అందుకే శ్రీకాంత్ వెంటనే బదులిచ్చాడు. "నాన్నగారోసారి అతనితో మాట్లాడాలి. ఇంకా అయన మాట్లాడలేదు."
'అలాగయితే ఎలా ---- కాగితం మీద రాయి. అర్జంటుగా తేవాల్సిన పదార్ధాలు అని హెడ్డింగు పెట్టి నంబర్ వన్ పంచదార అని వ్రాయి.....' అన్నాడు రాజారావు.
'సరే సెనగపిండి వగయిరా పదార్దాలన్నీ రేపు బజార్నించి నేనూ తమ్ముడూ వెళ్ళి తీసుకువస్తాం." అన్నాడు మోహనరావు.
"అవసరం లేదన్నయ్యా.ఈ ఊళ్ళో ఒక షావుకారు గారున్నారు. మనకేం కావాలో చెబితే ఆయనే తెప్పించి పెడతారు. రాజమండ్రి రేటుకే సరుకిస్తారు." అన్నాడు శ్రీకాంత్.
"చాలా బాగుంది ఏర్పాటు" అన్నాడు మోహనరావు. "ఇంక తర్వాత గాడి పొయ్యి లోకి కట్టెలు కావాలి. ఏమాత్రం కావాలి? ఈ ఊళ్ళో దొరుకుతాయా?"
'దొరకవు. మూడు పూట్ల దాకా అవసరమవుతుందట."
శ్రీకాంత్ చెప్పాడు. "మానూళ్ళో పుల్ల దొరకదు. అంతా రైతులే కదా. ఎవ్వరూ పుల్ల కొనరు. తమ్ముడి క్లాస్ మేట్ నాన్నకో పుల్లల అడితి వుంది రాజమండ్రి లో. అంచేత ఈ పని మనము వెంకట్రామణకు అప్పజెప్పామంటే వాళ్ళక్కడ పుల్లలు లాంచిలో వేసేస్తారు. రేపు లాంచీ మనూరు చేరేసరికి కూలివాళ్ళను పంపించుకుని పుల్లలు దింపించుకుని ఇంటికి చేరవేసుకోవాలి."
"పెళ్ళి రాజామండ్రిలోనే అయితే ఈ బాధలుండేవి కాదు"---- రాజారావు గొణుక్కున్నాడు.
"గతజల సేతు బంధనం వద్దు. నంబర్ టూ పుల్లలు అని వ్రాయి "----అన్నాడు మోహనరావు.
"తర్వాత - పొయ్యి మీదకు పాత్ర సామాగ్రి "-- అంది విరజ.
"ఆ విషయంలో ఏ బెంగా లేదు. అయిదారు పెళ్ళిళ్ళకు సరిపడ్డ పాత్ర సామాగ్రి ఉంది మనూళ్ళో. ఎప్పుడు కావాలంటే అప్పుడే దొరుకుతుంది"-----అన్నాడు శ్రీకాంత్.
'అన్నట్లుగాడి పొయ్యి ఎలా వస్తుంది?" అన్నాడు రాజారావు.
'అది మనవల్ల అయ్యే పని కాదు నాన్నగారికి తెలిసిన ఓ ముసలి మేస్త్రీ ఉన్నాడు. ఈ ఊళ్ళో అందరికీ గాడి పొయ్యి అతనే కడతాడు. నాన్నగారు చెబితే వస్తాడు. అదెంత - ఒక పూట పని"----- అన్నాడు శ్రీకాంత్.
మోహనరావాశ్చర్యంగా తమ్ముడి వంక చూసి --" ఒరేయ్- ఇంత సమాచారం నీకెలా వచ్చిందిరా?" అన్నాడు.
"నిరుద్యోగిని కదా - నాకిదేపని. అదీగాక చాలామంది పెళ్ళిళ్ళకు మనిల్లె విడిది. పెళ్ళి చేయడానికి సరిపడ ఇల్లు లేని కొంతమంది - పెళ్ళిళ్ళు కూడా మనింట్లోనే జరిపించుకున్నారు. మనిల్లో తిరుమల తిరుపతి దేవస్థాన మనుకో ....ఇంకనాకు సమాచారం తెలియకేమవుతుంది ?" అన్నాడు శ్రీకాంత్.
"విడిదంటే గుర్తుకు వచ్చింది ---మన పెళ్ళి వారికి విడిదేక్కడ?" అన్నాడు మోహనరావు.
'అది నాన్నగారికే తెలియాలి "---అన్నాడు శ్రీకాంత్.
"{మనమింకా పెళ్ళి వారిదాకా రాలేదు . వంట బ్రహ్మల దగ్గరే ఉన్నాం"----అన్నాడు రాజారావు.
'అబ్బే వచ్చేశాం. పుల్లలోచ్చేశాయి. దినుసు లోచ్చేశాయి. గాడిపొయ్యి కట్టేశాం. పాత్ర సామగ్రీ వచ్చేసింది. ఇంక మనం పెళ్ళివారి సంగతి చూడాల్సిందే "----- అన్నాడు మోహనరావు.
"పెళ్ళివారికి విడిది కావాలి - రాయరా శ్రీకాంత్ '--- అన్నాడు రాజారావు.
"తర్వాత"------అంది వసుంధర.
"పెళ్ళి వారు తెల్లవారు ఝామున వస్తారు. అందరికీ ముఖం కడుక్కోడానికి పళ్ళపొడి తాటాకు అవసరమవుతాయి"-- అన్నాడు రాజారావు.
'మంచి పోయింటే - ఎలా తెల్సిందిరా ?" అన్నాడు మోహనరావు.
"మొన్న మా మామగారు చెప్పార్లె "---- అన్నాడు రాజారావు.
