రైతు కొడుకును పెళ్లి చేసుకుంటే రూ. 2 లక్షల నజరానా!!

ఎన్నికల సమయంలో హామీలు ఆకాశానికి నిచ్చెనలేసేలా ఉంటాయి. పార్టీలన్నీ కూడా జనాల మద్దతు కూడగట్టుకోవడానికి హామీలను గుప్పిస్తూ ఉంటారు. అదిగో అదే దారిలో జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఉభయతారకమనదగ్గ ఒక హామీ ఇచ్చారు.  కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  కోలార్ లోని పంచరత్నలో జరిగిన ప్రచార ర్యాలీలో జెడిఎస్ నేత మాజీ సీఎం కుమారస్వామి రైతుల కొడుకులను పెళ్లి చేసుకునే మహిళలకు తమ పార్టీ తరపున  రెండు లక్షల రూపాయల నజరానా అందిస్తాం అంటూ హామీ ఇచ్చారు. రైతుల పిల్లలను ప్రోత్సహించేందుకు ఈ హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటకలో మే 10వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. 13వ తేదీన కౌంటింగ్ జరగనుంది.  రైతు బిడ్డల పెళ్లిళ్లను ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం ఆడపిల్లలకు ఈ నజరానా ఇవ్వాలి. అమ్మాయిలు రైతుల బడ్డలను పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. తమ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని హస్తగతం చేసుకుంటే, రైతన్నల కుమారుల ఆత్మగౌరవంగా దీన్ని భావిస్తూ, ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన అన్నారు. 224 స్థానాలున్న కర్నాటక అసెంబ్లిలో కనీసం 123 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న జేడీ (ఎస్‌) ఇప్పటి వరకు 93 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్న జేడీఎస్ కొంచం భిన్నంగా ఆలోచించి ఈ హామీని ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చూడటానికి..ఇది రైతుల కుమారుల సంక్షేమం..కల్యాణం కోసంలా కనిపిస్తూనే మరో వైపు అమ్మాయిలకు లాభం చేకూరే పథకం అనడంలో సందేహం లేదు.  ఈ తాయిలం ఎలాంటి ఫలితం ఇస్తుందన్నది చూడాలి. 

బాలినేనికి పొమ్మన లేక పొగపెడుతున్నారా?

బాలినేని శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి.. సీఎంకు సమీప బంధువు..ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అయితే ఆయన మాటే శాసనం అన్నట్లుగా వ్యవహారాలు నడుస్తాయి. అలాంటి నేతకు అవమానం జరిగింది. అదీ జగన్ అధికారిక కార్యక్రమం సందర్భంగా. సీఎం జగన్‌ మార్కాపురం పర్యటన సందర్భంగా వెళ్లిన బాలినేని శ్రీనివాసరెడ్డిని   సీఎం హెలిప్యాడ్‌ దగ్గరకు వెళ్లకుండా పోలీసులు నిలిపివేశారు. పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తానెవరో.. తన పవరేంటో చెప్పుకున్నారు. అయినా ససేమిరా అన్నారు. అంతే.. ఆయనకు ఒళ్లు మండింది. ఆగ్రహించిన ఆయన సీఎం కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. ఆయన అనుచరులూ అనుసరించారు.   బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో సొంత వర్గం ఉన్న నాయకుడు. అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్న నేత. అధికారదర్పం, అహంకారం పెద్దగా ప్రదర్శించరు. జిల్లాలో పేరుకు ఇద్దరు మంత్రులు ఉన్నా.. పలుకుబడి మాత్రం బాలినేనికే ఎక్కువ. అటువంటి ఆయన సీఎం హెలీపాడ్ వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని తట్టుకోలేకపోయారు. ఇంత అవమానం జరిగాకా తాను అక్కడ ఎందుకు ఉండాలనుకున్నారు. అంతే వెంటనే వెనక్కు వెళ్లిపోయారు.   బాలినేనిని పోలీసులు ఇంతగా అవమానించడం ఏమిటని వైసీపీ వర్గాలే ఆశ్చర్యపోయాయి. బాలినేనికి ముఖ్యమంత్రి వద్ద ప్రాధాన్యత లేదనడానికి నిదర్శనమా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బాలినేనికి సీఎం ఉద్వాసన పలకడంతో ఆయన ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆయన తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. ఆ తరువాత ఏదో సద్దుకుపోయినా,  తాజాగా ఎదురయిన అవమానం పుండుమీద కారం చల్లినట్లుగా అయ్యిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇక ముఖ్యమంత్రి మార్కాపురం వచ్చిన తరువాత బాలినేనిని పోలీసులు నిలిపివేయడంతో ఆయన వెనక్కు వెళ్లిపోయిన సంగతి తెలుసుకున్న జగన్ స్వయంగా బాలినేనికి ఫోన్ చేసి పిలిపించారు. దాంతో ఆయన వెనక్కు వచ్చి సీఎంతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అయినా ఆయనలో పరాభవ భారం కనిపిస్తూనే ఉంది. కార్యక్రమం మొత్తం ముభావంగానే ఉన్నారు. తన అసంతృప్తిని దాచుకోలేదు. అది ఆయన ముఖంలో కనిపిస్తూనే ఉంది. ఇదే విషయాన్ని ఆయన అనుచరవర్గం కూడా చెబుతున్నారు.  జరిగిన సంఘటన చూస్తుంటే పొమ్మనలేక పొగపెడుతున్నట్లుగా ఉందని అంటున్నారు. 

విశాఖ ఉక్కు సరే తెలంగాణలో మూతపడిన పరిశ్రమల మాటేంటి?..లక్ష్మణ్

తెలంగాణలో మూతపడిన పరిశ్రమలను తెరిచే దిక్కులేదు కానీ, విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్  ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పారని,  ఆ హామీ ఇచ్చి ఇన్నేళ్లయినా ఎందుకు అమలు చేయడం లేదని ఎంపీ లక్ష్మణ్‌ నిలదీశారు.  హెచ్‌ఎంటీ, ఐడీపీఎల్‌, అజంజాహీ మిల్‌ మాటేమిటని ప్రశ్నించారు. ఈ భూములపైన బీఆర్‌ఎస్‌ నేతలు కన్నేశారని అందుకే వాటిని తెరిపించే విషయంలో మౌనం వహిస్తున్నారని లక్ష్మణ్   ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో డిమాండ్ కు తగ్గ బొగ్గు ఉత్పత్తి లేకపోవడంతో దిగుమతి చేసుకునే వారని, వారికి కావాల్సిన వారికి బొగ్గు నిక్షేపాలు ఇచ్చేసి బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్‌ కూరుకుపోయింది.  బయ్యారం ప్రమేయం లేకుండానే  కడప స్టీల్‌ ప్లాంటు నడుస్తోందని, కడపలో జిందాల్‌ స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు.   నల్లగొండలో యురేనియం పుష్కలంగా ఉంది, అక్కడ నిక్షేపాలను వెలికి తీస్తే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.  వీటికి దిక్కు లేదు కానీ , వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు వెళ్తారా..? అని  ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌.. తన చుట్టూ పది మందిని పెట్టుకుని నోటికి హద్దూ అదుపూ లేకుండా మాట్లాడుతున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని కొల్లగొడుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని లక్ష్మణ్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్‌ వాడిన భాషను ఆంధ్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని, ఇప్పుడు విశాఖ స్టీల్‌ అంటూ మోసం చేయాలని చూస్తున్నారనీ, అయితే జనం నమ్మరని అన్నారు.  జాతీయ పార్టీ అని చెప్పుకునే కేసీఆర్‌ కు  ఏపీలో పార్టీ సింబల్‌కే   దిక్కు లేని పరిస్థితి ఉందన్నారు.   ముందు మన ఇల్లు చక్కదిద్దుకుని... తర్వాత పక్కోడి ఇల్లు గురించి తీరిగ్గా ఆలోచించాలని లక్ష్మణ్ కేసీఆర్ కు సూచించారు. 

