కెసిఆర్ పార్టీలో 'ఆత్మహత్యల' పరకాయప్రవేశం !!

 

 

మహాభారతం చదువుకున్నవాళ్ళకు "ముసలం'' అనే మాట తెలిసి ఉంటుంది. "యాదవకులంలో ముసలం'' అన్న పదం అదే! అలాగే, తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికి, తద్వారా తన రాజకీయ నిరుద్యోగానికి ఒక పరిష్కారంగా తెలంగాణలో తిష్ఠవేసిన కోస్తాంధ్రుడు "బొబ్బిలిదొర''గా పలువురు చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖర రావు టి.ఆర్.ఎస్. అనే పార్టీనొకదాన్ని స్థాపించుకున్నది లగాయతూ తోటి తెలుగు వారందరినీ కలిపి "సీమాంధ్ర దోపిడీదారులు''గా ప్రకటించి విద్వేష ప్రచారం ప్రారంభించాడు. అది మొదలు, కొంతమంది యువకుల ఆత్మహత్యలను ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఫలితంగా "సీమాంధ్రులను తెలంగాణా ఆంధ్రుల మధ్యనుంచి వెళ్లగొట్టి, వారి భూముల్ని, వారి ఇళ్ళను, వారి సంస్థలను మనం స్వాధీనం చేసుకోవడంద్వారా ఉద్యోగాలన్నీ మనకే దక్కుతా''యన్న ప్రచారంద్వారా స్థానిక యువకుల్లో భ్రమలు, ఆశలు పురిగొల్పాడు. ఈ "పురి'' కొందరు తెలంగాణా యువకులపాటి టి.ఆర్.ఎస్. నాయకుడు కెసిఆర్ విధించిన 'ఉరి'గా మారి, రకరకాల పేరిట ఆత్మహత్యల్ని ప్రోత్సహించింది!


చివరికి ఈ "ప్రోత్సాహం'' కెసిఆర్ పార్టీ నిర్మాణ తీరుతెన్నుల పట్ల ఏ కరీంనగర్ జిల్లా తనదేనని కెసిఆర్ భ్రమిస్తున్నాడో సరిగ్గా ఆ జిల్లాలోనే అంతర్గత కుమ్ములాటల గురించి విన్నవించుకోదలచిన ప్రధాన కార్యదర్శి, జిల్లా యువజన విభాగం నాయకుడైన గుండా నాగరాజు ఆత్మహత్యకు దారితీసింది. తోటి తెలుగువారిపై కెసిఆర్ ప్రారంభించిన విద్వేష ప్రచారంలో మొదలైన ఆత్మహత్యలు కెసిఆర్ పార్టీలోకే ప్రవేశించక తప్పలేదు! నాగరాజు ఆత్మహత్య పార్టీలోని కుమ్ములాటల గురించిన తన విజ్ఞాపనను కెసిఆర్ పట్టించుకోనందుకే గాక, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన తనను "మంథని'' శిక్షణా తరగతుల సభావేదికపైకి సహితం కెసిఆర్ ఆహ్వానించక పోవడంతో తీవ్రంగా కలతచెందిన నాగరాజు సభావేదిక సమీపంలోనే పురుగుమందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లినా బతికించడం సాధ్యపడలేదు. ఇతర కార్యకర్తలయినా ఆస్పత్రికి వెళ్ళి నాగరాజు మృతికి కుటుంబాన్ని కలుసుకొని సంతాపం తెలియజేసివచ్చారు గాని, కెసిఆర్ ఆ ఛాయలకు కూడా వెళ్ళకుండా, సరాసరి హైదరాబాద్ కు ఉడాయించడం అందరినీ ఆశ్చర్యపరిచిందని కొన్ని పత్రికలు రాశాయి.



నాగరాజు మృతి వార్తను అన్ని పత్రికలూ ఒకలా రాయకుండా ప్రస్తుతపు "ఉద్రిక్త వాతావరణం''లో అగ్నికి ఆజ్యం పోయడం ఎందుకని భావించి, సెంటిమెంటు పేరిట నాగరాజు తెలంగాణా కోసం బెంగపడి ఆత్మహత్య చేసుకున్నట్టు కొన్ని పత్రికలు చిత్రించ జూచాయి. కాగా, తెలంగాణా వాదాన్ని బలపరచడం ద్వారా స్థానికంగా ఓ నాలుగు సీట్లయినా రాకపోతాయా అని భావించి అవకాశవాద రాజకీయాన్ని ఆశ్రయించి, అంతకుముందు తెలంగాణా రైతాంగసాయుధ పోరాటం ద్వారా వివిధ ప్రాంతాల్లో పరాయి పాలనల వల్ల చెల్లాచెదురై ఉన్న తెలుగువారందరినీ ఒక్క రాష్ట్రంగా (విశాలాంధ్ర) ఒక్క గొడుగుక్రింద సమీకరించిన కమ్యూనిస్టుపార్టీ దినపత్రిక "విశాలాంధ్ర'' నాగరాజు ఆత్మహత్య వార్తను యిలా అందించింది:



"టి.ఆర్.ఎస్.లో వర్గపోరుకు ఒకరు బలి : కె.సి.ఆర్. సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు ఆత్మాహుతి'' : మంథనిలో జరిగిన శిక్షణా తరగతులకు ఆ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్రావు హాజరయ్యారు. అయితే, టి.ఆర్.ఎస్. జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నాగరాజును (29) వేదిక మీదకు ఆహ్వానించకపోవటంతో మనస్థాపం చెందాడు. క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దానిని గమనించిన నాయకులు నాగరాజును వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ నాగరాజు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మంధని సి.పీ.ఐ. నేత కొవ్వూరి రాజలింగం, పట్టాన కార్యదర్శి సత్యనారాయణ, టిడిపి మంథని మండల అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాజ్య, పట్టాన అధ్యక్షులు లక్కాకుల వెంకన్న విలేకరులతో మాట్లాడుతూ నాగరాజు కుటుంబానికి కెసిఆర్ తక్షణం రూ.10 లక్షణ ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. నాగరాజు మృతికి కెసిఆర్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గినా దృష్ట్యా నాగరాజు కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన కారణంగా మంథనిలో టి.ఆర్.ఎస్. ఫ్లెక్సీలు, తోరణాలను నాగరాజు సహచరులు తొలగించడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి''



కాగా, "సాక్షి'' పత్రిక కూడా నాగరాజు తెలంగాణా కోసం 12ఏళ్లుగా కష్టపడ్డాడని, కాని ఈరోజు స్టేజీమీదికి ఆయన్ని రానివ్వకపోవటంతో అవమానంతో క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బావ ప్రభాకర్ ఆరోపించారు'' [07-06-20`13]
ఇక బొబ్బిలిదొర'' బందీగా ఉన్న 'టి'ఛానల్ ఒక్కటే నాగరాజు తెలంగాణా రాలేదనే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రకటించడం ఆ ఛానల్ చూస్తున్న కొద్దిమందికి సహజంగానే ఆశ్చర్యం కల్గించలేదు!



