"నంబర్ టూ కాంతం పిన్ని ....ఈవిడకు మనింటి పరిస్థితి చూస్తె రవంత అసూయ. తనకు లాగే మనమూ చితికి పోలేదని బాధ. ఈవిడేమన్నా - మగ పెళ్ళివారికి పితూరీలు చేప్పే ధోరణి ప్రవర్తించ కుండా చూసుకోవాలి. అంతర్జాతీయ గూడచారుల లెవెల్లో ప్రవర్తించి - ఆవిణ్ణి కసుకోవాలి. మగపెళ్ళి వారి దగ్గర ఆవిడ కనపడ్డప్పుడల్లా - రమ ఆవిణ్ణి కాసేయడమో, పిలవడమో చేయాలి ...." అన్నాడు మోహనరావే మళ్ళీ.
"ఇంకా ....' అన్నాడు రాజారావు.
"నంబర్ త్రీ మంగళత్తయ్య . ఈవిడకు కాస్త తిండి భ్రమ. మిఠాయిలను ఉండల పళంగా మింగి జీర్ణించుకోగల శక్తీ. తనను కనిపెట్టిన వారికి అయాచితంగా మరిన్ని ఉండల నిచ్చి తప్పించుకో గల యుక్తీ ఈవిడ కున్నాయి. కాస్త ఏమరుపాటుగా ఉన్నామంటే పెళ్ళి వారికొక్క మిఠాయుండ కూడా మిగల్చదు. ఈవిణ్ణి కనిపెట్టడానికి కళ్యాణే ఉండాలి. అది ఉండల స్పెషలిస్టు.....' అన్నాడు మోహనరావు.
మోహనరావు చమత్కారానికీ అలా చెప్పినా రాబోయే బంధువుల వల్ల వారికి కొన్ని ఇబ్బందులున్న మాట మాత్రం నిజం.
ఒకనాటి వెంకట్రామయ్య హోదా ఏమిటో ఎంతోమందికి తెలుసును. అయన చితికిపోయాడని కూడా చాలామందికి తెలుసును. అయితే ఈనాటి వెంకట్రామయ్య అసలైన ఆర్ధిక పరిస్థితి వివరాలు వాళ్ళలో చాలామందికి తెలియదు. కూతురికి ఏడు వేలకు పైగా కట్నమిచ్చి పెళ్ళి చేస్తున్నాడన్న వార్తా అప్పుడే బంధు జనంలో పాకేసింది. అసలు కూతురి పెళ్ళి చేయగలడా అనుకున్న వారికీ మార్పు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వెంకట్రామయ్య పరిస్థితి ఏమిటి - అతని కొడుకుల హోదా ఏమిటీ - తండ్రీ కొడుకుల సంబంధ బందావ్యాలేలా ఉన్నాయి- అసలీ పెళ్ళి ఎలా జరుగుతుంది ---- అన్న కుతూహలం చాలా మంది బందువర్గాన్ని వేదిస్తోంది. అందుకనే ఈ పెళ్ళి చూడ్డానికి చాలామంది రాదల్చుకున్నారు.
బంధువర్గంలో తమను గురించి జరిగే చర్చల గురించి మోహనరావుకీ, రాజారావుకీ ఎలాగో అలాగా తెలుస్తూనే ఉంటుంది. అందుకని వాళ్ళీ పెళ్ళి నొక ప్రేస్టీజీ ఇష్యూగా , స్టాటస్ సింబల్ గా తీసుకున్నారు. తామేవ్వరో , తామేక్కడున్నారో - ఒక్కసారి బంధు వర్గానికి తెలియాలి. అలా చేయడానికి ఇదే మంచి అవకాశం. ఈ అవకాశాన్నుపయోగించుకుని - వెంకట్రామయ్య స్థానమేమిటో బంధు వర్గానికి తెలియజేయాలి.
