Read more!

వైశాఖ పురాణం 24 వ అధ్యాయము

 

 

వైశాఖ పురాణం 24 వ అధ్యాయము

 

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||

                                 వాయు శాపము

అంబరీషునితో నారదుడీవిధముగ వైశాఖ మహాత్మ్యమును వివరించెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తికి శంఖవ్యాధుల సంవాదమును వివరించుచు నిట్లనెను.

శంఖముని మాటలను విని కిరాతుడిట్లనెను. స్వామీ! విష్ణువునుద్దేశించి చేయుధర్మములు పూజలు, ప్రశస్తములు వానిలో వైశాఖమాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞానీ! ఆ విష్ణువెట్టివాడు. వాని లక్షణమేమి? వానిని చెప్పు ప్రమాణమేది? వానిని తెలిసికొనుటయెట్లు? వానికి చెందిన ధర్మములేవి? వీనిచేనతడు సంతోషించును? నీ సేవకుడనగు నాకీ విషయములను దయయుంచి చెప్పగోరును అని శంఖమహాముని సవినయముగ నడిగెను.

శంఖుడును కిరాతుడా! వినుము చెప్పెదను. శ్రీమహావిష్ణువు రూపము పాపరహితము. ఆలోచనకు అందనిది. బ్రహ్మమొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలిసికొనజాలనిది. శ్రీమహావిష్ణువు శక్తి గుణములు సర్వధా సంపూర్ణములు నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుణరహితుడు నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానందరూపుడు. చరాచరస్వరూపము సాటిలేనిది. దీనికి అధిపతి ఆశ్రయము. శ్రీమహావిష్ణువు. ఇవన్నియు పోయినను శ్రీహరి స్థానముపోదు ఆయన నిత్యుడు. ఉత్పత్తి స్థితి, సంహారము, వీని ఆవృత్తి, ప్రకాశము, బంధమోక్షములు, వీని ప్రవృత్తులన్నియు, నివృత్తులును, పరమాత్మవలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానులయభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మపదమునకు వాచ్యులెట్లగుదురు? కారు. జన్మాద్యస్యయతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడ నిర్ణయించినది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, యితిహాసములు, పంచపాత్రాది ఆగమములు, భారతము మున్నగు వానిచేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలిసికొన వీలగును మరి వేరువిధములచే తెలిసికొనజాలము. కావున వేదాదుల నెరుగనివారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణు నెరుగజాలరు. పరదైవము వేదవేద్యుడు సనాతనుడునగు శ్రీహరిని యింద్రియాదులచేత అనుమానాది తర్కముల చేతను తెలిసికొనశక్యము కాదు. ఇతని యవతారములను కర్మలను తమ బుద్దికొలదిగ దెలిసి కొని సర్వజీవములు ఆయన యధీనవృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగ నెరుగవలయును. ఇతడు సర్వశక్తిసంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగు వారు ఒకొక్క విధమైన శక్తినే కలిగియున్నారు.

బలము, జ్ఞానము, సుఖము మున్నగునవి యుండుటచే, ప్రత్యక్ష, ఆగమ, అనుమానాది ప్రమాణములచే సర్వప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని యెరుగవలయును. అట్టి మనుష్యుని కంటె జ్ఞానాదులుండుటవలన రాజు వండరెట్లు గొప్పవాడు. అట్తి రాజుకంటె మనుష్య గంధర్వులు నూరురెట్లు గొప్పవారు. తత్త్వాభిమానులగు దేవతలను మనుష్య గంధర్వులకంటె నూరురెట్లు గొప్పవారిని యెరుగుము. అట్టిదేవతలకంటె సప్తర్షులు గొప్పవారు, సప్తర్షులకంటె అగ్ని, అగ్నికంటె సూర్యుడు, సూర్యునికంటె గురువు, గురువుకంటె ప్రాణము, ప్రాణము కంటె యింద్రుడు మిక్కిలి గొప్పవారు బలవంతులు.

ఇంద్రునికంటె గిరిజాదేవి, ఆమెకంటె జగద్గురువగు శివుడు, శివునికంటె మహాదేవియగు బుద్ది, బుద్దికంటె మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణముకంటె గొప్పదిలేదు. ఆ ప్రాణమునండే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమన్నది పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడియున్నది. ప్రాణమువలననే సర్వము కదలుచున్నది. నల్లని మబ్బువలె ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీమహావిష్ణువుకంటె గొప్పది సమానమైనది యేదియును లేదు అని శంఖుడు వివరించుచుండగా కిరాతుడు స్వామీ! ప్రాణము అన్నిటికంటె గొప్పదో, ప్రాణముకంటె విష్ణువు గొప్పవాడో వివరింపుమని శంఖమునిని ప్రార్థించెను.

అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో నిట్లనెను. దేవతలారా! నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగ/రాజుగ నియమించుచున్నాను. మరిమీలో గొప్పవారెవరెవరో చెప్పిన వానిని యువరాజుగ చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి యుండవలెను అని శ్రీహరి పలుకగ యింద్రాదులు నేను గొప్పయనగ నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిరి, ఇంద్రుడు గొప్పయని కొందరనిరి. కొందరేమియుననక మౌనముగ నుండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయననే అడిగిరి.

