Previous Page Next Page 
మరో ముందడుగు పేజి 19

 

    యతి మనసంతా వికలమయింది. ఇన్నాళ్లుగా యతికి వీరయ్య హత్య చేసినందుకు జైల్లో ఉన్నాడని మాత్రమే తెలుసు! అంత అమాయకంగా కనిపించే అతడు ఎలా హత్య చేసాడా/ అనే ఆలోచన చాలాసార్లు వచ్చింది , కాని , ఆ విషయం అడగలేక పోయాడు. ఇప్పుడు ఎవరిని హత్య చేసాడు , ఏ సందర్భంలో హత్య చేసాడో అర్ధమయ్యాక, ఎవరు దోషులో, ఎవరు కారో, అతనికి అర్ధం కాకుండా పోయింది. ఒక్కటి మాత్రం యదార్ధం. కటకటాల వెనుక వున్నవారంతా దోషులు కారు! కటకటాల బయట వున్నవారంతా నిర్దోషులు కారు.
    అమాయకత్వం వల్లనో, అతి జాగ్రత్త వల్లనో గురువు గారూ, భక్తులూ మొదలైన వాళ్ళంతా ఎవరో వీరయ్య చెప్పకపోయినా మ భక్తులు మొదలైన వాళ్ళంతా ఎవరో వీరయ్య చెప్పకపోయినా యతి గ్రహించుకోగలిగాడు. పులిని గురించి ఎన్నెన్నో కధలు విన్నాడు. అతడు అతి చాకచక్యంగా పోలీసుల కళ్ళలో దుమ్ముకొట్టి ఎన్నిసార్లు తప్పించుకున్నాడు- చివరకు యే స్వార్ధపరుడి కుట్రవల్లో దొరికిపోయాడు . అతడి పేరు పులయినా - మరేదయినా అతడు నిజంగా గురువే అనుకున్నాడు యతి.
    ఆ రోజు జైలులో తీవ్ర సంచలనం! ఎవరి నోట విన్నా ఒకటే మాట! "పులిని వురి తీస్తున్నారు!" జైలు అధికారుల మధ్య పులి నడిచి వేడ్తున్నప్పుడు వీరయ్య గొంతులో నుంచి రాబోయే అర్తానాదం పులి కంటి కొసలలో కనిపించిన అదలింపుతో ఆగిపోయింది. ఆ ఆదలింపు యతీ ఒక్కడే గమనించగలిగాడు. ఆ గంభీర్యాన్నీ, ఆ సమయంలో కూడా చెక్కుచెదరని చిరునవ్వు ని చూసి "నాయకుడంటే ఇతడు!" తన నిండు ప్రాణాన్ని తను నమ్మిన సిద్దాంతం కోసం సునాయాసంగా త్యాగం చేసేస్తున్నాడు" అనుకున్నాడు యతి.
    సాయంత్రమయింది. పులిని ఉరి తీసి వుంటారు. ఆ వురి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యాలు యే మహాకవి వివరించ గలడు? ఎవరి కోసం ఆ ధీరుడు తన ప్రాణాలను పణంగా పెట్టాడో, ఆ అజ్ఞానులకు అతని కోసం కన్నీటి బొట్టు ఒదిలే పరిజ్ఞానమయినా వుండదు. ఒక కల్లు ముంత కోసమో, ఒక నైలాన్ చీర కోసమో వెరవేరలాడుతూ వెర్రి గొర్రెల్లా ఏ కరకు కసాయిల ముందో తమ జీవితాలను అర్పణ చేసుకుంటారు.
    కానీ, ఇలా దుర్మార్గులను హత్య చేయటమే పరిష్కార మార్గమా? వాడెవడో ఒక రాక్షసుణ్ణి చంపితే అతడి ప్రతి రక్తపు బొట్టులో నుంచి కొన్ని వేల మంది రాక్షసులు జన్మించేవారట. అలాంటి రాక్షసులు కారా. ఈ సమాజంలో డైరెక్టర్ల లాంటి వాళ్ళు! ఒకడిని చంపుతూండగానే మరో పదిమంది పుట్టుకొస్తారు. ఎంతమందిని చంపగలరు?
    కానీ, అంత దారుణమైన అన్యాయాన్ని చూస్తూ ఊరుకున్న సమాజం - అన్యాయన్నే సమర్ధించిన ప్రభుత్వం ఆ ప్రభుత్వపు అదుపాజ్ఞాలలో ప్రవర్తిస్తున్న పోలీసులు ఇన్ని విష వలయాల మధ్య సామాన్యుడు అమానుషంగా నలిగి పోవలసిందేనా? దీనికి ప్రతి క్రియ యేమిటి? ఎవరు చెయ్యగలరు?
