Read more!

శ్రీసాయిసచ్చరిత్రము పదకొండవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము


పదకొండవ అధ్యాయము

 

 

భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధాలుగా అవతరింప వచ్చు. (1) నిర్గుణస్వరూపము (2) సగుణస్వరూపము. నిర్గుణస్వరూపమానికి ఆకారము లేదు. సగుణస్వరూపానికి ఆకారము ఉంటుంది. రెండూ పరబ్రహ్మం యొక్క స్వరూపాలే. మొదటిదానిని కొందరు ధ్యానిస్తారు; రెండవదానిని కొందరు పూజిస్తారు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణస్వరూపాన్ని పూజించటమే సులభమని ఉంది. కాబట్టి దానినే అనుసరించవచ్చునని చెప్పారు. మనుష్యులు ఆకారము కలిగి ఉన్నాడు. కాబట్టి సహజముగా భగవంతుని కూడా ఆకారంతో సగుణస్వరూపునిగా భావించి పూజించటం సులభము. కొంతకాలము వరకు సగుణ స్వరూపమైన బ్రహ్మాన్ని పూజించిగానీ మన భక్తిప్రేమలు వృద్ధిచెందవు. క్రమంగా ఆ భక్తీ నిర్గుణస్వరూపమైన పరబ్రహ్మ ఉపాసనకు దారి తీస్తుంది. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురూ, సూర్యుడు, నీరు, బ్రహ్మము --- ఈ ఏడూ పూజనీయాలు. కాని సద్గురువు వీటన్నింటికంటే ఉత్క్రుష్టుడు. అలాంటి సద్గురువైన సాయినాథుని మనస్సులో ధ్యానిద్దాము! వారు రూపుదాల్చిన వైరాగ్యము; నిజభక్తులకు విశ్రాంతి ధామము.

 

 

వారి వాక్కులలో మనకుగల భక్తియే ఆసనంగా, మన కోరికలన్నీ విసర్జించటమే పూజా సంకల్పంగా చేసి వారిని ఉపాసిద్ధాము. కొందరు సాయిబాబా ఒక భగవద్భక్తుడు అంటారు; కొందరు మహాభాగవతుడు అంటారు; కాని మాకు మాత్రము బాబా సాక్షాత్తూ భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, ఋజువర్తులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్యసంతుష్టులు. శ్రీసాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవానికి వారు నిరాకారస్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగరసంగమం చేయబోయే ముందు దారిలో తాపంతో ఉన్నవారికి చల్లదనాన్నిస్తూ, చెట్లు-చేమలకు జీవాన్ని ఇస్తూ, ఎందఱో దాహంతో ఉన్నవారికి దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్టే, సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవనగమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదిస్తూ జగత్తును పావనం చేస్తున్నారు.

 

 

భగవద్గీతలో శ్రీకృష్ణుడు, మహాత్ములు తన ఆత్మ అని, తన సజీవ ప్రతిమ అని, తానే వారు అని, వారే తాను అని ఉన్నాడు. వర్ణింపడానికి వీలుకాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపంలో అవతరించారు. శ్రుతులు బ్రహ్మాన్ని ఆనందస్వరూపంగా వర్ణించుచున్నాయి. (తైతరీయ ఉపనిషత్తు). ఈ సంగతి పుస్తకములో చదువుతున్నాము. కాని భక్తులు ఈ ఆనందస్వరూపాన్ని షిరిడీలో అనుభవించారు. సర్వానికి ఆధారభూతమైన బాబా ఉపాధిరహితుడు. వారు తమ ఆసనం కోసం ఒక గోనెసంచి ఉపయోగించేవారు. భక్తులు దానిపై చిన్న పరుపువేసి, ఆనుకోవడానికి చిన్న బాలేసును సమకూర్చారు. బాబా తన భక్తుల కోరికను మన్నించి, వారివారి భావాన్ని అనుసరించి తనను పూజించుడానికి ఎలాంటి అభ్యంతరం చూపలేదు. కొందరు చామరాలతోనూ, కొందరు విసనకర్రలతోనూ విసురుతూ ఉండేవారు. కొందరు సంగీత వాద్యాలను ఉపయోగించేవారు. కొందరు వారికి ఆర్ఘ్యపాదాలు సమర్పించే వారు. కొందరు వారికి చందనము, అత్తరు పూస్తూ ఉండేవారు. కొంటారు తాంబూలాలు సమర్పిస్తూ ఉండేవారు. కొందరు నైవేద్యము సమర్పించేవారు. షిరిడీలో నివసిస్తున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి; ఎక్కడ చూచినా వారే ఉండేవారు. భక్తులు బాబాయోక్క సర్వంతర్యామి తత్త్వాన్ని ప్రతిరోజూ అనుభవిస్తూ ఉండేవారు. సర్వంతర్యామి అయినా ఆ సద్గుణమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగనమస్కారాలు.

