Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 17


    మాలిని అక్కడే వున్న ఓ రాతిమీద పద్మాసనం వేసుక్కూర్చుంది.

    కొద్ది క్షణాలు నిశ్శబ్దం...

    ఆ ప్రశాంతమైన గంభీర వాతావరణంలో ఘంటారావంలా ఓ శ్లోకం వెలువడింది ఆమె నోటి నుండి- "యాదృచ్చయా చోపసన్నం స్వర్గద్వారా మపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభన్తే యుద్ధ మీ దృశమ్!"

    "మిస్టర్ త్రినాథ్! ఏ యుగానికైనా స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ భగవానుడి శ్లోకాలు నీకు కొన్ని వివరిస్తాను. ఏకాగ్రతతో అవగాహన చేసుకో. కురుక్షేత్ర రణభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు-

    "పార్థ! ఈ భూమిపై ఏ మహారాజులకు యుద్ధ మయాచితముగా ప్రాప్తించునో, వారి భాగ్యము కొనియాడదగినది. అప్రయత్నంగా లభించిన యుద్ధము తెరచియుంచిన స్వర్గద్వారమునకు పోల్చదగినది."

    యుద్ధావసరం ఆసన్నమయిందనే రెండు విషయాలను- తను ఎవరితో యుద్ధం చేయాలో, పరోక్షంగా ఎత్తి చూపినట్లు అర్ధం చేసుకున్నాడు త్రినాథ్. కసి, పొగరు, ఆత్మాభిమానం, నిర్లక్ష్యం, తెగువ, ధైర్యం కలబోసుకుని కనిపించే త్రినాథ్ కళ్లిప్పుడు క్రమంగా ప్రశాంతతను సంతరించుకుంటున్నాయి. ఆ చూపుల్లో ఇప్పుడు నిర్దుష్టమైన కదలిక, పట్టుదల, అప్రమత్తత, లక్ష్యశుద్ధి గోచరిస్తున్నాయి.

    మాలినికి ఆనందంగా వుంది త్రినాథ్ ని చూస్తుంటే-

    "శ్రేయాన్ స్వధర్నో నిగుణః
    పరధర్మా త్స్వనుష్ఠితాత్
    స్వధర్మే విధనం శ్రేయః పరధర్మో
    భయావహః!"

    బాగుగా ఆచరించబడినదైనను పరధర్మముకంటే గుణరహితమయినను స్వధర్మమే మేలు. తన ధర్మము నాచరించుచు మరణించుటే ఉత్తమము. పర ధర్మము నాచరించుట చేత భయము తప్ప యింకేమియు మేలు లేదు.

    మనిషికి ఆత్మాభిమానం, పౌరుషము, పట్టుదల, లక్ష్యశుద్ధి లేనిచో పశువులతో సమానం. నిన్ను నీవు బాగుచేసుకుని ఆకాశమంత ఎత్తు ఎదగటానికి ప్రయత్నించు. ఆ నీ స్వధర్మమే ఎన్నో లక్షలమందికి పరధర్మం బోధిస్తుంది.

    నాలుగే నాలుగు సంవత్సరాలు...

    1460 రోజులు ...

    35040 గంటలు ....

    2102400 నిమిషాలు ...

    126144000 క్షణాలు...

    ఆ ఆఖరి రోజు, ఆఖరి గంట, ఆఖరి నిమిషం, ఆఖరి క్షణం నీవు సాధించే గెలుపు ఈ దేశ యువతకు స్ఫూర్తినివ్వాలి. సోమరిపోతులకు, నిరాశావాదులకు బుద్ధి చెప్పాలి. మాతృదేశ స్వర్ణయుగారంభానికి నాంది పలకాలి-"

    త్రినాథ్ కళ్ళకిప్పుడు కనిపిస్తున్నది మాలిని ఒక్కటే.

    త్రినాథ్ మనోనేత్రాలకిప్పుడు కనిపిస్తున్నది తన లక్ష్యమొక్కటే.

    "ఇప్పుడు నీవేం చూస్తున్నావ్...?" మాలిని ప్రశ్న నిశ్శబ్దంగా వున్న ఆ నిశీధి ఆలయ ప్రాంగణంలో ఒక మహారాజు ఆజ్ఞలా ప్రతిధ్వనించింది.

    "నాలుగు సంవత్సరాల తర్వాత సంభవింపనున్న నా విజయాన్ని..." ట్రాన్స్ లో వున్నట్టు అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ.

    "మరింకేమీ కనిపించటంలేదా?"

