూడిపోతూ - దాన్ని టాప్ మీద పడేసుకుంటూ సాగిపోతుంది.
ఆ బస్సులో బయల్దేరాడు రావిశాస్త్రి. ప్రొద్దున్న ఏడింటికి బయలుదేరితే పదింటికి కొంగల పాదాల దగ్గరికి చేరుకుంది బస్సు. అక్కణ్ణుంచి పడుతూ లేస్తూ ఎక్కటం ప్రారంభించింది. అతడు ఖాళీగా వుండలేదు. బస్సులోనే ఫోటో చూపించి ఎంక్వయిరీ ప్రారంభించాడు. అతడి హిందీకి వాళ్ళ హిందీకి చాలా తేడా వుంది. అయినా అర్థమౌతుంది.
అక్కడ చాలామంది అమాయకులు. బందిపొట్ల అలజడి కూడా ఎక్కువే. చంబల్ లోయ ప్రభావం ఎక్కువ వుంది.
శాస్త్రి మొదట చిరుగాఁవ్ పోలీస్ స్టేషన్ కే వెళ్ళాడు. అనుదీప్ ఫోటో చూపించి వాకబు చేసేడు. వేర్వేరు బందిపోట్ల ఫోటోలు, రిజిష్టర్లు తీసి వెతికాడు. ఆ పోలికలు కనపడలేదు. ఇక మిగిలింది గిరిజన ప్రాంతాల్లో వెతకటం. అనుదీప్ విద్యాధరికి చెప్పింది నిజమైతే, అతడు ఇక్కడే బైరాగుల్లో ఒకడుగా తిరిగి వుండాలి.
కొండలమీదికి వెళ్ళగానే తండాల దగ్గిర ఆగింది బస్సు. చిరుగాఁవ్ కి- ఖుందేర్ గాఁవ్ కి మధ్య అదే పెద్ద జంక్షన్ లా వుంది. దాదాపు అరగంట ఆగుతుంది అక్కడ. కానీ "కుండచాయ్" "కొండరటిపళ్ళు" తప్ప మరేమీ దొరకవు. గోచీగుడ్డలు పెట్టుకున్న పిల్లలు బస్సు చుట్టూ మూగారు.
బస్సుదిగి వళ్ళు విరుచుకున్నాడు రవిశాస్త్రి. "జన్మలో ఇంకెప్పుడూ ఇలా అనవసరమైన ఎంక్వయిరీలు నెత్తిన వేసుకోను" అనుకున్నాడు శపథం చేస్తున్నట్టు. అతడితోపాటు బస్సులో నలుగురికంటే ఎక్కువమంది ప్రయాణం చెయ్యటంలేదు. ఆ సుదీర్ఘమైన ప్రయాణంలో ఆ నలుగురితోనూ పరిచయం పెంచుకుని ఫోటో చూపించేడు. కానీ వాళ్ళేమీ చెప్పలేకపోయారు. ఒకరు మాత్రం "మీరు సిద్ధార్థస్వామిని కలుసుకోండి. ఆయన ఏదైనా ఆచూకీ చెప్పవచ్చు" అన్నాడు.
"ఆయన ఎక్కడ వుంటాడు?"
"తండా నుంచి ఖుందేర్ గాఁవ్ కి వెళ్ళే దారిలో మన బస్సు మఠం దగ్గర ఆగుతుంది. అక్కణ్ణుంచి నాలుగు కిలోమీటర్లు దూరం తూర్పుగా వెళ్తే ఆశ్రమ్ ఘాట్ వస్తుంది. సిద్ధార్థస్వామి అక్కడే వుంటారు".
"నేను చచ్చినా వెళ్ళను. ఈ పరిస్థితిలో అంత దూరం నడిచే ప్రశ్నేలేదు" అనుకున్నాడు మనసులో.
"ఆయనెప్పుడూ మఠం దగ్గరికి గానీ, తండా దగ్గరికిగానీ రారా?"
