"ఆఁ అలా అనబోకండీ, మీరు చాలా బాగా చదువుతారనీ, ఫస్టుక్లాస్ స్టూడెంటనీ నాన్నగారు చెబుతుంటారు" అన్నది మధ్యలో అడ్డుకుని.
సత్యమూర్తి ఆమె చెప్పిన విషయం అంగీకరించకుండా తల అడ్డంగా ఊపుతూ "అబ్బే. అదేం లేదండీ. అలాంటి సద్బుద్దులూ నాకేమీ లేవు" అన్నాడు.
"తెలివైన వాళ్ళంతా అలానే అంటారులెండి"
ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ కూర్చుండగా కాసేపటికి సత్యానందంగారు బలరామయ్యగార్ని చూడ్డం అయి అక్కడకు వచ్చారు. "ఇంకా వెళ్దామా అమ్మా ఆలస్యమవుతోంది" అంటూ.
"వెడదాం నాన్నగారూ! అంటూ సుధ లేచి నిల్చుంది.
"వస్తామండీ. వీలు చూసుకుని ఓ పర్యాయము మా యింటికి రండి."
"మీ తండ్రిగారికేమీ పరవాలేదు. తగ్గిపోతుంది. ఆ దుర్దాపడకండి" అని సానునయ ఐక్యాలు చెప్పి ఆయన బయటికి దారితీశాడు.
"వస్తామండీ" అని తన తెల్లని చేతుల్ని ఎత్తి నమస్కరించి సుధ ఆయన్ని అనుసరించింది.
వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ అతడు అన్యమనస్కంగా నిలబడ్డాడు.
5
రెండు రోజులు చూసి తండ్రి పరిస్థితి రాను రానూ విషమిస్తూండేసరికి సత్యమూర్తి ఎల్లమిల్లికి ఉత్తరం రాశాడు, రామకృష్ణయ్యగారికి సంగతి సందర్భాలు వివరిస్తూ. తను ఒక్కడ్నే అయిపోయాననీ, సాయంగా వుండటానికి రమ్మనమని కోరుతూ రాశాడు. ఉత్తరం పోస్టుచేశాక తల్లి దగ్గరకు వెళ్ళి యిట్లా రాశానని చెప్పాడు.
రాధమ్మగారు అతని వంక ఒక్కక్షణం తేరిపారచూసి "నాకు చెప్పకుండా ఎందుకు వ్రాశావు?" అనడిగింది.
అతను జవాబు చెప్పటానికి తడబడ్డాడు. "అ...దే చెప్పాలనే అనుకున్నాను. కా...ని...ఊరికినే చెప్పలేదు."
ఆమె యింకేమీ మాట్లాడక తల మరోవైపుకి త్రిప్పుకుని మెదలకుండా ఊరుకుంది.
అతనక్కడ్నుంచి వచ్చివేయబోతూండగా ప్రక్కనే నిలబడి వున్న వీరభద్రం "ఇక్కడ రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మానుకుని మేము సేవచేస్తూండగా మధ్య యీ రామకృష్ణయ్యగారెందుకు? ఆయన వచ్చి చక్రం అడ్డువేస్తాడా?' అన్నాడు మరోవైపు చూస్తూ ఎవరితోనో అంటున్నట్లు.
సత్యమూర్తికి "ఆయన మా తండ్రి" అని జవాబు చెప్పాలనిపించింది. కాని అతనిది సహజంగా దుడుకు స్వభావంకాదు. తమాయించుకుని మౌనంగా తన గదిలోకి వెళ్ళి పోయాడు.
ఇతను ఇక్కడకు వచ్చాక ఇంతవరకూ విశాఖపట్నానికి ఉత్తరం రాయలేదు రాయాలని రెండు మూడుసార్లు అనుకున్నాడు. కాని ఏమిరాయాలో తెలీక వూరుకున్నాడు. ఇవాళ ఏమయినాసరే వాళ్ళకు ఉత్తరం రాద్దామన్న దృఢ సంకల్పంతో కాగితము, కాలము పట్టుకొని కూర్చున్నాడు.
సాధారణంగా అతనికి ఎవరికీ ఉత్తరాలు రాసే అలవాటు లేదు. అమిత బద్దకము కూడానూ. మొదలుపెట్టిందగ్గర్నించీ అతనికి అడుగడుక్కి శంకలు రాసాగినై. నిజానికి అతను ప్రసాదరావుని సంబోధిస్తూ రాయాలి. కాని మనస్సు అంగీకరించటము లేదు. అది సంకోచం చేతకాదు. ఉష పేరా రాయాలన్న స్వార్ధం అతన్ని ఆ ప్రక్కకి లాగుతోంది. అంతకు ముందెప్పుడూ అతడామెకు ఎటువంటి జాబూ రాసి వుండలేదు. అందుకని సిగ్గు, భయం ఒక ప్రక్క అభ్యంతర పెడుతున్నాయి. కాని స్వార్ధము ఏదో మధుర వేధన. అతను ఆమెకే రాయటానికి ఉపక్రమించాడు.
ఉషా!
ఇక్కడికి వచ్చాక వెంటనే జాబు రాద్దామనుకున్నాను. కాని మా నాన్నగారి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండటంవల్ల స్థిమితంలేక జాప్యం చేశాను. మీ అన్నయ్య ఊళ్ళో వున్నాడో లేదో తెలీదు. ఈ మధ్య అతనికి తరచు క్యాంప్స్ తగుల్తున్నాయికదూ అందుకని నీకు రాస్తున్నాను. నీకు జీవితం ఎలావుంది? ఎట్లా కాలక్షేపం చేస్తున్నావు? ఇక్కడ నేను ఒకవిధంగా వొంటరిని. ఏమీ తోచదు. మనసు విప్పి మాట్లాడటానికి ఎవరూ వుండరు. మధ్యమధ్య నాన్నగార్ని చూడటం, నేనూ, నా గదీ, నా అడుగులచప్పుడూ ఇదీ జీవితం. బహుశా ఇప్పట్లో విశాఖపట్నం రావటం పడదేమో. ఎప్పుడు వస్తానో చెప్పలేను. నా గది ఇంకా నాక్రిందే ఉంది. అప్పుడు హడావుడిలో ఖాళీచేసి రాలేదు. ప్రసాదరావుని వెళ్ళి గదిలోవున్న నా సామాను తెచ్చి మీ ఇంట్లోపెట్టి గది ఖాళీ చేసెయ్యమని చెప్పు ఇంటి యజమానికి నేనేమీ బాకీలేను. జరిగే నెల అద్దెకూడా ముందెప్పుడో ఇచ్చేశాను. ప్రసాదరావుని ఉత్తరం రాయమని చెప్పు. విశేషాలతో...జవాబుకోసం ఎదురుచూస్తుంటాను.