ఆ రోజు శనివారం. తల్లిదండ్రులు స్కూలుకొచ్చి పిల్లల చదువు విషయంలో టీచర్స్ ని కలుసుకోవడానికి కేటాయించిన రోజది. రామూతో కలిసి అతడి తల్లి కౌసల్య స్కూలుకి చేరేసరికి పదకొండయింది. గేటుబయటే ఎదురొచ్చింది. రుక్కిణి కౌసల్య ఆమెని పలకరించింది.
"మీరందర్నీ కలవటం అయిపోయిందా? ప్రీతమ్ మార్కులెలా వచ్చాయి?"
రుక్మిణి మొహం ధుమధుమ లాడుతోంది. "పోయినసారికంటే తక్కువ వచ్చాయి. అప్పుడప్పుడు స్కూలు ఎగ్గొడుతున్నాడట. 'క్లాసులో సరిగా చెప్పడంలేదు ఇంట్లోనే చదువుకుంటాను' అంటున్నాడు. అయినా ఈ రోజుల్లో టీచర్స్ లో కూడా సిన్సియారిటీ లేదులెండి. తమ ట్యూషన్ పిల్లలకయితే ఎక్కువవేస్తారు. మా ప్రీతమ్ లాంటి వాళ్ళయితే ధైర్యంగా ఎదిరిస్తారు కదా! అందుకని తక్కువ మార్కులు వేస్తారు" అంది.
తన కొడుకు అశ్రద్ధణి కూడా టీచర్స్ నేరంగా పరిగణించి తమ పిల్లల్ని సమర్ధించే తల్లిదండ్రుల పెంపకంలో పిల్లలు ఎలా తయారవుతారో తెలియడానికి ఇదొక సజీవ ఉదాహరణ అనుకుంది. కౌసల్య. మరేమీ మాట్లాడకుండా రుక్మిణి వద్ద సెలవు తీసుకొని కొడుకుతో సహా లోపలి వెళ్ళింది. ప్రిన్సిపాల్ ఆఫీసు బయట ఎదురుపడింది పార్వతి. ఆమెకూడా రుస రుస లాడుతూనే వుంది.
"ఏం జరిగింది?" అని అడిగింది కౌసల్య.
"టీ.సీ. అడుగుదామనుకుంటున్నాను. మావాడ్ని ఈ స్కూల్లోంచి మార్చేయాలి" అని జావాబిచ్చింది.
"దేనికి ? ఏం జరిగిందసలు?"
"అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు ప్రిన్సిపాల్. మావాడు ఏదో పిరమిడ్స్ లో పాల్గొంటానని పేరిచ్చి ఆఖరి నిమిషంలో మానుకున్నాడట. అందుకు ఏదో కొంపలు మునిగిపోయినట్లు మాట్లాడతాడు. మా అవినాష్ ణి మరీ స్ట్రిక్టుగా పెంచుతున్నామాట. వాడికి ఫ్రిడమ్ కావాలిట. మా పిల్లవాడికేం కావాలో మాకు తెలియదా?"
"ఇప్పుడు స్కూలు మారిస్తే మరి అవినాష్ అడ్జస్ట్ అవుతాడా?" ఆశ్చర్యంగా అడిగింది కౌసల్య.
"వాడ్నడగడం దేనికి? నాలుగురోజుల్లో వాడే సర్దుకుంటాడు. ఇప్పుడే మావారి ఆఫీసుకి వెళ్ళి మాట్లాడి వచ్చాను" అంది విసురుగా.
కౌసల్య వాదించదలచుకోలేదు. కుందేలుని పట్టకుండానే దానికి మూడు కాళ్ళని వాదించే మూర్ఖులతో మాట్లాడటం అనవసరం. పార్వతి వెళ్ళిపోయాక ఆమె గురించే ఆలోచిస్తూ రామూ క్లాసువైపు నడిచింది.
మధ్యలో వున్న గ్రౌండ్ లో చెట్టుకింద కూర్చుని కనిపించాడు అవినాష్. ప్రపంచంలోని దిగులంతా అతని మొహం లోనే కనబడుతోంది. "క్లాస్ లేదా?" అని అడిగింది ఆశ్చర్యంగా.
"నాకు భయంగా వుంది ఆంటీ. అమ్మ ఇక్కడికొచ్చి ఇంగ్లీషు టీచరుతో పోట్లాడి వెళ్ళింది" అన్నాడు.