కాంగ్రెస్ సారథ్యంలో విపక్ష కూటమి దిశగా తొలి అడుగు!

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతా యత్నాలలో ఒక ముందడుగు పడిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలు బీహార్ సీఎం, జేడీఎస్ అధినేత నితీష్ కుమార్ తో బుధవారం భేటీ అయ్యారు. ఈ బేటీలో ఆర్జేడీ నాయకుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ కూడా ఉన్నారు. భేటీ అనంతరం  ఖర్గే మీడియాతో మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. నితీష్, తేజస్విలతో భుటీ సామరస్య పూరిత వాతావరణంలో అర్థవంతంగా జరిగిందన్నారు.   2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని ఖర్గే చెప్పారు.ముందు ముందు మరిన్ని పార్టీలు కలిసి వస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు.  నితీష్ కూడా ఈ భేటీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలన్నిటినీ ఏకం చేస్తామన్నారు. కాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటించాలన్న అభిప్రాయంతో ఉన్న విపక్ష పార్టీల నేతలతో మాట్లాడి వారిని కలుపుకునే బాధ్యతను ఈ భేటీ సందర్భంగా నితీష్ కుమార్ తీసుకున్నారు.   ఈ సమావేశంలో రాహుల్‌ గాంధీ, తేజస్వీ యాదవ్‌, జేడీ(యూ) చీఫ్‌ లాలన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ ఎంపీ నసీర్‌ హుస్సేన్‌, రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సుఖ్‌జీందర్‌ సింగ్‌ రంధావా, కాంగ్రెస్ నేతలు ముకుల్ వాస్నిక్, సల్మాన్ ఖుర్షీద్ లు పాల్గొన్నారు. ఇటీవలే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మోడీ డిగ్రీ సర్టిఫికేట్, అదానీ వ్యాపార వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో విపక్షాల ఐక్యతకు గండి పడినట్లే నంటూ వచ్చిన వ్యాఖ్యలను పూర్వ పక్షం చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్, ఆర్జేడీ, జేడీయూ పార్టీల నాయకులు భేటీ అయ్యి వచ్చే ఎన్నికలలో ఐక్యంగా సాగాలన్న నిర్ణయాన్ని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చాటింగ్.. సుఖేష్ చంద్రశేఖర్ లేఖతో సంచలనం

సుఖేష్ చంద్రశేఖర్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే పలువురితో తాను చేసిన చాటింగ్ ను బయటపెట్టిన సుఖేష్ చంద్రశేఖర్ తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో చేసిన చాటింగ్ ను బయటపెట్టాడు. ఈ మేరకు జైలు నుంచి విడుదల చేసిన లేఖలో సుఖేఖ్ చంద్రశేఖర్ కల్వకుంట్ల కవితతో తన వాట్సాప్ చాట్ ను బయటపెట్టాడు.  ఇప్పటి వరకూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ నాయకులతో చాట్ ను బయటపెట్టిన సుఖేష్ చంద్రశేఖర్ తాజా  లేఖతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో తన  వాట్సాప్ చాట్‌ను   బయటపెట్టడం సంచలనం సృష్ఠించింది. రాజకీయంగా కలకలం రేపింది.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన చాట్ ఇదేనంటూ సుఖేష్ కొన్ని స్క్రీన్ షాట్‌లను బయటపెట్టాడు. కవితక్క - టీఆర్ఎస్ అని సేవ్ చేసుకున్న నంబర్ తో సుఖేష్ చంద్రశేఖర్ చాట్ చేశాడు. ఏకే, ఎస్‌జే, ఏపీ, సిస్టర్ పేర్లతో కోడ్ భాషలో కల్వకుంట్ల కవితతో చాట్ చేసినట్లు సుఖేష్ ఆ లేఖలో పేర్కొన్నాడు.  15కేజీల నెయ్యి డెలివరీ చేశానని కోడ్ భాషలో సుఖేష్  పేర్కొన్నట్లు ఆ చాట్ స్క్రీన్ షాట్ ద్వారా తెలుస్తోంది. అలాగే   ప్యాకెట్  అందజేస్తానని ఏజే చెప్పారని చాట్‌లో సుఖేష్ పేర్కొన్నాడు.  98101 54102 నెంబర్‌తో సుఖేష్ చాటింగ్ చేశాడు. సుఖేష్ లేఖ మొత్తం 6 పేజీలు ఉంది.  

మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది!

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల మేరకు దేశంలో గత 24 గంటలలో  5 వేల 676 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మొత్తం 3 వేల 761 మంది కొవిడ్  నుండి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 37 వేల 93  యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నాయి. కాగా జాతీయ కొవిడ్ రికవరీ రేటు ప్రస్తుతం 98.73 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220 కోట్ల 66 లక్షలకు పైగా వ్యాక్సిన్‌ డోస్‌లను అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే బుధవారం నాటికి 24 గంటల్లో దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్క రోజే దేశవ్యాప్తంగా 7,830 మందికి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఏడు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడేనని వివరించారు. దీంతో దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 40,215 కు చేరిందని వివరించారు. ఒక్క ఢిల్లీలోనే 980 కరోనా కేసులు బయటపడ్డాయని తెలిపారు. ఇక రోజువారీ పాజిటివిటీ   విషయానికి వస్తే మంగళవారం నాటికి ఇది 3.65 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేట్ 3.83 శాతానికి చేరింది.  వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం (రికవరీ రేటు) 98.72 శాతానికి చేరుకుందని అన్నారు.  వైరస్ తో మంగళవారం 11 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,31,016 కు చేరిందని తెలిపింది. రాష్ట్రాల్లో చూస్తే.. కేరళలో అత్యధికంగా 13,745 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్ర (4,667), ఢిల్లీ (2,338), తమిళనాడు (2,099), గుజరాత్ (1932), హర్యానా (1928), కర్ణాటక (1673), ఉత్తరప్రదేశ్ (1282) ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో 1000 కంటె తక్కువగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో ఇండియాలో కరోనా వల్ల 15 మంది చనిపోయారు. వారిలో ఢిల్లీలో ముగ్గురు, పంజాబ్‌లో ముగ్గురు, రాజస్థాన్‌లో ముగ్గురు చనిపోయారు. కేరళలో ఇద్దరు చనిపోగా... గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడులో ఒక్కొక్కరు చనిపోయారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నిన్న దేశవ్యాప్తంగా జరిగిన కరోనా మాక్ డ్రిల్‌ను సమీక్షించారు. ఢిల్లీలోని RML ఆస్పత్రికి వెళ్లి.. అక్కడి కరోనా ఏర్పాట్లను పరిశీలించారు. మాక్ డ్రిల్ ఇవాళ కూడా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా ప్రిపరేషన్ ఎలా ఉందో ఇందులో గమనిస్తారు. తద్వారా కరోనా పేషెంట్లు ఎక్కువగా వస్తే.. ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటానికి ఎక్స్ బిబి.1.16 అనే వేరియంట్ కారణంగా కనిపిస్తోంది. ఇది గత వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తోంది. ఇది ప్రాణాంతకమైనది కాదు అని చెబుతున్నారు నిపుణులు. ఐతే... దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కరోనా సోకితే మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది అంటున్నారు.

