గోపి ఆలోచిస్తూ నిద్రకు పడ్డాడు.
ఇక్కడిలాఉంటే అక్కడ చందూ నాయుడివద్దకు వెళ్ళి - "వాడిని మనపక్షానికి లాక్కురావడంకోసం నేనొక తిరుగులేనిపథకం వేశాను. ఎటొచ్చీ నాలుగురోజులపాటు మీరు మనమనుషులకు చెప్పి - ఊళ్ళో ఎక్కడా వాడికే ప్రమాదంరాకుండానూ, ఏ ఇబ్బందీ కలక్కుండానూ ఏర్పాటు చేయాలి. నాయుడుగారి రక్షణపొందిన మనిషికి జీవితం ఈ ఊళ్ళో ఎంతబాగుంటుందో వాడికి తెలియాలి. ఈ విషయమై మీరుచేసే ఏర్పాట్లమీద కూడా నా పథకం ఎంతగానో ఆధారపడి ఉంటుంది-" అన్నాడు.
నాయుడు చందూని మెచ్చుకొని- "నీ ఉపాయం బాగుంది. శత్రువును బెదిరించడంవల్ల కాక-ఆదరించడంవల్లనే ఎక్కువ ప్రయోజనాలుంటాయి. నాకిలాంటిది తట్టనేలేదు-" అన్నాడు.
"నాకు సెలవిప్పించండి బాస్- మళ్ళీ మీకు సరిగ్గా నాలుగురోజులు తర్వాతే కనిపిస్తానునేను. అదీ-వాడితోకలిసి....." అన్నాడుచందూ.
అన్న ప్రకారం చందూ మర్నాడుదయమే గోపిఇంటికి వెళ్ళాడు. గోపికూడా అప్పటికి సిద్దంగా ఉన్నాడు.
"ఏమైనా ఆలోచించావా?" అన్నాడు చందూ.
"ఊఁ"
"ఏమిటో చెప్పు-"
"నిన్నిక్కడ ఎదిరించమని నువ్వనడం చాలా అన్యాయం ఎందుకంటే నీకిక్కడ స్థానబలమున్నది. మనమిద్దరం ఇక్కన్నించి బయల్దేరి" మరో ఊరు వెడదాం. అక్కడ మన బలా బలాలు పరీక్షించుకొందాం - అన్నాడు గోపి.
చందూ అనుమానంగా-"నీది దూరాలోచనే - కానీ దురాలోచన కూడా కాదుగదా అని అనుమానంగా ఉంది-" అన్నాడు.
"నీకిలాంటి అనుమానం వస్తుందని నాకు తెలుసు. నేను భయపడుతున్నది కేవలం నీస్థానబలానికి. అందుకే ఈ ఊరు వద్దంటున్నాను. ఊరుసెలక్షన్ కూడా నీకేవదిలిపెడుతున్నాను. ఇదికాక ఇంకేఊరన్నా సిద్దమే!"
చందూ నవ్వి-" నాకంటే ఈ ఊళ్ళో నాయుడికి స్థానబలం ఎక్కువ. స్థానబలానికి భయపడేనువ్వు ఈ ఊళ్ళో ఉండి నాయుడినెలా ఎదిరించగలవు?" అన్నాడు.
"యుద్ధంజరిగితే పాండవులు కౌరవుల్ని గెలువగలరు. కానీయుద్ధం లేకుండా పాండవుల రాజ్యంకాజేసే ఉపాయం శకుని కౌరవులకు చెప్పాడు. ధర్మరాజు జూదమాడడంలో సమర్దుడే-కానీ మాయాజూదం కావడంవలన ఓడిపోయాడు. జూదానికే నేనూ ఇప్పుడు సిద్దపడ్డాను. ఈ ఊళ్ళోనే అయితే-అది మాయాజూదమే అవుతుంది-" అన్నాడు గోపి.
చందూ ఆశ్చర్యంగా - "ఎంతబాగా చెప్పావు? నువ్వు చాలా తెలివైన వాడివి-" అన్నాడు.
"నాతెలివిసంగతి సరే- నాయుడు రక్షణ ఏర్పాట్లకు ఒప్పుకున్నాడా?" అన్నాడు.