    "కనిపిస్తోంది- నా గురువైన రాణీ మాలినీదేవి..." పెనుతుఫానుకు సయితం చలించని కొండలా స్థిరంగా వున్నట్లున్నాడు త్రినాథ్.

    మరలా నిశ్శబ్దం అలుముకుంది.

    త్రినాథ్ ఒకింత ప్రశాంతతను ఆస్వాదించాక, తన శారీరక ఏకాగ్రతను కాస్తంత సడలించాడు.

    "నాకో చిన్న అనుమానం."

    "అడుగు త్రినాథ్" అంది మాలిని కళ్ళుమూసుకొనే.

    "కురు, పాండవులు భీకర కురుక్షేత్ర సంగ్రామానికి బరి గీసుకొని మరికొద్ది ఘడియల్లో అది ప్రారంభం కానుండగా అర్జునుడు తనతో యుద్ధానికి సిద్ధపడబోతున్న బంధు జనావళిని చూసి వైరాగ్యంలోకి వెళ్ళాడు. అప్పుడు అర్జునుడ్ని కార్యోన్ముఖుడ్ని చేసిన శ్రీకృష్ణుడు పదునెనిమిది అధ్యాయాలను గీతగా అందించాడు గదా? అంతసేపు కౌరవులు చూస్తూ వూరుకుంటారా?"

    మాలిని త్రినాథ్ లాజిక్ కు ఓ క్షణం విస్తుపోయింది. అంతలోనే తిరిగి తేరుకుంది.

    "వేదాలలో, ఇతిహాసాలలో లాజిక్ కన్నా తత్వానికే ప్రాధాన్యత వుంటుంది త్రినాథ్. పైగా శ్రీకృష్ణుడు బ్రహ్మజ్ఞాని. అలాగే అర్జునుడు కూడా బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. బోధించేవారి స్థాయి- గ్రహింపుకు తెచ్చుకొనే వారి స్థాయి ఒకటయినప్పుడు కాలాన్నే శాసించగలదు. కొద్ది ఘడియలు తన విశ్వరూపం మొత్తం గీతా తత్త్వాన్ని బోధించాడు శ్రీకృష్ణుడు. అదే కొద్ది ఘడియల్లోనే పార్ధుడు దాన్ని గ్రహించాడు..."  

    "అయితే ద్రోణాచార్యుడికన్నా శ్రీకృష్ణుడే గొప్ప నా దృష్టిలో. ద్రోణుడు తన సంకుచిత దృష్టితో కులం ప్రాతిపదికగా క్షత్రియులకే విద్య నేర్పాడు. తను నేర్పకున్నా ఏకలవ్యుడు అర్జునుడంత నిష్ణాతుడయ్యాడు. పైగా నేర్పని విద్యకు ఏకలవ్యుడి బొటనవేలడిగాడు. అలాంటి గురువులు విద్యకే కళంకం తెస్తారు. నేటి తరానికి ద్రోణాచార్యులు అరిష్టమవుతారు. అంతేకాదు. జీవిత జ్ఞానం నేర్పేవాడే నిజమైన గురువు. చిన్న వయస్సులోనే విద్యార్దులలో కుల, మత ప్రసక్తి తెచ్చి కళంకితుడయ్యాడు గనుక చివరకు తన ప్రియశిష్యుడి చేతిలోనే దుర్మరణం పొందాడు..." త్రినాథ్ విశ్లేషణకు మాలిని నిర్ఘాంతపోయింది.

    "అవసరం ఆసన్నమయినప్పుడు అప్పిచ్చేవాడు కాదు గొప్ప. అలాంటి అవసరాలు ఎన్ని ఎదురైనా ఎదుర్కొనగల తరుణోపాయం, స్థయిర్యం ఇవ్వగలిగినవాడు గొప్ప. నాకు అ- ఆ- లు రావు. కాని ఆత్మ విశ్వాసం వుంది. ఏ-బి-సి-డి-లు రావు. కాని ఎవ్వరేమిటో క్షణాల్లో పసిగట్టగలను. సంఖ్యా శాస్త్రం రాదు. కాని రోజులు- నెలలు- గంటలు- మెదడులో లెక్కించగలను. అయినాసరే నాకా లోటు వుండకూడదు. ప్రపంచం పోకడల్ని అర్ధం చేసుకోవటానికి నాకు భాషరావాలి. తెలుగే కాదు ఇంగ్లీషు కూడా. అది మీరే నేర్పాలి-" దృఢచిత్తంతో అంటున్న త్రినాథవైపు మాలిని తృప్తిగా చూస్తూ అంది. "పట్టుదల, లక్ష్యశుద్ధి, అనవరతపు శ్రమ, అకుంటిత దీక్ష వుంటే నీకు అవసరమయ్యే చదువు నేర్పటానికి నాకు ఆరునెలలు చాలు-" అంటూ చాలా అన్నట్టు చూసింది.