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి.. పది మందికి గాయాలు

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా  చీమలపాడు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి  ఎంపీ నామా నాగేశ్వరావు,  ఎంఎల్ఏ లావుడ్యా రాములు నాయక్ కు స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ నాయకులు  పేల్చిన బాణాసంచ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి పది మంది తీవ్రంగా గాయపడ్డారు. కార్యకర్తలు పేల్చి బాణసంచా నిప్పురవ్వలు ఓ గుడిసెపై పడ్డాయి. ఆ గుడిసెకు నిప్పంటుకుంది. గుడిసెలో ఉన్న గ్యాస్ బండ పేలడంతో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పది మంది తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు వ్యక్తుల కాళ్లు తెగిపోయాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది. 

మోడీగారి పులి వేట

ఏప్రిల్ 9వ తేదీన మధుసూదన్ కుటుంబం ఆనందంలో మునిగి తేలుతోంది. బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో డ్రయివర్ గా ఉద్యోగం చేస్తున్న మధుసూదన్ జీపులో దేశ  ప్రధాని నరేంద్రమోడీ అరణ్య విహారం చేయనున్నారు. ఇదీ ఆ కుటుంబం ఆనందానికి కారణం. ఉదయం 7.15 నుంచి 9.30 వరకూ మోడీని జీపులో ఎక్కించుకుని పులులను చూపించే బాధ్యత తన పూర్వ జన్మ సుకృతం అని మధుసూదన్ భావించాడు.  కానీ అతని ఆశలపై బందీపూర్ పులులు నీళ్లు చల్లాయి. 135 నిముషాల పర్యటనలో ఒక్కటంటే ఒక్క పులి కూడా మోడీ కంట పడలేదు. దీంతో  మోడీ నిరుత్సాహానికి గురయ్యారు. ఎలాగూ అంత దూరం వచ్చాం కదా అని ఓ ఫొటో షూట్ తో ప్రధాని సంతృప్తి చెంది తిరుగుప్రయాణమయ్యారు. రోజూ కనిపించే పలులు ఆ రోజు కనిపించకపోవడంతో డ్రయివర్ మధుసూదన్ కూడా తన దుదరృష్టానికి బాధపడ్డాడు.  ఇదిలా ఉండగా ప్రధాని మోడీని పులులు దర్శించుకోలేకపోవడానికి డ్రయివర్ కారణమంటూ కర్నాటక బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. డ్రయివర్ మధుసూదన్ ఉద్యోగాన్ని ఊడబీకి జీపు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఇదంతా చేస్తున్న కర్నాటక అటవీ శాఖ అధికారులకు ఒళ్లు మండింది. మోడీకి పులి కనబడకపోతే డ్రయివర్ ను ఉద్యోగం నుంచి తీసేయడం ఏమిటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. జీపు రిజిస్ట్రేషన్ కు, పులి కనబడకపోవడానికి సంబంధం ఏమిటో అధికారులకు అర్ధం కావడం లేదు. మోడీకి పులి పంజా గుర్తులు చూపించామంటూ అటవీ అధికారులు బీజేపీ నేతలకు నచ్చ చెబుతున్నారు. మోడీ పర్యటనకు ముందే భద్రతా దళాలు, ఇతర వంది మాగధులు చేసిన హడావుడికి పులులు బెదిరిపోయి ఉంటాయని అటవీ అధికారులు అంటున్నారు. మోడీ పర్యటన తరువాత అడవిలో పులుల సంచారం తిరిగి ప్రారంభమైందని కూడా అధికారులు సెలవెచ్చారు. 

తెలంగాణలో ప్రగతి పరుగులు.. ఏపీలో ఎందుకు వచ్చేయండి!

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. ఏపీ అభివృద్ధి కుంటుపడిందని తెలంగాణ మంత్రి హరీష్ అన్నారు. అందుకే తెలంగాణలో స్థిరపడిన ఏపీ కార్మికులంతా అక్కడి ఓటు రద్దు చేసుకుని ఇక్కడ నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నిర్మాణంలో చెమట చిందించిన ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని కేసీఆర్ గతంలోనే చెప్పిన విషయాన్ని హరీష్ ఇప్పుడు మళ్లీ గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి  తెలంగాణ మంత్రులు  ఏపీలోని అభివృద్ధి లేమినే అలంబనగా వాడుకుంటున్నారు. అందుకే అవకాశం వచ్చినా రాకపోయినా తమ రాష్ట్ర ప్రగతిని చెప్పుకోవడానికి ముందుగా ఏపీలోని అభివృద్ధి లేమిని ఎత్తి చూపుతున్నారు. తాజాగా మంత్రి హరీష్ రావు మరో సారి అదే చేశారు.  ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు ఆయన ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. జగన్ పాలనలో ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం కుదేలయ్యాయనీ, దీంతో అక్కడ పనులు లేక, దొరకక పొట్ట చేతబట్టుకు వచ్చిన నిర్మాణ రంగ కార్మికులందరూ ఇక్కడే సెటిల్ అయిపోవాలనీ, అక్కడ ఓటు రద్దు చేసుకుని ఇక్కడ నమోదు చేయించుకోవాలని పిలుపునచ్చారు. తెలంగాణలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదనీ, ఇక్కడ చేతి నిండా పని దొరుకుతుందనీ, సంపాదనా పుష్కలంగా ఉంటుందనీ, తెలంగాణ అభివృద్ధి ఫలాల్లో భాగం కూడా దొరుకుతుందని చెబుతున్నారు. అభివృద్ధి విషయంలో తెలంగాణకూ ఆంధ్రప్రదేశ్ కూ ఆకాశానికీ, భూమికీ ఉన్నంత తేడా ఉందన్నారు. ఇప్పుడే కాదు.. గతంలో గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలలో ఏపీ సీఎం జగన్ ఫుల్ బిజీగా ఉన్నప్పుడు కూడా ఏపీలో వ్యవసాయ రంగం దీనస్థితి గురించి ప్రస్తావించి హరీష్ ఏపీ, ఏపీ సీఎం జగన్ గాలి తీసేశారు.   

వైకాపాలో ‘ముందస్తు’ తొందర!

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హీట్ రోహిణికార్తె ఎండలను మించిపోయింది.  రెండు రాష్ట్రాలలోనూ కూడా ముందస్తు ఎన్నికలు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ముందస్తు ప్రశక్తేలేదని అన్యాపదేశంగానైనా సరే స్పష్టం చేసినా..వాటికి ఫుల్ స్టాప్ పడటంలేదు. మరీ ముఖ్యంగా ఏపీలో అయితే తెలంగాణతో పాటే ఆంధ్రప్రదేశ్ కూ ఎన్నికలు అంటూ విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారానికి  ఊతం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి జగన్ సహా మంత్రులు, వైసీపీ నాయకులూ ముందస్తు ముచ్చటే లేదంటూ సందర్భం కల్పించుకుని మరీ ప్రకటనలు గుప్పిస్తున్నారు.   అయితే పరిశీలకుల విశ్లేషణ మేరకు తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే   ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏపీలో మాత్రం ముందస్తుకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఏపీలో వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాల కొనసాగింపు ప్రశ్నార్థకంలో పడింది. ఆ పథకాలు కొనసాగించలేక నిలిపేయాల్సిన పరిస్థితి ఎదురైతే..  ప్రభుత్వ ప్రతిష్ట మంటగలుస్తుంది. ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. పథకాలు కొనసాగుతుండగానే ఎన్నికలకు వెళ్లడం మేలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. ఆ పార్టీ ముఖ్య సలహాదారు సజ్జల ఆ విషయాన్ని ఇప్పటికే పలు మార్లు సూచన ప్రాయంగానే అయినా పలు మార్లు మీడియా ముఖంగానే చెప్పారు.   అందుకే రాష్ట్రంలో ఎన్నికల హీట్ ను పెంచేలా సీఎం జగన్ ఎమ్మెల్యేలకు మార్కులు గ్రేడులూ కేటాయిస్తూ పరుగులెత్తించే కార్యక్రమానికి తెరతీశారు. గడపగడపకూ, ఇంటింటికీ స్టిక్కర్లు అంటూ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను పరుగులెత్తిస్తున్నారు. ఇవన్నీ జగన్ ముందస్తు ఆచోనలను ప్రతిబింబిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అయితే ఏపీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోనికి తీసుకుంటే జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు. ఈ  ఏడాది చివరి నాటికి తెలంగాణ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంతో పాటే ఏపీలో కూడా ఎన్నికలు జరిగేలా జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని అంటున్నారు.  