కాగా గత కొంతకాలంగా జరుగుతున్న విచిత్ర పరిణామాల వెనక రహస్యం ఎవరికీ బోధ పడడంలేదు. ఎందుకంటే, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని సజావుగానూ, సమర్థవంతంగానూ, ఆశాజనకంగానూ, పకడ్బందీగానూ, ఆత్మవిశ్వాసంతోనూ నిర్వహించడంలో ఆరితేరిన తెలంగాణా ప్రాంత ప్రజలు ఆత్మహత్యలకు పూర్తిగా వ్యతిరేకం. 1947-53 దాకా సాగిన నాటి సాయుధ పోరాటంలో ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోలేదు. కాని ఇప్పుడా పరిస్థితి ఎందుకు, ఎవరివల్ల వచ్చింది? తెలంగాణా యువతలో కొందరిని ఎందుకీ బలహీనత ఆవరించింది? అంతేగాదు, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల (తెలంగాణా, కోస్తాంధ్ర, రాయలసీమ)లో మిగతా రెండు ప్రాంతాలతో పోల్చితే, తెలంగాణలో ఎక్కువ ఆత్మహత్యలు జరగడానికి దారితీసిన పరిస్థితులేవి? ఈ ఆత్మహత్యలు యువతకే కట్టుబడకుండా తెలంగాణాలోని రైతులు, వ్యవసాయ కార్మికులు, బడుగు, బలహీనవర్గాల కుటుంబాల వరకూ వ్యాపించిపోవటానికి కారణం తెలంగాణా వాదమా లేక రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలూ ప్రధాన కారణమా? ఈ ప్రశ్నకు సాధికారికంగా సమాధానం చెప్పుకోకుండా ప్రజాసమస్యలను విశ్లేషించుకోలెము.

 

"పుట్టినబిడ్డ బారెడ''ని ఓ సామెత! అలాగే తన స్వార్థరాజకీయం కోసం "తెలంగాణా రాష్ట్రం ఇదిగో నేడో, రేపో, ఎల్లుండో'' అంటూ తెలంగాణా ప్రజల్ని మోసపుచ్చుతూ ఇప్పటికి కనీసం ఎంతలేదన్న డజనుసార్లు "ఉద్యమాన్ని'' వాయిదా వేసుకున్నాడు కెసిఆర్. ఈసారి 'వాయిదా' సరాసరి నవంబర్ కు నెట్టి, 2014 ఎన్నికల లక్ష్యం - "ఓట్లు, సీట్లేగాని'', తెలంగాణా కాదంటున్నాడిప్పుడు! అయితే మరి రాష్ట్రాన్ని ఎలా సాధిస్తాడట? కాంగ్రెస్ లోని టి.ఆర్.ఎస్.ను విలీనం చేయడంద్వారా, తాను ముఖ్యమంత్రి కావడం ద్వారానట! కాని ఈ మధ్యలో మరో 'చిట్కా' వదిలాడు. ఇది కూడా 'వాయిదాల'కు సంబంధించిందే! తెలంగాణా వస్తే గిస్తే 'దళితుడ్ని' ముఖ్యమంత్రిని చేస్తానని ఏడాదిన్నర నాడు ప్రకటించి, మళ్ళా ఇన్నాళ్ళూ ఆ వూసెత్తకుండా 2014 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరోసారి (02-0602013) ఈసారి "దళితుడే ముఖ్యమంత్రి'' అని నినదించాడు. కాని ఢిల్లీలో ఆంధ్ర భవన్ లోని దళిత అధికారిమీద 'దొర'తనం చేయిచేసుకుని గాయపరిచిన తరువాత 'నష్టపరిహారం'గా ఎన్నికలలో టి.ఆర్.ఎస్. కు ఓట్ల కోసం "దళితుడే ముఖ్యమంత్రి'' అన్న పొలికేకను వినిపించాడు! కానీ ఇతని రాజకీయ "చదరంగపు'' ఆటను, కుట్రను తెలంగాణలో దశాబ్దాల తరబడిగా 'దొర'ల, జాగిర్దార్ల,దేశ్ ముఖ్ ల దోపిడీ దౌర్జన్యాలను అనుభవించి కునారిల్లిపోయిన గిరిజన, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తరగతులు, తదితర బడుగువర్గాలన్నీ పసికట్టేశారు! ఎవరోకాదు, టి.ఆర్.ఎస్. ప్రధాన దళిత కార్యదర్శి ఎలా టి.ఆర్.ఎస్. నాయకత్వం బేరసారాల ద్వారా వందలకోట్లు వసూలు చేశారో బహిరంగంగా ఆరోపించి, ఆ నాయకత్వం ఎలా దళిత వ్యతిరేక నాయకత్వామో ఆరోపిస్తూ ప్రకటన విడుదల చేశాడు.