"చూడు అవినాష్ మీ నాన్నగారి విషయం, అమ్మ విషయం నీకు బాగా తెలిసినపుడు చెప్పకుండా పెరివ్వటం, ఆఖరి నిముషంలో మానుకోవటం తప్పు కదా" అంది సౌమ్యంగా.
"నిజమే. కానీ అప్పుడు ఆలోచించుకోకుండా ఇచ్చేశాను".
"పిరమిడ్స్ లో ప్రయిజ్ పోయిందని టీచర్ల బాధ. ఫస్ట్ ర్యాంక్ పోయిందని మీ అమ్మా, నాన్నల బాధ.....నీకేమో రెండింటి గురించి బాధగానే వుంది కదూ."
అవినాష్ ఆమెవైపు ఆశ్చర్యంగా చూశాడు. తన మనసులో మాట ఆమెకెలా తెలిసిందా అని అనుకుంటూ "అవునాంటీ" అన్నాడు.
"పోతే పోయిందని ఊరుకోకుండా దానికోసం ఏదో చేయాలని నీకుంది. అది చాలా మంచి అలవాటు. అందుకే దాన్ని గురించి ఇలా బాధపడుతూ కూర్చొని టైం వేస్ట్ చేసుకోకు. ఫస్ట్ ర్యాంకు నీకే వచ్చేటట్టు పట్టుదలగా చదువు. ఇలా క్లాసులుమానేసి చెట్లకింద కూర్చుంటే ర్యాంకెలా వస్తుంది చెప్పు? ఇక పిరమిడ్స్సంగతంటావా! మీ అమ్మానాన్నలకి భయం అయి వుండవచ్చు. నీకెలగూ చదరంగం ఆడటం బాగా వచ్చుకదా! అందులో ప్రాక్టీస్ చెయ్యి" సానునయంగా అంది.
కొంచెం ఆగి, అవినాష్ నెమ్మదిగా లేచి క్లాసువైపుకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అతని నడకలో ఇప్పుడు కొత్త ఉత్సాహం కనబడుతోంది.
కౌసల్య అక్కడినుంచి తన కొడుకు క్లాసు టీచరు దగ్గరకెళ్ళింది. రాము ఎప్పుడూ క్లాసులో ఫస్ట్ రాడు. అతనికి అవినాష్ లాగా క్లాసు ఫస్ట్ రావాలన్న తపన లేదు. తల్లిదండ్రులు కూడా అతన్ని ఫోర్స్ చెయ్యరు. కాని ఫస్ట్ ర్యాంక్ వచ్చినవాడికీ అతనికీ మధ్య నాలుగయిదు మార్కుల తేడాయే వుంటుంది.
రామూ టీచర్లని కలిసాక తిరిగి ఇంటికి రాకుండా అవినాష్ వాళ్ళక్లాసు టీచర్ని కలుసుకుంది. ఆమె తనని కలవటానికి ఎందుకు వచ్చిందో ఆయనకి అర్థంకాలేదు.
"మీ అబ్బాయి నా క్లాసా?" అని అడిగాడు.
"కాదు" అంది కౌసల్య. "మీరేమీ అనుకోనంటే ఒక్క విషయం అడగాలి".
"అడగండి" అన్నాడు తను.
"మీ సబ్జక్టు బాగా చదివే పిల్లలపట్ల మీరెలా వ్యవహరిస్తారు?"
ఈ ప్రశ్నకి అతను కొంచెం ఆశ్చర్యపోయి "నాకు పిల్లలంతా సమానమే. కాకపోతే బాగా చదివేవాళ్ళంటే కొంచెం అభిమానం. అందులో తప్పేముంది? ఆఫ్ కోర్స్, మిగతా పిల్లలముందు దాన్ని ప్రదర్శించకూడదన్న విషయం నాకు తెలుసనుకోండి" అన్నాడు.
"టీచర్లు కొందర్ని స్పెషల్ గా చూస్తే మిగతావాళ్ళు బాధపడతారు. అలాగే ఒకళ్ళని మిగతా వాళ్ళముందు తిడితే అతనూ బాధపడతాడు".
ఊహించని వైపునుంచి విమర్శ వచ్చేసరికి ఇంగ్లీషు టీచరు కొంచెం కంగారుపడ్డాడు. "మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో కొంచెం తెలుసుకో వచ్చా?" అన్నాడు.
