Read more!

శ్రీసాయిసచ్చరిత్రము ముప్పైఆరవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము

 


ముప్పైఆరవ అధ్యాయము

 

 

 

 

1. ఇద్దరు గోవా పెద్ద మనుష్యులు 2. షోలాపూరు నివాసియగు ఔరంగాబాద్ కర్ భార్య - వింత కథలు
ఇద్దరు పెద్ద మనుష్యులు :

ఒకనాడు గోవానుండి యిద్దరు పెద్దమనుష్యులు బాబా దర్శనంకోసం వచ్చి, బాబా పాదాలకు సాష్టాంగంగా నమస్కరించారు. ఇద్దరు కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒకరిని 15 రూపాయలు దక్షిణ ఇవ్వమని అన్నారు. ఇంకొకరు అడగకుండానే 35 రూపాయలు యివ్వగా అందరికీ ఆశ్చర్యం కలిగిలా నిరాకరించారు. అక్కడున్న శ్యామా బాబాని ఇలా అడిగారు "ఇది ఏమిటి? ఇద్దరూ కలిసి వచ్చారు. ఒకరి దక్షిణ ఆమోదించావు. రెండవవాడు ఇవ్వగా నిరాకరించావు. ఎందుకీ భేదభావం?'' బాబా ఇలా సమాధానం చెప్పారు "శ్యామా! ఎందుకో నీకు ఏమీ తెలియదు. నేను ఎవరిదగ్గరా ఏమీ తీసుకోను. మసీదుమాయి బాకీని కోరను. బాకీ ఉన్నవాడు చెల్లించి, ఋణవిమోచనం పొందుతారు. నాకు ఇల్లు గాని, ఆస్తి కాని, కుటుంబం కాని ఉన్నాయా? నాకీమీ అక్కర్లేదు. నేనెప్పుడూ స్వతంత్రుడను. ఋణం, శత్రుత్వం, హత్య చేసిన దోషం చెల్లించే తీరాలి. దాన్ని తప్పించుకునే మార్గం లేదు.'' తరువాత బాబా తన విశిష్ట ధోరణిలో ఇలా అన్నారు "ప్రపథమంగా అతడు పేదవాడు. ఉద్యోగం దొరికినట్లయితే మొదటినెల జీతం ఇస్తానని తన ఇష్టదైవానికి మొక్కుకున్నాడు. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగం దొరికింది. క్రమంగా జీతం పెరిగి 15 రూపాయలనుంచి 30,60,100,200లకు చివరికి  700లకు పెరిగింది. అతడు ఐశ్వర్యాన్ని అనుభవించే కాలంలో తన మ్రొక్కును మరిచాడు. అతని కర్మఫలమే అతన్ని ఇక్కడకి ఈడ్చుకుని వచ్చింది. ఆ మొత్తాన్నే (15 రూపాయలు) నేను దక్షిణ రూపంగా అడిగాను''

ఇంకొక కథ

 

 

 

 


