"మైత్రేయ..... మనకో గుడ్ న్యూస్...... రెండురోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాత్రి జరగబోతోంది. పార్టీ చీఫ్ ఢిల్లీ నుంచి వస్తున్న కారణంగా పోలీసుల కాన్ సన్ ట్రేషన్ అంతా అటువేపే వుంటుంది. రెండురోజుల లోపలే మనపని పూర్తయిపోవాలి. ఎందుకైనా మంచిది. ముందు జాగ్రత్త చర్యగా ఇంకో హోటల్ లో రూమ్ బుక్ చెయ్యి...." చెప్పింది మోహిత.
"నీ ప్లానేమిటి....." అడిగాడు మైత్రేయ.
"ప్లాన్ చెప్పేస్తే థ్రిల్ ఉండదు. ఇవాళంతా నేను మహేంద్ర రొటీన్ ప్రోగ్రామ్ ని అబ్జర్వ్ చేస్తాను. నువ్వు రూమ్ లోనే వుంటావా......" అడిగిందామె.
"ఇంకో హోటల్ లో రూమ్ బుక్ చేయమన్నావుగా...... ఆ హోటల్ ఇక్కడకు దగ్గరగా వుండాలా.... దూరంగా వుండాలా....." ఆమె కళ్ళవేపు చూస్తూ ప్రశ్నించాడతను.
"దూరంగా వుంటేనే మంచిది" అని "ఏంటీ, నా ముఖం వేపే అలా చూస్తున్నావ్....." దగ్గరగా వచ్చి అతని భుజాలమీద చేతులు వేసి, అతని కళ్ళల్లోకి చూస్తూ అంది మోహిత.
"నీ దగ్గరగానే వున్నానుగా......" అన్నాడు గోముగా, చనువుగా ఆమె కుడిచేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దుపెట్టుకున్నాడు.
"ముగ్గులోకి దించడానికా ఈ ముద్దు" చిన్నగా నవ్వుతూ అతని బుగ్గమీద గిచ్చింది.
"చేతులమీదే కదా ముద్దు" అన్నాడతను.
"మరి!"
"నీ పెదవులు బావుంటాయి" గులాబీరంగు పెదవులవేపు చూస్తూ అన్నాడతను.
"పెదవులమీద ముద్దు అప్పుడే కాదు...... టైం పడుతుంది....." మునిగోటితో అతని ముక్కుమీద కొట్టి, సూట్ కేస్ లోంచి చీరను తీసుకుంది.
ఇరవై నిముషాల తర్వాత మోహిత బయటకి వచ్చింది.
* * *
ఎస్.పి. మహేంద్ర సర్వీస్ లోంచి రిటైర్ అయి ఆరునెలలయింది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. విజయవాడలో వంద ఎకరాల లాండ్ లో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంలో వున్నాడతను.
యాభై తొమ్మిదేళ్ళ మహేంద్ర బలంగా, దృఢంగా వుంటాడు. తనకు మాత్రమే వుపయోగపడే ఏ పనినయినా చెయ్యడానికి వెనుకాడని మనస్తత్వం అతనిది. అతని కొడుకు లిద్దరూ అమెరికాలో వుంటున్నారు. అల్లుడు శ్రీధర్ సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. కూతురు, అల్లుడు, భార్య అందరూ ఒకేచోట వుంటున్నారు.
* * *
మోహిత సాయంత్రం అయిదుగంటలకు హోటల్ రూమ్ కి వచ్చింది. మహేంద్ర గురించి తను సేకరించిన వివరాలు చెప్పింది.
"మహేంద్ర లైఫ్ కి సంబంధించి ఇంకో విషయం. భార్యకు గానీ, కొడుకులకు గానీ తెలీకుండా అతనో అమ్మాయిని 'కీప్' చేస్తున్నాడు. ఆ అమ్మాయిని తన రియల్ ఎస్టేట్ ఆఫీస్ దగ్గర్లోని ప్రశాంతనగర్ అనే ఏరియాలో ఒక ప్లాట్లో వుంచాట్ట...."
