Read more!

పదకొండవరోజు పారాయణము ఏకవింశాధ్యాయము

 

పదకొండవరోజు పారాయణము

ఏకవింశాధ్యాయము

 

యుద్ధ వర్ణనము:

అత్రి ఉవాచ: అగస్త్యా - సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై, మారి, ఆ సమరమొక మహాయుద్దముగా పరిణమించినది. అస్త్రశస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడివాడి గుదియలతో ఇనుపకట్ల తాడికర్రలతో, ఖడ్గ, పట్టిన, ముసల, శూల, భల్లాతక, తోమర, కుంభ, కుఠారాద్యాయుధాలతో ఘోరముగా యుద్దము చేశారు. ఆ సంకుల సమరములో కాంభోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి, పురంజయుని గొడుగునూ, జెండానూ, రధాన్నీ కూలగొట్టాడు. అనంతరం ఇంకొక అయిదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరి కొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు. అందుకు కోపించిన పురంజయుడు - బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను, కాంభోజ రాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజుని కవచానని చీల్చి, గుండెలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గ్రుచ్చుకొన్న బాణాలను పెరికి తీసి - ఆ కాంభోజ మహారాజు -

 


'ఓ పురంజయా! నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను. నీవు పంపిన బాణాల్ని నీకు త్రిప్పి పంపుతున్నాను తీసుకో' అంటూ వానినే తన వింట సంధించి, పురంజయుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుని సారధిని చంపివేశాయి. ధనుస్సును ముక్కలు చేశాయి. పురంజయుని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి - ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆకర్ణాంతము లాగి కాంభోజునిపై వదిలాడు. ఆ ఇరవై బాణాలూ ఏకకాలములో అతగాడి గుండెలలో నుండి - వీపు గుండా దూసుకు పోవడంతో - కాంభోజరాజు మూర్చిల్లాడు. దానితో యుద్ధము మరింత భయంకరమైనది. తెగిన తొండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుఱ్ఱాలూ, విరగిపడిన రథాలూ, స్వేచ్చగా దొర్లుతున్న రథచక్రాలు, తలలూ-మొండేలూ వేరుగాబడి ఎడం ఎడంగా పడి గిలగిలా తన్నుకుంటున్న కాల్బంటుల కళేబరాల్తో కదనరంగమంతా కంటగింపుగా తయారైంది. మృత వీరుల రక్తమక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామములో అధర్మియైన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించి పోయింది. కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక - ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి, పట్టణంలోనికి పారిపోయాడు.

 

 


అంతఃపురము చేరి - ఆనాటి శత్రువుల విజయానికి పడి పడి దుఃఖిస్తూన్న పురంజయుని చూసి "సుశీలుడు' అనే పురోహితుడు - 'మహారాజా! శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక గనుక బలవత్తరంగా వుంటే - ఈ క్షణమే భక్తిప్రపత్తులతో విష్ణువును సేవించడమొక్కటే మార్గము రాజా! ఇది కార్తీకపూర్ణిమ, కృత్తికా నక్షత్రయుతుడై - చంద్రుడు షోడశ కళాశోభాయమానముగా వుండే యీ వేళ - ఈ ఋతువులో లభించే పూలను సేకరించి, హరి ముందు మోకరించి పూజించు - విష్ణుసన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర, గోవిందా - నారాయణా - ఇత్యాది నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తి పాడు - ఆ పాటలతో పరవశుడవై హరి ముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహము వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసములో తనను ఆరాధించే భక్తుల రక్షణార్ధం - వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్యమహిమను చెప్పడం యేవరివల్లా అయ్యేపని కాదు. భూపతీ! ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడం గాని, నీకు శరీరబలం లేకపోవడం గాని కానేకాదు సుమా! మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మఫలం - తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయా! శోకాన్ని వదలి భక్తితో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్యైశ్వర్య సుఖసంపత్ సౌభాగ్య సంతానాలు సంఘటిల్లి తీరుతాయి. నా మాటలను విశ్వసించు.   

    ఏకవింశోధ్యాయ స్సమాప్తః (ఇరువది ఒకటవ అధ్యాయము)
 

 

ధ్వావింశాధ్యాయము


రెండవనాటి యుద్ధము - పురజయుని విజయము:

 


అత్రిమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు: అగస్త్యా! ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో - పురంజయుడు తక్షణమే విష్ణ్వాలయానికి వెళ్ళి, వివిధ ఫలపుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడశోపచారాలతోనూ పూజించి - ప్రదక్షిణ నమస్కారాలర్పించి - మేళతాళాలతో ఆయనను కీర్తించి, పారవశ్యంతో నర్తించాడు. అంతే కాదు. బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణుసేవలో విలీనుడైన పురంజయుడు - మరుసటి రోజు ఉదయమే శేషసైన్య సమేతుడై పునః యుద్ధరంగాన్ని చేరాడు. నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ - భీషణమైన ధనుష్ఠంకారాన్ని చేశాడు. ఈ ఠంకారం చెవినబడిన - కాంభోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ, పిడుగుల వంటి బాణాలతోనూ, అమిత వేగవంతాలూ ఆకాశానికి సైతం ఎగరగలిగినవీ అయిన గుర్రాలతోనూ, ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్షా తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బాలతోనూ - క్రమక్రమంగా యుద్ధం దారనిరీక్ష్యమానంగా పరిణమించసాగింది. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడగమనుడు - అతనికి దైవబలాన్ని తోడుచేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి.