"నాయుడు నాకు బాస్ కావచ్చు. కానీ అతడు నామతలకు విలువ ఇస్తాడు. నాలుగురోజులపాటు ఈ ఊళ్ళో అంతానీ యిష్టం-" అంటూ చందూ ఉలిక్కిపడి- "అవునూ- మనంవేరే ఊరు వెడుతున్నాంగదా-నీకు రక్షణ ఏర్పాట్లు గురించిన ఆలోచనెందుకూ?" అన్నాడు.
"తేరగా వచ్చేదేదీ వదిలిపెట్టను నేను-ఇంతకూ మనప్రయాణమెప్పుడు?" అన్నాడు గోపీ.
"ఇప్పుడే..." అన్నాడు చందూ.
"ఎక్కడికి?"
"అది బస్ స్టాండ్ లో చెబుతాను-"
గోపీ సాలోచనగా-" అయితే నువ్వు బస్ స్టాండుకి వెళ్ళిపో సరిగ్గా అరగంటలో నేనక్కడికి వస్తాను. ఆతర్వాత నీయిష్టం-" అన్నాడు.
"అరగంట గడువెందుకూ?" అన్నాడు చందూ.
"నీకు ప్రియురాలున్నదా?" అన్నాడు గోపీ.
"లేదు-"
"అందుకే నీకు గడువు అక్కర్లేదు. నాక్కావాలి...." అన్నాడు గోపీ. చందూతనలో తనునవ్వుకుంటూ మరేమీ అనకుండా వెళ్ళిపోయాడు.
చందూ వెళ్ళగానే గోపీ వద్దకు వచ్చిందివిశాలి. నెమ్మదిగా అతడితో "అయితే నువ్వు నన్నీ ఊళ్ళో ఒంటరిగా నాలుగు రోజులు వదిలివెడతావన్న మాట-" అన్నది.
"త్వరగా స్నానంచేయి-మనం బయటకు వెళ్ళాలి-" అన్నాడు గోపీ ఆమె మాటలు పట్టించుకోకుండా.
"నేనురాను-" అన్నది విశాలి.
"రానంటే ఎలా- ఈ ఊరంతా మనం ప్రణయగానాలు వినిపించాలి కదా-"అన్నాడు గోపీ.
"మరినువ్వా చందూతో వెళ్ళిపోతున్నావుగా?"
"నేనెక్కడికీ వెళ్ళను. నీతోనే ఉంటాను. ఈ నాలుగురోజులూ నిన్నాఫీసుక్కూడా వెళ్ళనివ్వను-" అన్నాడు గోపి.
"మరి ఆ చందూ ఊరుకుంటాడా?"
"ఎందుకూరుకోడు-? వాడూ నేనూ కలిసి ఊరు వెడతాంగా?"
"నీ మాటలు నాకు అర్ధం కావడంలేదు-" అన్నది విశాల.
"నాలాంటి మనిషి చందూని బస్ స్టాండ్ లో కలుసుకుంటాడు. అతఃడు నాలుగురోజులపాటు చందూను తప్పుదారి పట్టించి చివరకు తన ఓటమిని ఒప్పుకుంటాడు. చందూ ఉత్సాహంగా నాయుడి వద్దకువెడతాడు. ఈ నాలుగు రోజులూ నాయుడు చందూ ఏదో ఘనకార్యం చేస్తున్నాడనుకుని తన మనుషుల్ని మనకు రక్షణ కాపలాగా ఉంచుతాడు. లెటజ్ ఎంజాయ్-"
"ఎంజాయ్ అంటే?"
"కంగారుపడకు-జస్ట్ ప్రణయగానం.....అంతే!"
విశాల కమగారుగా- "నువ్వు నిప్పుతో చెలగాటమాడుతున్నావని నాకు భయంగా ఉంది. ఈ నాలుగురోజుల ప్రణయగానం నీకు ప్రాణప్రమాదం కావచ్చు-" అన్నది.
"నువ్వు చెబుతున్నది కొంతవరకూ నిజం. నా ప్రణయగానం ఈ ఫిరంగిపురంలో కొందరికి ప్రళయనాదం-" అన్నాడు గోపి. అప్పుడు అతడి కనులలో ఆవేశం కనబడింది. అది చూసి విషయాలకు కూడా భయం వేసింది.
14
నాలుగు రోజులపాటు గోపీ, విశాల ఫిరంగిపురంలో ఎంతో సరదాగా గడిపారు. వారిని దూరంగా ఉండి కనిపెట్టే నాయుడి మనుషులు నిజంగానే రక్షించారు.