మధుసూదనాచారిని సీఎం పక్కన పెట్టేశారా? హుజురాబాద్ సభే కారణమా? 

తెలంగాణ తొలి సభాపతిగా శాసనసభ రికార్డులకెక్కిన సిరికొండ మధుసూదనాచారి తన పనితీరుతో అప్పట్లో ప్రజల్లో మంచి మార్కులే కొట్టేశారు. స్పీకర్ గా ఉన్నా కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడానికి, స్థానిక సమస్యల మీద ఎంతోకొంత శ్రద్ధ చూపించేవారని చెప్పుకుంటారు. అయితే స్పీకర్ కు ఉండే పరిమితుల కారణంగా రెగ్యులర్ పొలిటికల్ లీడర్ల మాదిరిగా గతంలోలాగా కలివిడిగా తిరిగే సౌలభ్యాన్ని ఆచారి కోల్పోయారు.  దీంతో ఆయన అనేక అంశాల మీద కొడుకుల మీదనే ఆధారపడాల్సి వచ్చింది. వారికే నియోజకవర్గ యోగ క్షేమాలు, ప్రజల బాగోగులు చూసుకునే బాధ్యతలు అప్పగించారు. అయితే తండ్రి నుంచి బాధ్యతలు తీసుకున్న ఆచారి కొడుకులు మాత్రం బాధ్యతలకు బదులు "బరువు" పెంచుకునే కార్యక్రమాలకు పాల్పడ్డారని, అందువల్ల 2018 ఎన్నికల్లో తండ్రి ఓటమికి వారే పరోక్షంగా కారణమయ్యారని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈ క్రమంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఓ వెలుగు వెలిగిన సిరికొండ... కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా తన సెకండ్ ఇన్నింగ్స్ ను విజయవంతంగా ఆడతారా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఆయన్ని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆరే పక్కన పెట్టేశారన్న వ్యాఖ్యానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీని గురించే ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో విపరీతమైన చర్చ నడుస్తోంది. 

కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు, ఉద్యమ సహచరుడు అయిన సిరికొండను కేసీఆర్ అకస్మాత్తుగా ఎందుకు పక్కన పెట్టేశారన్న చర్చ సంచలనం సృష్టిస్తోంది. గత రెండేళ్లుగా ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచుకుంటున్న కేసీఆర్... తనకు ఎంతో పనికొచ్చే సిరికొండను ఈ టైమ్ లో ఎందుకని పక్కన పెట్టారో లోతుగా ఆరా తీస్తున్నారు. సిరికొండను  పక్కనపెట్టడానికి  పునాదులు ఎక్కడ పడ్డాయనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