"మనం ఇప్పుడు ఆ అమ్మాయి కలుసుకుంటాం....." చెప్పింది మోహిత. మరో పదినిముషాల తర్వాత ఇద్దరూ బయటకొచ్చి కారెక్కారు.
* * *
మహేంద్రని, ఆ అమ్మాయిని ఎలా డీల్ చెయ్యాలో దారిలో ప్లాన్ చెప్పింది మోహిత.
సరిగ్గా ఆరుగంటల పదిహేను నిముషాలకు ఏలూరు రోడ్ లోని ప్రశాంత నగర్ లో దివ్యా అపార్టుమెంట్స్ లో ప్లాట్ నెంబర్ 106 డోర్ తట్టాడు మైత్రేయ.
మూడు నిముషాల తర్వాత పాతికేళ్ళ అమ్మాయి తలుపు తెరిచింది,
"మహేంద్ర గారున్నారా....."
"మీరెవరు...."
"రాజమండ్రినుంచి వచ్చాను. ప్లాట్స్ కొనడానికొచ్చాను. కన్ స్ట్రక్షన్ ఆఫీసులో ఆయన లేరు. ఇక్కడకు వెళ్ళమని అక్కడి మేనేజర్ చెప్పాడు."
"ఏలూరు వెళ్ళారు. ఇంకోగంటలో వస్తారు. మీరు ఎనిమిదిగంటలకు రండి. ఈ లోపల ఆయనకు నేను ఫోన్ చేస్తాను. మీరు కలుసుకోవచ్చు."
"అడ్వాన్స్ కూడా తెచ్చాను.... చెప్పండి" చెప్పి బయటికొచ్చాడు.
వీధి చివరిదాకా వచ్చి కారెక్కాడు. వివరాలు మోహితతో చెప్పాడు.
"అతనితో మాట్లాడిన తర్వత హోటల్ రూమ్ కి రమ్మని చెప్పు ఎడ్వాన్స్ ఇస్తానంటే వస్తాడు. అతనికి డ్రింక్ అలవాటుంది. పార్టీ ఏర్పాటు చెయ్యి.... మిగతాది నేను చూసుకుంటాను. పార్టీ మన బుక్ చేసిన రెండో హోటల్ రూమ్ లో జరగాలి" అందామె.
"డ్రింక్ పార్టీలోనే మర్డర్ చెయ్యాలా?"
"చెప్తాను..... తొందరపడకు" సాలోచనగా అంది మోహిత.
* * *
రాత్రి ఎనిమిది గంటల నలభై అయిదు నిమిషాలు.
దివ్యా అపార్ట్ మెంట్స్ లో ప్లాట్ నెంబర్ 106లో మహేంద్ర ఎదురుగా కూర్చున్నాడు మైత్రేయ.
"రెసిడెన్షియల్ స్కూల్ కన్ స్ట్రక్షన్ కోసమా? పది ప్లాట్స్ కావాలా? నెట్ క్యాష్ డీలింగ్ అయితే ఇమ్మీడియట్ గా మీకు ఎరేంజ్ చెయ్యగలను...... రిజిస్ట్రెషన్ తో సహా" రేట్ చెప్పాడు మహేంద్ర.
"ఇందాక మీ మేనేజర్ నాకు సైట్ చూపించాడు. మీరిప్పుడు హోటల్ రూమ్ కొస్తే అడ్వాన్స్ ఇస్తాను. నైట్ కి నేను రాజమండ్రి వెళ్ళిపోవాలి. మీరెప్పుడు రమ్మంటే తిరిగి అప్పుడొస్తాను" చెప్పాడు మైత్రేయ.
మహేంద్ర డ్రాయింగ్ రూంకి అనుకుని వున్న డోర్ వేపు చూశాడు. వాళ్లిద్దరి మాటల్ని వింటున్న ఆ అమ్మాయి వెంటనే వెళ్లమని సౌంజ్ఞ చేసింది.
మరో అయిదు నిమిషాల తర్వాత మైత్రేయతో పాటు బయటికొచ్చాడు మహేంద్ర.
* * *
హోటల్ నీలకంఠ.....
రాత్రి 9-45 నిమిషాలు.
