Read more!

మహాశివుని జ్ఞాననేత్రం !

 

 మహాశివుని జ్ఞాననేత్రం !

మన కళ్ళతో చుట్టూ చూపినప్పుడు, సూక్ష్మపరిశీలన చేస్తే సృష్టిలోని సూక్ష్మాతిసూక్ష్మాలన్నీ గోచరిస్తాయి. అలాగే బ్రహ్మాండంగా ఆలోచిస్తే, ఈ సృష్టిలో అతిపెద్దదైన శూన్యం కనబడుతుంది. కొన్ని ప్రదేశాలు నక్షత్రమండలాలతో ఉంటూ మిగతా విశ్వమంతా అనంతశూన్యమే కనబడుతుంది. ఆ శూన్యం అందరి దృష్టికి రాదు. ఆ అనంత శూన్యమే 'శివ' అనబడుతుంది. నేటి ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడ ప్రతి వస్తువు శూన్యంలో నుంచే ఉద్భవించి, శూన్యంలోనే లయమవుతున్నట్లు చెబుతోంది. ఇది శివుని విషయంలో పరిశీలించగా, ఈ అనంత శూన్యమే మహాదేవుడు అని తెలుస్తోంది.

మనం శుభం కోరుకుంటూ భగవంతుని ఓ వెలుగుగా భావిస్తాము. కానీ, మనం ఆ పరిధి దాటి జీవితాన్ని శోధిస్తే, శూన్యంలో ఉండే దైవత్వం తెలుస్తుంది. ఈ భూమిపై మనకు తెలిసిన కాంతి సూర్యుడు మాత్రమే. ఆ సూర్య కాంతిని కూడా చేతితో ఆపి, చీకటిని లేక చీకటిఛాయను చేయవచ్చు. కానీ, చీకటి అన్నిచోట్ల అల్లుకుని ఉంటుంది.

కొందరు ఈ చీకటిని భూతంగా వర్ణిస్తారు.కానీ, దైవత్వం అన్నిచోట్ల వ్యాపించి ఉన్నాడని తెలిసిననాడు, ఆ దైవత్వమే ఈ అంధకారమని తెలుస్తుంది. ఎందుకంటే, విశ్వమంతా అంధకారం కనుక, వెలుగు అనేది ఒక మూల నుంచి వస్తుంది. ఆ మూల మండుతుంటుంది. ఆ మంటకు ఆద్యాన్తాలున్నాయి. ఆ మూలకు ఓ నియమిత పరిమాణం ఉంది. కానీ, చీకటికి మూలం లేదు. దానికి అదే ఆధారం.

అందువల్ల 'శివ' అంటే విశ్వంలోని శూన్యం. ఈ శూన్యం నుండే సృష్టి వచ్చింది.అంతా శివమయం. శివరాత్రి రోజు శివుడు చలనరహిత, నిశ్చల, నిర్మల స్థాణువైనరోజు, కనుక సన్యాసులు మాహాశివరాత్రిని అచేతన దినంగా భావిస్తారు.

మహాశివరాత్రి రోజు, సంవత్సరంలోని మిగిలిన రోజులన్నింటినీ గుర్తించేరోజు. ప్రతినెల కృష్ణపక్షంలో 14వ రోజు శివరాత్రి దినమని మనకు తెలుసు. ఆధ్యాత్మికులు ఈ రోజు ప్రత్యేక సాధనలు చేస్తారు. ఎందువల్లనంటే, నెలలో వచ్చిన ఈ రోజున అనేక శక్తులు శరీరంపై ప్రభావాన్ని చూపుతాయి. మహాశివరాత్రి రోజున నడుమును నిటారుగా వుంచి స్థిరాసనంలో కూర్చున్నవారు స్వామి అనుగ్రహాన్ని పొందగలుగుతారు.

ఆ రోజున నడుమును అడ్డంగా ఉంచి, శయనస్థితిలో ఉన్నట్లుగా చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. ఆరోజున సహజంగా మనశరీరంలో జీవశక్తి (ప్రాణశక్తి) ఊర్థ్వముఖంగా పయనిస్తుంది. అప్పుడు పంచభూతాలు మనకు సహకరిస్తాయి. అలా ప్రాణశక్తి ప్రవహించడం వల్ల మానవునికి సర్వవికాసాలు, శక్తులు సిద్ధిస్తాయి. మానవుడు అప్పుడు అమితానంద స్థితిని చేరుకుంటాడు. ఆధ్యాత్మిక సాధనలో చేసే ప్రతిసాధన, ఇలా ప్రాణాధారశక్తి శరీరంలో ఊర్థ్వముఖముగా ప్రవహించడానికే.

ఈ దైవత్వాన్ని మనం అనుభవించాలంటే మనలోని శక్తులను అతి బృహత్తర రూపంలోనూ, అతి సూక్ష్మరూపంలోనూ దర్శించగలడమే. మహాశివరాత్రినాడు భూమి యొక్క ఉత్తరగోళంలో ప్రత్యేకమైన స్వాభావిక మార్పులు ఏర్పడతాయి. వాటిని మన శరీరంలోని ప్రాణాధార శక్తి ఊర్థ్వముఖంగా పయనింపజేయడాన్ని గమనించవచ్చు. ఈ శక్తిని పొందడానికి నిశ్చలంగా నడుమును నిటారుగా ఉంచి స్థిరంగా కూర్చోవడమే. జీవశాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీవరాశులకు అడ్డంగా, మానవులకు నిలువుగా వెన్నెముకను పెట్టి నడవడం. ఆ తర్వాతనే మానవునిలో తెలివి వచ్చింది. కనుక శివరాత్రినాడు నడుమును నిటారుగా ఉంచి మేల్కొని ఉంటే సత్ఫలితాన్ని పొందగలం. ఈ విధంగా ఉండి జీవశక్తిని ఉపయోగించుకుంటే మరియు మంత్రోచ్ఛారణ లేక ధ్యానం చేస్తే దివ్యత్వానికి దగ్గరగా చేరుకోగలం.