తెలంగాణలో జరుగుతున్నా ఆత్మహత్యల స్వరూపస్వభావాల గురించి, ఆత్మహత్యలకు కారణమైన సశాస్త్రీయ కారణాల గురించీ సాయీమనీష్ (bold) అనే పరిశోధకుడు జరిపిన సర్వే ఫలితాలను, వాటి విశేషాలనూ ఇటీవల ఒక నివేదిక రూపొందించాడు. ఆ నివేదనను భారతదేశ మ్యాగజైన్ జర్నలిజంలో, ప్రత్యేక పరిశోధక నివేదికల రూపకల్పనలో, అవినీతిని, అక్రమాలను వెల్లడించడంలో సాధికారతను, విశ్వసనీయతను దేశంలోనేగాక, విదేశాలలోనూ పొందిన తేజ్ పాల "తెహల్కా'' (2013, మార్చి 9న) ప్రచురించింది. ఆ ప్రత్యేక పరిశోధనలో సాయీమనీష్ తెలంగాణలో ఆత్మహత్యలకు కారణాలను విపులంగా వివరించాడు : "స్వేచ్చా టిబెట్, (ఫ్రీ-టిబెట్) పేరిట టిబెటనలు ఆత్మాహుతి చేసుకుంటుంటారు. సరిగ్గా తెలంగాణాలో ఆత్మహత్యల దృశ్యం కూడా అలాంటిదే. కాని, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ ఒక్కటే తెలంగాణాలో జరిగే ఆత్మహత్యలకు కారణం కాదు. అదే అసలు కథ కాదు'' అని చెబుతూ ప్రాంతంలో ఆత్మహత్యల పర్వం వెనక దాగిఉన్న అసలు కారణాల్ని మనీష్ నివేదిక యిలా వెల్లడిస్తోంది.


 
"2009 నవంబర్ కు 2012 జనవరి నెల మధ్య కాలంలో తెలంగాణలో జరిగిన ఆత్మహత్యల సంఖ్య 849. ఈ ఆత్మహత్యల్లో కొన్ని తెలంగాణా రాష్ట్రం సమస్యపై జరిగినవైతే, వాటిలో పెక్కు ఆత్మహత్యలు నానాటికీ తీసికట్టు అవుతున్న దారుణ సాంఘిక-ఆర్థిక పరిస్థితుల మూలంగా జరిగాయి. దుర్భరదారిద్ర్యం, రుణాలు చెల్లించలేని పరిస్థితులు, వ్యవసాయరంగ సంక్షోభం, ఉద్యోగావకాశాలు సన్నగిల్లిపోవటం, ప్రత్యేకరాష్ట్రం ఏర్పడకపోతే తెలంగాణా ప్రజలకు యిక భవిష్యత్తే లేదన్న నిరంతర రాజకీయ ప్రచార మత్తు ఫలితంగానూ - తెలంగాణాలో చేనేత పనివారు, రైతులు, విద్యార్థులు ఆత్మహత్యల వైపునకు నెట్టబడ్డారు. ఇలా ఒక వైపున అమూల్యమైన జీవితాలు కొడిగట్టి పోతూండగా మరొక వైపున ఆంధ్రప్రదేశ్ లో పరస్పరం దుమ్మెత్తిపోసుకునే రాజకీయ ప్రహసనం యదేచ్చగా సాగిపోతోంది. ఇక తెలంగాణా ఉద్యమంలో అట్టడుగు బలహీన వర్గాల ఆత్మహర్యాలు మానవుడి కనీసపు ఆత్మగౌరవానికి కూడా నోచుకోని పరిస్థితులలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా స్పష్టంగా, వాస్తవం చెప్పాలంటే తెలంగాణా పేరిట ఆత్మహత్యలు చేసుకున్నవారిలో దాదాపు అందరూ షెడ్యూల్డ్ కులాలు (ఎస్.సి.) షెడ్యూల్డ్ తరగతులకు (ఎస్.టి.) లేదా వెనుకబడిన తరగతులకు (బి.సి.లు)చెందినవారేగాని, తెలంగాణా రాష్ట్రసమితి నాయకుడు, వెలమ కులానికి చెందిన కె.సి.ఆర్. కులంనుంచి ఒక్కడంటే ఒక్కడూ ఆత్మహత్య చేసుకున్నట్టు ఎక్కడా నమోదు కాలేదని ఈ సందర్భంగా గుర్తించాలి ... ఒక వైపున ఈ ఆత్మహత్యల్ని రాజకీయ సమస్యకు ఉద్రేకపూరిత స్పందనలుగా ప్రచారం చేస్తూండగా, రాష్ట్రంలోని రాజకీయవేత్తలు ఇంకొక వైపున నిరుద్యోగం, అనంతమైన రుణభారం లాంటి ప్రజాసమస్యలను బాపకిందకు తోసేసి, వ్యక్తుల దారుణ విషాద ఘటనలకు ప్రాధాన్యమిచ్చి ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు ....



అంతేగాదు, మనీష్ తన నివేదికలో యింకా యిలా తెలియజేశాడు : "1996 నుంచి 2007 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఆత్మహత్యల్లో మూడింట రెండు వంతులు తెలంగాణాలోనే నమోదయ్యాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా తెలంగాణాలో దుర్భిక్ష పరిస్థితులవల్లం కొత్తరకం పత్తివిత్తనాలు విఫలమవటంవల్ల, 2004 మే నుంచి 2005 నవంబర్ మధ్యకాలంలో చేనేత పనివారు జీవనభృతికి దూరం కావడంవల్ల - మొత్తం రాష్ట్రంలో జరిగిన 1068 ఆత్మహత్యల్లో తెలంగాణాలో నమోదైనవి 663 ఆత్మహత్యలు. ఈ లెక్కన కూడా ప్రాంతాలలోనూ ఒక్కొక్క ప్రాంతంలో పరిస్థితిని విశ్లేషించగా [కోస్తాంధ్రనుంచి ప్రకాశంజిల్లా, తెలంగాణా నుంచి మెదక్ జిల్లా, రాయలసీమలో అనంతపురం జిల్లా], ఎక్కువ ఆత్మహత్యలు కోస్తాంధ్ర, రాయలసీమల్లోని అగ్రకులాల్లో నమోదుకాగా, తెలంగాణాలో మాత్రం ఈ ఆత్మహత్యలు అగ్రకులాలు, షెడ్యూల్డ్ కులాలు, తదితర వనుకబడినవర్గాల మధ్య నమోదదయ్యాయి. తెలంగాణాలో దళితులు, వెనుకబడిన కులాలలో ఆత్మహత్యలు తరచుగా సర్వసాధారణమయ్యాయి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రోద్యమంలో 2009-10 సంవత్సరాల మధ్యన, 2009 నవంబర్, 2010 ఫిబ్రవరి మధ్యకాలంలో 313 ఆత్మహత్యలు నమోదుకాగా, వాటిలో 218 ఆత్మహత్యలకు పాల్పడ్డవారు 18-50 సంవత్సరాల మధ్య వయస్సుగల వాళ్ళు.