 

 


కాంభోజుల గుఱ్ఱాలు, కుఱజాదుల ఏనుగులు, వివిధరాజుల రథబలాలూ, వైరి కూటం యొక్క పదాతి బలాలు - దైవకృపాప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలవిసిపోయిన పగవారందరూ - ప్రాణభీతితో రణరంగాన్ని వదలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో - విష్ణ్వనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు - అయోధ్యా ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రువడవుతాడు. విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమైన కార్తీక వ్రాత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో - వారి సమస్త దుఃఖాలూ కూడా చిటికెలమీదనే చిమిడిపోతాయి. అగస్త్యా! విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం. అందునా కార్తీకవ్రతాచరణసక్తీ - శక్తీ కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరితే కార్తీక వ్రతమూ, శ్రీహరిసేవా వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే - వైష్ణవోత్వములుగా పరిగణింపబడతారు. వేదవిధులైన బ్రహ్మణులైనప్పటికీ కూడా - ఈ హరిసేవా, కార్తీక వ్రతాచరణలు లేనివాళ్లు కర్మచండాలులేనని గుర్తింపు.

 

 

ఇక వేదవేత్తయై, హరిభక్తుడై, కార్తీక వ్రాతనిష్ఠుడైన, వాణి యందు సాక్షాత్తూ ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది. ఏ జాతివాళ్లయినా సరే ఈ సంసార సాగరాన్నుంచి బైటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే - తక్షణమే వాళ్లు తరించుకుపోయినట్లుగా భావించు. అగస్త్యా! స్వతంత్రుడు గానీ, పరతంత్రుడు గానీ - హరి పూజాసక్తుడై వుంటేనే ముక్తి. భక్తులకా శ్రీహరీ, విష్ణువుకీ భక్తులూ అన్యోన్యానురాగబద్ధులై వుంటారు. భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి, రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండివున్న ఆ విష్ణువునందు భక్తి ప్రవత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది. కాబట్టి, వేదసమ్మతమూ, సకలశాస్త్రసారము, గోప్యమూ, సర్వవ్రతోత్తమోత్తమమూ అయినా ఈ కార్తీకవ్రతాన్ని ఆచరించినా, కనీసం కార్తీక మహాత్మ్యాన్ని మనస్పూర్తిగా విన్నా కూడా - వాళ్లు విగత పాపులై - అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు. మహత్త్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన - పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా!

త్రయోవింశాధ్యాయము

 పురంజయుని మోక్షము

 

 

'హే అత్రి మునీంద్రా! విష్ణుకృప వలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత ఏమి చేశాడో వివరించు' అని అగస్త్యుడు కోరడంతో - అత్రి ఇలా చెప్పసాగాడు. భగవత్కృప వలన భండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు,, అగస్యుడు కోరడంతో __ అత్రి ఇలా చెప్పసాగాడు.

భగవత్క్శ్రుప వలన భండవ భూమిలో విజయలక్ష్మి ని వరించిన పురంజయుడు, అమరావతిలో ఇంద్రునివలె, తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్యశౌచపాలనం, నిత్యధర్మాచరణం, దానశీలత, యజ్ఞ యాగాది నిర్వహణలూ - ఇత్యాదులు చేస్తూ - ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై, విశుద్ధుడై, అరిషడ్వర్గాన్నీ - జయించి - పరమ వైష్ణవుడై మనసాగేడు. అంతేగాదు - నిరంతరమూ కూడా - శ్రీహరి పూజాప్రియుడై - ఏ దేశాలలో, ఏఏ క్షేత్రాలలో తీర్ధాలలో విష్ణువును ఏఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా - అనే తపనతో వుండేవాడు, అంతగా హరిసేవా సంవిధాన సంత్రుప్తుడైన కారణంగా -

 

 

 

 

ఒకనాడు ఆకాశవాణి - 'పురంజయా! కావేరీతీరంలో శ్రీరంగ క్షేత్రం వుంది. శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి వున్న విష్ణువును కార్తీకమాసంలో అర్చించి - జనన మరణాల నుంచి కడతేరుమని ప్రబోధించడంతో - రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి - తగినంతచతురంగా బలయుక్తుడై - అనేక తీర్ధక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్యవిధిగా శ్రీహరినే అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి, కార్తీక మాసమంతా కావేరీనదిలో స్నానాదులనీ, శ్రీరంగంలో రంగనాథ సేవలనూ చేస్తూ ప్రతిక్షణమూ కూడా ;కృష్ణా! గోవిందా! వాసుదేవా! శ్రీరంగనాథా!' అని హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీకమాస వ్రతం పూర్తి చేసుకుని పునః అయోధ్యను చేరుకున్నాడు. అనంతరం ధర్మకామం వలన సత్పుత్రపౌత్రాదుల్ని పొంది, కొన్నాళ్ళకు సర్వభోగ వివర్జితుడై, భార్యాసమేతంగా వానప్రస్థమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ - విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు.


ఏవం శ్రీస్కాంద పురాణాంతారగా కార్తీక మహాత్మ్యే

ఏకవింశాద్వావింశాధ్యాయౌ (ఇరువది ఒకటి, ఇరువది రెండు - ఇరువది మూడు అధ్యాయములు)
 

11 వ రోజు


నిషిద్ధములు :- పులుపు, ఉసిరి

దానములు :- వీభూదిపండ్లు, దక్షిణ

పూజించాల్సిన దైవము :- శివుడు

జపించాల్సిన మంత్రము :- ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ

ఫలితము :- ధనప్రాప్తి, పదవీలబ్ధి 


పదకొండవ (ఏకాదశ దిన) నాటి పారాయణము సమాప్తము