    త్రినాథ్ చిరునవ్వుతో చాలన్నట్టు తలూపాడు.

    మాలిని చటుక్కున లేచి నిలబడింది.

    త్రినాథ్ ఓ విద్యార్ధిలా క్రింద కూర్చున్నాడు.

    మాలిని త్రినాథ్ వేపే తదేకంగా చూస్తూ "ఓం-" అంది.

    "ఓం-" తిరిగి అన్నాడు త్రినాథ్- ఆ ఓంకారనాదం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించిపోయింది కొద్దిక్షణాలపాటు.

    "అ" అంటే అమ్మకాదు"

    "మరి-?"

    "అమ్మ గురించి ఎవరూ ఎవరికీ ఏమీ నేర్పక్కర్లేదు. అయినా 'అమ్మ' అనే అతి పవిత్రమైన భావాన్ని వ్యక్తపర్చటానికి తెలుగు భాషకు చెందిన తొలి అక్షరం చాలదు. అది అనుభూతికి అందవలసినదే కాని అక్షరాభ్యాసానికి కాదు. 'అ' అంటే అనితరసాధ్యుడు-"

    "అనితరసాధ్యుడ్ని నేనే" త్రినాథ్ అల్లుకుపోతున్నాడు.

    "అ- అంటే ఆత్మవిశ్వాసం."

    తిరిగి అన్నాడు "ఆత్మవిశ్వాసం" అని.

    "ఎ" అంటే ఏపిల్ కాదు. ఏంట్ కాదు. చిన్నతనంలోనే 'ఏ' అంటే ఏపిల్ అని తిండి గురించి, ఏ అంటే ఏంటని చీమ గురించి చెప్పే పనికిమాలిన చదువులు నేర్పను నీకు. 'ఏ' అంటే ఎబిలిటి. అంటే సామర్ధ్యం.

    'బి' అంటే బ్యాలన్స్. కష్టనష్టాల్లో, కోపతాపాల్లో, పగ, ప్రతీకారాల్లో మనిషికి ఉండవల్సింది బ్యాలన్స్. అంటే సంయమనం, నిగ్రహం. ఇక 'సి' అంటే కేట్ (పిల్లి) అని పనికిమాలిన పిరికి జంతువు పేరు చెప్పను. 'సి' అంటే కరేజ్. ధైర్యము. 'డి' అంటే డాగ్ అని ఒక జంతువును గుర్తించటానికే దాన్ని ఉపయోగిస్తున్న పద్ధతి నాకు నచ్చదు. 'డి' అంటే డేరింగ్..."

    మాలిని అక్షరాభ్యాసానికి, జ్ఞానోపదేశానికి మధ్యలోనే అడ్డొచ్చాడు త్రినాథ్.

    "డాగ్ అంటే కుక్క. కుక్క విశ్వాసానికి, కాపలాకి మారుపేరు కదా?"

    "డి అంటే డాగ్ అనే చెబుతారు కాని విశ్వాసానికి మారుపేరని చెప్పరు."

    "కావచ్చు. కాని నేను ప్రారంభించే 'డి' అంటే డేరింగ్ మరియు విశ్వాసం కావాలి. ఎందుకంటే, ఈ దశలోనే అది నేర్చుకోకపోతే అంతా నేర్చుకుని అది మీ ఎడల చూపించకపోతే దారుణం."

    త్రినాథ్ వేపు విస్మయానందంతో చూసింది మాలిని.

    "ఒన్ అంటే నువ్వు అందరిలో నెంబర్ వన్ కావాలి. టూ అంటే ఒకటి కామన్ సెన్స్, రెండు శ్రమ విలువ, త్రీ అంటే ఒకటి దేశభక్తి, రెండు లక్ష్యశుద్ధి, మూడి అకుంఠిత దీక్ష..." మాలిని జ్ఞానబోధ నయాగరా జలపాతంలా దుమికి, గంగా ప్రవాహ నిర్మలతను సంతరించుకుంటూ పోతోంది.