శాస్త్రిని ఓ పిచ్చివాడిని చూసినట్టు చూసి, "సిద్ధార్థస్వామి మౌనభాషి. తపస్సు నుంచి కదలడు" అన్నాడు గిరిజనుడు. వాడి హిందీ అర్థం చేసుకోవటం కూడా కష్టం అవుతోంది.
"పోనీ ఆయన శిష్యులు?"
"లేరు. ఆయన పర్వతాలు దిగిరాడు. ఈ ప్రాంతం ప్రజలే మూడు నాలుగు నెలలకొకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటారు".
"పోనీ ఈ ఫోటోలో వున్న వ్యక్తి గురించి ఆయన శిష్యులెవరైనా చెప్పగలరేమో" ఆశగా అడిగాడు.
"నాకు తెలీదు".
బస్సు బయల్దేరింది. శాస్త్రి విచారంగా వున్నాడు. ఈ వూరు నుంచి ఆ ఊరు వంద కిలోమీటర్లు. ప్రొద్దున్న వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేయొచ్చు కదా అనుకున్నాడు. బస్సు అనేది, బండి అనే వాహనం నుంచి పరిణతి చెందినది అని వూహించలేదు. బస్సు మరో నాలుగు కిలోమీటర్లు ప్రయాణంచేసి, ఆక్సిల్ విరగటంతో ఆగిపోయింది. మరో రెండు గంటల వరకూ కదిలే ప్రసక్తి లేదు. "దీనికన్నా ఒక హత్యా రహస్యాన్ని శోధించినా ప్రమోషన్ వచ్చేది-" అనుకున్నాడు.
"ఇక్కడనుంచి మఠం ఎంతదూరం?" అని అడిగాడు డ్రైవర్ని.
"అడ్డదారిన వెళితే రెండు కిలోమీటర్లు" ఒరియాలో చెప్పాడు డ్రైవర్.
"నడిచి వెళ్ళి అక్కడ వుంటాను. బస్సు బాగుపడ్డాక అక్కడికి వస్తే ఎక్కుతాను" చెప్పాడు.
"అది అపాయకరమైన దారి సార్. పులులూ అవీ వుంటాయి".
"మనుషులకన్నా అవి అపాయకరమైనవి అనుకోను" అంటూ నడక కొనసాగించాడు. బస్సులో వున్నంతసేపూ తెలియలేదు. కానీ ఎండ మాడ్చేస్తూంది. పదినిముషాలు నడిచేసరికి అడవి దట్టమైంది. కాలిబాట మాత్రం బాగానే వుంది. చుట్టూ కీకారణ్యం. చదవటమే కానీ ప్రత్యక్షంగా చూడలేదు. దూరంగా కొండలు- లోయలు- వంపుల్లో పచ్చటి తివాచీ పరిచినట్టు అడవి.
అదృష్టవశాత్తు జంతువులేవీ ఎదురుపడలేదు.
మఠం చేరుకునేసరికి గంట పట్టింది. అదికూడా ఒక ఊరులా వుంటుందనుకున్నాడు. కానీ అక్కడ అలాంటిదేమీ లేదు. సత్రం, నుయ్యి వున్నాయంతే. మనుష్యులెవరూ లేరు.
రవిశాస్త్రికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు.
ఎవడో కుర్రవాడు నేను వింధ్య పర్వతాల్లో తపస్సు చేశానంటే ఆ ఫోటో పట్టుకుని ఇంతదూరం రావటం ఏమిటి? నిజంగా పర్వతాల మధ్య తపస్సు చేసుకునేవాడైతే అతడిని జనం ఎలా గుర్తుపడతారు? ఈ మాత్రం ఆలోచన తనకి రాలేదేమిటి? అందుకే తను ఆ డిపార్టుమెంట్ కి వచ్చాడు.
అతడు నూతిలో నీళ్ళతో మొహం కడుక్కుని సత్రం అరుగు మీద కూర్చుని బస్ కోసం చూడసాగాడు.