బీసీ వర్గానికి చెందిన విశ్వబ్రాహ్మణులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభ జరపాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 1న దానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఆ సభకు మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, బీసీ మినిస్టర్ గంగుల కమలాకర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీ కవితను కూడా ఆహ్వానించారు. ఆ తేదీని కూడా ప్రభుత్వ పెద్దల అనుమతితోనే ఖరారు చేసుకున్నారు. అటు హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం కూడా విశ్వబ్రాహ్మల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించింది. అయితే 2వ తేదీనే ఢిల్లీ టూర్ ఉన్న కారణంగా ఆ తేదీని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి ప్రభుత్వ పెద్దల సూచనతోనే మళ్లీ 5వ తేదీని ఖరారు చేశారు. అటు సభా ఏర్పాట్లు కూడా అదే ప్రకారం మొదలుపెట్టుకున్నారు. మరోవైపు విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం నుంచి హైప్రొఫైల్ కలిగిన వ్యక్తి అయిన మధుసూదనాచారిని సభకు ఆహ్వానించాలని వెళ్లిన విశ్వబ్రాహ్మణ పెద్దలకు చేదు అనుభవం ఎదురైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆ బహిరంగ సభ జరగడానికి వీల్లేదని, ఆ సభ జరిగితే తనకు రావాల్సిన క్రెడిట్ రాకుండా పోతుందని, కాబట్టి సభను తరువాత జరుపుకోవాలంటూ సిరికొండ విపరీతమైన అసహనానికి గురై మాట్లాడినట్లు సంఘ నాయకులు చెబుతున్నారు. గత మార్చిలో విశ్వబ్రాహ్మణ సంఘానికి రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. అలా ప్రజల చేత ఎన్నికైన సంఘంగా, ప్రజల చేత ఎన్నికైన అధ్యక్షునిగా ఎర్రోజు భిక్షపతికి ప్రభుత్వం దగ్గర గుర్తింపు లభించింది. కేటీఆర్, హరీశ్ రావు సూచనతోనే ఖరారైన 5వ తేదీ బహిరంగ సభకు హాజరయ్యేది లేదని సిరికొండ తేల్చేయడంతో పాటు అసలు సభ జరగకుండా వీలైనన్ని కుయుక్తులు పన్నినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అన్ని ఇతర బీసీ కులాల్లాగే విశ్వబ్రాహ్మణులకు కూడా ప్రత్యేకమైన ఆత్మగౌరవ భవనంతో పాటు దాని నిర్మాణానికి రూ. 5 కోట్ల నిధులు విడుదల చేయడానికి సర్కారు నాలుగేళ్ల క్రితమే అంగీకరించింది. ఉప్పల్ భగాయత్ లో ఐదెకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ హామీని పూర్తి చేయాలన్న డిమాండ్ ను చాలా కాలంగా విశ్వబ్రాహ్మణులు వినిపిస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికల దరిమిలా టీఆర్ఎస్ పెద్దలు అన్ని సామాజికవర్గాల మద్దతూ కూడగడుతున్న సందర్భంలో సొంత కులస్తుల దగ్గరే ఆచారి పలుచనైపోయారని, కేవలం కొందరు వ్యక్తుల మెప్పు కోసం, దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత సంఘం నాయకత్వాన్ని ఏదో స్థాయిలో కొనసాగించడం కోసం వారితో కుమ్మక్కయి అసలు సొంత వర్గ ప్రజలకే దూరమవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే 5వ తేదీన జరిగిన బహిరంగ సభకు ప్రభుత్వం తరఫున బీసీ మంత్రి గంగుల కమలాకర్ ను పంపించి విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి తాము శాయశక్తులా కృషి చేస్తామన్న మెస్సేజ్ ఇప్పించడం గమనార్హం. సభకు హాజరైన గంగుల... తాను మంత్రి హరీశ్ రావు చెబితే సభకు వచ్చానని, ఆయన చెప్పినట్లుగా విశ్వబ్రాహ్మణులకు ఐదెకరాల భూమితో పాటు భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తున్నట్టు పేర్కొందంటూ చెప్పి... ఆ ఉత్తర్వుల తాజా కాపీని భిక్షపతికి అప్పగించారు. కమలాకర్ మాటలతో సభికులంతా ఈలలు, కేరింతలతో భారీ స్థాయిలో రెస్పాండయ్యారు. 

తనకు దక్కని క్రెడిట్ మరొకరికి దక్కడం జీర్ణించుకోలేని కొందరు పెద్దలు... ఈ సభను వాయిదా వేయడానికి శతవిధాలా ప్రయత్నించారని, అలాంటి నాయకుల లోగుట్లేంటో ప్రజలంతా గ్రహించాలని, ప్రభుత్వం వెన్నుదన్నుతో ముందుముందు కూడా విశ్వబ్రాహ్మణుల మేలు కోసం పని చేస్తానని ఎర్రోజు భిక్షపతి ఇండైరెక్టుగా సిరికొండ మీద అస్త్రాలు సంధించారు. దీంతో విశ్వబ్రాహ్మణ ప్రజానీకంతో ఎక్కడా సంబంధం లేని పాత సంఘం నాయకుల కోసం... ఆ వర్గం యావత్ ప్రజానీకానికి దూరమైన వ్యక్తిగా సిరికొండను ప్రభుత్వం గుర్తించినట్లయింది. హుజూరాబాద్ లో ఈటల మీద గెలుపు కోసం సర్వ శక్తులూ ఒడ్డుతున్న సర్కారుకు చేయూతనిచ్చి ఆదుకోవాల్సిన సమయంలో సొంత కులం ప్రజల ఓట్లను టీఆర్ఎస్ కు మళ్లించాల్సిన బాధ్యతను పక్కనపెట్టి.. అసలు సొంత జాతి నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తికి తాము మద్దతిస్తున్న సంకేతాలు వెళితే మొదటికే మోసం వస్తుందన్న అంశాన్ని ప్రభుత్వ పెద్దలు పసిగట్టినట్లు పక్కా సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా సేకరించిన కేటీఆర్ తదితరులు సిరికొండతో సంబంధం లేకుండా బహిరంగ సభకు ప్రభుత్వం తరఫున గంగుల కమలాకర్ ను పంపించడమే సిరికొండ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మరి తన రాజకీయ భవితవ్యాన్ని తానే ప్రశ్నార్థకం చేసుకున్న మధుసూదనాచారి స్వయంకృతాపరాధాన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి.

ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ల కొట్టివేత

ఐబొమ్మ రవి బెయిలు పిటిషన్లన నాంపల్లి కోర్టు కొట్టివేసింది. సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిపై ఐదు కేసులు నమోదైన సంగతి తెలిసిదే.  ఈ క్రమంలోనే ఈ కేసులలో ఐబొమ్మ రవిని పోలీసులు దఫాల వారీగా కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.  పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబం ధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. కేసుల విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో అతడికి బెయిలు లభిస్తే, దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.  అంతేకాకుండా ఐ బొమ్మ రవి విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని, ఇటువంటి సమయంలో రవికి బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశాలు  ఉన్నాయని, అదే జరిగితే  కేసు విచారణ   దెబ్బతింటుందని పోలీసులు పేర్కొన్నారు. రవి భారతదేశం లోనే అందుబాటులో ఉండేలా కస్టడీలో ఉంచడం అత్యవసరమని పోలీసుల తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం నాంపల్లి కోర్టు పోలీసుల వాదనలను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు రవి పై నమోదైన ఐదు కేసులకు సంబంధించి దాఖలైన అన్ని బెయిల్ పిటీషన్లను  కొట్టి వేసింది.  

భోగాపురం క్రెడిట్ వార్.. లైన్ లోకి విజయసాయి?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య జరుగుతున్న క్రెడిట్ వార్ లోకి వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి ఎంటరయ్యారు. అయితే ఆయన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ క్రెడిట్ లో తనకూ కొంత భాగం ఉందని మాత్రమే చెప్పారు. అలా చెప్పడంలో ఆయన వైసీపీనీ, ఆ పార్టీ అధినేత జగన్ ను పూర్తిగా విస్మరించారు. భోగాపురం విమానాశ్రయంలో ఫస్ట్ టెస్ట్ ఫ్లయిట్ ను స్వాగతిస్తూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు.  ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు. విజయసాయి ఈ వైఖరి పట్ల వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  పలువురు వైసీపీ మద్దతుదారులు విజయసాయిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీకి క్రెడిట్ దక్కకుండా అడ్డుపడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు.  సరే అది పక్కన పెడితే.. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ పరిస్థితి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ చందంగా అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ ఎంపీగా నాడు సభలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం గళమెత్తిన విజయసాయి.. ఇప్పుడు పార్టీ ప్రస్తావన కూడా లేకుండా తాను వ్యక్తిగత స్థాయిలోనే భోగాపురం కోసం మాట్లాడానన్నట్లుగా సోషల్ మీడియాలో పేర్కొనడం.. వైసీపీ విమర్శకులకు కొత్త శక్తిని ఇచ్చినట్లైంది. ఈ నేపథ్యంలోనే  నాడు విపక్ష నేతగా భోగాపురం వద్దంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. విమానాశ్రయాన్ని అడ్డుకోవడానికి చేయగలిగినంతా చేసి ఇప్పుడు తగుదునమ్మా అని క్రెడిట్ కోసం పాకులాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.  

ఉగాదికి కవిత కొత్త పార్టీ

  తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది. ఉగాదికి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పేరుతో పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాల ఇన్‌ఛార్జ్‌లు, కార్యదర్శులతో కవిత సమావేశమయ్యారు. జనం బాట కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ తెలుసుకున్నారు. పార్టీ పెడితే ప్రజల్లోకి బలంగా వెళ్లగలమా? లేదా? అన్న సలహాలు, సూచనలు కార్యకర్తలు, నాయకుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నూతన పార్టీతోనే పోటీ చేయనున్నట్లు కవిత వెల్లడించిన సంగతి తెలిసిందే.  శాసనమండలిలో భావోద్వేగంతో మాట్లాడిన కవిత పలు సంచలన విషయాలు వెల్లడించారు. అయితే  కవిత తన జిల్లాల పర్యటనలను వాయిదా వేసుకున్నారు. వాస్తవంగా  ఇవాళ నుంచి సిరిసిల్ల జిల్లాలో పర్యటించాల్సి ఉంది. తన అన్న కేటీఆర్ ​ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కవిత పర్యటన నేపథ్యంలో ఆసక్తి నెలకొంది.  జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే పార్టీ నాయకులందరు డిమాండ్​ చేస్తున్నారు.   