"వీటిలో ఎక్కువ ఆత్మహత్యలు కెసిఆర్, అతని మేనల్లుడు హరీష్ రావు విద్యోశక తరహా అపహాస్యపు ప్రకటనలకు లోనవడం వల్ల జరిగాయి. ఆ ఏడాది నవంబర్ 29న హరీష్ రావు కిరోసిన్ మీద పోసుకున్నాడు కాని నిప్పంటించడానికి అగ్గిపెట్టె దొరక్కపోవటం ఒక అట్టహాసంకాగా, పగిలిన గాజుముక్కతో కోసుకుని చస్తానన్న కెసిఆర్ బెదిరింపు మరొక అపహాస్యపు ఘటన'' అని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి చేప్పార''ని మనీష్ ఉదాహరించారు. అప్పటికే గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టబడ్డ యువకుల్లోనూ ఇతరుల మనస్సుల్లోకి కెసిఆర్, హరీష్ రావుల అపహాస్యపు పనులు ప్రమాదకరమైన సందేశం ఎక్కించినట్టయింది. ఈలాంటి సందేశం ద్వారా తమ బాధలన్నింటికీ పరిష్కారం తెలంగాణా ప్రత్యేక రాష్ట్రమేనన్న అభిప్రాయాన్ని ప్రజలకు పదే పదే గుర్తుచేస్తున్నట్టయింది. ఇలాంటి చర్యల ద్వారానే [ఆత్మహత్యలకు పాల్పడడం ద్వారానే] తమ జీవితాలు సార్థ్యక్యం పొందుతాయనీ, తాము తద్వారా 'హీరోలు'కావడానికి ఇది మంచి అవకాశమని పెక్కుమంది యువకులు భావించారన్న'' ప్రొఫెసర్ సింహాద్రి అభిప్రాయాన్ని శ్రీకృష్ణ కమిటీ కూడా తన నివేదికలో ప్రతిధ్వనించడం గమనార్హం. ఇదంతా కెసిఆర్ వాచాలత్వం, ఉదార ఫలితమని రుజువైంది. కనుకనే ఈలాంటి విస్మయకర దృశ్యాన్ని మనస్తత్వ శాస్త్రజ్ఞులు "మారిలిన్ మన్రో సిండ్రోమ్'' (మానసికస్థితి) అని నామకరణం చేశారనీ తాము అనుకున్న లక్ష్యం నెరవేరక విఫలమైనప్పుడు ఆ బలహీనతతో కొందరు గుడ్డిగా ఆత్మహత్యలకు పాల్పడతారనీ మనీష్ నివేదిక తెలిపింది.


ఇందుకు ఉదాహరణగా మనీష్ హైదరాబాద్ లోని ఒక స్థానిక రెస్టారెంట్ లో తన విద్యా ఖర్చుల కోసమని పనిచేస్తున్న యాదయ్య అనే అనాథ యువకుడు ఉస్మానియా విద్యార్థీకాడు, ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడూ కాడు. కాని అతను ఆత్మహత్య చేసుకున్నది తెలంగాణా రాష్ట్రం కోసం కాదు, ఆర్థిక బాధలవల్ల ఆ పనిచేశాడు. కాని అతని ఆత్మహత్యను ఓ టి.వి.ఛానల్ 'లైవ్' చూపింది. అది చూసిన వెంటనే నానాబాపతు రాజకీయాలూ యాదయ్య ఆత్మహత్యను తెలంగాణా కోసం జరిగిన ఆత్మహత్యగా ముద్రవేయడానికి తొక్కిసలాడుకొన్నారు. అయితే యాదయ్య వద్ద ఉన్న అనేకమంది ఫోటో జర్నలిస్టులు చెప్పారు : "యాదయ్య చనిపోతూ రక్షించండి, రక్షించండి'' అంటూ కేకలు పెట్టాడనీ, టి.ఆర్.ఎస్. వర్గం చెప్పుకుంటున్నట్టు యాదయ్య నోట "జై! తెలంగాణా'' అన్న నినాదమే వినిపించలేదనీ చెప్పారు! టెలివిజన్ ప్రసారాలు చూసి ఎక్కువమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, రాజకీయవేత్తలు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల్ని పొగడ్తలతో ముంచెత్తడం ద్వారా తెలంగాణాలోని విద్యార్థులలో ఆత్మహత్యా ధోరణులను పెంచుతున్నారని హైదరాబాద్ మనస్తత్వశాస్త్ర అధ్యయన సంస్థ శాస్త్రవేత్త డయానా మాంటిరొ ఆరోపించారు. అందుకే భూస్వామ్య వ్యవస్థ తాలూకు మనస్తత్వాలూ, నిరంతర సమస్యలూ చింత చచ్చినా పులుపు చావదన్నట్టు అంతతేలిగ్గా, త్వరగా పోవని మనీష్ వ్యాఖ్యానించాడు! అన్నివందలమంది ఆత్మహత్యలకు ప్రోత్సాహకుడు, కారకుడయిన సీమాంధ్ర "బొబ్బిలిదొర'' కెసిఆర్ దివంగతులయిన యువకుల కుటుంబాల ధర్మాగ్రహానికి అర్హుడు కాక తప్పదు!

2026.. పొలిటికల్ హీట్ మామూలుగా ఉండదుగా?