వేళాకోళానికే మోహనరావు తన తమ్ముళ్ళకూ, చెల్లెళ్ళకూ చెప్పినప్పటికీ వచ్చిన బంధు వర్గాన్నో కంట కనిపెట్టవలసిన అవసరాన్ని మాత్రం అతను వేళాకోళంగా భావించలేదు. ఎందుకంటె :
వెంకట్రామయ్యకు దగ్గర బంధువులనదగ్గరవారిలో ఒక సంఘ సంస్కర్త ఉన్నాడు. అతను తల్లిదండ్రుల్ని కాదని కులం లేని పిల్లను పెళ్ళాడాడు. సమాజంలో అతనికి సరైన స్థానం లభించలేదు. దానికి తగ్గట్టే ఆ సంస్కర్త జీవితంలోనూ ఓడిపోయాడు. అతని జాతక ప్రభావమో ఏమిటో - అతనేందులో వేలు పెడితే అది భస్మమై పోయింది. దూర ప్రాంతాలకు పోయి వ్యవసాయం చేయాలనుకున్నాడు. నష్టం వచ్చింది. అందరికీ లాభసాటిగా ఉన్న వ్యాపారాన్నేన్నుకున్నాడు, అందులోనూ నష్టపోయాడు. అతను అప్పుల పాలైపోయాడు. వెంకట్రామయ్యకూ కొంత బాకీ పడ్డాడు. ఎవరికీ ముఖం చూపించలేక భార్యతో కలిసి అజాపజా లేకుండా మాయమై పోయాడు. అతనేమై పోయాడో ఎవరికీ తెలియదు.
బంధువులేవరయినా మోహనరావుని కలిసినప్పుడు నువ్వేం చేస్తున్నావ్, మీ తమ్ముడెం చేస్తున్నాడు, మీ పిన్ని నీలవేణి యెలా గుంది వగయిరా విషయాలేమీ అడగరు. ఆ సంఘసంస్కర్త గురించి అడుగుతారు. అతని మీద జాలిని ప్రదర్శిస్తారు. అలా అడగడంలో అలా చేయడంలో వారి ఉద్దేశం తెలుసుకోవాలన్న కుతూహలమూ కాదు. మనసులో రేగిన జాలీ కాదు. ఆ సంఘసంస్కర్త ఆ చెడిపోయినవాడు నీకు ముఖ్య బంధువు సుమా అని గుర్తుచేయడం. అటువంటి బంధువు తమకు లేడన్న దర్పాన్ని ప్రదర్శించడం!
బంధువులనబడేవారి మనస్తత్వాలేలాగుంటాయో తెలుసుకొనేందుకిదో మచ్చుతునక. అందుకే మోహనరావుకి భయం. ఐతే అతనికి చిన్నప్పట్నించి చాలా బంధువులతో బాగా పరిచయముంది. వారి మనస్తత్వాలను కాచి వడపోశాడనవచ్చు. ఎవరినేలా ఎదుర్కోవాలో, ఎవరికెలా దెబ్బ కొట్టాలో అతనికి బాగా తెలుసు. అందుకతనే తగినవాడు కూడా.
* * * *
డబ్బు మంచినీళ్ళలా ఖర్చయి పోతోంది. మోహనరావుకు రావాల్సిన చెక్కింకా రాలేదు. ఇంక చేసేదీలేక అతను వడ్డీకి డబ్బు అప్పుగా తీసుకో దల్చుకున్నాడు. పదహారు శాతం మీద అప్పిచ్చే వడ్డీ వ్యాపారి ఒకతను రాజమండ్రి లో వున్నాడు. అతను మోహనరావుకి తెలుసును. ఎలాగూ నెలరోజుల్లో తన బాకీ తీర్చేయగలనని మోహనరావుకు తెలుసు. ఎందుకంటె ఈరోజు కాకపొతే మరొ పదిరోజుల కయినా చెక్కు రెడీ అవుతుంది. అందుకని రాజమండ్రి వెళ్ళి వడ్డీకి అప్పు తీసుకు రాదల్చుకున్నాడు మోహనరావు. ఈవిధంగా ఒక యాభయిరూపాయలు నష్ట పోవల్సుంటుంది. అయితేనేం సమయానికి పని గడిచిపోతుంది. అతను రాజమండ్రీ వెళ్ళాడు.
