Read more!

అశోకవనాన్ని నాశనం చేసిన హనుమంతుడు (Hanuman and Ashokavanam)

 

అశోకవనాన్ని నాశనం చేసిన హనుమంతుడు

(Hanuman and Ashokavanam)

 

రావణాసురుడు సీతమ్మను ఎత్తుకు వెళ్ళిన సందర్భంలో హనుమంతుడు ఆమెను అన్వేషిస్తూ లంకకు బయల్దేరాడు. అక్కడ అశోకవనంలో శోకమూర్తిలా విలపిస్తూ కూర్చున్న సీతామాతను దర్శించి సంభాషించాడు. రాముడి కుశలసమాచారం తెలియజేసి, రామరావణ యుద్ధం జరుగుతుందని, త్వరలో విముక్తి కలుగుతుందని, ధైర్యంగా ఉండమని చెప్పాడు.

 

అలా సీతమ్మకు ధైర్య వచనాలు చెప్పిన పిమ్మట హనుమంతుడు ఆలోచించ నారంభించాడు. “రామరావణ సంగ్రామం తప్పదు. ముందుగా ఇక్కడి వాతావరణం గురించి సమగ్రంగా అర్ధం చేసుకోకపోయినట్లయితే, ప్రతీకార మార్గములు బోధపడవు. సరే, భగవత్కార్యము పూర్తయింది. ఇక వీరి బలాబలాలేంటో తెలుసుకోవాలి. అప్పుడే శత్రుసేనలతో యుద్ధం చేయడం సులభం అవుతుంది. అరే, చెట్లనిండా ఫలాలు ఉన్నాయే.. తింటే మహత్తరంగా ఉంటుంది కదా అనుకుని హనుమంతుడు చెట్ల కొమ్మలు విరుగ్గొట్టాడు. ఈ దుష్టులను ఉత్తేజపరచడానికి ఇంతకుమించిన మార్గం లేదు” అని నిశ్చయించుకున్నాడు. అందుకు జానకీమాత కూడ అంగీకరించింది. హనుమంతుడు అల్లరి మొదలుపెట్టాడు. తత్ఫలితముగా ఉద్యాన వనములో అనేక వృక్షములు నాశనమై పోయాయి. కాపలాదారులు పారిపోయారు. అనేకమంది రాక్షసులు హతమై పోయారు.

 

హనుమంతుని ఒకే ఒక ముష్టి ఘాతముతో అక్షయ కుమారుడు శాశ్వత నిద్రలో పడ్డాడు. లంకానగరమంతయు కోలాహలముతో నిండిపోయింది. రావణుడు అంత మహా పరాక్రమశాలి, తన జ్యేష్ట తనయుడు అయిన ఇంద్రజిత్తును పంపాడు. హనుమంతునిపై దెబ్బలకు అతడు తట్టుకొనజాలక బ్రహ్మ పాశమును ప్రయోగించాడు. బ్రహ్మవరానుసారము హనుమంతుడు బ్రహ్మపాశముక్తుడైననూ, దానిని అవమానించరాదని, కార్యసాధన కొరకునూ ఆ బ్రహ్మపాశ బంధితుని వలె నటించుచూ రావణుని సభ చేరి శ్రీరామ మహిమను గానము చేయదలచెను. అందువల్ల అతడు స్వయంగా బ్రహ్మపాశమునకు బద్దుడైపోయాడు.

  

లంకకు ముప్పు తెచ్చేందుకు తోక కు నిప్పు

 

రావణాసురునితో హనుమంతుడు మొదట ఎంతో ఓర్పుగా, హితకరంగా మాట్లాడాడు. కానీ, ఆ మాటలు రావణునికి ఎంతమాత్రమూ రుచింపలేదు. అతడు కోపోద్రిక్తుడై “వీనిని సంహరించండి” అని రాక్షసులకు ఆదేశమిచ్చాడు. “దూతను చంపడం అన్యాయ”మని విభీషణుడు అడ్డుకున్నాడు. చివరికి ఏదో విధముగా హనుమంతునికి శ్రుంగభంగము చేయ నిశ్చయించుకుని “తోకను కాల్చండి” అని ఆదేశించాడు. సేవకులు హనుమంతుని తోకకు వస్త్రం చుట్టి దానిని నూనెలో ముంచి నిప్పుముట్టించి హనుమంతుని పట్టుకొని లంకానగర వీధులలో త్రిప్పసాగారు. కుర్రవాళ్ళు చప్పట్లు కొడుతూ, ఆడుతూ, కేకలు వేస్తూ, నవ్వుకుంటూ అతనిని వెంబడించారు. లంకా దహనానికి ఇదే సరైన సమయమని తలచిన హనుమంతుడు తన తోకను ఒక్క విసురు విసిరిరాడు. దానితో రాక్షస వీరు లందరూ పారిపోయారు. వాయునందనుడు ఒక భవనము మీద నుండి వేరొక భవనము మీదకు దూకుతూ లంకలోని భవనములన్నింటినీ భస్మం చేయసాగాడు. ఆ కార్యములో అతనికి వాయువు విశేషముగా సహకరించాడు. అంతే, క్షణాల్లో లంక దహించుకుపోయింది. అనేక యంత్రాలు నాశనమైపోయాయి. కాని, సువర్ణలంక మాత్రము భస్మం కాలేదు. లంకవాసులు సకుటుంబ సమేతంగా పారిపోయారు.