గవర్నర్ల వ్యవస్థ అవసరమా?

బీజేపీయేతర రాష్ట్రాలపై కక్ష సాధించడం కోసమే కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను వాడుకుంటోందని తెలంగాణ మంత్రి  కేటీఆర్‌ తప్పుబట్టారు. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని సూచిస్తూ తెలంగాణ ప్రభుత్వ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొంతం దిలీప్‌ చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్‌ రీట్విట్‌ చేశారు. ఆ ట్విట్‌కు కేటీఆర్‌ తన వ్యాఖ్యను జోడించారు. తమ అధికారాలను నిర్దాక్షిణ్యంగా దుర్వినియోగం చేస్తున్న దేశంలోని బీజేపీయేతర రాష్ట్రాల్లోని గవర్నర్లపై తమిళనాడు ప్రభుత్వం ఇటీవల అభ్యంతరం తెలిపింది. బ్రిటిష్‌ కాలం నాటి గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. తెలంగాణ గవర్నర్‌ కూడా కొన్ని బిల్లులను పెండింగ్‌లో పెట్టారని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవుల్లో ఉన్నవారు కేంద్ర ప్రభుత్వ అధీనంలో రాజకీయ పావులుగా మారారని ఆరోపించారు. బీజేపీయేతర రాష్ట్రాలకు కేంద్రం సహకరించడం లేదని, ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తోందని మంత్రి విమర్శించారు. సహకార సమాఖ్య పాలనకు ఇది ఒక నమూనా కాదా అని ఆయన నిలదీశారు. టీమ్‌ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర వైఖరి ఉందని, ఇది దేశ ప్రగతికి, సామరస్యానికి ఎలా దోహదపడుతుందని మంత్రి కేటీఆర్‌ప్రశ్నిస్తున్నారు.  గవర్నర్ వ్యవస్థ వ్యర్థ మని ఇప్పటికే పలువురు న్యాయ కోవిదులు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం.. గవర్నర్లను .. తమ ప్రయోజనాల పరిరక్షణకు ఉపయోగించు కుంటోందని ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి.  ఈ తరుణంలో కేటీఆర్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. 

టీహబ్ ఒక అద్భుతం.. ఆదిత్యథాక్రే

శివసేన ఎమ్మెల్యే ఆదిత్య థాకరే   హైదరాబాద్‌లోని టీహబ్‌ను సందర్శించారు. అక్కడ మంత్రి కేటీఆర్‌తో ఆయన కొద్ది సేపు భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తన ట్విట్టర్‌లో ఆదిత్య థాకరే.. మంత్రి కేటీఆర్‌ను కలిసిన ప్రతిసారి అద్భుతంగా, ఎంకరేజింగ్ ఫీలవుతానంటూ ప్రశంసల వర్షం కురిపించేశారు. సుస్థిరత, పట్టణీకరణ, సాంకేతికత లాంటి అంశాలపై ఇరువురి మధ్యా చర్చ జరిగిందని పేర్కొన్నారు.  భారత దేశ ప్రగతిలో ఆ అంశాలు కీలకమని ఆదిత్య థాకరే తెలిపారు. టీహబ్‌ ఒక  మహాద్భుతంగా అభివర్ణించారు.  స్టార్ట్ అప్‌లు, ఆవిష్కర్తలు, ఆలోచనాపరులకు టీహబ్ మంచి ఊతం ఇస్తోందన్నారు.  మంత్రి కేటీఆర్‌ను కలవడం ఉత్తేజాన్ని ఇచ్చిందని, ఆయన బ్రెయిన్ చెయిల్డ్ టీహబ్ విజిట్ చేసి థ్రిల్ అయ్యాననీ, అక్కడ అమేజింగ్ వర్క్ జరుగుతోందని ఆదిత్యథాక్రే ట్వీట్ చేశారు.  కాగా ఆదిత్య థాక్రే ట్వీట్ కు స్పందించిన కేటీఆర్   గత ఏడాది దోవోస్‌ సదస్సు సందర్భంగా కలిసిన తరువాత మళ్లీ ఆదిత్యథాక్రేతో భేటీ కావడం ఇదే తొలిసారనిపేర్కొన్నారు.ఆయనతో చర్చలు అర్ధవంతంగా జరిగాయని పేర్కొన్నారు.  భవిష్యత్ లో ఆయనతో కలిసి పని చేయాలన్న ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.   ఆదిత్యథాక్రే, కేటీఆర్ పరస్పర పొగడ్తలను పక్కన పెడితే...ఈ భేటీ కేవలం టీహబ్ సందర్శనకు మాత్రమే సంబంధించినది కాదని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాలలో బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా గళం వినిపిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మహారాష్ట్రపై నిశిత దృష్టి పెట్టారు. ఇక మహారాష్ట్రలో బాల్ థాక్రే బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.  తన ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీకి గట్టి గుణపాఠం నేర్పాలన్న పట్టుదలతో ఉన్నారు.   మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని బావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బాల్ థాక్రే నేతృత్వంలోని శివసేన బీఆర్ఎస్ తో చేతులు కలిపే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్యఠాక్రే  హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా ఎనలేని ప్రాథాన్యత సంతరించుకుంది.  

కవిత కాలికి గాయం.. ఈడీ విచారణకు బ్రేక్?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కాలుకు ఫ్రాక్చర్  అయింది. ఆ విషయాన్ని ఆమె  స్వయంగా ట్వీట్ చేశారు. తనకు కాలు ఫ్యాక్చర్ అయిందని, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు కవిత ట్వీట్ చేశారు. గాయం కారణంగా కొన్నిరోజులపాటు ఇంటికే పరిమితం కానున్నట్లు చెప్పారు.  ఏదైనా సహకారం లేదా సమాచారం కోసం తన కార్యాలయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఫ్రాక్చర్ ఎప్పడు, ఎక్కడ, ఎలా జరిగిందనే విషయం ఆమె చెప్పలేదు.  అదలా ఉంటే కవిత కాలుకు గాయం అయిందన్న వార్త విన్నబీఆర్ఎస్ క్యాడర్, భారత జాగృతి కార్యకర్తలు కవిత అభిమానులు, సహజంగానే సానుకూలంగా స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని తమ ఇష్ట దైవాలాను ప్రార్ధించారు. ప్రార్ధనలు చేస్తున్నారు.  కవితక్క జాగ్రత్త ... అంటూ సోషల్ మీడియా సందేశాలు పంపిస్తున్నారు.  మరోవంక దాల్ మే కుచ్ కాలా ..హై ..అని అనుమానిస్తున్న వారు అనుమానిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికీ మూడు సార్లు ఈడీ ఎదుట విచారణకు హాజరైన కవితను మరోమారు విచారించవచ్చనే సమాచారం అందుతున్న నేపథ్యంలో కవిత కాలి గాయం కావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారూ ఉన్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమంలో రకరకాలు కామెంట్లు వస్తున్నాయి. అయితే, ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్‌ చంద్రశేఖర్‌   వెల్లడించిన తాజా వివరాల నేపథ్యంలో ఈడీ ఏ క్షణంలో అయినా కవితకు ఫ్రెష్ సమన్లు జారీ చేయవచ్చని అంటున్నారు.