ఎల్లుండి ఉదయానికి పెళ్ళి వారోస్తారు. ఇంటముందర ఇంకా పందిరి లేవలేదు. ఆరోజు సాయంత్రానికి వంట బ్రాహ్మలు రానున్నారు. గాడి పొయ్యి గురించి తండ్రితో ఘర్షణ పడవలసి వచ్చింది. పదేపదే చెబుతున్నందుకాయనకు చాలా కోపం వస్తోంది. చెప్పకపోతే నిమ్మకు నీరెత్తినట్టుంటారు. ఎలాగూ తప్పని పనికాయాన వాయిదా ఎందుకు వేయాలనుకుంటారో అతని కర్ధం కాకుండా వుంది. వంట బ్రహ్మాలు వచ్చేసరికి గాడిపొయ్యి రెడీగా వుండకపోతే ఎలా అన్నందుకాయనకు కోపం వచ్చి ఎండలో జోళ్ళు లేకుండా మేస్త్రీ యింటికి వెళ్ళాడు. మేస్త్రీ అయినను చూసి నొచ్చుకుని -----క్షణాల మీద వచ్చి గాడిపొయ్యి కట్టేశాడు.
అదేపని ఒకరోజు ముందుగా చేయించి వుంటే యెంత బాగుండేది ?
పెళ్ళి దగ్గరై ఎక్సయిట్ మెంట్ పెరుగుతున్న కొద్దీ - వెంకట్రామయ్యకు , రాజారావుకు వాగ్యుద్దాలు పెరిగి పోసాగాయి. ఆ రోజు ఉదయం దేబ్బలాడితే కాని శ్రీకాంత్ పంచదార మిల్లుకు వెళ్ళే అవకాశం రాలేదు. ఏమైతేనేం - సాయంత్రమయేసరికి పంచదారా వచ్చింది - గాడి పోయ్యా తయారయింది.
విడిది గురించి అడగడానికి రాజారావుకు భయంగానే ఉంది. ఉదయం నించీ తండ్రి అతనితో ముభావంగా ఉంటున్నాడు. సాయంత్రం అయన బట్టలు కట్టుకుని, కండువా మీద వేసుకుని బయటకు వెడుతుంటే రాజారావు కాస్తమనసు తేలికపడింది. అయన విడిదిల్లు మాట్లాడ్డానికే వెడుతున్నారని అతను భావించాడు.
మరో అరగంటలో వెంకట్రామయ్య తిరిగి వచ్చాడు. అయన ముఖం పాలిపోయింది. వచ్చి ఒక్క క్షణం పడక కుర్చీలో జారగిలపడిపోయి - రాజారావును నెమ్మదిగా పిలిచాడు.
రాజారావు క్షణాల మీద ఆత్రుతగా వెళ్ళాడు.
"విడిదింటి విషయంలో అనుకోని సమస్య వచ్చింది "--- అన్నాడు వెంకట్రామయ్య నీరసంగా.
"ఏం - ఇస్తానన్న వాళ్ళివ్వ లేదా ?" అన్నాడు రాజారావు.
"అదేం కాదు మీ యింట్లో పెళ్ళయితే మా యిల్లే విడి దివ్వాలి మరిచి పోకూడదు - అంటుంటే వాడు రఘురామయ్య. రెండు మూడు నెలల క్రితం అతనితో లక్ష్మీ పెళ్ళి విషయం చూచాయగా అన్నాను కూడా. వెంటనే అతను - ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ గురించి ఇల్లు ఖాళీ చేసి ఉంచుతానని అన్నాడు. తీరా ఇప్పుడతనింటికీ వెళ్ళే సరికి - ఇంటికి తాళం పెట్టి ఉంది. పక్క వాళ్ళనడిగితే - నిన్ననే యింటిల్లపాదీ హైదరాబాద్ వెళ్ళారని తెలిసింది "-- అన్నాడు వెంకట్రామయ్య.
"ముహూర్తం నిశ్చయమయ్యాక ఇంతవరకు ఒక్కసారి కూడా అతనికి విడిది గురించి చెప్పలేదా?"