ఇద్దరు గిరిజనులు ఎండుకట్టెలు ఏరుకుంటూ అతడి దగ్గరికి వచ్చి అగ్గిపెట్టె అడిగారు. అది యిస్తూ మాటలు కలిపాడు "సిద్ధార్థస్వామి ఎక్కడుంటాడు?"
అందులో ఒకడు దూరంగా కొండ చూపిస్తూ "అక్కడ" అన్నాడు.
"ఆయనకి శిష్యులు ఎవరైనా ఉన్నారా?"
"లేరు. అయన ఎవరితోనూ మాట్లాడరు. ఏడాది కొకసారి జాతరలో దర్శనమిస్తాడు?"
"ఇలాగే ఇంకా ఇక్కడ బైరాగులు ఎవరైనా వున్నారా?"
"చాలామంది వున్నారు బాబూ, కానీ అందులో చాలామంది వేషాలేసుకున్న వాళ్ళే! బందిపోట్లు.... పోలీసుల్నించి తప్పించుకోవడానికి పగలు అలా తిరుగుతూ వుంటారు".
"అలా కాకుండా నిజంగా పూజలు చేసుకునేవాళ్ళు?"
"ఆళ్ళూ వుంటారు. ప్రజలు అలాంటి వాళ్ళని కొలుస్తుంటారు. కానీ ఆళ్ళు ప్రజల్ని పట్టించుకోరు. తపసులోనే వుంటారు. అరటిపండు ముందు పెట్టినా ముట్టుకోరు".
రవిశాస్త్రి తన జేబులోంచి ఫోటో తీసి, "ఇతన్ని ఎక్కడైనా చూశారా?" అని అడిగాడు. వాళ్ళిద్దరూ దాన్ని అటూ ఇటూ తిప్పి "అబ్బే లేదు బాబూ" అన్నారు.
"బైరాగుల్లో...? మునుల్లో...? సాముల్లో....." అని అడిగాడు. అందులో ఒకడు -
"ఆళ్ళకి గెడ్డాలుంటాయి కదా స్వామీ" అన్నాడు సందిగ్ధంగా. అంత అమాయకులు వాళ్ళు.
అప్పటివరకూ తను చేసిన తప్పు శాస్త్రికి అర్థమైంది. నూనూగు మీసాల అనుదీప్ తాలూకు ఫోటోనే చూపిస్తూ వచ్చాడు. చిరుగాఁవ్ లోనూ గిరిజనుల్లోనూ ఈ తేడా గుర్తుపట్టే శక్తిలేదు!!!
జేబులోంచి పెన్ తీసి ఆ ఫోటోకి గెడ్డమూ జుట్టూ పెట్టి వాళ్ళకి మళ్ళీ చూపించాడు.
అందులో ఒకడు క్షణంకన్నా ఎక్కువసేపైనా చూడకుండానే "ఈయన సిద్ధార్థస్వామే కదా" అన్నాడు. అమాయకత్వమూ ఉద్వేగమూ నిండిన కంఠంతో.
బాంబు పేలినట్టయింది.
"సరిగ్గా చూడు" అన్నాడు రవి. "ఈయనేనా ఆ కొండమీద ఉంటాడన్నావు?"
"అవును బాబూ, ఈయన ఆ కొండమీదే ఉంటాడు?"
"మొన్న నెల జాతర రోజు చూసినా కదా"
దూరంగా బస్ వస్తూ కనిపించింది. శాస్త్రి ఇంకా షాక్ లోనే వున్నాడు. డ్రైవర్ బస్ ఆపి "రండి సార్" అని పిలిచాడు. అతడికి ఎటు నిర్ణయించుకోవాలో తెలియలేదు. ఒకసారి కొండ ఎక్కి ఆ సిద్ధార్థస్వామిని చూడాలన్న కోర్కెబలంగా వుంది. కానీ ఈ బస్ వెళ్ళిపోతే మళ్ళీ కష్టం.
అతడు తన అనుమానం నివృత్తికోసం బస్ లో తనతోపాటు వస్తున్న నలుగురికీ ఆ ఫోటో చూపించాడు.