డ్రింక్ పార్టీలో కూర్చున్నారు మహేంద్ర, మైత్రేయ.
నాలుగో రౌండ్ పూర్తయింది. తను తాగుతున్న డ్రింక్ లో పవర్ పుల్ పాయిజన్ కల్సిందని మాహేంద్రకి తెలీదు. ఆ విహం మరో అరగంట తర్వాత పనిచేస్తుందని కూడా అతనికి తెలీదు.
చాలా జోవియల్ గా, జోక్స్ కట్ చేస్తూ మాట్లాడుతున్నాడు మహేంద్ర.
"పోలీసాఫీసర్ గా వుంటున్నప్పుడే చాలా సరదాలు తీర్చేసుకున్నాను మిష్టర్ మైత్రేయా! ఐ లైక్ బొంబాయి గర్ల్స్..... నెలలో వారంరోజులు అక్కడే వుండేవాడిని..... ప్రస్తుతం నాకున్నది ఒకే ఒక్క కోర్కె.... చెప్తే మీరు నవ్వుతారనుకుంటాను."
"చెప్పండి..... ఫర్వాలేదు."
"ఇట్స్ ఎ ఫెంటాస్టిక్..... ఫాంటసీ డ్రీమ్.... ఐ వాంట్ టు స్పెండ్ ఏన్ ఈవెనింగ్ విత్ మధురీదీక్షిత్.... బట్.... నాకు పోటీగా ఆ ఆర్టిస్టు ఎమ్. ఎఫ్. హుస్సేన్ వచ్చేస్తాడని భయం.... అంతే...." చెప్పి గట్టిగా నవ్వాడు మహేంద్ర.
మైత్రేయకి కూడా నవ్వొచ్చింది.
సడెన్ గా మూడ్ మారిపోయింది మహేంద్రకి.
"డ్రింక్ లో నేనెప్పుడూ ఇంత ఇంటాక్సికేషన్ ఫీలవలేదు..... మత్తుగా వుంది..... వెళతాను" అన్నాడు మహేంద్ర.
పరిస్థితి గమనించిన మైత్రేయ.
"ఉండండి..... క్యాష్ తెస్తాను" లోపలి రూమ్ లోకెళ్ళాడు.
లోపలి రూమ్ లో మోహిత అతనికోసం వెయిట్ చేస్తోంది.
"ఇప్పుడేం చెయ్యాలి?" అడిగాడు మైత్రేయ కంగారును దాచుకుంటూ.
"అతనికిప్పుడు మత్తు ప్రారంభమయింది. మరో పది నిమిషాల తర్వాత పూర్తిగా స్పృహ కోల్పోతాడు. పావుగంట తర్వాత డాక్టర్ వచ్చి హెవీ డ్రింక్ వల్ల చచ్చిపోయాడని చెప్తాడు. తర్వాత ఏం జరుగుతుందో చూడు" చెప్పింది మోహిత.
మత్తులోకి వెళ్ళిపోయిన మనిషిని చచ్చిపోయాడని డాక్టర్ సర్టిఫై చేస్తాడా? ఎవరా డాక్టర్? ఆలోచిస్తున్నాడు మైత్రేయ.
"మై డియర్ మైత్రేయా! ఇప్పుడు ఆలోచించడానికి టైమ్ లేదు. డూ వాట్ ఐసే..... కమాన్."
ఇద్దరూ డ్రాయింగ్ రూమ్ లోకొచ్చారు.
అప్పటికే కుర్చీకి చేరబడిపోయాడు మహేంద్ర. స్పృహ కోల్పోయాడు.
మోహిత హోటల్లోంచి బయటికొచ్చి పబ్లిక్ టెలీఫోన్ బూత్ లోకి వెళ్ళింది.
దివ్యా అపార్ట్ మెంట్స్ కి ఫోన్ చేసింది.
ఆఘమేఘాలమీద మహేంద్ర 'కీప్' చేస్తున్న అమ్మాయి హోటల్ కి వచ్చింది.
ఆమె వచ్చిన సమయంలోనే డాక్టర్ వచ్చాడు.