 2025కు గుడ్ బై చెప్పేసి.. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టి మూడు రోజులు అయ్యింది. గత నాలుగైదు రోజులుగా కొత్త సంవత్సర వేడుకల సన్నాహాలు, వేడుకలతో అంతా బిజీబిజీగా గడిచిపోయింది. ఇప్పుడు ఇక కొత్త సంవత్సరం ఎలా గడవబోతోంది అన్న విషయంపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది.  అది పక్కన పెడితే రాజకీయ పార్టీలకు మాత్రం కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి.  పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు  2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాలతో పాటు  అసోం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా 72 రాజ్యసభ స్థానాలకూ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 2026ను పరిశీలకులు ఎన్నికల నామ సంవత్సరంగా అభివర్ణిస్తున్నారు.  ముందుగా తమిళనాడు విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమి అధికారంలో  ఉంది.  ఈ రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వచ్చే ఏప్రిల్‌లో అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. ఏప్రిల్ కు ముందే తమిళనాడులో ఎన్నికలు జరగుతాయి.  ఇప్పటి వరకూ ఉనికి మాత్రంగానే రాష్ట్ర రాజకీయాలలో ఉన్న బీజేపీ ఈ సారి తమిళనాడుపై భారీ అశలే పెట్టుకుంది. అందుకే ఆ రాష్ట్రానికి చెందిన ఓబీసీ నాయకుడు సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతిని చేసి ఆ రాష్ట్ర ప్రజల గుడ్ లుక్స్ లో నిలవడానికి ప్రయత్నించింది. తమిళనాడులో మరో ప్రాంతీయ పార్టీ అన్నాడీఎంకే జయలలిత మరణానంతరం నామావశిష్ఠంగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. ఇక కొత్తగా తమిళ రాజకీయాలలోకి తమిళ వెట్రి కజగం (టివికే) అనే పార్టీ అడుగు పెట్టింది. తమిళ నాట అశేష్ అభిమానులు ఉన్న హీరో విజయ్ నేతృత్వంలోని ఈ పార్టీ ప్రభావం ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.   ఆ తరువాత ఈ ఏడు ఎన్నికలు జరగనున్న మరో కీలక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కాలపరిమితి ఈ ఏడాది మేతో ముగియనుంది. ఈ రాష్ట్రంలో మొత్తం మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.ఇక్కడ గత మూడు దఫాలుగా  మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది. ఈ  సారి ఇక్కడ ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో కమలం పార్టీ ఉంది.   బంగ్లాదేశ్ నుంచి చొరబాటు దారుల కారణంగా  పశ్చిమ బెంగాల్ లో స్థానికులకు ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న కమలనాథులు, అదే సమయంలో చొరబాట్లకు తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలుస్తున్నారన్న విమర్శతో ఇప్పడ ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టేశారు.   ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మరో కీలక రాష్ట్రం కేరళ. ఇక్కడ వామపక్షాలు అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.  ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలొ తమకు అవకాశాలున్నాయనడానికి నిదర్శనంగా బీజేపీ భావిస్తోంది.  ఇలా ఉండగా బీజేపీ ఇంత వరకూ తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళలో ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. ఆ ట్రెండ్ ను బ్రేక్ చేసి ఈ రాష్ట్రాలలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో కమలనాథులు వ్యూహాలు పన్నుతున్నారు. కేంద్ర పాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ + బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది.  ఇక్కడ కూడా ఈ ఏడాది ఏప్రిల్‌తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది.   అలాగూ అసోం అసెంబ్లీ గడువు కూడా ఈ ఏడాది మేతో ముగియనుంది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది.  వచ్చే మేతో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఇక్కడ తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించగా,  మరోవైపు కాంగ్రెస్ కూటమి కూడా బలంగానే ప్రయత్నాలు చేస్తున్నది.  ఏది ఏమైనా 2026 ఏడాది మొత్తం పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో కొనసాగేలా కనిపించడం ఖాయం. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. 

అందెశ్రీ కుటుంబానికి అండ!

ప్రముఖ కవి అందెశ్రీ కుటుంబానికి అండగా నిలిచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా అందెశ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి వీలుగా 1994 ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, వేతన నిర్మాణ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర శాసన సభలో శనివారం (జనవరి 3) ప్రవేశపెట్టింది.  తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం  అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపె ట్టామన్నారు. 1994 చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం 7991 మంది తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని తెలిపారు. అందులో కొందరు ఉద్యోగులు కోర్టుకు వెళ్లి గతం నుంచి రెగ్యులరైజ్ చేయాలని ఆర్డర్ తెచ్చారని ప్రస్తావించారు మల్లు భట్టి విక్రమార్క. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు 573/225, 1.1.1995కి ఇది విరుద్ధమని చెప్పుకొచ్చారు. వెనుక తేదీ నుంచి రెగ్యులరైజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై రూ.20వేల కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు. ఏపీలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ప్రాస్పెక్టివ్‌గా చట్ట సవరణ చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం 25.11.2025న ప్రాస్పెక్టివ్ రెగ్యులరైజేషన్ కోసం ఆర్డినెన్స్ 88 తెచ్చిందని తెలిపారు. ఈ ఆర్డినెన్సును బిల్ నంబర్ 7ద్వారా సభ ఆమోదం కోరుతున్నామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

బంగ్లా తరహా ఉద్యమాలతోనే మోడీని సాగనంపగలం

ఇటీవలి కాలంలో తరచుగా రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పెనుదుమారానికి కారణమౌతున్నాయి. సమాజంలో హింసా, ద్వేషాలను రగిల్చే విధంగా ఉంటున్నాయి. ప్రాంతీయ వైషమ్యాలు, మత విద్వేషాలకు తావిచ్చేలా నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసనలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ)ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ) జాతీయ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా చేసిన వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారానికి తెరలేపాయి. దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు. ఆయా దేశాలలో ప్రభుత్వాలను గద్దె దించడానికి హింసాత్మక ఆందోళనలు జరిగాయనీ, అటువంటివే భారత్ లో కూడా జరిగితే తప్ప.. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించలేమని అభయ్ సింగ్ చౌతాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశంలో.. శ్రీలంకలో, బంగ్లాదేశ్‌లో యువత ప్రభుత్వాన్ని ఎలా తరిమి కొట్టారో, అదే తరహా పద్ధతులను భారత్‌లోనూ అమలు చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై  బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, చౌతాలా వ్యాఖ్యలు భారత రాజ్యాంగ వ్యవస్థకు, ప్రజాస్వామ్య నియమాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇది విపక్ష నేతల  దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక  వైఖరికి నిదర్శనమన్నారు.   రాజకీయ లబ్ధి కోసమే దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. విపక్షాలకు  దేశ ప్రయోజనాల కంటే రాజకీయ లబ్ధికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.  మొత్తం మీద అభయ్ సింగ్ చౌతాలా వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించేలా, దేశంలో హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