సముద్రతీరంలో తిరుగుతుండగా ఒక పెద్ద భవనం దగ్గరికి వచ్చి, దాని వసారాపై కూర్చున్నాను. యజమాని నన్ను బాగా ఆదరించి చక్కని భోజనం పెట్టారు. బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలం చూపించి యిక్కడ పడుకోమన్నారు. నేను అక్కడ నిద్రపోయాను. నేను గాఢనిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతిపలకను లాగి గోడకు కన్నం చేసి, లోపలికి ప్రవేశించి నా జేబులో ఉన్న ద్రవ్యాన్నంతటినీ దొంగిలించాడు. నేను లేచి చూసుకోగా 30,000 రూపాయలు పోయాయి. నేను అమితంగా బాధపడ్డాను, ఏడుస్తూ కూర్చున్నాను. పైకం అంతా నోట్ల రూపంలో ఉండింది. ఆ బ్రాహ్మణుడే దాన్ని దొంగిలించాడని అనుకున్నాను. భోజనం, నీరు రుచించటం లేదు. వసారాపై ఒక పక్షకాలం కూర్చుని నాకు కలిగిన నష్టానికి ఏడుస్తున్నాను. తరువాత ఒక ఫకీరు దారివెంట వెళుతూ నేను ఏడవడం చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. నేను జరిగిన వృత్తాతం చెప్పాను. వారు ఇలా అన్నారు. "నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకుతుంది. ఒక ఫకీరు దగ్గరకు వెళ్ళు. వారి చిరునామా నేను ఇస్తాను. వారి శరణు వేడుకో. వారు నీ పైకం నీకు తిరిగి తెప్పిస్తారు. ఈలోగా నీకు ప్రియమైన ఆహరం ఏదో దాన్ని నీ ద్రవ్యం దొరికేవరకూ విసర్జించు.'' నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకున్నాను. నా పైకం నాకు చిక్కింది. నేను వాడాను విడిచి సముద్రపు ఒడ్డుకు వెళ్ళాను. అక్కడొక స్టీమర్ ఉంది. దానిలో జనాలు ఎక్కువగా ఉండటంతో లోపల ప్రవేశించలేక పోయాను. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలికి వెళ్ళగలిగాను. అది యింకొక ఒడ్డుకు దీసుకుని పోయింది. అక్కడ రైలుబండి ఎక్కి ఈ మసీదుకు వచ్చాను.

 

 

 

 


కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనం కోసం తీసుకుని వెళ్ళమనగా శ్యామా అలాగే చేశారు. శ్యామా వారిని ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టారు. భోజన సమయంలో శ్యామా బాబా చెప్పిన కథ చిత్రంగా ఉందన్నారు. బాబా  ఎప్పుడూ సముద్రతీరానికి వెళ్ళి ఉండలేదు. వారి దగ్గర 30,000 రూపాయలు ఎప్పుడూ లేవు. ఎన్నడూ ప్రయాణం చేయలేడు. ద్రవ్యం ఎపుడూ పోవటంగాని, రావడంగాని జరుగలేదు. కాబట్టి దాని భావం తమకేమైనా తెలిసిందా? అని వారిని అడిగారు. అతిథుల మనస్సులు కరిగాయి. వారు కంటతడిపెట్టుకున్నారు. ఏడుస్తూ "బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మస్వరూపుడే'' అని అన్నారు. "బాబా చెప్పిన కథ మాగురించే. వారు చెప్పినదంతా మా విషయమే. వారికీ ఎలా తెలిసిందో అనేదే గొప్ప చిత్రం. భోజనం అయిన తరువాత పూర్తి వివరాలను చెపుతామని'' అన్నారు.
భోజనం అయిత తరువాత తాంబూలము వేసుకుంటూ అతిథులు వారి కథలను చెప్పడం మొదలుపెట్టారు. అందులో ఒకరు ఇలా చెప్పరు "లోయలో ఉన్న ఊరు మా స్వగ్రామం. జీవనోపాధి కోసం నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్ళారు. నాకు ఉద్యోగం లభించినట్లయితే నా మొదటి నెల జీతం ఇస్తానని దత్తదేవుడికి మ్రోక్కుకున్నాను. వారి దయవల్ల నాకు 15 రూపాయల ఉద్యోగం దొరికింది. నాకు క్రమంగా జీతం బాబా చెప్పిన ప్రకారం 700 రూపాయల వరకు పెరిగింది. నా మ్రొక్కును నేను మరిచిపోయాను. దాన్ని బాబా ఈ విధంగా జ్ఞాపకానికి తెచ్చి నా దగ్గర  15 రూపాయలు తీసుకున్నారు. అది దక్షిణ కాదు. అది పాట బాకీ; తీర్చుకోవటం మరిచిన మ్రొక్కును చెల్లించటం''

నీతి :

 

 

 

 


