బీజేపీలో చేరిన రాములమ్మ.. కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు
posted on Dec 7, 2020 @ 2:38PM
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కొద్దిసేపటి క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
1998లో బీజేపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని విజయశాంతి చెప్పారు. తెలంగాణ కోసం చాలా కష్ట పడ్డానని తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పట్లో బీజేపీ నుంచి బయటకు వచ్చి, ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశానని చెప్పారు. అయితే, తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయమని కేసీఆర్ ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపారు. ఏ పార్టీ ఉండకూడదన్న దురుద్దేశ్యంతో కేసీఆర్ వ్యవహరించారని అన్నారు. కేసీఆర్ కంటే ముందు నుంచే తాను తెలంగాణ కోసం పోరాడుతూ వచ్చానని తెలిపారు. టీఆర్ఎస్ నుంచి తాను, కేసీఆర్ ఇద్దరం ఎంపీలుగా గెలిచామని గుర్తు చేసిన ఆమె.. 2013 జూలైలో తనను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశారని చెప్పారు. ముందు నుంచే కేసీఆర్ తనపై కుట్ర పూరితంగా వ్యవహరించారని, టీఆర్ఎస్ నుంచి తానే బయటకు వెళ్లానని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.
తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని సోనియాగాంధీకి చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడే నాయకులు ఎవరూ ఉండకూడదన్న ఆలోచనతో ఇతర పార్టీల నేతలందరినీ టీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారని మండిపడ్డారు. కానీ, ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగిందని చెప్పారు. తెలంగాణలో పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతోందని, కేసీఆర్ అవినీతి భాగోతాన్ని బయటపెడతానని అన్నారు. కేసీఆర్ను గద్దె దించుతాం, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే రాబోతోందని విజయశాంతి తెలిపారు.