వైసీపీ బాటలోనే బీఆర్ఎస్?.. అసెంబ్లీ బహిష్కరణకు నిర్ణయం

పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఒక్క ఓటమితో కుదేలైపోయిందా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కోలేక పలాయన మంత్రం పఠిస్తోందా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. ఆ పార్టీ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం అందులో భాగమేనని అంటున్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే అసెంబ్లీని బహిష్కరించి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇప్పుడు పార్టీ సభ్యులు కూడా అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  దీంతో రాజకీయ వర్గాలలో బీఆర్ఎస్  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అడుగుజాడలలో నడుస్తోందని అంటున్నారు. ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంంది.   సోమవారం (జనవరి 4)న సభకు హాజరై.. మంగళవారం (జనవరి 5) నుంచి అంటే సభలో కృష్ణ, గోదావరి జలాలపై చర్చ జరిగే సమయానికి అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పరిశీలకులు మాత్రం సభలో కాంగ్రెస్ ను దీటుగా ఎదుర్కోనేందుకు సభాపక్ష ఉప నేతల నియామకం తరువాత బీఆర్ఎస్ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం ఏమిటన్న ప్రశ్నకు ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి రేవంత్ రెడ్డికి క్రెడిట్ దక్కే చాన్స్ ఇవ్వవద్దన్య వ్యూహంతోనే బీఆర్ఎస్ ఈ బాయ్ కాట్ నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా అసెంబ్లీలో నదీ జలాలపై చర్చను బీఆర్ఎస్ బాయ్ కాట్ చేయడమంటే.. పలాయన మంత్రం పఠించడమేనని పరిశీలకులు భావిస్తున్నారు.   అయితే నిన్న మొన్నటి వరకూ నదీ జలాల అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎండగడతాం అంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ ఇంత హఠాత్తుగా బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక వేళ కేసీఆర్ సభకు హాజరైతే.. జల వివాదాలకు ఆయనే సమాధానం చెబుతారు. అయితే కేసీఆర్ గైర్హాజరౌతున్న నేపథ్యంలో ఇటీవల శాసనసభాపక్ష ఉప నేతగా నియమితులైన హరీష్ రావు సభలో బీఆర్ఎస్ తరఫున ప్రసంగించాల్సి ఉంది. అదే జరిగితే సభ సీఎం రేవంత్ వర్సెస్ హరీష్ రావు అన్నట్లుగా మారిపోతుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ డమ్మీ అయిపోతారు. ఇప్పటికే శాసనసభాపక్ష ఉప నేతగా హరీష్ రావు నియామకం కేటీఆర్ ను ఒకింత తక్కువ చేసినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఇక జలవివాదాలపై హరీష్ రావు గట్టిగా గళం విప్పితే కేటీఆర్ పరిస్థితి పార్టీలో మరింత దిగజారుతుందన్న భావనతోనే బీఆర్ఎస్ ఆకస్మికంగా అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి సీఎం రేవంత్, హరీష్ మధ్య కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయనీ, వారిరువురి మధ్యా అరగంట భేటీ జరిగిందనీ బీఆర్ఎస్ అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించిన గంటల వ్యవధిలో బీఆర్ఎస్ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో సంక్షోభం ముదిరేలా చేసుకోవడం కంటే.. జనం పలాయనం అనుకున్నా అసెంబ్లీ బాయ్ కాటే మేలని బీఆర్ఎస్ నిర్ణయించుకునట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విశేషమేంటంటే  పార్టీ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయాన్నిస్వయంగా హరీష్ రావే ప్రకటించడం విశేషం.

కేసీఆర్ తోనూ ఢీ అంటే ఢీ.. కవిత మాటల అర్ధం అదేనా?

తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని ఖతమేనా? ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు కవిత ఇదే విషయాన్ని ఒకింత నర్మగర్బంగా చెప్పారా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఆరంభం సందర్భంగా సభకు వచ్చి ఓ ఐదారు నిముషాలు సభలో కూర్చున్న బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు కల్వకుంట్ల కేసీఆర్..  ఆ తరువాత  సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. అయితే.. ఆ రోజు సభలో ఏ విషయంపైనా చర్చ జరిగే అవకాశం లేనందున ఆయన సభనుంచి వెళ్లిపోయారనీ, కొత్త సంవత్సరం రెండో తేదీ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రేవంత్ సర్కార్ ను అడుగడుగునా ఇరుకున పెట్టి తన విశ్వ రూపాన్ని చూపిస్తారనీ బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు గట్టిగా చెప్పారు. అదే నమ్మారు. అయితే కేసీఆర్ మాత్రం సభలో పార్టీ గొంతు గళంగా వినిపించేందుకు ఉప నాయకులను నియమించడంతో.. ఆయన ఈ శీతాకాల సమావేశాలలో ఇక సభలో కనిపించరని పరిశీలకులు ఆ రోజే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు.  ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవిష్యత్ పై తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సభకు కేసీఆర్ డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఇక ఖతమే అని అన్నారు.  శుక్రవారం (ఫిబ్రవరి 2) శాసనమండలి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో  చిట్ చాట్ చేసిన ఆమె.. తన తండ్రి కేసీఆర్ కే  సవాల్ విసిరారు. ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. తప్పు చేయకుంటే కేసీఆర్ సభకు రావాలని సవాల్ విసిరారు.   అధినాయకుడు అసెంబ్లీకి రాకుండా..  పిల్ల కాకులకు సభాసమయాన్ని వదలడం సరికాదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కు ప్యాకేజీలు, అమ్ముకోవడం తప్ప ఏం తెలియదని ఎద్దేవా చేశారు.   హరీష్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య బాండ్ ఉందని ఆరోపించిన ఆమె హరీష్ సీఎం చాంబర్ లో అరగంట సేపు ముచ్చటించడం నిజం కాదా అని ప్రశ్నించారు.   అసెంబ్లీలో  మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించిన ఆమె..  రేవంత్ వర్సెస్ హరీష్ అన్నట్లుగా అసెంబ్లీ చాలా ప్రమాదకరమన్నారు.  కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ పై నేరుగా అటాక్ చేయడం ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ తో తాను మాట్లాడి నాలుగు నెలలు పైనే అయ్యిందన్నారు.  కేటీఆర్, హరీష్ లకు పార్టీని వదిలేయడంపై ఆమె ఈ సందర్భంగా కేసీఆర్ ను తప్పుపట్టారు.  ఇలా మాట్లాడడం ద్వారా ఆమె తాను కేసీఆర్ తో డీ అంటే ఢీ అనడానికి రెడీ అన్న సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత తన శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. శుక్రవారం (జనవరి 2) కూడా ఆమె శాసనమండలి స్పీకర్ ను తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. 