బీఆర్ఎస్ లో అంతర్మధనం

తెలంగాణ అంటే తెరాస, తెరాస అంటే కేసీఆర్ ఇదీ నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు నిర్వచనంగా చెప్పుకున్న మాట.  ఏది చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ చేయవలసిందే. ఏది చెప్పినా కేసీఆర్ చెప్పవలసిందే. ఇతరులు ఎవరు ఏది చెప్పినా ఏది చేసినా కేసీఆర్ పేరున చేయవలిసిందే.  , సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదనే విధంగా పార్టీ ప్రభుత్వ వ్యవహారాలు నడిచాయి.  కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర మంత్రులు, పార్టీ పెద్దలు ఎవరు ఏమి చెప్పినా చివరకు కేసీఆర్ శంఖంలో పోస్తేనే అది తీర్ధం. ఆ మాటకు ఒక విలువ. అందుకు భిన్నంగా తొందరపడి ఏ మంత్రీ కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇంతవరకు ఏనాడూ  లేదు.  అయితే  తెరాస, బీఆర్ఎస్ గా మారిన తర్వాత లేదా అంతకు కొంత ముందు నుంచి పరిస్థితి   మారుతూ వస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ రాజకీయాలు హీట్ ఎక్కిన నేపథ్యంలో ఇటు కుటుంబంలో అటు పార్టీ, ప్రభుత్వంలో చోటు చేకున్న పరిణామాలు కొత్త చర్చకు తెర తీశాయి. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు వచ్చినప్పటి నుంచీ  కేసీఆర్  ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా  అది కూడా ఫోటోల్లో కనిపించడం, ప్రెస్ నోట్’లో వినిపించడమే కానీ నేరుగా ముఖ్యమంత్రి ప్రజల ముందుకు వచ్చిన సందర్భాలు పెద్దగా లేవనే చెప్పవచ్చు. అసెంబ్లీలో లేదా ఇటీవల మహారాష్ట్రలో జరిగిన బీఆర్ఎస్ సభలో తప్ప రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు లేదా మీడియా ముందుకు వచ్చిన సందర్భం ఇటీవల కాలంలో లేదనే చెప్పాలి.  చివరకు రాష్ట్రంలో సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణం,  టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీక్ , ఎస్ఎస్సీ పేపర్స్ లీక్ /మాల్ ప్రాక్టీసు వ్యవహారంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్.. విడుదల చివరకు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా కేసీఆర్ కుటుంబ పాలనని టార్గెట్ చేస్తూ చేసిన తీవ్ర విమర్శలు ఇలా.. ఏ విషయంలోనూ ముఖ్యమంత్రి స్పందించలేదు. అయితే, ఉద్యమ కాలం నుంచీ కూడా కేసీఆర్  ప్రతికూల పరిస్థితుల్లో సైలెన్స్ గా ఉండడం, సమయం వచ్చినప్పడు   దూకుడు పెంచడం అనుభవంలో ఉన్న విషయమే అంటున్నారు. కేసీఆర్ విషయం అలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ జోష్ పెంచారు. సర్వం తానే అన్నట్లు (డీఫ్యాక్టో ముఖ్యమంత్రి)గా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక అధికార బీఆర్ఎస్ లో అయితే ఆయన అనుకూల వర్గం కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ట్రీట్ చేస్తున్నారు. అంతేకాదు ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి కేటీఆర్ ను బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించడంతో పాటుగా, ఎన్నికలకు ముందుగా ఆయన్ని  ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి, అయన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళాలని పార్టీలో ఒక వర్గం ‘డిమాండ్’ చేస్తున్నట్లు తెలుస్తోంది.  అదలా ఉంటే, ఏప్రిల్ 27న భారత రాష్ట్ర సమితి జనరల్ బాడీ మీటింగ్ జరగనున్న నేపధ్యంలో ఈ సమావేశంలో కేటీఆర్ ను భారాస రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ప్రకటించే అవకాశం లేక పోలేదన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇంతలోనే బీఆర్ఎస్ గుర్తింపు వ్యవహారం గందరగోళంలో పడింది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపే కానీ, ఇప్పటికే పార్టీ అధ్యక్షుడిని నియమించిన పొరుగు రాష్ట్రం ఏపీ, పార్టీ విస్తరణ  ప్రారంభించిన కర్ణాటక, మహారాష్ట్ర సహా దేశంలో మరెక్కడా ఎలాంటి గుర్తింపు దక్కే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో బీఆర్ఎస్ భవిష్యత్ ఒక విధంగా  డోలాయమానంలో పడిందని అంటున్నారు. అలాగే, ఒక విధంగా చూస్తే బీఆర్ఎస్ లో అంతర్మథనం జరుగుతోందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపద్యంలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్  ఆవిర్భావ దినోత్సవ  సభ లో ఏమి జరుగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

బలగం సింగర్ మొగులయ్యా ఆరోగ్యం విషమం

చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అందుకున్న మూవీ బలగం ఇంత పెద్ద హిట్ కావడానికి ప్రధాన కారణాలలో ఒకటి   క్లైమాక్స్ లో వచ్చే పాట అనడంలో సందేహం లేదు. ఈ పాటను పాడింది బుడగ జంగాల కళాకారుల పాట. సినిమాలో ఈ  పాట పాడినది  ఆ బుడగ జంగాల కళాకారుడైన  పస్తం మొగిలయ్య, కొమురమ్మ. ఈపాటతో వారిరువురికీ మంచి గుర్తింపు రావడమే కాకుండా.. సినిమా సక్సెస్ కు కూడా ప్రధాన కారణమయ్యారు. ఇప్పుడీ ప్రస్తావన అంతా ఎందుకంటే బలగంలో క్లైమాక్స్ పాటను అద్భుతంగా  పాడిన   మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడున్న మొగిలయ్య ఇటీవలే   వరంగల్ సంరక్ష ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. మంగళవారం (ఏప్రిల్11) ఆయనకు డయాలసిస్ చేస్తుండగా  గుండెపోటు రావడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో మొగిలయ్యను హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు.  మొగిలయ్యకు వైద్య సేవలందించే విషయంలో  ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన భార్య  భార్య కొమురమ్మ వేడుతున్నారు. 

బీఆర్ఎస్ లో టీఆర్ఎస్ గుబులు?

