కోర్టు కేసుల్లో హీరోయిన్

  కన్నడ హీరోయిన్ పూజాగాంధీకి కోర్టుల చుట్టూ తిరగడానికే టైమ్ సరిపోతున్నట్టుంది. మన తెలుగులో రూపొందిన ‘పూజ’ సినిమాలో ‘‘ఎన్నె్న్నో జన్మల బంధం నీదీనాదీ’’ అనే పాటలో నటించిన ‘కల్పన’ అనే కన్నడ నటి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. 1970 ప్రాంతంలో జరిగిన ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ కల్పన జీవిత కథ ఆధారంగా కన్నడ భాషలో ‘అభినేత్రి’ అనే సినిమా రూపొందింది. ఆ సినిమాలో పూజాగాంధీ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా మీద కల్పన కుటుంబ సభ్యులు కేసు వేశారు. దాంతో దర్శక నిర్మాతలతోపాటు హీరోయిన్ పూజాగాంధీ కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఎట్టకేలకు కోర్టు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో ‘అభినేత్రి’ విడుదల కానుంది. ఇదిలా వుంటే, గత ఎన్నికలలో రాయచూర్ అసెంబ్లీ స్థానం నుంచి పూజాగాంధీ పోటీ చేసి ఓడిపోయింది. ఎన్నికల సమయంలో ఆమె ఎన్నికల నిబంధనలు అతిక్రమించారంటూ కేసు నమోదైంది. ఆ కేసు విచారణ కోసం గురువారం ఆమె కోర్టుకు హాజరయ్యారు.

జగన్ ‘బఫూన్’పై అసెంబ్లీలో గొడవ...

  వైఎస్సార్సీపీ నాయకుడు, గౌరవనీయ ప్రతిపక్ష సభ్యుడు అయిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో తెలుగుదేశం నాయకులను ‘బఫూన్లు’ అనడం మీద వివాదం పెరుగుతోంది. శుక్రవారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత జగన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ‘బఫూన్లు’ అనే పదం మీద స్పీకర్ సూచించినట్టుగా జగన్ సారీ చెబుతారని అందరూ భావించారు. అయితే జగన్ సారీ చెప్పకపోగా తన వ్యాఖ్యలని సమర్థించుకున్నారు. జగన్ మీద తెలుగుదేశం నాయకులు ఉవ్వెత్తున విరుచుకుపడినప్పటికీ జగన్ లైట్‌గా తీసుకుని తన ధోరణిని కొనసాగించారు. కాగా శనివారం నాడు అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి జగన్ ‘బఫూన్’ వ్యాఖ్యల మీద వివాదం కొనసాగింది. తెలుగుదేశం సభ్యులు జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అయితే జగన్ గానీ, ఆయన పార్టీ నాయకులు గానీ ఈ విషయంలో క్షమాపణ చెప్పే ధోరణిని కనబరచలేదు. సభలో గందరగోళం జగడంతో 10 గంటల 15 నిమిషాలకు స్పీకర్ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు.

మందుబాబులం.. మేము మందుబాబులం...

  మందు కొట్టడం అనేది గోవా సంస్కృతిలో ఒక భాగమని అందువల్ల గోవాలో మద్యపాన నిషేధం లాంటి ఆలోచనలు ఎవరికీ రాబోదని, అలాంటి ఆలోచన ఎవరికైనా వచ్చిందంటే వాళ్ళు గోవాకి చెందిన వ్యక్తులు అయి వుండరని గోవా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ విల్ఫ్రెడ్ మెస్కిటా అన్నారు. మద్యనిషేధం గోవాకు అసలు రాలేదని, ఎందుకంటే గోవా సంస్కృతిలోనే మద్యపానం ఇమిడి ఉందని ఆయన అన్నారు.కేరళలో దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించనున్నట్లు అక్కడి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్రకటించారు. ఇదే బాటలో గోవా కూడా నడిచే అవకాశం వుందా అని విలేకరులు అడిగినప్పుడు మెస్కిటా ఇంత స్పష్టంగా స్పందించారు. గోవా ప్రజలు అన్ని సందర్భాల్లోనూ మందు కొడుతూనే వుంటారని, అలాంటి సంస్కృతి వున్న గోవాలో మద్యనిషేధం విధించాలని అనడం అన్యాయమని ఆయన చెప్పారు.

