"ఏమంటున్నాడు" అడిగాను.
"మీ అన్నయ్య ఎక్కడున్నాడు? అని పదే పదే అడిగాడు" అంది.
"ఏం చెప్పావు?"
"నాకు అన్నయ్యలు ఎవరూ లేరని అన్నాను".
"కంగారు పడ్డాడా?"
"ఆఁ చాలా".
అంటే- నాతల్లికి మొగపిల్లవాడు పుట్టిన సంగతి కూడా అతడికి తెలుసన్నమాట. నా ఆలోచన్లు గ్రహించినట్లు రాణి అంది- "అతడికి మీ పేరు కూడా తెలుసు".
ఉలిక్కిపడి- "నాపేరు తెలుసా?" అన్నాను.
"అవును గోపీచంద్ ఎక్కడ అని అడిగాడు".
అంటే-మోసం చేశాక కూడా కొంతకాలంపాటు నా తల్లి గురించి అతడు వాకబు చేస్తూనే వున్నాడన్నమాట. నేనేదో అనబోయాను. అంతలో తలుపు చప్పుడయింది. ఇద్దరం ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం. నేను చప్పున టాయ్ లెట్ లోకి వెళ్ళాను. రాణి వెళ్ళి తలుపు తీసింది.
లోపలికి వచ్చింది ఆనందరావు భార్య!
తలుపు సందులోంచి చూస్తున్న నేను ఆశ్చర్యపోయాను. అంత అర్ధరాత్రి భర్తని ఫాలో చేస్తూ తరళ అలా హోటల్ లోకి ప్రవేశిస్తుందని నేను అనుకోలేదు.
ఇది మేము వూహించని మలుపు.
"ఎ... ఎవరు కావాలి?" రాణి భయం నటిస్తూ అంది.
"నేను పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాను" అంది ఆనందరావు భార్య నాకు నవ్వొచ్చింది రాణీ కూడా నవ్వుకుంటూ ఉండి ఉండాలి.
"నీ పేరేమిటి?" తరళ అడుగుతుంది.
"శ్రీదేవి".
"మీ అమ్మపేరు?"
"ఇందిర".
....
....
"మీ నాన్నగారేం చేస్తూ వుంటారు?"
"తరళా ఫెర్టిలైజర్సులో ఇన్ స్పెక్టరు".
"మీ అమ్మగారు?"
"స్కూల్లో టీచరు"
"మరి నువ్వీ వూరు ఎలా వచ్చావు? బ్రోతల్ కంపెనీలో ఎలా చేరావు?"
రాణి ఏడవటం ప్రారంభించింది. చాలా అద్భుతంగా నటిస్తూంది.
రాణి ఒక్కొక్క మాట బుల్లెట్లా పేలుతూంది.
ఆ తరువాత రాణి చెప్పిన కథ నాకే ఎంతో ఇంటరెస్టింగ్ గా అనిపించింది. నెలకి నాలుగు రోజులు మాత్రమే తమతో వుంటున్నాడని అంది. తల్లి ఈ ఎడబాటు భరించలేక కిర్సనాయిలు పోసుకుని కాల్చుకోవాలను కుంటోందని చెప్పింది.
తరళ అంటూంది- "ఇక నువ్వు పడుకో మీ నాన్నగారు ప్రొద్దున్నే వస్తారు. అంతేకాదు, ఈ ఇన్ స్పెక్షన్లు కూడా ఇక వుండవు. మీతోనే వుంటారు" అనేసి వెళ్ళిపోయింది.
ఆమె గది బయట వెళ్ళగానే నేను లోపల్నుంచి వచ్చి "అద్భుతం" అన్నాను. "నేను వూహించిన దానికన్నా గొప్ప కథ అల్లావు. ఇక ఆనందరావుకి నరకం ప్రారంభమైనట్టే..."
రాణి నవ్వింది.
"ఇప్పుడే వస్తాను ఆవిడకి ఆఖరి షాక్ ఇచ్చి" అని క్రిందకి బయల్దేరి, ఆమె మెట్లుదిగే సమయానికి జీపుతో ఆమె ముందుకి వచ్చాను. నేను వూహించినట్లే ఆమె మొహంలో విస్మయం కనబడింది.
"బాబూ-మీ నాన్నగారి పేరేమిటి?"
....
"నా పేరు గోపీచంద్. అమ్మ పేరు భాగ్యేశ్వరి. మా అమ్మ అమెరికాలో వుంటుంది. చిన్నప్పుడే నాన్నగారు పోయారు".
"ఆయన పేరు?"
"అయినంపూడి ఆనందరావు".
