Previous Page Next Page 
మరో ముందడుగు పేజి 18


    "పాపం! నీ కెంత కష్టం వచ్చింది వీరయ్యా" అన్నాడు . అతడు వీరయ్య పక్కన కూచుని. వీరయ్య ఏడ్చి ఏడ్చి మసకబారిన కళ్ళతో దీనంగా చూసి "అదీ , నేనూ సచ్చినా బాగుండేది!" అన్నాడు. వీరయ్య కూతురు ఒక మూల కూచుని తల ఎత్తి లోకం చూడలేని దానిలా తల దించుకొని వుంది.
    "వీరయ్యా! నీకు మరేదైనా పని చెప్తే చేస్తావా?   
    వీరయ్య గాజు కళ్ళలో ఆశ తళుక్కుమంది . "చేస్తాను బాబూ! చేస్తాను. ఎట్లాగైనా నా బిడ్డని కాపాడుకుంటాను" అన్నాడు వీరయ్య. కూతురు విచిత్రంగా చూసింది. కోర్టు కేసు పూర్తయి డైరెక్టర్ నిర్దోషిగా తీర్పు వచ్చేసరికి , అది నిండు గర్భిణి. ఇంకా తన తండ్రి తనను కాపాడదేమిటి? అని దాని ఆశ్చర్యమేమో!
    "వీరయ్యా! జరిగిన అన్యాయానికి ప్రతీకారం చెయ్యాలని లేదా?" అన్నాడు అతడు. వీరయ్య వెంటనే అగ్ని కీలలా నిలువెల్లా రగులుకుపోతూ "ఆడిని ముక్క ముక్కలుగా చంపి నెత్తురు తాగాలనుంది " అన్నాడు.
    "అయితే నాతొ రా! గురువుగారికి నీ కష్టం చెప్పుకో! ఆయనే నీకు మార్గం చూపిస్తారు" అన్నాడు.
    ఇటీవల కాలంలో వీరయ్యకు ఆ మాత్రం అండగా నిలిచినవాళ్ళు కూడా లేరు . కొందరు సానుభూతి చూపించిన వాళ్ళు లేకపోలేదు - కానీ, ఆ సానుభూతి పెదవులు చప్పరించటంతోనూ, కళ్ళు చెమ్మగిల్లటంతోనూ ఆగిపోయింది. వీరయ్య సమస్యను పరిష్కరించటానికి కానీ, అతడికి జరిగిన అన్యాయానికి గట్టిగా ప్రతీకారం చెయ్యటానికి కానీ పూనుకొన్న వాళ్ళు ఎవరూ లేరు. అంచేత వీరయ్య ఆ గురువు ఎవరని కాని, అతడు తనకి ఏవిధంగా సహకరిస్తాడని కాని ఏ ప్రశ్నలు వెయ్యలేదు. వెంటనే ఆ వ్యక్తిని అనుసరించాడు. ఒక పాడుబడ్డ మంటపంలో ఉన్నాడు గురువు. కాషాయ వస్త్రాలు ధరించాడు. పొడుగ్గా పెరిగిన గెడ్డం - సూదుల లాంటి కళ్ళు - వ్యంగ్యపూరితమైన నవ్వు - అతని చుట్టూ భక్త బృందం చాలామందే ఉన్నారు. వీరయ్య వెళ్ళి ఆ గురువు పాదాల మీద సాష్టాంగ పడ్డాడు - గురువు గంభీరంగా "లే! నిన్నింత హింసించిన పాపాత్ముడు దానికి తగిన దారుణ ఫలితం అనుభవిస్తాడు." అన్నాడు. గురువుగారికి తన సంగతి ఎలా తెలిసిందా! అని ఆశ్చర్యపోయాడు. "మహాత్ములు ఆయనకు తెలియనిది ఏముంటుంది?" అని సరిపెట్టుకున్నాడు. తనను గురువు దగ్గరికీ తీసుకొచ్చిన వ్యక్తికీ తన సంగతులన్నీ ఎలా తెలిశాయి? అతడే గురువుకి చెప్పి వుండకూడదా? లేక గురువే అతనికంటే ముందుగా తెలుసుకుని అతడ్ని తన దగ్గరకు పంపకూడదా? ఈ ఆలోచనలేవీ రాలేదు ఆ అమాయకుడికి! భక్తితో చెంపలేసుకుంటూ నిలబడిపోయాడు. గురువుగారితో ఉన్న వ్యక్తీ అతడి చెయ్యి పట్టుకుని లోపలికి తీసికెళ్ళాడు. అక్కడ భక్తులు భోజనాలు చేస్తున్నారు. వీరయ్యను ఆ వరసలో కూచోబెట్టారు - అన్నం చూడగానే వీరయ్యకు ప్రాణం లేచొచ్చింది. కానీ అంతలోనే కూతురు గుర్తుకొచ్చి ముద్దా నోట్లో పెట్టుకోలేకపోయాడు. అతని మనసు అర్ధం చేసుకున్నల్టు ఆ వ్యక్తీ "నీ కూతురి కేం ఫరవాలేదు