డాక్టరు పండితుని పూజ :

 

 

 

తాత్యాసాహెబు నూల్కరు మిత్రుడైన డాక్టరు పండిత్ ఒకసారి బాబా దర్శనం కోసం షిరిడీ వచ్చారు. బాబాకు నమస్కరించిన తరువాత మసీదులో కొంతసేపు కూర్చున్నారు. అతనిని దాదా భట్ కేల్కరు దగ్గరికి వెళ్ళమని బాబా చెప్పారు. డాక్టరు పండిత్ అలాగే దాదా భట్ దగ్గరికి వెళ్లారు. దాదా భట్ అతనిని సగౌరవంగా ఆహ్వానించారు. బాబాను పూజించడానికి పళ్ళెంతో దాదాభట్ మసీదుకు వచ్చారు. డాక్టరు పండిత్ కూడా అతన్ని అనుసరించారు. దాదాభట్ బాబాను పూజించారు. అంతకు ముందు ఎవ్వరూ బాబా నుదుటిపై చందనము పూయడానికి సాహసించలేదు. ఒక్క మహల్సాపతి మాత్రేమే బాబా కంఠానికి చందనం పూస్తుండేవారు. కాని ఆ అమాయకభక్తుడైన డాక్టరు పండిత్ దాదాభట్ పూజా పళ్ళెంలోనుండి చందనాన్ని తీసుకొని బాబా నుదుటిపై త్రిపుండాకారంలో వ్రాసారు. అందరికీ ఆశ్చర్యం కలిగేలా బాబా ఒక్క మాట అయినా అనకుండా ఊరుకున్నారు.

 

 

ఆనాడు సాయంత్రం దాదాభట్ బాబాను ఇలా అడిగారు "బాబా! మేమెవరయినా మీ నుదుటిపై చందనం పూస్తామంటే నిరాకరించేవారే? డాక్టరు పండిత్ వ్రాస్తుంటే ఈరోజు ఎలా ఊరుకున్నారు?'' అన్నారు. దానికి బాబా ప్రసన్నంగా ఇలా సమాధానం యిచ్చారు "నేనొక ముస్లీంని, అతడు సద్భ్రాహ్మణుడననీ, ఒక మహమ్మదీయుని పూజించటం ద్వారా తాను మైలపడిపోతాననే దురభిమానం లేకుండా, ఆటను నాలో తన గురువును భావించుకుని, అలా చేసాడు. అతని నిష్కల్మష భక్తీ నన్ను కట్టిపడేసింది. అతనికి నేను ఎలా అడ్డు చెప్పగలను?'' దాదాభట్ ఆ తరువాత డాక్టరు పండిత్ ని ప్రశ్నించగా అతను బాబానుతన గురువుగా భావించి తన గురువుకి చేసినట్లే బాబా నుదుటిపై త్రిపుండాకారంలో వ్రాసాను అని చెప్పారు.

 

 

భక్తులు వారివారి భావానుసారం తమను ఆరాధించడానికి బాబా సమ్మతించినా, ఒక్కొక్కసారి వారు అత్యంత వింతగా ప్రవర్తించేవారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యాల పళ్ళాన్ని విసిరివేస్తూ ఉగ్ర అవతారం దాల్చేవారు. అలాంటి సమయంలో బాబాను సమీపించడానికి కూడా ఎవ్వరికీ ధైర్యం చాలేది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిడుతూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు మైనంకంటే మెత్తగా కనిపిస్తూ ఉండేవారు. అప్పుడు వారు శాంతి, క్షమాలకు ప్రతిరూపాలుగా కనిపిస్తూ ఉండేవారు. బయటికి కోపంతో ఊగిపోతూ కళ్ళెర్ర చేసినప్పటికీ, వారి హృదయం మాత్రం మాతృహృదయంలా అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరకు తీసుకొని "నేనెప్పుడూ ఎవరిపైనా కోపించి ఎరుగరు. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేస్తుందా? సముద్రం తనను చేరుకునే నదులను ఎప్పుడైనా తిరగ్గొడుతుందా? నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరిస్తాను? నేనెప్పుడూ మీ యోగాక్షేమాలనే ఆపేక్షిస్తాను. నేను మీ సేవకుడిని. నేనెప్పుడూ మీ వెంటే వుండి, పిలిచినా పలుకుతాను. నేనెప్పుడూ కోరేది మీ ప్రమను మాత్రమే'' అనేవారు.

