అయినా అప్పుడప్పుడు వరదలొచ్చి, వానలు లేక, చేలకి పురుగుముట్టి పంటలందక ఆ ఏడు కటకటలాడతారు. షావుకారు దగ్గర అప్పులు చేస్తుంటారు. అవి తీర్చలేక చక్రవడ్డీలు అయి తడిసి మోపెడు అవుతుంటాయి. ఆ అప్పులలోంచి బయటపడటానికి పొలం అమ్ముకుంటారు.
"మరి కో ఆపరేటివ్ బ్యాంక్ సిస్టమ్ లు ఉన్నాయేమో! రైతులకి రుణాలిచ్చి ఆదుకునే బ్యాంకింగ్ సర్వీస్ ఏమీలేదా?"
"వున్నాయనుకోండి. వాళ్ళూ అప్పులు యిచ్చి తీర్చలేదంటే అప్పు తీరేవరకు కొత్త రుణాలు ఇవ్వకపోతే వాళ్ళు ఇలాంటి వడ్డీవ్యాపారులనించే గదా తీసుకోవాలి. యిదొక వూబి అనుకోండి. ఒకసారి దిగబడితే బయటికి రావడం కష్టం మామయ్యా..." రంగా అన్నాడు.
"మొత్తం సేద్యపు నేల ఎంతుంటుంది ఈ వూరిలో?"
"అంజినాయుడు మనస్సులో లెక్కలుకట్టాడు. నాది ఏభై, మీది పాతిక, ఎమ్మెల్యేగారిది ముప్పై, మోతుబరి లక్ష్మయ్యనాయుడుది వంద... చిన్న పెద్ద రైతులు అందరిది కల్సి సుమారు వెయ్యి ఎకరాలలోపే వుంటుందండి. ఏడాదికి రెండు పంటలు. పెసర, మినప లాంటి పంటలు కూడా వేస్తారు.
"నీటి సదుపాయం ఏమిటి?"
"పెద్ద రైతులకి, భూస్వాములకి అందరికీ కాలవలు ఆధారం. ఈ ప్రాంతాల నీటిఎద్దడి లేదు. వర్షాకాలం కోసం - మిగతా టైము కాలువలు, నూతులు, చెరువులు ఆధారం. ఈ ప్రాంతంకి నీటి ఎద్దడి ఏంలేదు లెండి. పంట కాల్వలు చాలా అవసరాలు తీరుస్తాయి.
"చిన్నరైతులు నీటికి ఏం చేస్తారు. కాలవనీరు సరిపోతుందా."
"ఏం చేస్తారు. వర్షాల మీద, కాల్వల మీద ఆధారం. ఇంకా ఎప్పుడయినా అవసరం అయితే బోర్లున్న వారి దగ్గిరనుంచి నీరు కొనుగోలు చేస్తుంటారు. కొందరికి నూతులున్నాయి."
"పండిన పంట అమ్ముకోడానికి ఏంచేస్తారు. గవర్నమెంటుకిస్తారా, దళారీలకా..."
"గవర్నమెంటు ధాన్యం ప్రొక్యూర్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు కొందరిస్తారు. కొందరు కాస్త ఎక్కువ డబ్బు ఆశ చూపి ఏజంట్లకి, మిలర్లకి యిస్తారు. కాని ఎవరికిచ్చినా మార్కెట్ లో అమ్మే ధరలో సగం కూడా రైతుకి దక్కదు మామయ్యా."
"ధాన్యం మనంతట మనం బియ్యం చేసుకుని డైరెక్టుగా మార్కెట్ కి అమ్ముకుంటే- ఆహా, అసలు వీలుందా. ఈ విషయాలు నాకు తెలీక అడుగుతున్నాను."
"బియ్యం అమ్ముకోవాలంటే మనవూరిలో రైసు మిల్లులుండాలి మొదటిది! తరువాత బియ్యం ట్రాన్స్ పోర్టుచేసే లారీలు కావాలి. మార్కెట్ లో అమ్ముకోడానికి మళ్ళీ మధ్యవర్తులనే ఆశ్రయించాలి గదా. ఈ బాధలు పడలేకే ధాన్యమే అమ్మేస్తారు చాలామంది. బియ్యం అమ్ముకోడానికి పర్మిట్ కావాలి."