వీరయ్యా! ఆమెని కనిపెట్టి చూడటానికి గురువుగారు అప్పుడే ఇద్దరమ్మయిలను పంపించారు" అన్నాడు. "గురువుగారూ" అనే పేరు వినేసరికి ఎక్కడలేని విశ్వాసమూ, ఏర్పడిపోయింది వీరయ్యలో తనను నిలువునా కబళించేవారినే విశ్వసించిన అమాయకుడతను. ఆదరించి అభయమిచ్చిన వారిని విశ్వసించలేడా? కొన్ని నెలల తర్వాత సంతృప్తిగా కడుపు నిండా భోజనం చేసాడు వీరయ్య. ఇంటికి వచ్చేసరికి నిజంగానే ఇద్దరు యువతులు చూడడానికి విద్యార్ధినుల్లా ఉన్నవారు వీరయ్య కూతురికి ఆహారం తీసుకొచ్చి తినిపిస్తున్నారు. ఆ దృశ్యం చూసేసరికి మనసు నిండిపోయింది వీరయ్యకి. ఇటీవలి కాలంలో తన కూతుర్ని ఆ మాత్రం దగ్గరకు తీసిన వాళ్ళెవరూ లేరు. వీరయ్య కొంచెం స్థిమిత పడ్డాక అతడు మళ్ళీ వచ్చాడు . అతడి చేతిలో యేవో పొట్లాలు ఉన్నాయి. "వీరయ్యా! పని కావాలన్నావు. పని చూపిస్తే జాగ్రత్తగా చేస్తావా!" అన్నాడు.
    వీరయ్య పరమానందంగా తలూపాడు.
    "ఇవి గురువుగారి ప్రసాదాలు. భక్తులకు అందజేయాలి. నీకు బహుమతి ఇస్తారు."
    "బహుమతి ఎందుకండీ? తప్పకుండా ఇస్తాను"
    "జాగ్రత్తగా విను. భక్తులు ఈ ఊళ్ళో లేరు. డిల్లి లో ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఇవ్వాలి."
    "ఓర్నాయనో అంట దూరమే ! నే వెళ్ళగలనా బాబూ" వీరయ్య కళ్ళలో భయం చూసి కొద్దిగా చికాకు పడ్డాడు అతను.
    "ప్రతిదానికి ఇలా భయపడతారు గనుకే మీ బ్రతుకులు ఇలా గున్నాయి. నీకేం భయం లేదు. ఇక్కడ రైలేక్కిస్తాం. అక్కడ రైలు దిగగానే నీ కోసం భక్తులు వస్తారు. వాళ్ళు కాషాయ బట్టలు కట్టుకుని వుంటారు. వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. "స్వామి విశ్వానంద పంపారా?" అని అడుగుతారు. "అవును" అని వాళ్ళకి ప్రసాదాలు ఇచ్చేసేయ్యి. అక్కడ నీకు కావలసిన ఏర్పాట్లన్నీ వాళ్ళే చూస్తారు. "విశ్వానంద " పేరు గుర్తుంటుందా?"
    వుంటుందన్నట్లు తలూపుతూనే కూతురి వంక బెంగగా చూసాడు వీరయ్య.
    "నీ కూతురి కేమీ ఫరవాలేదు. ఇవాళే మీ అమ్మాయిని నర్శింగ్ హోమ్ లో చేప్తిస్తున్నారు. ప్రసవం అయ్యేవరకూ అన్ని సదుపాయాలతో మీ అమ్మాయి అక్కడే ఉంటుంది. నీ కూతురి ఆరోగ్యం బాగా పాడయింది. ఆ అమ్మాయి ఆస్పత్రిలో వుండటమే అన్ని విధాల మంచిది. ఆ అమ్మాయిని కనిపెట్టి చూసేవాళ్ళు వుంటారు."
    ఈ మాటలతో వీరయ్యకు పెద్ద బరువు తొలగించినట్లయింది! అతడు చేతులు జోడించి "మీరేం చెయ్యమంటే అది చేస్తాను" అన్నాడు.
    ఆ సాయంత్రమే అతడు ప్రసాదాల పేకెట్లు నింపిన చిన్న ట్రంక్ తో వీరయ్య ను డిల్లీ ఎక్స్ ప్రెస్ ఎక్కించాడు.  వీరయ్య ప్రయాణానికి ముందే వీరయ్య కూతుర్ని నర్శింగ్ హొంలో చేర్పించటం వల్ల వీరయ్య చాలా స్థిమితంగా ప్రయాణమయ్యాడు.
    "మీ అమ్మాయిని నర్శింగ్ హొంలో చేర్చిపించింది ఎవరో తెలుసా? కస్తూరిబా మహిళా మండలి వాళ్ళు"  హెచ్చరిస్తున్నట్లు అన్నాడు అతడు.
    "ఏంటీ? సాములోరు కాదూ?" తెల్లబోతూ అన్నాడు వీరయ్య.