మహేంద్రని డాక్టర్ టేస్ట్ చేస్తున్న సమయంలోనే మహేంద్ర భార్య, కొడుకు, కోడలు హోటల్ కి వచ్చారు.
"హెవీ డ్రింక్ వల్ల ఆయన చనిపోయారు" చెప్పాడు డాక్టర్.
పోలీసులు ఇంకా చచ్చిపోని మనిషిని శవంగా ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు.
"అటాప్సీ జరిపాక రేపు మధ్యాహ్నం శవాన్ని మీకు అప్పగిస్తాం" గవర్నమెంట్ డాక్టర్ చెప్పాడు.
* * *
రాత్రి పన్నెండు గంటలు దాటింది.
హోటల్లో మహేంద్రని టేస్ట్ చేసిన డాక్టర్ క్లినిక్ లో అతనికెదురుగా కూర్చింది మోహిత.
"మిష్టర్ మురళీ! మీరు విజయవాడలోనే వుండడం, అనుకోకుండా మనం కలవడం, నాకీ హెల్ప్ చెయ్యడం...." ఏదో చెప్పబోయిందామె.
"ఒక ఫ్రెండ్ గా మీకీ హెల్ప్ చేశాను. మహేంద్రవల్ల మీకు జరిగిన అన్యాయం నాకు తెలుసు కదా" అన్నాడాయన.
హేండ్ బ్యాగ్ లోంచి పాతికవేలు తీసి, డాక్టర్ మురళి చేతికిచ్చింది మోహిత.
"ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ కి, మార్చురీ ఇన్ ఛార్జికి ఈ డబ్బివ్వండి."
ఆ డబ్బుని తీసుకుని డ్రాయర్ లో పెట్టుకున్నాడు డాక్టర్ మురళి.
"మార్చురీలో వున్న మహేంద్రకిప్పుడు మెలకువ వస్తుంది. మనం అర్జంటుగా మార్చురీకి వెళ్ళాలి. పదండి" అంటూ క్లినిక్ లోంచి బయటికొచ్చాడు డాక్టర్ మురళి.
మోహిత, మైత్రేయ కారెక్కారు. డాక్టర్ మురళి డ్రైవ్ చేస్తున్నాడు.
"మోహిత! బీకేర్ పుల్! పనంతా పదినిమిషాల్లో జరిగిపోవాలి. మీరెళ్ళగానే మార్చురీ ఎటెండర్ మార్చురీ రూమ్ డోర్స్ ఓపెన్ చేస్తాడు. ఆ ఏర్పాటు నేను చేశాను. మార్చురీలో మీకు అవసరమవుతుందేమో ఇది వుంచండి. మహేంద్రవల్ల మీకు ప్రమాదం ఏర్పడితే ఈ బాటిల్లోని యాసిడ్ ను అతని ముఖంమీదకు విసరండి. స్పృహ కోల్పోతాడు.... ఓ.కే...." అంటూ చూపుడువేలు సైజులో వున్న ఒక బాటిల్ ని మోహితకు ఇచ్చాడు డాక్టర్ మురళి.
* * *
తనని స్పృహ లేకుండా చేసి అనుభవించిన వ్యక్తుల్లో ఒకరైన మహేంద్రని బతికుండగానే శవాన్ని చేసి, ఆ శవాన్ని మార్చురీలో వుండేటట్లుగా చేసి, మార్చురీలోనే 'మత్తుమనిషి'గా చలనరహితుడ్ని చేసి, చంపడానికి మోహిత ప్లాన్ చెయ్యడం నమ్మలేకపోతున్నాడు మైత్రేయ.
తమకు అన్యాయం జరిగినప్పుడు ఆడపిల్లలు ఎంతమంది ఈ రోజుల్లో పగ, ప్రతీకారం తీర్చుకుంటున్నారు? అన్యాయానికి గురైన ప్రతి ఆడపిల్ల మోహితలా తిరగబడితే స్త్రీ నేరాల సంఖ్య తగ్గిపోతుందేమో? ఆమెకేసే అబ్బురంగా చూస్తూ ఆలోచనల్లో కూరుకుపోయాడు మైత్రేయ.