Read more!

క్షీరాబ్ది ద్వాదశి – క్షీరసాగరమథనంలోని ఆంతర్యం!

 




క్షీరాబ్ది ద్వాదశి – క్షీరసాగరమథనంలోని ఆంతర్యం!

 

 

కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలలో క్షీరాబ్ది ద్వాదశి ఒకటి. దేవదానవులు ఈ రోజునే సాగరాన్ని మథించడం మొదలుపెట్టారు కాబట్టి ఈ రోజుని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. ఇంతే కాకుండా యోగీశ్వర ద్వాదశి అనీ, మథన ద్వాదశి అని వివిధ పేర్లు కూడా ఉన్నాయి. కార్తీక శుద్ధ ఏకాదశినాడు, క్షీరసముద్రం మీద శయనించిన విష్ణుమూర్తి నిదురలేచి, బ్రహ్మాదిదేవతల సమేతంగా బృందావనం (తులసివనం)లోకి ప్రవేశిస్తారట. అందుకని ఈ రోజున ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో వారికి సకల శుభాలూ కలుగుతాయంటారు. ఇక కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ఉన్న ప్రాధాన్యత కూడా సామాన్యం కాదు. ఉసిరి చెట్టు నీడ పడిన నీటిలో స్నానం చేసినా, సాయంవేళ ఉసిరి చెట్టు కింద దీపాన్ని ఉంచినా విశేషఫలితం దక్కుతుందని పెద్దల మాట.

 

 

క్షీరాబ్ది ద్వాదశినాడు తులసికోటలో విష్ణుమూర్తి రూపాన్నీ, ఉసిరికాయతో కూడిన ఉసిరి కొమ్మనీ ఉంచి ` ఓం శ్రీ తులసీ ధాత్రి సహిత లక్ష్మీనారాయణస్వామినే నమః` అన్న మంత్రాన్ని జోడిస్తూ దీపారాధన, సంకల్పం, కలశపూజ, షోడశోపచార పూజ వంటి పూజావిధినంతటినీ చేసి ధూపదీపనైవేద్యాలను సమర్పించి విష్ణుమూర్తిని కొలుచుకుంటారు భక్తులు. ఈ రోజున దీపాన్ని వెలిగించినవారికి ఏడాది పొడవునా దీపాన్ని వెలిగించిన ఫలితం దక్కుతుందని చెబతారు. ఇక ఈ రోజు దీపదానం చేసిన వారికి జన్మజన్మాల పాపాలన్నీ దహించుకుపోతాయని కార్తీక పురాణం చెబుతోంది. హైందవులు తులసికీ, ఉసిరికీ ఎందుకంత ప్రాముఖ్యతని ఇచ్చారో చెప్పేందుకు ఆధ్మాత్మికమైన, ఆరోగ్యపరమైన కారణాలు అనేకం కనిపిస్తాయి. ఇక క్షీరసాగరమథనాన్ని పరిశీలిస్తే ఆధ్మాత్మిక రహస్యాలు అనేకం గోచరిస్తాయి.

 

 

అమృతం కోసం దేవదానవులిద్దరూ క్షీరసాగరాన్ని మథించిన ఘట్టం రామాయణ,భారతాల్లోనే కాకుండా పురాణాల్లో కూడా ప్రస్తావనకు వస్తుంది. అలా సాగరమథనం ద్వారా వచ్చిన అమృతాన్ని పంచుకోవలన్నది దేవదానవుల నియమం. అందుకోసం నాగరాజైన వాసుకిని తాడుగానూ, మందర పర్వతాన్ని కవ్వంగానూ ఉపయోగించాలనుకున్నారు దేవదానవులు. ఈనాటి బిహార్‌లోని భగల్‌పూర్‌ హైవేకి దగ్గరలో ఉన్న ఎత్తైన గ్రానైటు కొండే పురాణాల్లో పేర్కొన్న మందర పర్వతమని కొందరి నమ్మకం. దానికి తగినట్లుగానే ఆ కొండ శిఖరం కవ్వం ఆకారంలో ఉంటుంది. ఇక సాగరమథనం కోసం మందర పర్వతానికి దన్నుగా కూర్మావతారం(తాబేలు) వెలసింది. తాబేలుది ఒక చిత్రమైన ప్రవృత్తి. తనకి ఏదైనా హాని జరుగుతుందని తెలిసినప్పుడు, లోపలికి ముడుచుకుపోతుంది. బాహ్య ప్రవృత్తిగా ఉన్న ఇంద్రియాలన్నింటినీ విరమించుకోగలగడం ధ్యానికి ఉండే ఉన్నతమైన లక్షణం అని యోగం చెబుతోంది. సర్పమేమో (వాసుకి) కుండలినిని సూచిస్తుంది. మనిషిలో ఉండే మంచి చెడులే దేవదానవులు! మనిషి అంతర్మఖుడై, తనలో నిద్రాణంగా ఉన్న ఆధ్మాత్మిక శక్తులను మేల్కొల్పడానికి నిత్యం చేసే ప్రయత్నమే సాగరమథనం.

 

 

మనిషి తన అంతర్మథనాన్ని మొదలుపెట్టగానే లభించేది సత్యమనే గరళమే!  దాన్ని అంగీకరించిన తరువాత అధికారం (ఐరావతం), సంపద (లక్ష్మీదేవి), ఆరోగ్యం (ధన్వంతరి), కీర్తి (చంద్రుడు)… అన్నీ లభిస్తాయి. వాటితో ఆగిపోకుండా, అన్నింటినీ దాటుకుని వెళ్లిననాడు అమృతం దక్కుతుంది. ఇంత చేసినా చివరికి ప్రబలమైన బలహీనతలకు లొంగిపోతే… మోహినిని చూసి అమృతాన్ని జారవిడుచుకున్న దానవులలాగానే మనిషి కూడా దిగజారిపోతాడు. లేకపోతే మోక్షమనే అమృతాన్ని సాధిస్తాడు.

- నిర్జర.