ఔను నిజమే.. టీఆర్ఎస్ గా మొదలై రాష్ట్ర రాజకీయాలను శాసించిన పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయింది. పేరుకే జాతీయ పార్టీ అయినా.. తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలోనూ ఆ పార్టీకి గుర్తింపు లేదని కేంద్ర ఎన్నికల సంఘం కుండ బద్దలు కొట్టేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర సమితిగా మారిపోయిన తరువాత ఇంత కాలం ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిన తెలంగాణ సెంటిమెంట్ ఆ పార్టీకి దూరమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ కాదు. అదో జాతీయ పార్టీ. రాష్ట్రంతో ఆ పార్టీ  బీజేపీ, కాంగ్రెస్ లలాగే ఒక రాజకీయ పార్టీ. అంతే అంతకు మించిన అనుబంధమేదీ ఆ పార్టీకి రాష్ట్రంలో లేకుండా పోయింది. బీఆర్ఎస్ గా మారనంత కాలం.. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండటం వల్ల ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకున్నా తెలంగాణ సాధించిన పార్టీగా తెలంగాణ ప్రజలలో ఆ పార్టీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకే తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్ఎస్( ఇప్పుడు బీఆర్ఎస్) తెలంగాణ జనం గుండెలకు హత్తుకున్నారు. అయితే ఎప్పుడైతే పార్టీలో తెలంగాణను తీసేశారో.. జనం కూడా ఒక ఆ పార్టీకి తమ హృదయాలలో ఉన్న ప్రత్యేకత ను తొలగించుకున్నారు. అలాంటి వేళ ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా  టీఆర్ఎస్ పేరుతో మారో పార్టీ ఆవిర్భవించబోతున్నది.   ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద తెలంగాణ రాజ్య సమితి అనే పార్టీ రిజిస్టర్ అయింది. దానికి తోడు ఇటీవలే  తెలంగాణ రైతు సమితి అనే పేరుతో రిజిస్ట్రేషన్ కోసం మరో దరఖాస్తు దాఖలైంది.   రాష్ట్రంలో రెండుసార్లు అధికారాన్ని సాధించడానికి బీఆర్ఎస్ పార్టీకి తోడ్పడిన ‘తెలంగాణ’ తొలగించడంతోనే తెలంగాణతో బీఆర్ఎస్‌కు బంధం తెగిపోయిందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే పార్టీ నుంచి సస్పెండ్ అయిన బీఆర్ఎస్ నేతలు పొంగులేటి,  జూపల్లిలు తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ కు వ్యతిరేకంగా బలంగా తీసుకువచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ను ఢీ కొనేందుకు వ్యూహరచన చేస్తున్నారు.  తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రైతు సమితి లలో దేనినో ఒక దాన్ని ఎంచుకుని బీఆర్ఎస్ ను దెబ్బకొట్టేలా ఎన్నికల బరిలోకి దిగేందుకు బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పేరుతోనే గట్టి పోటీ ఇవ్వాలని పొంగులేటి భావిస్తున్నట్టు సమాచారం. ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లలో గణనీయమైన పట్టు ఉన్న పొంగులేటి.. తనతో వచ్చిన వారిని కలుపుకుని ఇతర జిల్లాల్లోనూ బీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ దూరం పెట్టిందనే అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని వారిని డ్రైవ్ చేసేలా ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియను ఆయన మొదలుపెట్టినట్టు సమాచారం. 

కృత్రిమ మేథతో కోట్లాది మంది ఉపాధి గోవిందా?!

