"ఇన్నాళ్ళ దారి వేరు. ఇప్పుడు రఘు పెళ్ళి అవుతూంది. వాళ్ళిద్దరూ చిలకాగోరింకల్లా తిరుగుతూంటే ఇది మోడులా పడి వుండటం దానికెంత బాధ. మనకెంత బాధ? ఆ వియ్యపురాలు పెళ్ళికి ముందే ఇలా అంది. రేపు కోడలు వచ్చాక ఇది వాళ్ళకి ఎంతలోకువవుతుందో తెలుసా? ఇంట్లో కోడలేమన్నా అంటే అది ఎంత బాధపడ్తుంది? అది విని ఎటూ చెప్పలేక మనం ఎంత బాధపడాలి? అనకుండా వూరుకుంటే అది విపరీతంగాని, పుట్టింట్లో పడివున్న ఆడపిల్లని అనడం సహజం. నాకు తెలుసు ఇలాంటివన్నీ జరుగుతాయని. పెద్దలు అనుభవంతో చెపుతారు."
"చాలిస్తావా నీ సాధింపు? ఏం, ఆ వియ్యపురాలికి నా కూతురు బరువయిందటనా? ఎన్నాళ్ళుంటుందో, వుంచుకుంటామో అది ఆవిడ కేం బాధ? ఈసారంటే నోరు ముయ్యమను." కోపంగా అన్నారు శివశంకరంగారు.
"ఇవాళ వియ్యపురాలంది - రేపు కోడలంటుంది. ఎన్నాళ్ళు ఎవరి నోళ్ళు మూయించగలం? అందులో రఘు ఇక్కడుండేవాడు. పోనీ, ఏదో పై వూరిలో ఉద్యోగం అనుకుంటే అదోదారి - రేపు ఇంట్లో ఆ కోడలు దీన్ని చిన్న చూపు చూస్తే......"
"అంతదాకావస్తే వాళ్ళని బయటికి నడిచి వేరింటి కాపురం పెట్టుకోమను. నీవు అన్నింటికీ పెడ ఆలోచనలు చెయ్యకు." విసుక్కున్నారాయన.
మిగతా విషయాలలో శివశంకరంగారికి ఎంతటి లోకానుభవం వున్నా కూతురి విషయంలో మాత్రం ఆయన అనుభవాన్ని అనురాగపు పోరా కమ్మింది. ఎవరి మాటలు, ఎవరి విమర్శలు ఆయన వినరు. లెక్క చెయ్యరు. తనకి డబ్బు ఉంది. ఆ డబ్బుతో కూతురి సుఖానికి బాట వెయ్యగలనన్నవిశ్వాసం ఉంది ఆయనకి. లోకంలో డబ్బు ఒక్కటే అన్నీ సమకూర్చదన్న విషయం గ్రహించడానికి ఇష్టపడరు. తనది కన్న కడుపు కనక కూతురి విషయం కడుపులో పెట్టుకుంటారు. కూతురిపట్ల సానుభూతి వుండాలి. మిగతావారికి ఎందుకుంటుంది? ఎందుకుండాలి? అని ఆలోచించడానికిష్టపడరు.
పెళ్ళిళ్లయ్యేవరకే తమ బిడ్డలు. కోడళ్ళు వచ్చాక వాళ్ళ సంసారాలు, వాళ్ల స్వార్థాలు వాళ్ళవి. ఈనాడు చెల్లెలి పట్ల వున్న ప్రేమాభిమానాలు రేపుండవు అన్న నిజం ఆయన గ్రహించలేదు. భార్య శారదాంబ కన్నతల్లి అయి వుండీ ఎంత లోకజ్ఞానంతో మాట్లాడుతుందో అర్థం చేసుకోకుండా కూతురు అక్కడ వుండటం ఆమెకిష్టం లేదన్నట్టు మాట్లాడి సాధించేవారు.
