మమతకే బెంగాళీల మొగ్గు
posted on Apr 15, 2011 @ 10:06AM
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెసు-కాంగ్రెసు కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు తెలుపుతున్నాయి. రెండు ప్రసిద్ధ సంస్థలు వేరు వేరుగా చేసిన సర్వేలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి అధికారంలోకి వస్తుందని తేలింది. హెడ్ లైన్స్ టుడే ఛానల్ కోసం ఓఆర్జి చేసిన సర్వేలో టిఎంసి 182 స్థానాలను, లెఫ్ట్ కూటమి 101 స్థానాలను గెలుచుకుంటుందని తేల్చింది. స్టార్ ఆనంద ఛానల్ కోసం నీల్సన్ చేసిన సర్వేలో టిఎంసి 215, లెఫ్ట్ కూటమి 74 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. బుద్దదేవ్ కంటే మమతా బెనర్జీవైపే బెంగాళీలు మొగ్గు చూపుతున్నారని సర్వేలు తేల్చాయి. ముఖ్యమంత్రిగా మమతను 56 శాతం మద్దతు ఇస్తే, బుద్దేవ్కు 20 శాతం మాత్రమే ఇవ్వడం విశేషం. అయితే ఇప్పటి వరకు జ్యోతిబసు మెరుగైన ముఖ్యమంత్రిగా బెంగాళీలు చెబుతున్నారు. టిఎంసి గద్దెనెక్కితే ముప్పయి అయిదేళ్ల లెఫ్ట్ అధికారానికి బెంగాళీలు గండి కొట్టినట్లే. దశాబ్దాల పాటు అధికారం కోసం వేచి చూస్తున్న మమత ఈసారి తనకు అధికారం తప్పకుండా వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికల సమయం నుండే లెఫ్ట్ కూటమి ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. భారీగా పార్లమెంటు సీట్లను టిఎంసికి కోల్పోయింది. ఇప్పుడు కూడా సర్వే ఫలితాలు నిజం అయితే 227 స్థానాలున్న లెఫ్ట్ సగానికి పైగా తగ్గుతాయి. మమత ప్రభంజంలో స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరుక్కుపోయారు.