సొంత ఇంటి పంచాయతీ పరిష్కరించలేక చేతులెత్తేశారు.. కేసీఆర్ పై రఘునందన్ విమర్శలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున ఆయనపై బీజేపీ ఎంపీ రఘునందనరావు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తీరు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్న చందంలా ఉందన్నట్లుగా ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఇతరుల పంచాయతీలను పరిష్కరించడంలో గొప్ప ఉత్సాహం చూపిస్తారనీ, అయితే సొంత ఇంటి పంచాయతీల పరిష్కాం విషయంలో మాత్రం చేతులెత్తేశారనీ అన్నారు. గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.  ఇక కల్వకుంట్ల కవిత సొంత దారి చూసుకున్నారనీ, నేడో, రేపో ఆమె కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమనీ జోస్యం చెప్పారు.  అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహన అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డిలు లేచి నిలబడకపోవడం వారి విచక్షణకు సంబంధించిన విషయమన్న రఘునందనరావు.. కేటీఆర్ కు ముఖ్యమంత్రి కావాలన్న యాంబిషన్ ఉందనీ, అయితే అది సాకారం అవ్వాలంటే ఉండాల్సిన మద్దతు కేటీఆర్ కు సొంత పార్టీ నుంచే కరవైందన్నారు.  పార్టీ దాకా ఎందుకు ఆయనకు సొంత కుటుంబంలోనే మద్దతు లేదని చెప్పారు.  ఈ పరిణామాలన్నిటినీ నిశబ్దంగా గమనిస్తున్న హరీష్ రావు సమయం కోసం వేచి చూస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న రఘునందనరావు.. కావాలంటే ఈ విషయాన్ని తాను రాతపూర్వకంగా కూడా చెబుతానన్నారు.  ఇక రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలపై స్పందిస్తూ.. ఏ పార్టీలోనైనా అభిప్రాయబేధాలు సహజమని కొట్టి పారేశారు.  దశాబ్ద కాలం బీఆర్ఎస్ పాలనను.. రెండేళ్ల కాంగ్రెస్ పాలననూ చూసిన తెలంగాణం ఇప్పడు బీజేపీకి పట్టం గట్టాలని ఉవ్విళ్లూరుతున్నారన్నారు.  

బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డిపై కాల్పులు

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై కర్నాటకలోని బళ్లారిలో హత్యాయత్నం జరిగింది. ఆయనపై స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు కాల్పులు జరిపి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీవిషయంలో  తలెత్తిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.   ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి  గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో  కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. అలాగే తొలుత కాల్పులు జరిపిన సతీష్ రెడ్డి గాయపడ్డాడు.   స్థానిక ఎమ్మెల్యే భరరత్ రెడ్డి, గాలి జనార్థన్ రెడ్డిల మధ్య దీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉన్న సంగతి విదితమే.  భరత్ రెడ్డి వర్గం వారు గాలి జనార్ధన్ రెడ్డి నివాసం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఘర్షణకు దారి తీసింది.  కాగా ఈ కాల్పుల ఘటన నేపథ్యంలో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొడంతో  పోలీసులు 144వ సెక్షన్ విధించారు. బళ్లారిలో ప్రధాన నాయకులు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు.  

కొత్త సంవత్సరంలో కవిత వార్ కొత్త పుంతలేనా?

బీఆర్ఎస్ వర్సెస్ కవిత వార్ కొత్త సంవత్సరంలో కొత్త పుంతలు తొక్కబోతున్నది. ఇప్పటి వరకూ ఘాటుగా విమర్శలు చేస్తున్నా కవిత తన విమర్శలను ఒకింత సున్నితంగా చిన్నపాటి సూదిమొన గుచ్చినట్లుగా చేస్తు వచ్చారు. అయితే ఇక ముందు అంటే కొత్త సంవత్సరంలో తాను ఇంకెంత మాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగుతానని.. ఈ ఏడాది చివరి రోజున కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఆయన ఈ సారి కేటీఆర్ లక్ష్యంగా కూడా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.  కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరితే.. తాను మాత్రం   2006 లో  సొంతంగా తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశాననీ, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ అన్న విషయానికి తెలంగాణ సాధన ఉద్యమంలో అగ్రస్థానం కలిగేలా చేశాననీ చెప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ తాను ఇండిపెండెంట్ గానే పాల్గొన్నా నన్నారు.  తెలంగాణ ఆవిర్భవించి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ తీరులో మార్పు వచ్చిందని కవిత అన్నారు.  అప్పుడే తన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం తనకు కలిగిందన్న కవిత..  తన ఫోన్ ను తన భర్త పోన్ ను ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను అప్పుడే పార్టీ దృష్టికి తీసుకువచ్చినా తేలికగా తీసుకున్నారని కవిత చెప్పారు. అదే కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేయిస్తే తేలికగా తీసుకుంటారా అని ప్రశ్నించిన ఆమె,  మా ఇంట్లో పని చేస్తున్న ఒకరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో  సిట్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడే తన ఫోన్, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న విషయం అర్ధమైందన్నారు.  మహిళలకు అవకాశం ఇచ్చే విషయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సరిగా వ్యవహరించలేదని తండ్రి నిర్ణయాలను సైతం తప్పుపట్టిన కవిత.. కేసీఆర్ హయాంలో 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తే.. వారిలో కనీసం ఒక్క మహిళ కూడా లేని విషయాన్ని ఎత్తి చూపారు. ఆ నాడే తాను తన తండ్రిని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు.  ఇక హరీష్ రావుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. హరీష్ రావును తెలంగాణ చంద్రబాబుగా అభివర్ణించారు. ఏడాది ముగుస్తున్న సమయంలో ఆమె పాడ్ కాస్ట్ లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వచ్చే సంవత్సరం కవిత బీఆర్ఎస్ పై ఇప్పటి వరకూ చేస్తున్న యుద్ధం కొత్త పుంతలు తొక్కబోతోందన్న విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఇప్పటి వరకూ తన సోదరుడిని హరీష్ ముంచేస్తారు, తన తండ్రిని తప్పుదోవపట్టిస్తారు అంటూ వచ్చిన కవిత.. ఇప్పుడు మొత్తంగా పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా మొత్తం అందరిపైనా యుద్ధం ప్రకటించేసినట్లైంది. 