అప్పుడు శ్రీహరి నవ్వుచు "విరాట్ పురుషుడు సృజించిన యీ స్థూలదేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలమంది దేవతలు అంశరూపముననుండిరి. ఏ దేవుడు ఏ దేవుని అంశ యీ శరీరమునుండి బయటకు వచ్చిన యీ దేహము పడిపోవునో ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరును అంగీకరించిరి.

స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలకి వచ్చెను. అప్పుడా శరీరము నడువలేక యుండెను. కాని వినుట, చూచుట మున్నగు సర్వకార్యములను చేయుచుండెను. అప్పుడా దేహినికుంటివాడనిరి. స్థూలదేహము గుహ్యవయవమునుండి దక్షుడను ప్రజాపతి యీవలకు వచ్చెనను శరీరము పడిపోలేదు. వినుచు, చూచుచు, పలుకుచు గాలిని పీల్చుచునుండెను తరువాత హస్తప్రదేశమునుండి యింద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడా దేహిని హస్తహీనుడనిరి. ఆ శరీరము యింద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగువానిని చేయుచునే యుండును. తరువాత కన్నులనుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపులేకపోయెను కాని ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కునుండి అశ్వినీ దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేక పోయెను గాని వినుట మున్నగువానిని శరీరము చేయుచునే యుండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడా దేహికి వినికిడిశక్తి లేకపోయెను. చెవిటి వాడనియనిరి. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుటమున్నగు వానిని చేయుచుండెను. శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీరి మాటలేకపోవుటచే మూగవాడయ్యెను. చూచుట మున్నగు వానిని చేయుచునే యుండెను. జ్ఞాన స్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానములేదుగాని వినుట మున్నగునవి యుండెను. తరువాత ప్రాణము, వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడా శరీరము, కన్నులు, చెవులు, మాట మున్నగునవి పనిచేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూచి దేవతలందరును ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి యిట్లనెను. ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును యే దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను.

శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను. కాని శరీరము లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించెను. శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చేవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్నిప్రవేశించినను ఆ కళేబరమునుండి మాటరాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా నా శరీరము లేచెను. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము బ్రదికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగ దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని యనిరి.

ఈ ప్రాణము తన అంశలచేత పూర్ణభాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమైయుండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు. ప్రాణహీనమగు ప్రాణియు నీ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ది లేదు. ప్రాణము లేనిదేదియని ఉండుటలేదు. కావున ప్రాణము సర్వజీవములకంటె అధికము. దానిని మించిన బలాఢ్యమైనది యేదియును లేదు. ప్రాణముకంటె గొప్పవారు సమానులు యెవరును ఉన్నట్లుగ నెవరును చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులనుచున్నారు. సర్వసృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరును ప్రాణమును తిరస్కరింపలేరు.

ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము నిత్యము శ్రీహరిని అనుసరించియుండును. శ్రీహరివశమున నుండును. ప్రాణదైవము. శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు చూడడు. రుద్రుడు, ఇంద్రుడు మున్నగువారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికెప్పుడును వ్యతిరేకమును చేయుదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. కావున శ్రీమహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసినజీవి పూర్వకర్మవశమున సిద్దమైన స్థూలము తన శరీరముపై నున్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము. వినాశవహితమునగు శ్రీహరి పదమును చేరుచున్నాడు.

అప్పుడు శంఖమహాముని వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరల శంఖుని యట్లడిగెను. స్వామీ! బ్రహ్మజ్ఞానీ! మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడునగు ప్రాణము యొక్క మహిమ లోకమున నెందులకు ప్రసిద్దము కాలేదు? దేవతలు, మునులు, మహాత్ములు మున్నగువారి మహిమ లోకమున పురాణాదులయందు వినబడుచున్నది. కాని ప్రాణమహాపురుషుని మహిమ యెందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను.

అప్పుడు శంఖమహాముని యిట్లనెను. పూర్వము ప్రాణమహాపురుషుడు. సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధయాగముల చేసి సేవింపదలచి గంగాతీరమునకు బోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్దిచేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసికొను కణ్వమహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించెను. పుట్టనుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నము నాచరించిన ప్రాణపురుషుని జూచి ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నము నాచరించితివి గాన నీకు ముల్లోకములయందును. ప్రఖ్యాతియుండదు. భూలోకమున మరింతగా ప్రఖ్యాతి యుండదని శపించెను. శ్రీహరి యవతారములు ప్రసిద్దములగును గాని నీవు మాత్రము ప్రసిద్దుడవు కావని యనెను.

ప్రాణమహాపురుషుడును కోపించి దోషము లేని నన్ను తప్పుచేయకుండనున్న వానిని యిట్లు శపించితివి కావున కణ్వమునీ! నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తి నందరును నిందింతురని యనెను. కణ్వముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్దుడు కాలేదు. కణ్వుని ప్రాణశాపము ననుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యెను. కిరాతా! నీవడిగిన వానినన్నిటిని చెప్పితిని. ఇంకను అడుగవలసినది యున్నచో నదుగమని శంఖుడు పలికెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను.

వైశాఖ పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము సంపూర్ణము