"అవినాష్ గురించి" అంది............. "అతను తప్పుచేసి వుండవచ్చు. కానీ కాస్త అనునయంగా పక్కకి పిలిచి అడిగి వుండవలసింది. అందరి ముందు మీరతన్ని తిట్టారు" అంది.
"పదిహేను రోజులు ప్రాక్టీసు చేయించాం. ఆఖరి నిమిషంలో మానేశాడు. అందువల్ల ఆ కోపంలో తిట్టాను. అతడు చెప్పిన కారణం ఏమిటంటే 'మా డాడీ వద్దన్నారు. అందుకే మానేశాను' అని. ఎంత సిల్లీగా వున్నదో చూశారుకదా. ఏదో ఆరోగ్యం బాగాలేదంటే అది వేరేవిషయం".
కౌసల్య అంది "పదిహేను రోజులు కష్టపడి ప్రాక్టీసు చేసి, చివరి రోజు ఎందుకని మానేశాడు? అని మీరొక్కసారి ఆలోచించి వుండవలసింది. అవినాష్ చాలా పిరికివాడు. భయస్థుడు. అయినా అంత కష్టపడి ప్రాక్టీసు చేశాడంటే దానికి కారణం ఎవరో తెలుసా టీచర్? మీరే. మీ మెప్పు పొందాలన్న ఆరాటమే తల్లిదండ్రులు కల్పించుకోవటంతో అతడు బాగా కృంగిపోయాడు. దానికితోడు మీరు బాగా తిట్టడంతో, మరీ డిప్రెస్ అయిపోయాడు.
ఇంగ్లీషు టీచరు చాలాసేపు మౌనంగా వుండి, "అయాం సారీ. నేనంతదూరం ఆలోచించలేదు. నా కోపం అతనిమీద చూపించటం తప్పే, ఈ రోజే అవినాష్ తో మాట్లాడతాను" అన్నాడు.
అతని దగ్గర సెలవు తీసుకొని వచ్చేసింది కౌసల్య. ఇంగ్లీషు టీచరు ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయాడు. అతని మనసులో ఎందుకో 'తనకీ చిన్నప్పుడు ఇలాంటి తల్లి వుండుంటే బావుణ్ణు' అనిపించింది.
6
డిసెంబరు 31వ తీదీ.
రాత్రి ఎనిమిది గంటలవుతోంది. కాలనీ మధ్య పార్కులో లైట్ల వెలుగు దేదీప్యమానంగా వుంది. ఆ కాలనీ జనమంతా అక్కడ చేరారు. ఓ పక్క కొందరు పిల్లలు చెస్, కారమ్స్ ఆడుతున్నారు. మరికొందరు పిల్లలు చలిమంటలు వేసి చుట్టూ కేరింతలు కొడుతూ తిరుగుతున్నారు. కాస్త దూరంగా వేసిన టెంట్ లో ఆడవాళ్ళ వంటపనిలో నిమగ్నమైవున్నారు.
శంకరానికి చాలా చిరాకుగా వుంది. పార్కు మధ్యలో వేసిన కుర్చీలలో ఒక దాంట్లో ముళ్ళమీద కూర్చున్నట్లు కూర్చొని వున్నాడతను. పక్కన కొందరు మగవాళ్ళు రమ్మీ ఆడుతున్నారు.
శంకరంకూడా రోజూ క్లబ్బుల్లో ఆడతాడు కాని ఆ లెవెలే వేరు. అక్కడంతా అతనికి సమానస్థాయిలో వున్నవాళ్ళో, లేక పై స్థాయిలో వున్నవాళ్ళో! ఇక్కడ......... స్టేక్ కూడా లేదట.
అతడికి చిరాకుగా వుంది. కారణం ఆ రోజు క్లబ్బుల్లో బ్రహ్మాండమైన పార్టీ వుంది. సీట్లు బుక్ చేస్తానంటే పార్వతి వద్దంది.
ఆ రోజు ప్రయిజ్ డిస్ట్రిబ్యూట్ చెయ్యమని ఆమెని ఆ కాలనీ వాళ్ళు అడిగారు. ఆ గుర్తింపు ఆమెకి చాలా సంతోషాన్నిచ్చింది. ఆమె కాదంటే అదే కాలనీలో వున్న కిరాణాకొట్టు యజమాని భార్య శకుంతలని పిలుస్తారు. కాలనీలో తన ఆధిపత్యానికి అది దెబ్బ. అందువల్ల భర్తని ఈ ప్రోగ్రాంకి రావటానికి బలవంతంగా ఒప్పించింది.