    "ఏమిటా ఆలోచిస్తున్నావు నాయనా?" యతి భుజం మీద తట్టి అన్నాడు వెంకటయ్య.
    "పులిని ఉరి తీసారు!" ఎంతో క్షోభతో అన్నాడు యతి. వెంకటయ్య అతి సామాన్యంగా-
    "హింసకు పూనుకుంటే ఫలితం ఇలాగె వుంటుంది మరి!" అన్నాడు.
    నివ్వెరపోయి చూశాడు యతి. వెంకటయ్య సామాన్యుడు కాడు. యతి చూపుల్లో భావాన్ని అర్ధం చేసుకున్నాడు. వెంటనే తన కంఠాన్ని మార్చేస్తూ "ఆ మహానుభావుణ్ణి వురి తీసినందుకు ఆవేదనతో రాత్రంతా కంటిమీద కునుకు రాలేదు. అయన ఆత్మకు శాంతి ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్దిస్తూనే వున్నాను. కానీ , యతీ! గొప్పతనం ఉండగానే సరికాదు! అది ఏ మార్గంలో , ఉపయోగించుకోవలో కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు చూడు! అతడు చంపినవాళ్ళు దుర్మార్గులే! కాదనను! కానీ,  ఏం సాధించగలిగాడు ? సమాజంలో దుర్మార్గాన్ని యే విధంగానయినా తగ్గించ గలిగాడా? చివరికిలా బలై పోయాడు. అదీ గాక ఇలా హింసకు ప్రోత్సహిస్తే అరాచకత్వానికి దారితీసిన వాళ్ళమవుతాం! "పులి" లాంటి వాళ్ళు నిజంగా దుర్మార్గాల్నే చంపారనుకో! కానీ, కొందరు తమ అవసరాలు తీర్చుకోవటం కోసం తమకంటే ధనికులను చంపటం మొదలుపెడితే? అబ్బెబ్బే! ఇది కాదయ్యా మార్గం! అసలు పాలక యంత్రాంగాన్నే సరిదిద్దాలి. అది సవ్యంగా ఉంటె అన్నీ సవ్యంగానే ఉంటాయి. ఆందోళన ఒకటే మార్గం!"
    వెంకటయ్య కంఠంలో , అతడు చెప్పే తీరులో ఏం వుందో కాని ఎవరైనా అతని మాటలు నమ్మేస్తారు. అతడిలో విశ్వాసం కలుగుతుంది. యతికి వివేకం ఎంత ఉన్నా అతడింకా డిగ్రీ కోసం చదువుతోన్న యువకుడు. లోకానుభవం యే మాత్రం లేనివాడు. అటు పులి త్యాగమూ, ఇటు వెంకటయ్య మాటల్లో లౌక్యమూ అతని మనసులో ఒకదానితో ఒకటి సంఘర్షణ పడి ఏదీ నిర్ణయించుకోలేక , ఎదురుగా వున్నా వెంకటయ్య మార్గానికే మగ్గాడు. అయినా జైలులో సహితం వెంకటయ్య అనుభవించే సౌకర్యాలు - అక్కడ కూడా అతని కున్న పలుకుబడి, అతని మనసులో అనేక సందేహాలను కలిగించక పోలేదు. జీవితంలో ప్రవేశించి చూసి తన మార్గమేదో నిర్ణయించు కోవాలనుకున్నాడు.
    వెంకటయ్య విడుదల తేదీ వచ్చేసింది. అతడు యతి తనను ఎక్కడ కలుసుకోవాలో వివరంగా వ్రాసిచ్చి వెళ్ళిపోయాడు.
    వెంకటయ్య వెళ్ళిపోయాక తోటి ఖైదీలతో మరింత ఎక్కువకాలం గడపసాగాడు యతి - ఏ ఖైదిని కదిలించినా అతని నేరం వెనుక ఒక కన్నీటి గాధ వుంటుంది. మరొకటి కూడా గమనించాడు యతి. ఆ ఖైదీలలో అధికభాగం అడుగు వర్గాల వారే! అవును మరి! పై వర్గాల వాళ్ళు జైళ్ళ దాకా ఎందు కోస్తారు? కటకటాల దాకా రాకుండానే తమ నేరాల నుంచి తప్పించుకోవడానికి అనేక మార్గాలున్నాయి వాళ్ళకి.
    ఖైదిలలో కొందరికి తమ గుడిసెల కంటే జైళ్ళు బాగున్నాయి. ఏ దేశానికైనా ఇలాంటి స్థితి వాంఛనీయమేనా?