    "కాదు, ఆ మహిళా మండలి వాళ్ళకి మీ అమ్మాయి సంగతి తెలిసి వచ్చి తీసికెళ్ళి ఆస్పత్రిలో చేర్చారు" నొక్కి పలుకుతూ అన్నాడు అతడు. అంత అమాయకుడైన వీరయ్యకు కూడా ఏదో తోచి "చిత్తం,  చిత్తం" అన్నాడు. రైలు కదిలింది.
     డిల్లీలో రైలు దిగగానే కాషాయి వస్త్రాలు కట్టుకున్న భక్తులు వీరయ్యకు కనిపించారు. అనుకున్నట్లు స్వామి వారి ప్రసాదం భక్తులకు అందించాడు వీరయ్య. అతడు మళ్ళీ ప్రయనమయ్యే వరకు అతనికి కావలసిన సదుపాయాలన్నీ ఆ భక్తులే చూసారు. వీరయ్య తిరిగి తన ఊరికి వచ్చేసరికి ఊరంతా గగ్గోలుగా వుంది . డైరెక్టర్ ని ఎవరో దారుణంగా చిత్రవధ చేసారు. ఆ వార్తా విని వీరయ్య అనందం పట్టలేక ఎగిరి గంతులేసాడు.
    ఆ దారుణ హత్య చేసింది ఎవరో ఎవరికి అంతు పట్టలేదు. హత్య జరిగిన సమయానికి వీరయ్య ఊళ్ళో లేడు గనుక వీరయ్యను అనుమానించలేదు. అసలు వీరయ్యను అనుమానించాలనే ఆలోచనే ఎవరికీ రాలేదు. తన కన్న కూతురి బ్రతుకు సర్వనాశనం చేసిన అతని మీద పగ తీర్చుకోవాలనే ఆలోచనయినా ఆ అభాగ్యుడికి రాగలదని ఎవరూ ఊహించలేదు.
    వీరయ్యకు మాత్రం స్వాములవారు కానీ "అతడు" కానీ మళ్ళీ కనిపించలేదు. కస్తూరిబా మహిళా సమాజంవాళ్ళు అతడికి తోటపని ఇచ్చారు. వీరయ్య కూతురు ప్రసవించింది - పురుట్లో చాలా జబ్బు చేసింది ఆ పిల్లకి. అతి కష్టం మీద కోలుకుంది. కోలుకున్నాక అయినా తన బిడ్డను ఎత్తుకోలేదు. అడా? మగా? అని అడగలేదు. గంటల తరబడి ఆ బిడ్డను చూస్తూ కూచునేది ----ఆకలికి యేడ్చినా స్తన్యమిచ్చేది కాదు. చివరికి నర్స్ లు పై పాలు పట్టవలసి వచ్చేది. ఒకసారి అలా చూసి చూసి ఆ బిడ్డను గోడకేసి కొట్టేసింది. రక్తం పడుగులో వున్న పసిబిడ్డను చూసి కెవ్వున కేక పెట్టింది. అప్పటి నుండి ఆ అమ్మాయి పిచ్చిదై పోయింది. వీధిలో సూటూ బూటూ తో ఎవరూ కనపడ్డా మీదపడి పీకి రక్కబోయేది. ఏ పసిబిడ్డ కనిపించినా బలవంతంగా ఎత్తుకోబోయేది. తన కూతుర్ని అదుపులో పెట్టడం వీరయ్యకు సాధ్యమయ్యేది కాదు. జనం ఈ పిచ్చిదాని చూసి హడలిపోయేవారు ----ఎప్పుడు ఏ పసిబిడ్డ గొంతు నులుముతుందోనని - ఒకసారి ఒక సూటూ వాలా మీద పడి రక్కబోతే , అతడు పోలీసులకు పట్టిచ్చాడు. వీరయ్య ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా పోలీసులు వీరయ్య కూతుర్ని విడిచిపెట్టలేదు. వీరయ్య దగ్గిరేమైనా డబ్బులున్నాయా, తన కూతుర్ని విడిపించు కోవడానికి? ఎలాగో పోలీసుల పంజాల్లోంచి బయట పడిందా పిచ్చిది! ఏం జరిగిందో చెప్పడానికి ఆ నిర్భాగ్యురాలికి జ్ఞానం లేకపోయినా ఆ శరీరం చెప్పేస్తోంది. ఏం జరిగిందో? వీరయ్య మనసు రగిలిపోయింది. చేతకాని పౌరుషంతో వుడికిపోయింది. ఆ రోజే మళ్ళీ అ అమ్మాయి వీరయ్యను తప్పించుకొని నుయ్యి దగ్గరకు పారిపోయి , నూతి గట్టుమీద కూచుని నీళ్ళలోకి తొంగి చూస్తూ "ఇహిహి! ఇహిహి!" అని మురిసిపోసాగింది. ఆ ఇంటి వారబ్బాయి ఆమె పమిట లాగాడు. అది చూసి భరించలేకపోయాడు వీరయ్య. తనే తన కూతుర్ని నూతిలోకి తోసేసాడు. తిన్నగా పోలీస్ స్టేషన్ కి వచ్చి తనే తన నేరం ఒప్పుకున్నాడు.

 Previous Page Next Page