హాజీ సిద్దీఖ్ ఫాల్కే :

 

 

 

బాబా ఎప్పుడూ ఏ భక్తుని ఎలా ఆశీర్వదిస్తారో ఎవరికీ తెలియదు. అది కేవలం వారి ఇచ్చపై ఆధారపడి ఉండేది. హాజీ సిద్దీఖ్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణ. సిద్దీఖ్ ఫాల్కే అనే మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన తరువాత షిరిడీ చేరుకున్నారు. అతను చావడి ఉత్తరభాగంలో బసచేశారు. తొమ్మిదినెలలు షిరిడీలో ఉన్నా, బాబా అతన్ని మసీదులో పాదం పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ స్థలంలో కూర్చునేవాడు. ఫాల్కే అత్యంత నిరాశానిస్పృహలకు లోనయ్యాడు. ఏమీ చేయడానికి అతనికి తోచేదికాదు. నిరాశ చెందవద్దనీ, నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడు అయినట్లు, మాధవరావు దేశ్ పాండే (షామా)ద్వారా బాబా దగ్గరికి వెళ్లి అతని మనోరథం సిద్ధిస్తుందని కొందరు భక్తులు అతనికి సలహా యిచ్చారు. అలాగే అని, తన తరపున బాబాతో మాట్లాడమని షామాను ఫాల్కే వేడుకున్నాడు.

 

 

షామా అందుకు సమ్మతించి, ఒకరోజు సమయం కనిపెట్టి, బాబాతో ఇలా అన్నారు : "బాబా! ఆ ముదుసలి హాజీని మసీదులో కాలుపెట్టనివ్వడం లేదు ఎందుకు? ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించుకొని వెళ్తున్నారు. ఆ హాజీని మాత్రమే ఎందుకు ఆశీర్వదించవు?'' దానికి బాబా ఇలా సమాధానమిచ్చారు : "షామా! ఇటువంటి విషయాలలో నీవింకా పసివడివి. నీకివన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకోకుంటే నేనేం చేయగలను? అల్లామియా కటాక్షము లేకపోతేఈ మసీదులో పెట్టగలిగేవారు ఎవరు? సరే, నీవు అతని దగ్గరికి వెళ్లి వాణ్ని బారవీ బావి దగ్గరున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగు'' షామా వెళ్లి హాజీని ఆ విషయం అడిగి, తిరిగి బాబా దగ్గరకి వచ్చి హాజీ అందుకు ఒప్పుకున్నాడని చెప్పాడు. నలభైఅయిదు వేల రూపాయలు నాలుగు వాయిదాలలో ఇవ్వగలాడేమో కనుక్కుని తిరిగి బాబా అడిగారు. షామా వెంటనే వెళ్లి, హాజీ తాను నాలుగు లక్షలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని జవాబు తీసుకుని వచ్చాడు.

 

 

సరే మళ్ళీ వెళ్లి వాడిని ఇలా అడుగు "మసీదులో ఈ రోజు మేకను కోద్దాం, వాడిని దాని మాంసము కావాలో, వృషణాలు కావాలో కనుక్కో'' బాబావారి కొళంబా (మసీదులో బాబా భిక్షచేసి తెచ్చిన పదార్థాలు ఉంచే మట్టిపాత్ర)లో ఉన్న చ్వ్హిన్నముక్కతోనైనా సంతుష్టి చెందుతానని షామా ద్వారా హాజీ బదులు చెప్పాడు. ఇది వినగానే బాబా అత్యంత కోపంతో మసీదులోని కొళంబా, నీతికున్దాలను బయటికి విసిరివేసి, తిన్నగా చావిదీలో ఉన్న హాజీదగ్గరికి వెళ్లి తన కఫ్నీని పైకెత్తి పట్టుకుని తీవ్రస్వరంతో "నన్ను గురించి ఏమనుకుంటున్నావు? నీవేదో గొప్పవాడివనీ, పెద్ద హాజీవాణి గొప్పలు పోతూ, ఏమిటేమిటో వదులుతున్నావవే? నా దగ్గరా నీ ఆటలు? ఖురాను చదివి నీవు తెలుసుకొన్నది ఇదేనా? మక్కామదీనా యాత్రలు చేశాననే గర్వంతో నేనెవరో తెలుసుకోలేక పోతున్నావు? అంటూ, ఏమేమో ఇంకా అతన్ని తిట్టి, మసీదుకు మరలి వెళ్ళిపోయారు.

