వైసీపీకి వల్లభనేని వంశీ గుడ్ బై?.. రాజకీయ సన్యాసమేనా?
posted on Jul 2, 2025 @ 11:15AM
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీ వివిధ కేసులలో గత కొంత కాలంగా విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చివరాఖరుకు ఆయనపై నమోదైన అన్ని కేసులలోనూ బెయిలు లభించడంతో బుధవారం (జులై 2) ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఆయన బయటకు రావడంతోనే ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఏమిటంటే వైసీపీకి వల్లభనేని వంశీ రాజీనామా చేస్తారంటే రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేయడమే కాదు.. మొత్తంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పే అవకాశం ఉందని కూడా వినిపిస్తోంది.
కృష్ణా జిల్లా రాజకీయాలలో వంశీ కీలకమైన వ్యక్తి అనడంలో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన వంశీ వరుసగా రెండు సార్లు తెలుగుదేశం తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికలలో విజయం తరువాత.. అప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ గూటికి చేరారు వల్లభనేని వంశీ. అధికారం అండతో ఇష్టారీతిగా చెలరేగిపోయారు. దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలతో చెలరేగిపోయార్న ఆరోపణలతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో సాక్షిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టైన వంశీపై ఆ తరువాత పలు కేసులు నమోదయ్యాయి. ఎట్టకేలకు ఆయనకు అన్ని కేసులలో బెయిలు లభించడంతో బయటకు వచ్చే అవకాశం ఉంది.
వంశీకి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. జైలు జీవితం, పెరిగిపోతున్న రాజకీయ ఒత్తిడుల కారణంగా వంశీ వైసీపీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అంతే కాకుండా ప్రజాజీవితం నుంచి కూడి రిటైర్ కావాలని, రాజకీయాలకు పూర్తిగా దూరం అవ్వాలని వంశీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. వంశీ కుటుంబం నుంచి కూడా ఈ దశగా ఆయనపై ఒత్తిడి ఉందంటున్నారు. వంశీ జైలులో ఉన్న సమయంలో వైసీపీ నాయకత్వం ఆయన భార్యను రాజకీయంగా క్రియాశీలంగా ఉండాలని కోరినప్పటికీ ఆమె సుముఖత వ్యక్తం చేయకపోవడమే వంశీ కుటుంబం ఇంకెంత మాత్రం వైసీపీతో కలిసి పయనించేందుకు అవకాశం లేదనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. వంశీ ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఒత్తిడి కారణంగా వంశీ వైసీపీకి గుడ్ బై చెప్పేయాలన్న నిర్ణయానికి రావడానికి కారణంగా చెబుతున్నారు. ఈ వార్తలలో వాస్తవం ఎంతన్నది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.