అదే టైముకి అవినాష్ తన గదిలో ఒంటరిగా కూర్చొని పూస్తాకాలు చదువుకుంటున్నాడు. క్రితం నెలలో తప్పిపోయిన ఫస్ట్ ర్యాంక్ ఈసారి రాకపోతే మాట దక్కదని అతని తల్లిదండ్రులు చెప్పారు.
సడన్ అందరూ గ్రౌండ్ లోకి వచ్చారు. ఆడవాళ్ళంతా ఒక పక్క, మగవాళ్ళంతా ఒక పక్క కుర్చీల్లో వున్నారు. కౌసల్య ఏదో క్విజ్ ఏర్పాటు చేసింది.
శంకరానికి చికాకు మరింత ఎక్కువైంది. "స్కూళ్ళు, కాలేజీ లెవల్లో క్విజ్ అంటే అర్థం వుంటుంది. కానీ పిల్లల తల్లిదండ్రులైన తరువాత కూడా ఏమిటీ క్విజ్ అనుకున్నాడు. కౌసల్య మైక్ దగ్గిర ఒక్కొక్క క్వశ్చన్ అడగటం ప్రారంభించింది. అందరికీ పేపర్లు, బాల్ పాయింట్ పెన్ లు ఇవ్వబడ్డాయి. ఆమె ఏం ప్రశ్నలు అడుగుతుందా అని అందరూ ఉత్సాహంగా చూస్తున్నారు శంకరం కూడా నిరాసక్తంగా పెన్ తీసుకున్నాడు. అయినా ఈ ఆడవాళ్ళకి జనరల్ నాలెడ్జ్ గాని. పాలిటిక్స్ నాలెడ్జ్ గాని ఏముంటుంది? ఏం సమాధానాలిస్తారు? అని అతని అభిప్రాయం.
మైకులో కౌసల్య మొదటి ప్రశ్న వేసింది.
"పెళ్ళయ్యాక మీ భార్య మీతో, మీ భార్యతో మీరు మాట్లాడిన మొదటి మాట ఏది?" జనంలో ఒక్కసారి కలకలం రేగింది. వెధవ ప్రశ్న ఎవరికి గుర్తుంటుంది. అతను పార్వతితో ఏం మాట్లాడాడో అనుకున్నాడు శంకరం. జవాబు వ్రాయటానికి కొంచెం టైమిచ్చి కౌసల్య రెండవప్రశ్న వేసింది.
"మీ భార్యకి మీరు మొదట కొనిచ్చిన చీర రంగేది? ధర ఎంత?"
బోడి ప్రశ్న! తను కొన్నివ్వడమేమిటి? అన్నీ పార్వతే కొనుక్కుంటుంది. పెళ్ళి కాగానే మావగారు బెంగుళూరు, ఊటీ పంపించారు. అక్కడ ఏదో కొనిచ్చినట్లు గుర్తు. రంగు మాత్రం గుర్తురావడంలేదు.
ఆడవాళ్ళు మాత్రం ప్రశ్నలకి, సమాధానాలు ఫిలప్ చేస్తున్నారు.
"గుర్తులేదు" అని అతను సమాధానం వ్రాశాడు.
తరువాతి ప్రశ్న. "మీరూ, మీ భార్య మాత్రమే కలిసి చూసిన మొదటి సినిమా ఏది? ఎక్కడ?"
"ఇవేం ప్రశ్నలురా బాబూ!" అనుకున్నాడు శంకరం. "గుర్తులేదు" అని వ్రాశాడు.
"మీ అబ్బాయి\అమ్మాయి పుట్టినప్పుడు మీరు మీ భార్యతో మాట్లాడిన మొట్ట మొదటి మాట ఏమిటి? ఏం మాట్లాడారు?"
"జ్ఞాపకం రావటంలేదు. అప్పుడు నేను ఊళ్ళోలేను" అని వ్రాశాడు. మళ్ళీ ఆ సమాధానం కరెక్ట్ కాదనిపించింది. ఊళ్ళో లేకపోతే వచ్చిన తరువాత ఏం మాట్లాడాడో గుర్తులేదు. ఏదో వ్రాయాలి కాబట్టి "నీ ఆరోగ్యం ఎలా వుంది? అని అడిగాను" అని వ్రాశాడు.