"అంటే ఊరిలో ఓ రైసు మిల్లుండాలి. ట్రాన్స్ పోర్టు ఫెసిలిటీస్ వుండాలి. యివన్నీ చెయ్యాలంటే వూరిలో రైతులందరూ, భూస్వాములు అందరూ ఓ సహకారసంఘంగా ఏర్పడి మొత్తం నేల అంతా సహకార సేద్యం చెయ్యాలి. ఖర్చు, లాభం అన్నీ అందరూ తమ ఎకరాల నిష్పత్తిలో పంచుకోవాలి. ఇదంతా మనం చేస్తే దిగుబడి, లాభం పెరుగుతుందంటారా" కేశవరావు సందేహం బయటపెట్టాడు. అంజినాయుడు, రంగా మొహాలు చూసుకున్నారు.
అంజినాయుడు బుర్రగోక్కున్నాడు. కేశవరావు అతనివంక చూశాడు.
"ఏం వూరంతా కలిసికట్టుగా సేద్యం చేయడానికి అవదా. అలా అయితే ప్రొడక్షన్ పెరుగుతుంది. కాస్ట్ తగ్గుతుంది. అంతా ఒకేమాట మీద వుండి సహకార సేద్యం చేస్తే ఒకరి పొలం బాగా పండింది. ఇంకొకరిది పండలేదు. ఒకరికి నష్టం, ఇంకొకరికి లాభం లాంటి సమస్యలుండవు. విత్తనాలు, ఎరువులు, మందులు మొత్తం మీద కొనుగోలు చేస్తే ధర, రవాణా, ఖర్చు తగ్గుతుంది. ట్రాక్టర్లు, కంబైన్ హార్ స్టర్ తో ఓ గంటలో ఒక ఎకరంలో కొత్త, నూర్పుడి, తూర్పారబట్టడం అన్నీ అయిపోతాయి. 7,8 లక్షలుంటుంది. వూరంతా కలిసి ఓ రెండు ట్రాక్టర్లు, ఓ యిలాంటి మిషను కొనుక్కుంటే సహకారసేద్యంలో ఎంతో కలిసివస్తుంది."
"డబ్బెక్కడ నుంచి వస్తుంది మామయ్యా..."
"అంతా ఎకరానికింత అని చందా వేసుకోవాలి. కొంత బ్యాంకులోను తీసుకోవచ్చు లేదంటే ప్రభుత్వం అగ్రీ యిండస్ట్రీస్ కార్పొరేషన్ వారు కొనుగోలు చేసి బాడుగకి యిప్పించే ఏర్పాట్లు చెయ్యాలి. వారిమీద ఆధారపడేకంటే మనవూరికి మనకు సంతానికుంటే మంచిది. మనం ముందు సహకార సేద్యానికి ఊరందరి రైతుల్ని భూస్వాములని కూడగట్టుకుని మంచి చెడు వివరించి ప్రోత్సహించాలి. సహకార సంఘంగా ఏర్పడాలి.
ప్రతి రైతు ఊరిలో భూమి తనదేనన్నంతగా భావించి కష్టపడాలి. ఎవరి పనులు వారికి నిర్దేశించాలి. బాధ్యతలు కేటాయించాలి. నష్టం, లాభం అందరికి ఎకరాల నిష్పత్తిలో పంచడం జరుగుతుందని చెప్పాలి. మనం ఒకసారి రైతులను, భూస్వాములను పిలిచి మీటింగ్ పెడదాం. అందరూ అంగీకారానికి వస్తే నేను అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్, కలక్టర్ అవసరమైతే ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి అన్నీ చెప్పి వారు ఏ సహాయ సహకారాలు యిస్తారో తెల్సుకుంటాను. గ్రామీణ బ్యాంకుల ద్వారా రుణం ఎంత యిస్తారో తెల్సుకుంటాను. ఎవరూ ఏమీ సాయం చేయకపోయినా మనకి మనమే చేసుకుంటాం అన్న భావన అందరిలో ముందు కలగాలి. అన్నీ ప్రభుత్వం చెయ్యలేదు. మన ఇల్లు మనం ఎలా చక్కదిద్దుకుంటామో మన యిష్టం! అలాగే మన వూరిని మనం చక్కదిద్దుకుంటాం. ఎవరి జోక్యం అక్కరలేకుండా అన్న అవగాహన అందరిలో కలిగించాలి మనం.