రఘు పెళ్ళి అట్టహాసంగా, ఆడంబరంగా జరిగింది. ఒక్క ఆడపిల్ల అని పెళ్ళి బాగా చేశారు. లాంఛనాలు, మర్యాదలు బాగానే జరిగాయి. కూతురికి మంచి ఫర్నీచర్, ఫ్రిజ్, గోద్రేజ్ ల దగ్గరనించి అన్నీ ఇచ్చి పంపారు అత్తవారింటికి. రఘు కళ్ళు నేలమీద ఆననట్టే భార్యని చూసుకొని ఊహా లోకాల్లో తేలిపోతూ, చుట్టూ జరుగుతున్నది పట్టించుకోడం మానేశాడు. నిర్మల ఎంత సంతోషంగా, ఎంత హడావిడిగా అన్న పెళ్ళిలో తిరిగినా ఏదో వెలితిగా అన్పించింది. అదేమిటో ఆమెకి అర్థం కాలేదు.
పెళ్ళికి వచ్చిన చుట్టాలు 'అమ్మాయి మరి వెళ్ళదా, అల్లుడేమన్నాడు, మళ్ళీ పెళ్ళి చేస్తారా?' లాంటి ప్రశ్నలు కొందరు డైరెక్ట్ గా అడిగితే, మరికొందరు ఇన్ డైరెక్ట్ గా అడిగారు. ఆ మాత్రం చనువులేని వాళ్ళు ఆ భావాలు చూపులతో వ్యక్తం చేశారు. అటు ఆడపెళ్ళివారు నిర్మలని చూసినప్పుడల్లా గుసగుసలాడుకునేవారు. కళ్ళతో సౌజ్ఞలు చేసుకునేవారు. 'ఈ అమ్మాయే మన దివ్య ఆడపడుచు. మొగుణ్ణి వదిలేసిందట. మూడేళ్ళబట్టి పుట్టింట్లోనే వుంటోంది' అంటూ గుసగుసలాడేవారు. నిర్మల అదంతా పట్టించుకోకుండా దులిపేసుకోవాలన్నాఒక్కోసారి ఆ మాటలు ఆమె చెవినపడి మనసు చివుక్కుమనేది. మొహం చిన్నపోయేది. తప్పు చేసిన దానిలా తప్పించుకు వెళ్ళిపోయేది.
గృహప్రవేశం, రిసెప్షన్ హడావిడి, ఆ తరువాత హనీమూన్ ట్రిప్ అయ్యాక దివ్య కాపురానికి వచ్చింది. ఆ అమ్మాయి స్వతహాగా సరదా అయింది. ఈ కాలం పిల్లలభావాలు కలది కనక నిర్మల గురించి మొదట ఏం అనుకోలేదు. ఇంట్లో తల్లి, చుట్టాలు రకరకాలుగా మాట్లాడుకోవడం విన్నాక ఆమెకి తెలియకుండానే ఆమెలో నిర్మలంటే అదోరకం చులకన భావం వచ్చింది.
అసలు ఆ కొత్త వైవాహికజీవితంలో నిర్మల గురించి ఆలోచించే తీరికే లేదు ఆమెకి. ఎంతసేపు రఘు ఆమె, సినిమాలు, షికార్లు, గదిలో తలుపులు బిడాయించుకుని ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోవడంతో ఓ నెలగడిచిపోయింది. అప్పటికి ఆ దంపతులిద్దరికీ కాస్త కొత్తమైకం వదిలి ప్రపంచంలో పడ్డారు. రఘు కోర్టుకి వెళ్ళడం ఆరంభించారు. దివ్య లా ఫైనల్ ఇయర్ లో ఉంది కనక చదువు ఆపకుండా పూర్తి చెయ్యాలని ఇద్దరూ అనుకున్నారు. కనక మళ్ళీ దివ్య కాలేజీకి వెళ్ళడం ఆరంభించింది. కాలేజీకి వెళ్ళిరావడం, సాయంత్రం షికార్లు, సినిమాలు, రాత్రిభోజనాలవగానే గదిలో దూరడం. ఉదయం ఏడు లోపల లేవరు ఇద్దరూ. ఉదయం కాఫీ - టిఫిన్లు గదిలోకి తీసుకెళుతోంది దివ్య బ్రేక్ ఫాస్ట్, స్నానాలు పూర్తిచేసిగాని గదిలోంచి బయటపడరు, ఉదయం పూట ఎవరి హడావిడిలో వారు తయారై కాలేజీలకి, ఆఫీసులకి వెళ్ళడం......