మెగా ఫ్యాన్స్ వర్సెస్ నాగబాబు.. జనసైనికులు ఎటువైపు?

జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబు కొద్ది కాలంగా ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు, వినిపించడం లేదు. అటువంటి నాగబాబు.. నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన కామెంట్లకు కౌంటర్ ఇవ్వడం ద్వారా ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. జనసేన ఎమ్మెల్సీగా.. ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు పని చేసుకుంటూ పోతున్న నాగబాబు.. శివాజీ కామెంట్లకు కౌంటర్ ఇచ్చి, మెగా ఫ్యాన్స్ కు టార్గెట్ గా మారారు. శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు  కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.   వాస్తవానికి మెగా కాంపౌడ్ అంత పటిష్ఠంగా ఉండటానికి నాగబాబే కారణమని అంటుంటారు, ఆయన నాగ‌బాబు లేకుండా మెగా కాంపౌండ్ ఇంత స్ట్రాంగా నిల‌బ‌డే ఛాన్స్ లేదనే వారు కూడా చాలా మంది ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి అయినా, మెగాపవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అయినా.. తాము మాట్లాడితే ఇబ్బంది అనుకునే విషయాలను నాగబాబు నోట పలికిస్తారని వారిని దగ్గరా తెలిసన వారు చెబుతుంటారు.   ఇందుకు ఉదాహరణగా అల్లు అర్జున్ గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసిన సందర్భంలో కానీ,  ఇండస్ట్రీలో చిరుకు మద్దతుగా గళం విప్పే అంశంలో కానీ నాగబాబు ఎలాంటి శషబిషలూ లేకుండా ముందుకు వచ్చిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ఇక తన స్వంత కుమార్తె నీహారిక విషయంలో ఆమె పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అండగా నిలబడిన ఉదంతాన్నీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నాగబాబును జనసేన నుంచి సస్పెండ్ చేయాలంటూ చేస్తున్న డిమాండ్ ను జనసైనికులు కొట్టి పారేస్తున్నారు. మహాళల వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో నాగబాబు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని ఆయనకు అండగా నిలబడుతున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ అనవసర అంశాన్ని ఇంకా పొడిగించకుండా కామైపోవడం మంచిదని హితవు చెబుతున్నారు.  

గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు రేహాన్ వాధ్రా గాంధీయేనా?

రాహుల్ గాంధీ నెహ్రూ గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు.  కాంగ్రెస్ పార్టీకి ప్ర‌స్తుత‌ం పెద్ద దిక్కు. ద‌శా దిశా దిస్కూచి కూడా రాహుల్ గాంధీయే. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి కూడా ఆయనే. అందులో సందేహం లేదు. అయితే.. రాహుల్ తరువాత కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా చూసిన ఆయన సోదరి ప్రియాంక వధేరా గాంధీ కుమారుడు   రేహాన్ వాద్రానే వార‌సుడు. అందుకు కారణం రాహుల్ గాంధీ అవివాహితుడిగా ఉండటమే. ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.   అదే రాహుల్ గాంధీకి వివాహమై ఉంటే.. ఆయ‌న త‌న‌యులే త‌ర్వాతి  త‌రం వార‌సులు అయి ఉండేవారు. కొద్ది కాలం కిందటి వరకూ రాహుల్ గాంధీ వివాహం అన్నదే వారి కుటుంబంలోనే కాక, రాజకీయవర్గాలలో కూడా హాట్ టాపిక్ గా ఉండేది. అయితే.. రాహుల్ వివాహం పట్ల సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ చర్చ క్రమంగా ఆగిపోయింది. ఇప్పుడు రాహుల్ మేనల్లుడు రేహాన్ తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని పెళ్లి పీటలెక్కుతున్నారు. అయితే రాహుల్ గాంధీకి కూడా ఓ ప్రియురాలు ఉండేదని గట్టిగా వినిపించేది. అయితే ఆయన రేహాన్ లా ధైర్యం చేయలేదు. అందుకు ప్రధాన కారణం సెక్యూరిటీ థ్రేట్ అంటారు.  అప్ప‌ట్లో సోనియా గాంధీ ప్ర‌ధాని  కావ‌ల్సిన  వారు.. ఆమె ప్ర‌ధాని కాలేక పోవ‌డానికి, త‌ర్వాత రాహుల్ పెళ్లాడ‌క పోవ‌డానికి కూడా అదే కారణంగా చెబుతారు.  అప్ప‌ట్లో ఎల్. టీ. టీ. ఈ అనే మిలిటెంట్ గ్రూప్ రాజీవ్ గాంధీని హ‌త‌మార్చిన సంగ‌తి తెలిసిందే. సోనియా ప్ర‌ధాని కాకుండా హెచ్చ‌రిక‌లు జారీ చేసి అడ్డుకున్నది కూడా ఎట్టీటీయే అని అప్పట్లో గట్టిగా వినిపించింది.ఈ నేప‌థ్యంలో రాహుల్ తన త‌ద‌నంత‌ర వార‌సుల‌కు ఈ ప్రాణ‌హాని  సైతం అనువంశికంగా  క‌ల్పించ‌డం ఎందుకు? అన్న కోణంలో ఆలోచించి.. త‌న పెళ్లి ఊసెత్తలేదని అంటారు. అందుకే రేహాన్ పెళ్లి ద్వారా ఆ ఇంట ఇన్నేళ్ల‌కు ఒక శుభ‌కార్యం జ‌రుగుతుండ‌టంతో హ్యాపీ ఫీల‌వుతున్నారు కాంగ్రెస్ కార్య‌ర్త‌లు.