అసెంబ్లీలో జగన్ కామెంట్స్... హత్యల సంఖ్యదేముందిలే...

  ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తెలుగుదేశం ఎమ్మెల్యేలను ‘‘బఫూన్లు’’ అని వ్యాఖ్యానించి వివాదాన్ని సృష్టించిన వైసీపీ నాయకుడు జగన్ ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. హత్యల సంఖ్య పైన తాను సభను తప్పుదారి పట్టించలేదని, అయినా హత్యల సంఖ్య ఎంతయితే ఏంటని, సమస్యను మానవతా దృక్పథంతో చూడాలని జగన్ అన్నారు. హత్యల వైసీపీ చెప్పే సంఖ్యకు, సాక్షి పత్రిక ప్రచురించిన సంఖ్యకు తేడా ఉంది కదా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు ‘‘సంఖ్యలదేముందిలే’’ అని తేలిగ్గా తీసుకున్నట్టుగా జగన్ మాట్లాడారు. తాను తెలుగుదేశం సభ్యులను ‘బఫూన్లు’ అనడాన్ని జగన్ సమర్థించుకున్నారు.

గవర్నర్‌కి అధికారాలు తప్పవు... బిల్లులో వున్నవే...

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గవర్నర్ పరిధిలోనే వుంటాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్న విధంగానే గవర్నర్‌కి అధికారాలు కట్టబెట్టామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు గవర్నర్ నేరుగా జోక్యం చేసుకుంటారని, రోజువారీ పాలనలో గవర్నర్ జోక్యం వుండబోదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇదిలావుండగా, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శుక్రవారం నాడు ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఆంధ్రప్రదేశ్, రాజధానిలోని పరిస్థితులను మోడీకి ఆయన వివరించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన అంశాలను మోడీ ఈ సందర్భంగా గవర్నర్‌ దగ్గర ఆరా తీసినట్టు తెలుస్తోంది. నరసింహన్ మోడీతో అరగంటపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి గవర్నర్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు మీద కూడా నివేదిక సమర్పించినట్టు సమాచారం.

షిండే, చిదంబరం, ఆజాద్‌లకు అరెస్టు వారెంట్లు...

  ముగ్గురు మాజీ కేంద్ర మంత్రుల అరెస్ట్‌కు అనంతపురం కోర్టు వారెంట్లు జారీ చేసింది. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించిన కేసులో గత యూపీఏ ప్రభుత్వంలోని జీవోఎం సభ్యులైన సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, పి. చిదంబరంలపై బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది. రాష్ట్ర విభజన సమయంలో యుపిఎ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్)లో ఈ ముగ్గురు మంత్రులే కీలకంగా నిలిచారు. అయితే విభజనకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయడంలో వీరు ఏకపక్షంగా వ్యవహరించారని, కాంగ్రెస్‌ పార్టీ చెప్పినట్టల్లా ఆడారని, ఎవరి నుంచి ఎలాంటి సూచనలు స్వీకరించలేదన్న ఆరోపణలు వీరిమీద వున్నాయి.

జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు.. సభ వాయిదా..