జీపు స్టార్ట్ చేశాను.
వత్తి వెలిగింది. బాంబు పేలాలి. ఇంటికి వెళ్ళాక పేలుతుంది. తనతో కలిసి భర్తకి ముగ్గురు భార్యలున్నారని తెలిస్తే ఏ స్త్రీ వూరుకుంటుంది? తరళ లాటిది అసలు వూరుకోదు.
ఈ రాత్రి వాళ్ళ జీవితాల్లో తుఫాను మొదలైంది. ఇక అది ఆ సంసార వృక్షాన్ని నిలువునా పెరికించిగానీ వదలదు. నిరాశ్రయుడైన ఆనందరావు దగ్గరికి అప్పుడు వెళ్ళాలి. నేను అడగదల్చుకున్నది ఒకే ప్రశ్న... నా తల్లి తరపున.
కానీ ఇప్పుడే కాదు.
ఇంకా అతడిని బిగించాలి.
చదరంగంలో రెండో ఎత్తు ప్రారంభించాను.
ప్రమద్వర చెప్పిన కథ
ఎడారిలో ప్రయాణం చేసి చేసి అలసిపోయిన యాత్రికుడి నుదుటిమీద చెమట చారల్లా వృద్దాప్యం నా చర్మపు ముడతల్ని విస్తృతం చేస్తూంది. జీవన పోరాటంలో అలసిపోయిన మనిషిని కబళించటానికి నెమ్మది నెమ్మదిగా మృత్యువు ముందుకు రావటం తెలిసిపోతూ వుంది. డాక్టర్లు చెప్పనవసరం లేదు, నాకే తెలుస్తూంది.
ఈ వెన్నెల రాత్రి నా కథంతా మీకు చెప్పాలని వుంది. ఈ కథంతా తెలిస్తే తరళ నన్ను క్షమించదు. ఆమెకు నేను ద్రోహం చేశానా అని అప్పుడప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటాను. లేదు లేదని సమాధాన పర్చుకుంటాను. తప్పెవరిదయినా, విషయం తెలిస్తే మాత్రం తరళ నన్ను క్షమించదు.
తానేం సాధించానని జీవితపు చివరి రోజుల్లో మనిషి తీరిగ్గా ఆలోచించు కోవటానికే 'వృద్దాప్యం' అనేదాన్ని దేముడు బహుశా సృష్టించి వుంటాడు. నాకు అసంతృప్తి ఏమీలేదు. గోపీచంద్ ని మనిషిగా తీర్చిదిద్దటం అనే సంతృప్తి చాలు. ప్రబంధ్ కన్నా ఒక మెట్టు పైనే గోపీని నిలబెట్టగలిగాను. పాతిక సంవత్సరాలు పట్టింది నేను అన్నమాట నెరవేర్చటానికి. అయినా ఈ విషయాలన్నీ తరళకి తెలుసా? ఆనందరావు చెప్పి వుంటాడా?
అన్నట్టు ఈ రాత్రికి మీకు నా కథంతా చెపుతానన్నాను కదూ. ఎక్కణ్ణుంచి మొదలు పెట్టను?
వెన్నెల పిండారబోసినట్టుంది. వెన్నెల్లో మీరెప్పుడైనా గోదావరిని చూశారా? గోదావరే అవసరంలేదు గంభీరంగా పారే ఏ నదినైనా చూడండి. తళతళలాడే కెరటాలు, మిలమిల మెరిసే నీరు, దూరంగా సాగిపోతున్న నావ....ఎంత అందంగా వుంటాయో అందుకే మా పల్లె అంటే నా కిష్టం పక్కనే గోదావరి వంగిన కొబ్బరి చెట్లు, అందమైన తోటలు, ఆనందరావు...
ఆనంద్ తో నా పరిచయం గమ్మత్తుగా జరిగింది. మా పల్లెలో కిరాణాకొట్లు నాలుగైదుకన్నా ఎక్కువ లేవు. అందులో ఒక షాపువాడు మాత్రమే లాటరీ టిక్కెట్లు తెప్పించి అమ్మేవాడు. ఒకరోజు ఎందుకో నాకు టిక్కెట్టు కొనాలనిపించింది. అదే సమయానికి ఆనంద్ కూడా ఒక టిక్కెట్ ఇమ్మని అడిగాడు. ఆ రోజే ఆఖరు తేది. షాపువాడు ఒక్కటే టిక్కెట్టు వుందన్నాడు. ఎవరు తీసుకోవాలి అన్న మీమాంస వచ్చింది. ఇద్దరం చెరో అర్ధరూపాయి వేసి తీసుకున్నాం.