కవిత కాంగ్రెస్‌లో చేరొచ్చు...కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

  ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని మల్‌రెడ్డి హింట్ ఇచ్చారు. గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి నేతలు కాంగ్రెస్‌లోకి వస్తారని అనుకున్నా.. అనుకున్నట్టుగానే వచ్చారని ఆయన తెలిపారు.  మంత్రి పదవిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టం అన్నారు. నిరాకరిస్తే నాకేం నష్టం లేదు. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఆలోచించాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానమేనని రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చు. కానీ జిల్లా స్వరూపం పేరు మారొద్దున్నారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో ల్యాండ్ విలువ పెరిగి  భూములు ఎవరూ అమ్మడం లేదని ఆయన అన్నారు.  

తమిళనాట రచ్చ రేపుతున్న లాప్ ట్యాప్ రాజకీయం!

తమిళనాడులో రాజకీయ వెడి రోహిణీకార్తెను తలపిస్తున్నది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలలో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన విజయ్.. అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.  ఈ నేపథ్యంలో తమిళనాడ రాజకీయ వాతావరణం వేడెక్కింది.ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే భావిస్తుంటే.. ఇరు పార్టీల పాలననూ చూసిన తమిళులు.. తనకు ఒక చాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని విజయ్ అంటున్నారు.  కాగా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి స్టాలిన్ సర్కార్ ఫీబీస్ కు తెరలేపింది. విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీ చేపట్టింది. దీంతో కంగుతిన్న అన్నాడీఎంకే ఎన్నికల తాయిలాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు స్టాలిన్ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ విమర్శలకు తెరలేపింది. అయితే డీఎంకే మాత్రం ఇదేం కొత్త పథకం కాదనీ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత విద్యార్థులకు లాప్ టాప్ ల పంపిణీ పథకాన్ని 2011లోనే ప్రారంభించారని చెబుతోంది.   2021లో అధికారంలోకి వచ్చిన డీఎంకే, గత పథకాలను కొనసాగిస్తామని ప్రకటించి, ఇప్పుడు ఏడాదికి 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. చెన్నైలో సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా తొలి విడతగా 10 లక్షల మందికి ట్యాప్ టాప్ ల పంపిణీ చేపట్టింది. దీంతో ఎన్నికల వేళ తమిళనాట ట్యాప్ లాప్ రాజకీయం రచ్చ రేపుతోందని పరిశీలకులు అంటున్నారు.  

కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ కన్నుమూత

కాంగ్రెస్  సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ  మంగళవారం (జనవరి 6) తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 81 ఏళ్లు. ఆయనకు భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు ఉన్నారు. ఎరండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కల్మాడీ మృతి రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పైలట్ అయిన సురేష్ కల్మాడీ  ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పుణె నుంచి పలుమార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.  పుణె రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన నేతగా, 'కింగ్‌మేకర్‌'గా ఆయన గుర్తింపు పొందారు.  భారత ఒలింపిక్ సంఘం   అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి.   

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన నవీన్ రావు విచారణ.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు!

ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా సీట్ గుర్తించిన బీఆర్ఎస్ నాయకుడు నవీన్ రావును సిట్  సోమవారం (జనవరి 5)  విచారించింది. ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలపై సిట్ ఒక నిర్ణారణకు వచ్చిందని తెలుస్తోంది.  ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఎక్విపిమెంట్ సేకరణ, కార్యాలయం ఏర్పాటు, మధ్యవర్తుల పాత్ర వంటి అంశాలు ఈ కేసులో కీలకంగా మారాయని అధికారులు చెబుతున్నారు. రాజకీయ నేతల పేర్లు కూడా విచారణలో వినిపించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనంగా మారింది.   నవీన్ రావును సిట్ అధికారులు సోమవారం (జనవరి 5) దాదాపు ఎనిమిది గంటలపాటు విచారించారు. ఈ విచారణలోఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆర్థిక, సాంకేతిక, నిర్వహణ తదితర అంశాలపై స్పష్టమైన ఆధారాలు వెల్లడైనట్లు సమాచారం.  ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది.  పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ నిర్వహణ కోసం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రత్యేక కార్యాలయాన్ని నవీన్ రావు తీసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కార్యాలయం నుంచే ఫోన్ ట్యాపింగ్ కార్యకలా పాలు కొనసాగినట్లు అనుమానిస్తున్నారు. కార్యాలయ అద్దె, నిర్వహణ ఖర్చులు, పరికరాల అమరిక వంటి వివరాలపై కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో రాజకీయ కోణం మరింత బలపడిందని చెబుతున్నారు. బీఆర్‌ఎస్ నేతల తరఫున ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులతో నవీన్ రావు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సిట్ విచారణలో తేలినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఎవరి కోసం, ఏ ఉద్దేశంతో వినియోగిం చారన్న అంశంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో  నవీన్ రావు విచారణ ముగిసినా, ఈ కేసు ఇక్కడితో ఆగే అవకాశాలు లేవని సిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటా ఎవరెవరికి చేరింది, దాన్ని ఎలా వినియోగించారు, ఈ వ్యవహారంలో ఇంకెంతమంది పాత్రధారులు ఉన్నారనే అంశాలపై మరింత లోతుగా విచారణ కొనసాగనుంది. ఇదిలా ఉండగా ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో హరీష్ కు భారీ ఊరట

ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీం కోర్టులో   ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే గతంలోనే తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఆ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్   సుప్రీంలో సోమవారం విచారణకు వచ్చింది.  తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమంటూ  జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.  

జనసేన తెలంగాణ కమిటీలు రద్దు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తీసుకునే చర్యలలో భాగంగా ముందుగా రాష్ట్రంలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు జనసేనాని ఆదేశాల మేరకు తెలంగాణలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సోమవారం (జనవరి 5) అధికారికంగా ప్రకటించారు. రద్దు చేసిన కమిటీల స్థానంలో  నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.  ఈ విధంగా రాష్ట్రంలో పార్టీని పునర్వ్యవస్థీకరించి కేడర్ మరింత చురుకుగా పని చేసేలా స్థానిక నాయకత్వానికి గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.   

హరీష్‌రావు ఓ గుంట నక్క....కవిత హాట్ కామెంట్స్

  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. వ్యక్తిగతంగా హరీష్ రావును ఒక్క మాట అంటే సభని బైకాట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ అంశంపై వాకౌట్ చేస్తే.. తరువాత సభకు రావొచ్చు కదా? అని అన్నారు. ఆదివారం నాడు సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన కవిత.. అసెంబ్లీ జరిగిన తీరుపైనా.. హరీష్ రావుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్‌రావు గుంటనక్కగా పేర్కొంటూ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బిల్లులపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఉండొద్దా? అని ప్రశ్నించారామె. సభ నుంచి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీష్ రావుదేనా? అని ప్రశ్నించారు కవిత.  బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక గుంపును తయారు చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ బయట సభలు పెట్టడం కంటే.. చట్ట సభల్లో మాట్లాడటం మంచిదని.. ఈ అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదని కవిత అభిప్రాయపడ్డారు. గుంటనక్క హరీష్ రావు వ్యవహారం.. తోక కుక్కను ఊపినట్లుగా ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కవిత. కృష్ణా పంపకాలల్లో హక్కులు తగ్గించి హరీష్ సంతకం ఎందుకు పెట్టాడో చెప్పి.. పీపీటీ చేయాలని కవిత డిమాండ్ చేశారు.  హరీష్ రావు ధన దాహం కోసమే జూరాలా నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. హరీష్ రావు నిర్ణయాలతోనే సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. హరీష్‌రావును ముఖ్యమంత్రిని  వ్యక్తిగతంగా విమర్శిస్తే అసెంబ్లీని  బాయ్‌కాట్ చేస్తారా? మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టినప్పుడు ఎందుకు బహిష్కరించలేదు? ప్రతిపక్షం అంటే పార్టీ కాదు.. పబ్లిక్ వాయిస్ అని అన్నారు.