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శుక్రవారం నాడు వాడిగా, వేడిగా జరిగాయి. శాంతి భద్రతల మీద చర్చ జరగాలని ప్రతిపక్ష వైసీపీ పట్టుబట్టడంతో స్పీకర్ అందుకు అనుమతి ఇచ్చారు. అయితే వైసీపీ కార్యకర్తల మరణాలను తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తూ జగన్ తదితర వైసీపీ నాయకులు మాట్లాడ్డం పట్ల తెలుగుదేశం శాసనసభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో రక్తచరిత్ర వున్న నాయకుడు, ఫ్యాక్షనిస్టు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డేనని తెలుగుదేశం సభ్యులు గళమెత్తారు. వైఎస్ హయాంలో రాష్ట్రంలో నరమేధం జరిగిందని, వందలమంది తెలుగుదేశం కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆరోపించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఈ సందర్భంగా జగన్ తెలుగుదేశం ఎమ్మెల్యేలను ‘బఫూన్లు’ అని వ్యాఖ్యానించడంతో గొడవ తారస్థాయికి చేరింది. దాంతో స్పీకర్ కోడెల సభను శనివారం నాటికి వాయిదా వేశారు. అలాగే జగన్ చేసిన ‘బఫూన్’ అనే వ్యాఖ్యను స్పీకర్ కోడెల తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని సూచించారు. తెలుగుదేశం సభ్యులు కూడా ఇదే డిమాండ్ చేశారు. అయితే జగన్ తన వ్యాఖ్యని ఉపసంహరించుకోలేదు. దీనిపై తెలుగుదేశం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మళ్ళీ ‘విదర్భ’ హడావిడి...

  మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిన సమయంలో విదర్భ ఉద్యమ నాయకులు కూడా హడావిడి చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విదర్భ ఉద్యమకారులు తమకూ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఉద్యమం ఉద్ధృతం చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే విచిత్రంగా అలాంటిదేమీ జరగలేదు. అయితే తాజాగా మరోసారి విదర్భ ఉద్యమ హడావిడి మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి మహారాష్ట్రలోని నాగపూర్‌కి వెళ్ళారు. అక్కడ విదర్భ వాదులు నల్లజెండాలు చూపించి మోడీకి తమ నిరసన తెలిపారు. ప్రత్యేక విదర్భ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

షర్మిల అరెస్ట్!!

  మణిపూర్ హక్కుల కార్యకర్త ఇరోం షర్మిలను విడుదల చేయాలనంటూ మణిపూర్ కోర్టు ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాలకు తలవంచి మణిపూర్ ప్రభుత్వం ఆమెను విడుదల చేయడం విదితమే. అయితే ఇరోం షర్మిలను అలా విడుదల చేశారో లేదో ఇలా రెండు రోజులకే ఆమని మణిపూర్ పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. మణిపూర్‌లో అమల్లో ఉన్న వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్పీఏ)పై తన పోరాటంలో ఆమె నిరాహార దీక్ష చేస్తున్నారు. పోలీసులు బలవంతంగా ఆమెకు ముక్కుద్వారా ఆహారం ఇస్తున్నారు. షర్మిల విడుదలైన తర్వాత తాను ఇక ముందు కూడా నోటి ద్వారా ఆహారం తీసుకోనని ప్రకటించారు. దాంతో ఆమె నిరాహార దీక్ష ద్వారా ఆత్మహత్యకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణ మీద పోలీసులు మళ్ళీ ఆమెని అరెస్టు చేశారు. ఏఎఫ్‌ఎస్పీఏ చట్టానికి వ్యతిరేకంగా ఆమె గత 14 ఏండ్లుగా ఆమరణ నిరాహార దీక్ష పోలీసు నిర్బంధంలో ఆమెకు ఇన్నాళ్లు ముక్కు ద్వారా ద్రవ ఆహారాన్ని అందిస్తూ వచ్చారు.

‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ రూపకర్త ‌మృతి

  ఈమధ్య కాలంలో ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ అనే విరాళాల సేకరణ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం, ఆదరణ పొందుతోంది. తాజాగా హాలీవుడ్, బాలీవుడ్ తాలతోపాటు దక్షిణాదికి చెందిన తారలు కూడా ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. తాజాగా అక్షయ్ కుమార్, హన్సిక తదితరులు కూడా పాల్గొన్నారు. అయితే విషాదమేమిటంటే, ఇంత ఆదరణ పొందుతున్న ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ రూపకర్త కోరె గ్రిఫిన్ ఆగస్టు 16న మసాచుసెట్స్ లోని నాంటుకెట్ సముద్ర తీరంలో జరిగిన ఒక ప్రమాదంలో సముద్రంలో మునిగి చనిపోయారు. డైవింగ్ చేస్తుండగా సముద్రంలో మునిగి ఆయన చనిపోయారు. గ్రిఫిన్ వయసు కేవలం 27 సంవత్సరాలే. ఇంత చిన్న వయసులోనేప్రపంచ వ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న ఆయన అనుకోని ప్రమాదంలో చనిపోవడం విషాదం. గురువారం నాడు ఆయన సంస్మరణ సభ జరిగింది. కపాలానికి సంబంధించిన తన స్నేహితుడి సహాయార్థం గ్రిఫిన్ ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ కార్యక్రమాన్ని రూపొందించాడు. గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమం ఆన్లైన్ లో హల్ చల్ చేస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్ తారలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’లో పాల్గొంటున్నారు. తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు.

ఏపీ వ్యవసాయ బడ్జెట్ విశేషాలు...

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మొట్టమొదటి వ్యవసాయ బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 14 వేల కోట్ల రూపాయలతో ఈ వ్యవసాయ బడ్జెట్‌‌ రూపొందించారు. వ్యవసాయ బడ్జెట్‌లో విశేషాలు... * జాతీయ వ్యవసాయ విస్తరణ సాంకేతిక మిషన్‌కు 62 కోట్లు. * జాతీయ ఆహారభద్రతా మిషన్‌లో ముతకధాన్యాలు, వాణిజ్యపంటల చేర్పు. * జాతీయ నూనెగింజలు, ఆయిల్‌ఫాం మిషన్లకు 59 కోట్లు. * రాష్ట్రీయ కృషి వికాస్‌యోజన పథకం ద్వారా అనుబంధ శాఖలకు కేంద్ర ప్రభుత్వం నుంచి 230 కోట్లు. * వర్షాధార ప్రాంతాల అభివృద్ధి కోసం 169 కోట్లు. * ఏపీలో ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం, 50 కోట్లు కేటాయింపు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 192 కోట్లు కేటాయింపు. * వాటర్ మేనేజ్‌మెంట్, బిందుసేద్యానికి 348 కోట్లు. * వైఎస్ఆర్ హార్టీకల్చర్ వర్సిటీకి కేంద్రం నుంచి 30 కోట్లు. * పట్టుపరిశ్రమకు 122 కోట్లు. * పశుసంవర్ధక శాఖకు 723 కోట్లు. * మత్స్యశాఖకు 60 కోట్లు. * ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీకి 112 కోట్లు. * సహకార శాఖకు 156 కోట్లు. * రైతులకు 7 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌. 9 గంటలు పెంచేందుకు కృషి. * ఉచిత విద్యుత్‌కు 3188 కోట్లు.

కత్తులతో కాదు.. కమలాపళ్ళతో చంపేశారు...

  తియ్యగా, మృదువుగా వుండే కమలా ఫలాలని మనం ప్రశాంతంగా ఒలుచుకుని తింటాం. అవసరం అనుకుంటే జ్యూస్ తీసుకుని తాగుతాం. ఓ సినిమా దర్శకుడయితే కమలాపళ్ళని హీరోయిన్ బొడ్డుమీద లాఘవంగా విసిరి ప్రేక్షకులను మెప్పిస్తాడు. అయితే కొంతమంది వ్యక్తులు కమలాపళ్ళని మర్డర్ చేయడానికి ఉపయోగించారు. ఒక వ్యక్తిని కమలాపళ్ళతో కొట్టి చంపారు. దక్షిణాఫ్రికాలోని గ్రామీణ ప్రాంతంలో ఈ విచిత్రమైన హత్య జరిగింది. దక్షిణాఫ్రికాలోని కమలాపళ్ళ తోటల్లో కాయలు సేకరించే కూలీల మధ్య గొడవ జరిగింది. ఇద్దరు కూలీలు తమకు గిట్టని మరో కూలీని కమలాపళ్ళతో కొట్టి మరీ చంపేశారు. కమలాపళ్ళ గుట్ట పక్కనే ఇద్దరూ నిల్చుని ఎదురుగా వున్న వ్యక్తి మీద వరసబెట్టి విసిరారు. దాంతో ఆ వ్యవసాయ కూలీ అక్కడికక్కడే చనిపోయాడు.