అన్న పెళ్ళి అయితే దివ్యతో తనకి బాగా కాలక్షేపం అవుతుందనుకున్న నిర్మలకి చాలా ఆశాభంగం కల్గింది. ఇంట్లో ఎదురుపడితే హాయ్ అనడమో, ఇప్పుడే వచ్చారా ఇంటికి అని ఓ చిన్న పలకరింపు తప్ప, ఇద్దరూ ఒక ఈడు వాళ్ళయినా కూర్చుని మాటా మంతీ ఆడుకునే
అవకాశమే రాలేదు నిర్మలకి. రాత్రి భోజనాలపుడు మాత్రం వాళ్ళెక్కడికీ వెళ్ళని రోజు అంతా కల్సి భోజనం చేసే అవకాశం వచ్చేది. అప్పుడు మామగారున్నారనేమో ఎక్కువ మాట్లాడేది కాదు. జనరల్ గా లోకాభిరామాయణమో, కుటుంబ విషయాలో మాటల్లో దొర్లేవి. ఆ పరిస్థితిలో దివ్యతో చనువుగా ఎలా వుండటమో నిర్మలకి అర్థం కాలేదు.
అటు శారదాంబకీ కోడలు వచ్చిన ముద్దు ముచ్చట తీరలేదు. ఆ అమ్మాయి ఇంట్లో వున్న కాసేపు అయినా అందరి మధ్యకురాదాయె అనుకుంటుంది. ఆదివారం వస్తే దివ్య, రఘు ఇద్దరూ ఆమె పుట్టింటికి వెళ్ళి భోజనాలు చేసి రాత్రికి కాని రారు. అత్తగారేదన్నా అడిగితే జవాబు చెప్పటం తప్ప తనంతట తానుగా ఏదీ మాట్లాడని కోడలితో శారదాంబకీ పరిచయం పెంచుకునే అవకాశం లేకుండా పోయింది. అత్తవారిల్లు, అత్తగారిని కాస్తో కూస్తో చేదోడుగా ఉండాలని, ఆ ఇల్లు తనది, పనీపాట కాస్త చూసుకోవాలని కూడా అనుకోకుండా ఏదో హోటల్లో ఉన్నట్టు వేళకి కాఫీ టిఫిన్లు, భోజనాలకి రావడం తప్ప ఏదీ కల్పించుకోకుండా గెస్ట్ మాదిరి గడుపుతున్న కోడలిని ఏమనాలో తెలియలేదు శారదాంబకి.
ఇంట్లో వంటకి మనిషి వున్నా, ఎన్ని పనులుంటాయి? కనీసం ఇది చెయ్యనా అత్తయ్యా అని రాని కోడలిని ఏం అనుకోవాలో తెలియలేదు ఆవిడకి. రఘు అయితే పెళ్ళయ్యాక ఓ వంటిల్లు వుంటుందని, వంటపని వుంటుందన్న విషయం మర్చిపోయినట్టు దివ్య గదిలోకి కాఫీ ఫలహారాలు తెస్తే తినడం తప్ప మిగతా విషయాలు పట్టించుకోవడం మానేశాడు. ఓ వారం రోజులు వంటావిడ సెలవు పెడితే తల్లి పనితో సతమతమవుతుంటే నిర్మల సాయం చేసేది కాని దివ్య వంటింటి వైపన్నా వచ్చేది కాదు. "కోడలు వచ్చినా నా పాట్లు తప్పలేదు" అని ఒకటి రెండుసార్లు గొణుక్కుంది శారదాంబ.