    యతి విడుదలయ్యాడు. పోబోతున్నప్పుడు సూపరింటెండెంట్ యతికి షేక్ హాండ్ యిచ్చి చిరునవ్వుతో "విష్ యు బెస్ట్ ఆఫ్ లక్!" అన్నాడు. అతని కళ్ళలో మెరుపు చాలా విచిత్రంగా తోచింది యతికి. అంటే, తాను జరిపిన ఆందోళన పట్ల ఆయనకు కూడా సానుభూతి వుందన్నమాట! అలాంటి వాడు ఇలాంటి వుద్యోగం ఎలా చేస్తున్నాడు? ఇలాంటి వుద్యోగం చేస్తూ తనబోటి వారి పట్ల సానుభూతి వుంటే మాత్రం ఏం ప్రయోజనం? లోకాన్ని చూస్తున్న కొద్దీ అన్నీ ప్రశ్నలే ఎదురు కాసాగాయి యతికి.
    విడుదలయ్యాక అతడు వెంకటయ్య దగ్గరికీ వెళ్ళలేదు. తన ఇంటికీ వెళ్ళలేదు. వీరయ్య యిచ్చిన ఆధారాలతో కస్తూరిబా మహిళా సమాజాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒక పల్లెటూళ్ళో రెండు గదుల వాటా అది! ఒక గదిలో అయిదారుగురు యువతులు ఏదో చర్చించుకొంటున్నారు. యతిని చూడగానే మాటలాపేసి అతడిని నఖ శిఖ పర్యంతం చూసారు. "ఎవరూ మీరు?" అన్నారు. - యతి వీరయ్య మాటలను గుర్తు చేసుకుంటూ "లలితాదేవి గారూ కలుసుకోవాలని వచ్చాను" అన్నాడు.
    వాళ్ళలో ఒకావిడ లేచి "రండి! అని లోపలిగదిలోకి తీసికెళ్ళింది. లలితాదేవి అంటే ఎవరో పెద్దావిడ అనుకున్నాడు యతి - తీరా చూస్తే ఆవిడ కాలేజీ విద్యార్ధినిలాగ వుంది. ఆవిడతో ఎవరో ఇద్దరు మొగవాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు యువకులే. యతి రాగానే వాళ్ళిద్దరూ చటుక్కున లేచిపోయారు. లలితాదేవి చిరునవ్వుతో కుర్చీ చూపించి "కూర్చోండి!" అంది. "మీరెవరూ? ఎందు కొచ్చారూ?" అని అడగలేదు. యతి కూచున్నాడు. తను వూహించిన దానికి బిన్నంగా వున్న ఆ వాతావరణాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. లలితాదేవి ఏం మాట్లాడకుండా తన రిజిస్టర్లు చూసుకోసాగింది . అయిదు నిముషాలు అలా దాటిపోయాక కాని యతికి  జ్ఞానం రాలేదు. అప్పుడు "వీరయ్య మీ గురించి చెపుతుంటే విని మిమ్మల్ని చూడాలని వచ్చాను" అన్నాడు.
    లలితాదేవి అతి మాములుగా "వీరయ్య మికెలా తెలుసు?" అంది.
    "వీరయ్య నేనూ ఒకే జైల్లో వున్నాం. నేను విద్యార్ధి నాయకుడిగా ఆందోళన జరిపి జైలు కెళ్ళాను."
    కొంచెం గొప్పగా అన్నాడు యతి - అయితే లలితాదేవి ఆ గొప్ప ఏమాత్రం గుర్తించకుండా "అలాగా!" అంది.
    తరువాత యధాలాపంగా "ఇప్పుడెలా వున్నాడు వీరయ్య" అంది.
    "పులిని ఉరి తీసినప్పటి నుండీ , ఆందోళనతో అతని ఆరోగ్యం పాడయింది. ఆ జైల్లో ఖైదీల ఆరోగ్యం గురించి పట్టించుకొనే దేవరు?"
    ఈ మాటలు విన్నాక లలిత క్రిందకి చూస్తూ చాలా సేపు వుండిపోయింది. ఎంతో సేపటికి కానీ, వంచిన తల ఎత్తలేక పోయింది. "పులి" మరణానికి ఆమె బాధ పడుతున్నదనీ , అది నిగ్రహించుకోవటానికి ప్రయత్నిస్తున్నదనీ ఊహించగలిగాడు. ఎలాంటి మనోభావాలనైనా నిగ్రహించు కొని అతి మాములుగా కనిపించ గలిగే ఆ శిక్షణను మెచ్చుకున్నాడు.

 Previous Page Next Page