    ఆ నిశ్శబ్ద వాతావరణంలో ప్రాతఃకాల ప్రశాంతతలో, ప్రత్యూష పవన పర్యవేక్షణలో ఆమె నోటినుంచి సన్నని శబ్దంతో వెలువడుతున్న లౌకిక బోధ తత్వాలు వచ్చి అతని కర్ణపుటాలను తాకి ఆ పైన అతని మేధస్సును పదును పెడుతున్నాయి.

    గగన వీధిన ఆ ఆలయ ప్రాంగణమే తమ నివాసమైన పక్షి జాలములు అల్లనల్లన స్వేచ్చా విహారం చేస్తున్నాయ్.

    అప్పటివరకూ దూరాన వున్న గుడి ప్రహరీగోడమీద పొంచి వున్న ఓ వృద్ధ గ్రద్ద సర్రున ఎగురుతూ వచ్చి ఆకాశ మార్గాన ఆనంద విహంగమైన ఓ శాంతి కపోతాన్ని తన వాడిగోళ్ళతో తన్నుకుపోయింది.

    సరీగ్గా అదే సమయంలో అటే చూస్తున్నారు ఆమె, అతడు. ఆ తర్వాత ఒకరివేపు ఒకరు చూసుకున్నారు నిశ్శబ్దంగా.

    "చూశావుగా? ఒక అరాచకపు హింస, జ్ఞానచక్షువయిన మానవుడిలోనూ నేటికి కొనసాగుతోంది. పావురాయికి శత్రువు వాడిని తట్టుకొనే శక్తి లేనప్పుడే తెలివి, మేధస్సు ఇచ్చే లౌక్యంతో నెగ్గుకురావాలి."

    "అర్ధమయింది మేడమ్" అన్నాడు త్రినాథ్ తగ్గు స్వరాన.

    సుదూరంగా కనిపించే నగర వీధి దీపాలు మిణుకు మిణుకు మంటుననే. తెల్లవారటానికి అట్టే వ్యవధి లేదని సూచిస్తూ, పక్షుల కలకల రావాల శబ్దం అంతకంతకు పెరుగుతోంది.

    ఇక ఈ రోజుకు చాలన్నమాట చెప్పటానికి ఆమెకు ధైర్యం లేదు. అతని కళ్ళల్లో అనంతమైన జిజ్ఞాస, తపన, వాటి లోతుల్లో పగ, ప్రతీకారం స్పష్టమవుతున్నాయి.

    అయినా కాలాతీతం కావడంతో లేచి నిలబడిందామె.

    అతనూ లేచి నిలబడ్డాడు.

    ఇద్దరూ ఒకరి వెనుక ఒకరు బయటకు నడుస్తున్నారు.

    వారి కాళ్ళక్రింద పడి నలుగుతున్న ఎండుటాకుల శబ్దం ఒక్కటే ఇప్పుడక్కడ స్పష్టంగా వినిపిస్తోంది.

    "మేడమ్! 'గీత' లోంచి మీరు వినిపించిన రెండవ శ్లోకంలో నాకు వేరే భావం గోచరిస్తున్నది."

    ఆమె చటుక్కున ఆగిపోయింది.

    "స్వధర్మం గురించి ఈ సమయంలో నాకు చెప్పవలసిన అవసరం ఎందుకు కల్గింది?"

    ఆమె గిరుక్కున వెనుదిరిగి త్రినాథ్ వేపు చూసింది.

    శరీరచ్చాయ నలుపైనా ముఖంలో ఏదో తేజస్సు కనిపిస్తోంది. సరైన ఒడ్డు, పొడుగు కలిగి ఆజానుబాహుడైన అతని దేహాకృతిలో ఏదో ఆకర్షణ... గర్జనలాంటి గంభీర స్వరం వెనుక కదనుతొక్కే ఆవేశం... అక్షరజ్ఞానమే లేని ఇతనిలో అనంతమైన అన్వేషణ... లోతైన ఆలోచన... ఒక మామూలు మనిషికి ఇన్ని అనన్యమైన లక్షణాలుండడం సాధ్యమా...?

    "అవును త్రినాథ్... నిజానికి నీవు కోరుకోకుండానే యుద్ధం సన్నద్ధమైంది. నిన్ను యుద్దోన్ముఖుడ్ని చేయాలన్నదే నా ప్రధానోద్దేశ్యం అయినప్పుడు మొదటి శ్లోకం చాలు. కాని రెండో శ్లోకం కూడా ఉపదేశం చేశాను. ఎందుకో తెలుసా? అది నాకు కూడా వర్తించాలని, వర్తిస్తుందని- అది నీవు గ్రహించాలని-"

 Previous Page Next Page