"ఇదంతా వినడానికి బాగుంది. అందరూ అర్థం చేసుకుని సహకరించడం జరిగే పనా. ఇందరిని కూడగట్టుకుని పెద్ద భూస్వాములు మనతో కలుస్తారా?" అంజినాయుడు అన్నాడు.
"జరిగేపనా అన్న నిస్పృహ ముందు వదలాలి మనం- ముందా నెగిటీవ్ థింకింగ్ ఎందుకు. అడిగిచూద్దాం- నచ్చచెపుదాం- ఇందులో వారికి కలిగే లాభాలు విడమర్చి చెపుదాం! తమకి లాభం వుంటుందన్న నమ్మకం మనం కలిగిస్తే తప్పకుండా అందరూ కలిసి వస్తారు. మీరు ఒకరోజు అందరినీ సమావేశపర్చండి. మనం మాట్లాడుదాం- రైసుమిల్లు కూడా పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఒకసారి ప్రభుత్వం రైస్ ప్రొక్యూరింగ్ వాటి విషయాలు గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి అది నిర్ణయించుకుందాం- ముందు మన ప్రజలని మనం కూడగట్టాలి. మీటింగు ఏర్పాటు చెయ్యండి. అదిచాలు! మిగతాది నేను చూస్తాను." కేశవరావు లేచి నిలబడి అన్నాడు!
"దానికేం భాగ్యం... రేపే పిలిపిస్తా అందరినీ..." అన్నాడు అంజినాయుడు.
* * *
"అబ్బ! ఏమిటింత కమ్మటి నేయి వాసన...ఏం పిండివంటలు చేస్తున్నావు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన కేశవరావు గుమ్మంలోకే మంచి నెయ్యి వాసన వస్తూంటే అడిగాడు.
"పిండివంటలు లేవు ఏంలేవు - నెయ్యి కాస్తున్నాను! పదిరోజులకే కిలో వెన్న వచ్చిందండి! ఎంత కమ్మటి వాసన వస్తుందో నెయ్యి- అమెరికాలో పాలు చిక్కగా వున్నా ఈ పెరుగంత బాగుండదు. ఈ నెయ్యి వాసనే లేదు!
"ఎంతయినా స్వదేశీ. సహజంగా దొరికే రుచి, వాసన ఆర్టిఫిషల్ వాటికి ఎలా వస్తాయి. ఈ ఎరువులు వచ్చాక కూరల రుచి, తాగే పాల రుచి మారిపోయింది. ఈ గేదె పాల పెరుగు ఎంత బాగుందో. మా మామ్మ చూడు యిక్కడ కవం పెట్టుకుని రోజూ కుండెడు మజ్జిగ చేసేది. రోజూ చేతిలో ఇంత వెన్నముద్ద పెట్టేది నాకు. మా అందరికి గడ్డ పెరుగు, తాగడానికి ఇంటికెవరొచ్చినా మజ్జిగ, పాలేర్లకి, రైతులకి, యిరుగు పొరుగులకి మజ్జిగ పోసేది. ఏమిటో యిప్పుడు పల్లెటూర్లలో కూడా పాల కలక్షన్ సెంటర్లు వచ్చాక పాలు పెరుగు మాయమయిపోతున్నాయి. పల్లెటూర్లలో యిదివరకు ప్రతి ఇంట పాడి, పొలంలో కాసే నవనవలాడే కూరలుండేవి.