యు.పి.లో మరో గ్యాంగ్ రేప్

  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అత్యాచార ఘటన జరిగింది. ఓ మహిళ మీద పది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి ఓ దళిత కుటుంబం వ్యవసాయ పనులు ముగించుకుని వస్తుండగా పొదల్లో దాక్కొని ఉన్న పది మంది దుండగులు వారిపై ఒక్కసారిగా దాడి చేశారు. ప్రతిఘటించిన ఆ మహిళ భర్త, కుమారుడిని చెట్టుకు కట్టేసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన వారిని మహిళ కుటుంబం గుర్తించింది. ఆ పది మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షలల్లో ఆమె అత్యాచారానికి గురైనట్లు వెల్లడయింది. నిందితుల కోసం గాలిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర జంతువు ‘అడవి దున్న’

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక. అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా ‘రాష్ట్ర జంతువు’ని తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్ర జంతువుగా ‘అడవి దున్న’ (ఇండియన్ బైపన్) ఎంపికైంది. అడవి దున్నను ఖరారు చేస్తూ దీనికి సంబంధించిన ఫైలు మీద తెలంగాణ అటవీ, పర్యావరణ మంత్రి ఫైలు మీద సంతకం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదానికి పంపించారు. సింగపూర్ పర్యటన నుంచి కేసీఆర్ తిరిగిరాగానే ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పేస్తే ఇక నుంచి అడవిదున్న తెలంగాణ రాష్ట్ర జంతువు హోదాని పొందుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట (ఇండియన్ రోలర్)ని ఖరారు చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర చెట్టుగా ఇప్పచెట్టును, రాష్ట్ర పుష్పంగా మోదుగుపువ్వును ఎంపిక చేశారు.

నోరు పారేసుకోవద్దు.. కేసీఆర్‌కి పవన్ సూచన

  సూచన తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన సమయంలో పవన్ కళ్యాణ్ ఇంట్లో లేని విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ సర్వేలో పాల్గొనలేదన్న విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పవన్ కళ్యాణ్ మీద వెటకారంగా కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో టూరిస్టులా వుంటాడేమోనని వ్యంగ్యంగా మాట్లాడారు. దానికి పవన్ కళ్యాణ్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. ‘‘సమగ్ర సర్వే జరిగిన రోజు నేను హైదరాబాద్‌లో లేను. పైగా సమగ్ర కుటుంబ సర్వే ఐచ్ఛికమని, ఇష్టంలేనివాళ్ళు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు చెప్పింది. సర్వే ఐచ్ఛికమని నేను సర్వేలో పాల్గొనలేదు. ఆమాత్రం దానికే కేసీఆర్ వ్యంగ్యంగా మాట్లాడటం బాధాకరం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ విద్వేష పూరితంగా మాట్లాడడం సమంజసం కాదు. బాధ్యత కలిగిన నాయకులు నోరు పారేసుకోవడం మంచిది కాదు.. పదే పదే విద్వేషాలు రెచ్చగొడితే సమాజంలో అశాంతి ఏర్పడుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్న విషయాన్ని తెలుసుకుని ఎవరైనా మాట్లాడాలి’’ అన్నారు.

చంద్రబాబుతో అమిత్ షా సమావేశం...

  భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కి వచ్చిన సంగతి తెలిసిందే. అమిత్ షా తన పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని తమ మిత్రపక్షాల నాయకులను కలుస్తున్నారు. గురువారం ఆయనని పవన్ కళ్యాణ్ కలిశారు. శుక్రవారం నాడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. చంద్రబాబు నాయుడితో అమిత్ షా ప్రత్యేకంగా భేటి అయ్యారు. వీరిరువురూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితి గురించి చర్చించినట్టు తెలుస్తోంది. అమిత్‌ షాతోపాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడిని కలిశారు.