 

 

బాబా ఆగ్రహావేశాలను చూసి హాజీ గాబరా పడ్డాడు. ఆ తరువాత బాబా కొన్ని గంపల మామిడి పళ్ళు కొని వాటిని హాజీకి పంపారు. తిరిగి హాజీ దగ్గరికి వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హాజీ చేతిలో పెట్టారు. అప్పటినుంచి హాజీని బాబా ప్రమాదారాలతో చూస్తూ, భోజనానికి పిలుస్తుండేవారు. హాజీ ఆనాటి నుండి తనకు ఇష్టం వచ్చినప్పుడల్లా మసీదులోకి వచ్చి వెళ్తుండేవాడు. బాబా ఒక్కొక్కప్పుడు వాడికి డబ్బులు ఇస్తుండేవారు. బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యాడు.

పంచభూతాలు బాబా స్వాధీనం :

 

 

బాబాకు పంచభూతాలూ స్వాదీనమని తెలపడానికి రెండు సంఘటనలను వర్ణించిన తరువాత ఈ అధ్యాయాన్ని ముగిస్తాను ....
(1) ఒకరోజు సాయంకాలంలో షిరిడీలో గొప్ప తుఫాను సంభవించింది, నల్లని మేఘాలు ఆకాశం నిండా పరుచుకున్నాయి. గాలి తీవ్రంగా వీస్తుంది. ఉరుములు, మెరుపులతో కుంభవృష్టి కురిసింది. కొంతసేపటికి నేలంతా జలమయమ అయ్యింది. పశుపక్షాది జీవకోతితో సహా జనాలందరూ భయపడ్డారు. షిరిడీగ్రామంలో కొలువై ఉన్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకోలేదు. కాబట్టి వారందరూ మసీదుకి వచ్చి బాబా శరణు కోరారు. తుఫానుని ఆపివేయమని బాబాను వేడుకున్నారు.

 

 

ఆపదలో వున్న ప్రజలను చూసి బాబా మనస్సు కరిగింది. వారు బయటికి వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా "ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించ''మని గర్జించారు. కొన్ని నిముషాలలో వర్షం తగ్గిపోయింది. గాలి వీచటం మానింది. తుఫాను ఆగిపోయింది. చంద్రుడు ఆకాశంలో కనిపించాడు. ప్రజలందరూ సంతోషపడి వారి వారి గృహాలకు వెళ్ళిపోయారు.

 

 

(2) ఇంకొకప్పుడు మిట్టమధ్యాహ్నం దునిలోని మంటలు అపరిమితంగా లేచాయి. మంటలు మసీదు కప్పుకున్న దూలాలను తాకుతున్నట్టుగా ఎగిసిపడసాగాయి. మసీదులో కూర్చున్నవారికి ఏం చేయడానికి తోచలేదు. ధునిలోని కట్టెలు తగ్గించమని గానీ, నీళ్ళు పోసి మంటలు చల్లార్చండని కానీ బాబాకు సలాహా యివ్వడానికి వారు భయపడి పోతున్నారు. వారి భయాందోళనలను బాబా వెంటనే గ్రహించి,, తమ సటకాతో ప్రక్కనే ఉన్న స్తంభముపై కొడుతూ "దిగు, దిగు, శాంతించ''మని అన్నారు. ఒక్కొక్క సటకా దెబ్బకు, కొంచెం కొంచెం చప్పున మంటలు తగ్గిపోయి, ధుని యథాపూర్వంగా మితంగా మండసాగింది. భగవంతుని అవతారమైన శ్రీసాయినాథుడు అలాంటి వారు. వారి పాదములపై పది సాష్టాంగనమస్కారం చేసి, సర్వస్యశరణాగతి వేడుకున్నవారందరినీ వారు కాపాడుతారు. ఎవరైతే భక్తీ, ప్రేమలతో నీ అధ్యాయములోని కథలను నిత్యం పారాయణ చేస్తారో వారు కష్టాలన్నింటినుండీ విముక్తులు కాగలరు. అంతేకాక సాయిలోనే అభిరుచి, భక్తీ కలిగి త్వరలో భాగవత్సాక్షాత్కారాన్ని పొందుతారు. వారి కోరికలన్నీ నెరవేరి, చివరికి కోరికలు లేనివారై ముక్తిని పొందుతారు.

పదకొండవ అధ్యాయము సంపూర్ణము