బాబా ఎప్పుడూ డబ్బు బిక్షమెత్తుకోలేదు, సరికదా తమ భక్తులు కూడా భిక్షమెత్తుకోవడానికి ఒప్పుకోలేదు. వారు ధనం ప్రమాదకరమైనదిగానూ, పరాన్ని సాధించటానికి అడ్డుగానూ భావించారు. భక్తులు దాన చేతులలో చిక్కకుండా కాపాడేవారు. ఈ విషయం భక్త మహాల్సాపతి ఒక నిదర్శనం. ఆయన అత్యంత పేదవాడు. అతనికి భోజనవసతికి కూడా జరుగుబాటు లేకపోయింది, అయినా అతడు ద్రవ్యం సంపాదించడానికి బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీ ఇవ్వలేదు. ఒకరోజు ఉదారవర్తకుడైన హంసరాజు అనే బాబా భక్తుడు ఒకతను చాలా ద్రవ్యాన్ని బాబా సుముఖంలో మహాల్సాపతికి యిచ్చారు. కాని బాబా దాన్ని పుచ్చుకోవడానికి అనుమతించలేదు.
తరువాత రెండవ అతిథి తన కథ ఇలా ప్రారంభించాడు : "నా బ్రాహ్మణ వంటమనిషి నా దగ్గర 35 సంవత్సరాల నుండి నౌకిరీ చేస్తూ ఉన్నాడు. దురదృష్టాన వాడు చెడు మార్గంలో పడ్డాడు. వాది మనస్సు మారిపోయింది. వాడు నా ద్రవ్యాన్నంతా దొంగిలించాడు. రాతి పలకను తొలగించి, ధనం దాచిన భోషాణం ఉన్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వస్వం అంటే 30,000 రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయాడు. బాబా సరిగ్గా ఆ మొత్తాన్నే ఎలా చెప్పగాలిగారో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడుస్తూ కూర్చున్నాను. నా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒక పక్షం వరకు చాలా ఆరాట పడ్డాను. విచారగ్రస్తుడనై దుఃఖంతో అరుగుమీద కూర్చుని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణాన్ని తెలుసుకున్నారు. నేను వివరాలన్నీ తెలిపాను. అతడు "షిరిడీసాయి అనే ఔలియా ఉన్నారు, వారికి మ్రోక్కుకో. నీకు ప్రియమైన ఆహారాన్ని విడిచిపెట్టు. నీ మనస్సులో వారి దర్శనం చేసేవరకు నీకు ప్రియమైన ఆహారాన్ని తిననని మొక్కోకో'' అన్నారు. నేను అలాగే "బాబా! నా ద్రవ్యం దొరికిన తరువాత, మీ దర్శనం చేసిన తరువాత, నేను అన్నం తింటాను'' అని మ్రోక్కుకున్నాను.
"దీని తరువాత 15 రోజులు గడిచాయి. బ్రాహ్మణుడు తనంతట తానే ఆ డబ్బును నాకు ఇచ్చాడు.నా శరణు వేడుకున్నాడు. వాడు ఇలా అన్నాడు "నేను పిచ్చి ఎక్కి యిలా చేశాను. నీ శిరస్సు నా పాదములపై పెట్టాను. దయచేసి క్షమించు'' ఈ విధంగా కథ సుఖాంతమైంది. నాకు కనిపించి సహాయపడిన ఫకీరు తిరిగి కనబడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూడడానికి ఎంతో గాఢమైన కోరిక కలిగింది. మా యింటి అంత దూరం వచ్చినవారు షిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకం. ఎవరయితే నాకు కనపడి నా ద్రవ్యాన్ని తిరిగి తెప్పిస్తారో అలాంటివారు 35 రూపాయలకు పేరాశ చూపెడతారా? దీనికి వ్యతిరేకంగా మా దగ్గరనుంచి ఏమీ ఆశించక, ఎల్లప్పుడూ తమ చేతనయినంత వరకు బాబా మమ్ములను అధ్యాత్మిక మార్గంలో నడిపిస్తారు.