దేవుడిని మానవుడు ఆవిష్కరించినప్పుడు చరిత్ర మొదలైంది. ఇప్పుడు మానవుడే దేవుడిగా మారుతున్నాడా? ఇటీవలి వరకూ కంప్యూటర్లు మనతో భౌతిక నైపుణ్యాలు, ఉద్యోగాల విషయంలోనే పోటీ పడేవి.  తొలిసారి అవి మేధో నైపుణ్యాల విషయంలోనూ పోటీ పడుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం జెట్‌ వేగంతో పరుగులు పెడుతోంది.  కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతోంది. అది మానవ జీవితంలో స్పృశించని పార్శ్వమంటూ లేకుండా పోతోంది. మనుషుల స్థానాన్నే ఆక్రమిస్తోంది. ఈ క్రమంలో భవిష్యత్తులో ఎదురయ్యే సామాజిక, ఆర్థిక, సాంకేతిక మార్పులపై సర్వత్రా ఆసక్తి, ఆందోళన వ్యక్తమౌతోంది. టీవీలో మనం వార్తలు చూస్తూనే ఉంటాం. వివిధ కార్యక్రమాలు, షోలను హోస్ట్ చేసే యాంకర్లనూ చూస్తున్నాం. ఆ వార్తలు చదివే వారు, షోలను హోస్ట్ చేసే వాళ్లు నిజమైన మనుషులు కాకపోతే?  కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే డిజిటల్‌ రూపాలైతే?  ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(క‌ృత్రిమ మేధస్సు) తీసుకొస్తున్న విప్లవం అనాలో, ప్రమాదం అనాలో తెలియదుగానీ.. క్రమంగా మానవ సామర్థ్యాన్ని పెరుగుతున్న సాంకేతికత మింగేస్తోంది.  ఇప్పటి వరకూ రోబో ‘సోఫియా’ ఒక సంచలనం అనుకుంటుండగా.. తాజాగా ‘కృత్రిమ’ న్యూస్‌ యాంకర్ వచ్చేసింది! చూడటం, వినడం, తాకడం మాత్రమే కాదు.. అవసరానికి తగ్గట్టు మనుషులు ఎలా ప్రవర్తిస్తారో రోబో కూడా అలాగే ప్రవర్తించేట్లు, తనకు తాను కొత్తగా నేర్చుకునేట్లు అందులో ఒకరకమైన తెలివి తేటలను ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా అభివృద్ధి చేశారు. దీన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ అంటారు.  అలసట అన్నదే లేకుండా 24 గంటలూ పనిచేస్తుంది. కానీ.. ఇది జీవించి ఉన్న మహిళ కాదు. కంప్యూటర్ ప్రోగ్రామ్ అమర్చిన వర్చువల్ రోబోటిక్ న్యూస్ యాంకర్. ఇది టెక్స్ట్ టు స్పీచ్ ఫీచర్ ను ఉపయోగించి మాట్లాడే వీడియో.  సాధారణ యాంకర్ మాదిరిగానే పెదవులను కదుపుతూ, గొంతు, ముఖ కవళికలు, హావభావాలను సహజంగా ప్రదర్శిస్తూ అనేక భాషల్లో తాజా వార్తలను మనకు అందజేస్తుంది.  దీంతో మనం నిజమైన న్యూస్ యాంకర్ వార్తలు చదువుతుంటే చూసిన అనుభూతిని పొందుతాం. అందుకే  ఆ రోబో యాంకర్ ను వర్చువల్ యాంకర్ అని కూడా పిలుస్తారు. భవిష్యత్తులో ఈ రోబో న్యూస్ యాంకర్లు అన్ని దేశాలకూ విస్తరించినా ఆశ్చర్యం లేదు. ప్రజలు అప్లికేషన్ ద్వారా విద్య, గృహాలు, ఉద్యోగాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై న్యూస్ యాంకర్‌తో మాట్లాడొచ్చు. ఇప్పుడు న్యూస్ యాంకర్ల స్థానాన్ని ఏఐ యాంకర్లు ఆక్రమించుకునే సమయం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.  ఇండియా టుడే గ్రూప్ నకు చెందిన ‘ఆజ్ తక్’ న్యూస్ చానెల్ ‘సనా’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మహిళా న్యూస్ యాంకర్ ను ప్రవేశ పెట్టింది. ప్రముఖ జర్నలిస్టు సుధీర్ చౌదరి ఇటీవల నిర్వహించిన ‘బ్లాక్ అండ్ వైట్’ షో ద్వారా ‘సనా’  ప్రేక్షకులకు పరిచయమైంది.  సుధీర్ చౌదరితో కలిసి షో నిర్వహించిన ‘సనా’ వార్తలు కూడా చదివింది. ఈమె దేశంలోనే తొలి ఏఐ న్యూస్ యాంకర్ గా రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో తొలి ఏఐ న్యూస్ యాంకర్ ను చైనా నాలుగేళ్ల క్రితమే ప్రారంభించింది. చైనా సెర్చ్ ఇంజిన్ కంపెనీ సోగో,  చైనా న్యూస్ ఏజెన్సీ జిన్హువా సంయుక్తంగా రూపొందించిన ఒక పురుష ఏఐ న్యూస్ రీడర్ చైనా భాషతో పాటు ఇంగ్లీషులో వార్తలు చదువుతున్నాడు. ఏడాది తర్వాత మహిళా ఏఐ న్యూస్ రీడర్ ‘షిన్‌ షియావోమెంగ్‌’ ను కూడా ఆవిష్కరించారు.  జీవమనేది ప్రకృతి సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అయితే.. ప్రకృతి స్థానాన్ని ఇప్పుడు సైన్స్‌ ఆక్రమిస్తోంది. కంప్యూటర్‌ శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సు(ఏఐ)కు సంబంధించిన ఆల్గారిథమ్‌లను అభివృద్ధి చేస్తున్నారు. వాటికి అభ్యాస, విశ్లేషణ సామర్థ్యాలు ఉంటున్నాయి. ఇన్ఫోటెక్‌, బయోటెక్‌ల కలయికతో మనల్ని మెరుగ్గా విశ్లేషించే, మనతో సంభాషించే సామర్థ్యమున్న ఆల్గారిథమ్‌లకు మార్గం సుగమమవుతోంది. ఈ కృత్రిమ మేధస్సు, బయో ఇంజినీరింగ్‌తో కొత్త జీవజాతి పుట్టుకొస్తోంది. వీటివల్ల అనేక సమస్యలూ తలెత్తుతాయి. సాంకేతిక ఆవిష్కరణల కారణంగా కొన్ని దేశాలు సంపన్నమవుతాయి. ఇతర దేశాలు పేదరికంలో కూరుకుపోతాయి. ఇంతకీ ఆర్టిఫిషియల్ అంటే ‘కృత్రిమ’, ఇంటెలిజెన్స్ అంటే ఆలోచించే శక్తి ఉన్న ‘మేధస్సు’. ఏఐ అంటే మనిషి  తయారు చేసిన కంప్యూటర్ ప్రోగ్రామ్ కు ఆలోచించే, నేర్చుకునే సామర్థ్యాన్ని అందించడమే. మానవ మేధస్సును అనుకరిస్తూ మనుషులు సాధారణంగా చేసే పనులను సొంతంగా చేసుకోగలిగే శక్తిని అందించే యంత్రాలను తయారు చేయడమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అనేది నేర్చుకునే మరియు ఆలోచించగల సామర్థ్యం ఉన్న ప్రోగ్రామ్. ఏఐ ప్రధానంగా మూడు రకాలు. (1) బలహీనమైన ఏఐ (2) బలమైన ఏఐ (3) అత్యంత బలమైన ఏఐ. బలహీనమైన ఏఐ: ఒక పనిపైనే దృష్టి సారిస్తుంది. దాని పరిమితులను మించి పని చేయదు. ఉదాహరణకు ప్రస్తుతం మనం రోజువారీ ఉపయోగిస్తున్న యంత్రాలు.  బలమైన ఏఐ:  మానవుడు చేయగలిగిన ఏదైనా మేధోపరమైన పనిని అర్ధం చేసుకోగలుగుతుంది. మనం ప్రోగ్రామింగ్ చేసి పెడితే నేర్చుకొని మన సూచనలకు అనుగుణంగానే సొంతంగా చేస్తుంది. ఉదాహరణకు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు, ఏఐ న్యూస్ యాంకర్లు, ఏఐ లాయర్లు, చెస్ ఆడే యంత్రం. దానిలోని కృత్రిమ మేధను యాంత్రిక అనువాదం చేయడం సాధ్యం కాదు. పరిశోధకులు ప్రస్తుతం బలమైన ఏఐలను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవి మానవాళికి విరుద్ధంగా తయారయ్యే అవకాశాలు తక్కువ. ఎందుకంటే దాని పరిధి చాలా చిన్నది.  సూపర్ ఏఐ: ఇది మానవ మేధస్సును అధిగమిస్తుంది. అనేక రకాల పనులను మనుషుల కంటే మెరుగ్గా, చురుకుగా చేయగలిగే కృత్రిమ మేధ. పరిశోధకులు ఇప్పటికీ వీటిని తయారు చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. సూపర్ ఏఐ పరిశోధనలు ఫలప్రదమై మానవాళికి విరుద్ధంగా తయారయ్యే పరిస్థితి వస్తే..? నిజంగా అక్కడి దాకా వస్తే.. అది మానవాళికి విరుద్ధంగా తయారయ్యే ప్రమాదం లేకపోలేదు.  మేధస్సు కలిగిన కంప్యూటర్లు ఉద్యోగ మార్కెట్‌ నుంచి మానవులను గెంటివేస్తాయి. ఏఐ రోబో ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వర్ గానే కాకుండా టీవీ ఛానెళ్లలో వార్తలు చదివే యాంకర్ గా, లాయర్ గా న్యాయ సలహాలు అందించేందుకూ సిద్ధమైంది. త్వరలో కోడింగ్, సాఫ్ట్ వేర్ డెవలపింగ్, కంటెంట్ రైటింగ్, పారా లీగల్, న్యాయ సహాయం, మార్కెట్ రీసెర్చ్ విశ్లేషకులు, ఉపాధ్యాయులు, ఫైనాన్స్ పరిశ్రమలో కార్మికులు, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో, ఆడియో ఎడిటింగ్‌, అకౌంటింగ్, కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్టులు, వైద్యులు, డ్రైవర్లు, సైనికులు, బ్యాక్‌-ఆఫీస్‌ ట్రాన్సాక్షన్‌ ప్రాసెసింగ్‌, మార్ట్‌గేజ్‌.. ఇలా అన్ని రంగాల్లో ఏఐ రోబోలు పాగా వేయనున్నాయి. నటులు, సంగీతకారులు, గాయకులు, నిర్మాతలుగానూ ఏఐ రోబోలు అవతరిస్తారు. ఆయా రంగాల్లో 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఏడున్నర నుంచి 37న్నర కోట్ల మంది తమ ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుంది. అమెరికా, జర్మనీ, జపాన్, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని ఉద్యోగులకు ఎక్కువ నష్టం కలుగుతుంది.  ఆటోమేషన్‌ వల్ల కొత్త ఉద్యోగాలకూ కొదవ ఉండదు. సాంకేతిక పరంగా ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ యంత్రాల వెనుక, యంత్రాలతో పాటు మనుషులు ఉండాల్సిందే. తోటపని, ప్లంబింగ్‌, చిన్నపిల్లలు-వృద్ధుల సంరక్షణ తదితర పనులు రోబోలు చేయలేవు. ఇంధన పొదుపు తదితర విభాగాల్లో కొత్త ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుంది. అయితే.. కృత్రిమ మేధో ప్రపంచంలో 40% మందికి పని దొరికినా మిగిలిన 60% మంది పరిస్థితి దుర్భరంగా ఉంటుందనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఏఐతో వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి కొత్త ఉద్యోగాలను సృష్టించడమే సరైన వ్యూహం. సాంకేతిక మార్పులకు అనుగుణంగా మానవ శక్తిని సన్నద్ధం చేయడం, అందుకు ముందస్తు సన్నాహాలు చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి.   చాట్ జీపీటీ వంటి ఏఐ టెక్నాలజీతో భవిష్యత్తులో మానవాళికి ముప్పు పొంచి ఉందని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్, యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ తో సహా 1344 మంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కోట్లాది ఉద్యోగాలు పోవడంతో పాటు మానవాళి ఉనికికే ముప్పు తీసుకొచ్చే ఏఐను వెంటనే నిలిపివేయాల్సిన అవసరం ఉందంటూ బహిరంగ లేఖ రాశారు. చాట్ జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ ఏఐ కంపెనీ ఇటీవల జీపీటీ-4 పేరుతో అత్యాధునిక వ్యవస్థను పరిచయం చేసింది. జీపీటీ-4 కంటే శక్తిమంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు సమాజానికి, మానవాళికి ముప్పును తలపెట్టే ప్రమాదం ఉందని, ప్రతికూల ప్రభావాలు తలెత్తితే నియంత్రించగలమనే నమ్మకం కుదిరితేనే శక్తిమంతమైన ఏఐల దిశగా ముందుకెళ్లాలని సూచించారు. మరోవైపు ఏఐతో వచ్చే కుదుపులను తగ్గించుకోవడానికి, సర్దుబాట్ల సమయం తీసుకోవడానికి ఆటోమేషన్‌ వేగాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు భావించే వీలుంది. అయితే దీన్ని పూర్తిగా నిరోధించడం అసాధ్యం, అవాంఛనీయం. నేడు కారు ప్రమాదాల్లో ఏటా 12.5 లక్షల మంది చనిపోతున్నారు. వీటిలో మానవ తప్పిదాల వాటా 90% కన్నా ఎక్కువే. స్వయం చోదిత వాహనాలతో ఆ ముప్పు తగ్గిపోతుంది. ఆటోమేషన్‌పై ఆధారపడే సమాజంలో ప్రపంచ శక్తి సమతౌల్యమనే ప్రభుత్వాల నుంచి టెక్‌ కంపెనీల వైపు మొగ్గుతుంది. అందువల్ల ఈ కంపెనీలే ప్రభుత్వ అవతారం ఎత్తవచ్చు. ఈ సాంకేతిక పరిజ్ఞానంపై ప్రభుత్వాలు గుత్తాధిపత్యం చెలాయించే అవకాశమూ లేకపోలేదు.