తర్వాత చర్చలు జోరుగా జరిగాయి. పెళ్ళి వారికీ విడిది. ఆ విడిదిలోకి నిత్యావసర సామాగ్రి - కనీసం నలుగురైదుగురైనా పడుకునేటందుకు మంచాలు - ఒకటి రెండు పెద్ద జంబుఖానాలు- కాఫీలకు పాలు .....వగైరా వగైరా చాలా తేలాయి.
'ఇంకా చాలా పని ఉంది"------ అన్నాడు నీరసంగా మోహనరావు.
"ఇందులో మనపను లేవో నాన్నగారి పనులేవో విడదీసి అయన పనులన్నీ కాగితం మీద లిస్టుగా రాసి అయన కందజేయడం మంచిది "------ అన్నాడు రాజారావు.
పంచదార, పెళ్ళివారి విడిది , గాడి పొయ్యి - ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తనదని తెలుసుకొని నవ్వాడు వెంకట్రామయ్య - 'మరి పెళ్ళి పందిరేవరు వేయిస్తారు - మీరేనా ?' అన్నాడాయన.
రాజారావు కంగారుగా -- "అవును పెళ్ళి పదిరోజుల్లోకి వచ్చేసింది. పందిరి వేయించాలి"-- అన్నాడు.
వెంకట్రామయ్య తన చేతిలోని కాగితాన్ని నలిపి అవతల పారేసి - "కాగితాలు మీలాంటి కుర్రాళ్ళకి గానీ - నాలాంటి అనుభవజ్ఞులక్కాదు-----' అన్నాడు.
'అయితే విడిది సంగతి చెప్పే ఉంచేరా ?" అన్నాడు రాజారావు.
'అవన్నీ నా పనులు. నేను చూసుకుంటాను. ఎవరూ నాకు గుర్తు చేయనవసరం లేదు"-- అన్నాడు కాస్త తీవ్రంగానే వెంకట్రామయ్య. చీటీ మీద రాసి అయన బాధ్యతలు తెలియపరచడం తండ్రికి నచ్చలేదని రాజారావక్కన్నింఛి నెమ్మదిగా జారుకున్నాడు.
16
లక్ష్మీ పెళ్ళి కూతురయింది.
ఎంత ముందుగా చెప్పినా ఏదీ చివరి క్షణం వరకూ జరగదు. ముహూర్తం టైముకే అందుకవసరమైన కొయ్యరోలూ, పెళ్ళి కూతురు పీటా తెప్పించాడు వెంకట్రామయ్య. రోలుకీ, పీటకీ పసుపు తాడు కట్టడం లాంటి తంతు కొంతవుంది. మనసులో గొణుక్కుంటూనే కార్యక్రమాన్ని కొనసాగించింది విరజ. చుట్టూ ప్రక్కల నుంచి అయిదారుగురు ముత్తయిదువలోచ్చారు. రోకట్లో పసుపు కొమ్ములు దంచారు.
ఆ కార్యక్రమం పూర్తయేక లక్ష్మీ స్నానం చేసి ---ఆరోజు కని ప్రత్యేకంగా కొన్న చీర కట్టుకుంది.
ఆ బట్టల్లో లక్ష్మీ ముఖంలో కొత్త కళ కనపడింది. బహుశా అదే పెళ్ళి కళ కాబోలు.
కూతుర్ని చూస్తుంటే వెంకట్రామయ్య కళ్ళు చెమర్చాయి - "ఎంత బాగుంది నా లక్ష్మీ -----" అన్నాకున్నాడాయన. కాళ్ళకు మ్రొక్కిన కూతుర్ని రెండు చేతులతో లేవనెత్తాడాయన.
పార్వతమ్మ ప్రేమగా కూతుర్ని దగ్గరకు తీసుకుని ----" ఈ రోజే పెళ్ళి రోజులాగుందే ...' అంది. లక్ష్మీ అన్నగార్లకు వదిన గార్లకూ నమస్కరించింది.
చెల్లెలు తనకు నమస్కరిస్తున్నప్పుడు ---" కనీసం ఇటువంటి సందర్భాల్లో నైనా నేనూ ఇంట్లో పెద్ద వాన్నే అన్న గ్రహింపు కలుగుతుంటుంది-----" అన్నాడు శ్రీకాంత్.
"రమకు పెళ్ళయితే కానీ నాకు దణ్ణం పెట్టేవాళ్ళు, దొరకరు ...." అన్నాడు వెంకట్రామణ బాధగా. అతను లక్ష్మీ కంటే రెండేళ్ళు చిన్న. రమ అతని తర్వాతది.
"దగ్గిర పడుతున్నాం ముఖ్య ఘట్టానికి ....' అన్నాడు మోహనరావు. అందరి మనసుల్లోనూ ఒకరకమైన ఉద్వేగముంది.
ఆ సాయంత్రం అందరూ కూర్చున్న సమయంలో మోహనరావు అన్నాడు. "ఇంక బంధుజనం ఒక్కొక్కరే రావచ్చును. మన దగ్గర బంధువుల్లో రకరకాల మంది ఉన్నారు. వాళ్ళను మనం వారి వారి మనస్తత్వాన్ని కాసుకుంటూ ఉండాలి. లేకపోతే అభాసు పాలై పోగలం...."
'అందరిలోకి ముఖ్య బంధువు నీలవేణి పిన్నీ ....." అన్నాడు రాజారావు.
'అవును, వెంకట్రామణ పూర్తిగా పిన్ని అవసరాలు చూసే బాధ్యత నప్పగిస్తున్నాను. అవసరాలు చూడ్డమంటే అవీ ఇవీ ఇవ్వడం కాదు. క్షణానికో మాటు ఆకాశాని కేత్తేస్తూ పోగుడుతుండాలి...." అన్నాడు మోహనరావు.