 

 

 

 


దొంగిలించిన నా ద్రవ్యం దొరికిన వెంటనే అమితంగా సంతోషించి మైమరిచి నా మ్రొక్కును మరిచిపోయాను. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నంలో చూశాను. షిరిడీకి వెళ్లాలనే సంగతి అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. నేను గోవా వెళ్ళాను. అక్కడనుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటునుండి షిరిడీకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. నేను హార్బరు దగ్గరకు వెళ్లగా స్టీమరులో జాగా లేకపోయింది. కెప్టెన్ ఒప్పుకోలేదు. కాని, నాకు పరిచయం లేని నౌకరు ఒకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్ లో బొంబాయికి తీసుకుని వచ్చారు. అక్కడనుండి యిక్కడకు రైలులో వచ్చాను. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి,. మేమెక్కడ? మా యిల్లెక్కడ? మా అదృష్టం ఏమని చెప్పాలి? బాబా మా ద్రవ్యాన్ని తిరిగి రాబట్టారు. ఇక్కడికి లాక్కువ్చ్చారు. షిరిడీ జనులారా! మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఎలాగంటే, బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరాలు మీతో నివసించారు. మీ పుణ్యం అనంతం. ఎందుకంటే అది బాబాను షిరిడీకి లాగింది. సాయియే మా దత్తుడు. వారే మ్రొక్కుకోమని నన్ను ఆజ్ఞాపించారు. స్టీమరులో జాగా ఇప్పించారు. నన్ను ఇక్కడికి తెచ్చారు. ఇలా వారి సర్వజ్ఞత్వం సర్వశక్తి మత్వాన్ని నిరూపించారు.

ఔరంగాబాదుకర్ భార్య :

 

 

 

 


షోలాపూరు నివాసి అయిన సఖారామ్ ఔరంగాబాద్ కర్ భార్యకు 27 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. ఆమె అనేక దేవతలకు మ్రొక్కులు మొక్కింది, కాని నిష్ప్రయోజనం అయ్యాయి. చివరికి నిరాశ చెందింది. ఈ విషయమై చివరి ప్రయత్నం చేయాలని నిశ్చయించుకుని తన సవతి కొడుకు అయిన విశ్వనాథునితో షిరిడీకి వచ్చింది. అక్కడ బాబా సేవ చేస్తూ రెండు నెలలు గడిపింది. ఆమె ఎప్పుడు మసీదుకు వెళ్ళినా అది భక్తులతో నిండిపోయి ఉండేది. బాబా చుట్టూ భక్తమండలి మూగి ఉండేవారు. బాబా ఒంటరిగా చూసి, వారి పాదాలపై పడి తన మనస్సును విప్పి చెప్పి, తనకు ఒక సంతానం కావాలని కోరుకోవడం కోసం తగిన అవకాశానికి ఆమె కనిపెట్టుకుని ఉండేది. చివరికి శ్యామకి ఈ సంగతి చెప్పి, బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యం కలగచేసుకోమని చెప్పింది. శ్యామా, బాబా రార్బారు ఎల్లప్పుడూ తెరిచి ఉంటుందనీ, అయినా ఆమె గురించి ప్రయత్నిస్తానని సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చు  అనీ చెప్పారు. బాబా భోజన సమయంలో మసీదు వాకిలిలో కొబ్బరికాయ, అగరవత్తులతో సిద్ధంగా ఉండమనీ తాను సైగ చేయగానే మసీదుపైకి రావాలనీ చెప్పరు. ఒకరోజు శ్యామా మధ్యాజ్న భోజనం తరువాత బాబా చేతులు తువాలుతో తుడుస్తూ ఉండగా బాబా శ్యామా బుగ్గను గిల్లారు. శ్యామా కోపంగా "దేవా! నా బుగ్గను గిల్లటం నీకు తగునా? మా బుగ్గలు గిల్లటంవంటి పెంకి దేవుడు మాకు అక్కర్లేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇదేనా మన సాన్నిహిత్య ఫలితం?'' అన్నాడు. బాబా ఇలా అన్నారు "శ్యామా! 72 జన్మలనుండి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్ళకు గిల్లితే నీకు కోపం వస్తున్నది.'' శ్యామా ఇలా అన్నారు "ఎల్లప్పుడు ముద్దులు, మిఠాయిలు ఇచ్చే దైవం మాకు కావాలి. మీనుండి మాకు గౌరవంకాని, స్వర్గంకాని, విమానంకాని అవసరంలేదు. మీ పాదాలపట్ల నమ్మకం మాకెప్పుడు ఉండుగాక.'' బాబా ఇలా అన్నారు. "అవును, నేను వచ్చింది అందుకే, ఇన్నాళ్ళనుంచి మీకు భోజనం పెట్టి పోషిస్తున్నాను. నీ యందు నాకు ప్రమానురాగాలు ఉన్నాయి.''
అలా అంటూ బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చున్నారు. శ్యామా ఆమెను సైగచేసి రమన్నారు ఆమె మసీదుపైకి వచ్చి బాబాకు నమస్కరించి, కొబ్బరికాయ, అగరవత్తులు ఇచ్చింది. బాబా ఆ టెంకాయని ఆడించారు. అది ఎండిపోయింది. కాబట్టి లోపల కూడుక ఆడుతూ శబ్దం వస్తూ వుంది.