కొత్త పొత్తుల మొలకలు నిజమేనా?

రాజకీయాల్లో అసాధ్యమన్న పదానికి స్థానం లేదు. పాలటిక్స్ లో శాశ్వత  మిత్రులు, శాశ్వత శత్రువులూ ఉండరని అంటారు. అంటే నేడు తిట్టుకున్ననేతలే.. రేపు చేతులు కలుపుకుంటారు. నేడు చెట్టాపట్టాలు వేసుకు తిరిగిన పార్టీలు రేపు విమర్శల కత్తులు దూసుకుంటాయి. రాజకీయాలలో ఇలాంటివన్నీ సహజమే అని ఎంత సరిపెట్టుకుందామనుకున్నా.. అలా సరిపెట్టుకోవడానికి కూడా నమ్మశక్యం కానీ కొన్ని వార్తలు జనాలనే కాదు.. పరిశీలకులను సైతం అయోమయానికీ, సంభ్రమాశ్చర్యాలకూ గురౌతుంటాం. అసలా వార్త నిజమా కాదా  అని నిర్ధారణ  అయ్యేదాకా వినడానికే ఎబ్బెట్టుగా అనిపిస్తుంటుంది. అలాంటి వార్త ఒకటి ఇప్పుడు రాజకీయవర్గాలలో సర్క్యులేట్ అవుతోంది. ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా.. సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్న ఆ వార్త ఏమిటంటే...  ఏపీలో ఎలాగైనా కాలు పెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న కేసీఆర్.. ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే కాదు.. స్వరాష్ట్రమైన తెలంగాణలో కూడా బలమైన పొత్తు లేదా అండ లేకపోతే ముందుకు సాగడం కష్టం అన్న నిర్ధారణకు వచ్చేశారు. ఈ విషయాన్ని ఎవరో ఆయన ప్రత్యర్థులు కాదు.. స్వయంగా బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అందుకే ఆయన ఉభయ తారకంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ బలమైన పార్టీ నిర్మాణం, క్యాడర్ ఉన్న తెలుగుదేశంతో జట్టు కట్టడానికి విశ్వయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం ఆయన ఏ అవకాశాన్నీ వదల దలుచుకోలేదు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ విధానాలనూ, వ్యవహరాశైలినీ, పాలనా తీరును తప్పుపడుతున్నారు. విమర్శలు చేస్తున్నారు. గత నాలుగేళ్లలో ఏపీ ప్రగతిని తెలంగాణ ప్రగతితో పోల్చి చూపుతున్నారు. తెలంగాణ మంత్రి, కేసీఆర్ కుమారుడు అయిన కేటీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి మరీ ప్రపంచంలోనే అమరావతి గొప్పనగరం అని కీర్తించడమే కాకుండా గత నాలుగేళ్లలో అక్కడి ప్రభుత్వ నిర్వాకం వల్ల అమరావతి కుంటుపడిందని విమర్శించారు. సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు కేసీఆర్ తెలుగుదేశంతో చెలిమికి తహతహలాడుతున్నారు. ఇందు కోసం ఆయన అన్ని దారులనూ వెతుకుతున్నారు. ఒక వైపు చంద్రబాబు బీజేపీ, జనసేనలతో  జట్టుకట్టేందుకు ప్రయత్రాలు చేస్తుంటే.. కేసీఆర్ మాత్రం తెలుగుదేశం పార్టీతో స్నేహం కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం ఆయన చంద్రబాబు వద్దకు జేడీఎస్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని రాయబారానికి పంపే యత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.  బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో విస్తరించాలంటే చంద్రబాబు లాంటి అనుభవజ్ణుడి అండ అవసరమన్నది కేసీఆర్ భావనగా తెలుస్తోంది.  వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను సమన్వయం చేయడంలో పార్టీల మధ్య పొత్తులు కుదర్చడంలో చంద్రబాబు అనుభవం బీఆర్ఎస్ విస్తరణకు దోహదపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. ఇక అందుకు లిట్మస్ టెస్టుగా కర్నాటక ఎన్నికలలో చంద్రబాబుతో సమన్వయం చేసుకుని జేడీఎస్ నేత కుమారస్వామి ని ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా బీజేపీయేతర పార్టీల ఐక్యతా యత్నాలను సరికొత్తగా ప్రారంభించాలన్న యోచనతో కేసీఆర్ వ్యూహాత్మకంగా చంద్రబాబుతో చెలిమికి చేయి చాస్తున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ కేసీఆర్ రాయబారాలకు తెలుగుదేశం నుంచి కానీ, చంద్రబాబు నుంచి కానీ ఎటువంటి స్పందనా రాలేదంటున్నారు. అయితే పరిశీలకులు మాత్రం ఏపీలో బీఆర్ఎస్ పొత్తు వల్ల ఒకింత ప్రయోజనం ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. బీఆర్ఎస్ ఏపీలో ఒంటరి పోరుకు దిగితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదో మేరకు ఆ పార్టీకి మళ్లే అవకాశం ఉందని, అలా కాకుండా బీఆర్ఎస్ కూడా తెలుగుదేశం జట్టులో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశాలే ఉండవని విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి చంద్రబాబు లేకుండా గతరెండేళ్లుగా బీజేపీయేతర కూటమి యత్నాలు జరుగుతున్నాయి కానీ అవి ఇసుమంతైనా సఫలం కావడం లేదు. కేసీఆర్, మమతా బెనర్జీ, స్టాలిన్, శరద్ పవార్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ ఇలా ఎవరికి వారుగా చేసిన ఐక్యతా యత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చందంగానే సాగాయి.  ఈ నేపథ్యంలోనే చంద్రబాబును కలుపుకుంటే కొత్త పొత్తుల మొలకలకు అవకాశం ఉంటుందని పరిశీలకులు సైతం అంటున్నారు.