ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యేని దోషిగా తేల్చిన కోర్టు
posted on Dec 16, 2019 @ 3:56PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్ కేసులో ఢిల్లీ తీస్ హజారీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ను దోషిగా తేల్చింది. ఈ నెల 19న శిక్ష ఖరారు చేయనున్నట్టు కోర్టు పేర్కొంది. రెండేళ్ల క్రితం ఈ కేసు నమోదుకాగా.. సుప్రీం కోర్టు చొరవతో లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు కేసు బదిలీ అయ్యింది. 2017లో కేసు నమోదు కాగా.. ఇప్పటికి కుల్దీప్ సింగ్ సెంగార్ను దోషిగా కోర్టు ప్రకటించింది. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన ఢిల్లీ కోర్టు.. మాజీ ఎమ్మెల్యేను దోషిగా తేల్చింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 5(సీ) మరియు ఐపీసీ 376 సెక్షన్ కింద సెంగార్ను దోషిగా నిర్ధారించారు. సెంగార్ను దోషిగా ప్రకటిచండంతో.. ఆయన కోర్టు హాలులోనే బోరున విలపించారు.
ఉన్నావ్ రేప్ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ పై కిడ్నాప్, సామూహిక అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. తన దగ్గరకు పనికోసం వచ్చిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. అనంతరం ఆమె కుటుంబసభ్యులను వివిధ రకాలుగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. కుల్దీప్ సింగ్, అతనికి సహకరించిన శశిసింగ్పై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులైతే నమోదు చేసారు కానీ శిక్షలు మాత్రం బాధితురాలి కుటుంబసభ్యులు అనుభవించారు. బాధితురాలి తండ్రిపై అక్రమాయుధాలు కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఉండగానే ఆయన ప్రాణాలు వదిలారు. గత జులైలో బాధితురాలిపై హత్యాయత్నం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాధితురాలి బంధువులు ఇద్దరు మరణించగా.. ఆమెతో పాటు ఆమె తరపు లాయర్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఇది సెంగారే చేయించాడనే ఆరోపణలు వెల్లువెత్తడంతో.. బాధితురాలికి ఢిల్లీ మహిళా కమిషన్ ఆశ్రయమిచ్చింది. సుప్రీం ఆదేశాలతో ఆమె కుటుంబానికి సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించింది. ఇటు పరిస్థితిని సమీక్షించిన సుప్రీం కేసును లక్నో బెంచ్ నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. అంతలోనే బాధితురాలిపై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఈ నెల 7న బాధితులరాలిని సజీవంగా తగులబెట్టేందుకు కొంతమంది ప్రయత్నించారు. ఈ ఘటనలో బాధితురాలు 90 శాతం కాలిపోయింది. చివరకు హాస్పిటల్లో చికిత్స పొందుతూ.. ఈ నెల 8న తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనలో ఇప్పటికైనా సరైన న్యాయం చేయాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి కోర్టు మాజీ ఎమ్మెల్యేకి ఎలాంటి శిక్ష విధిస్తుందో చూడాలి.