 

 

 

 


బాబా : "శ్యామా! యిది గుండ్రంగా లోపల తిరుగుతున్నది. అది ఏమంటుందో విను!''
శ్యామా : ఆమె తన గర్భంలో ఒక బిడ్డ అలాగే ఆడాలి అని వేడుకుంటుంది. కాబట్టి, టెంకాయను నీ ఆశీర్వాదంతో యివ్వు.
బాబా : టెంకాయ బిడ్డను ప్రసాదిస్తుందా? అలా అనుకోవడానికి ప్రజలు ఎంత అమాయకులు?
శ్యామా : నీ మాటలు మహిమా, ఆశీర్వాదప్రభావాన్ని నాకు తెలుసు. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదిస్తుంది. నీవు మాటలతో కాలాయాపన చేస్తూ ఆశీర్వాదం ఇవ్వకుండా ఉన్నావు.
ఆ సంవాదము కొంతసేపు జరిగింది. బాబా పదేపదే టెంకాయను కొట్టమని అంటున్నారు. శ్యామా టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుకుంటున్నాడు. చివరికి బాబా లొంగి "ఆమెకు సంతానం కలుగుతుంది'' అని అన్నారు. ఎప్పుడని శ్యామా అడిగారు. 12 మాసాలలో అని బాబా జవాబిచ్చారు. టెంకాయను పగులకొట్టారు. ఒక చిప్పను ఇరువురు తిన్నారు. రెండవ చిప్ప ఆమెకి ఇచ్చారు.
అప్పడు శ్యామా ఆ స్త్రీవైపు తిరిగి "అమ్మా! నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసాలలో సంతానం కలగకపోతే, ఈ దేవుని తలపై ఒక టెంకాయను కొత్తిఏ మసీదునుంచి తరిమివేస్తాను. ఇందుకు తప్పితే నేను మాధవుడను కాను. మీరు దీన్ని చూచెదరు గాక!'' అన్నారు.
ఆమె ఒక సంవత్సరంలో కొడుకును కనింది. 5వ మాసంలో కొడుకును మసేదుకు తీసుకొనివచ్చి భార్యాభర్తలు బాబా పాదాలపై పడ్డారు. కృతజ్ఞుడైన తండ్రి 500 రూపాయలు ఇచ్చారు. బాబా గుఱ్ఱము 'శ్యామాకర్ణ'కు ఈ ధనంతో శాల కట్టించారు.
ముప్పైఆరవ అధ్యాయము సంపూర్ణం