శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం

 

తిరుమల శ్రీవారి అలయంలో గురువారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది.

ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళంఅర దగ్గర కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. 

ఆతర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారు బావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజ స్తంభం, బలిపీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూల బావి, రంగ నాయక మండపం, మహా ద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా వెయ్యి నేతి జ్యోతులను మంగళ వాయిద్యల న‌డుమ‌ వేద మంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు.

శ్రీవారి ఆలయంలో కార్తీకదీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు. కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది.

ఈ కార్తీకదీపోత్సవంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, 

టీటీడీ ఈవో  అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు  పనబాక లక్ష్మి,  జానకి దేవి,  భాను ప్రకాష్ రెడ్డి,  నరేష్, అదనపు ఈవో  సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓ  లోకనాథం, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.


 

పుష్ప–2 తొక్కిసలాట…ఛార్జిషీట్ దాఖలు

  సంధ్య  థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మొత్తం  23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. ఏ-1గా సంధ్య  థియేటర్‌ మేనేజ్మెంట్, ఏ-11గా అల్లు అర్జున్‌ను పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరంలో పుష్ప–2 సినిమా ప్రదర్శన సందర్భంగా సంధ్య థియేటర్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... ఈ కేసులో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటివరకు ఆ బాలుడు కోలుకోలేదు... ఘటన జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటన పై సమగ్ర దర్యాప్తు పూర్తి చేసిన చిక్కడపల్లి పోలీసులు కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చుతూ అభియోగాలు నమోదు చేశారు. ఈ ఘటన దేశవ్యా ప్తంగా తీవ్ర చర్చకు దారి తీయగా, పోలీసుల దర్యాప్తు లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిసినా కూడా సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు తమ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. చార్జిషీట్‌లో అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది సభ్యులు, అలాగే 8 మంది బౌన్సర్లు నిందితుల జాబితాలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు చేరతారని తెలిసినా సరైన ముందస్తు ఏర్పాట్లు లేకుండా సంధ్య థియేటర్‌కు వెళ్లడం, భద్రతా వ్యవస్థను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహించడమే నేరంగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసినట్లు ఛార్జిషీట్‌లో వివరించారు. ఈ తొక్కిస లాట ఘటనకు సంధ్య థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రేక్షకుల నియం త్రణకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం, ప్రవేశ ద్వారాల వద్ద భద్రతా సిబ్బందిని సముచితంగా నియమించకపోవడం, ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్‌ను పాటించకపోవడం వంటి అంశాలు ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు. ఈ కారణంగా థియేటర్ యాజమాన్యంతో పాటు మేనేజర్‌పైనా అభియోగాలు నమోదు చేశారు.ఈ దుర్ఘటనలో ఓ మహిళ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు కావడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.  సినిమా చూడాలనే ఉద్దేశంతో థియేటర్‌కు వచ్చిన కుటుంబం ఇలా విషాదంలో మునగడం ప్రజల హృదయాలను కలిచి వేసింది. బాధిత కుటుం బానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో పలు వర్గాలు ఆందోళనలు కూడా వ్యక్తం చేశాయి. చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను కోర్టు స్వీకరించనుండగా, కేసు తదుపరి విచారణకు వెళ్లనుంది. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు ఎలా కొనసాగుతాయన్న దానిపై సినీ పరిశ్రమతో పాటు ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.భారీ జనసమూహాలు పాల్గొనే కార్యక్రమాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

దుర్గగుడికి విద్యుత్‌ సరఫరా నిలిపివేత.. కారణమేంటో తెలుసా?

 విజయవాడ దుర్గగుడికి  విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దుర్గ గుడి విద్యుత్ బకాయిలు 3 కోట్ల ఎనిమిది లక్షల రూపాయల వరకూ పేరుకుపోవడంతో  ఏపీసీపీడీసీఎల్‌  అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.   2023 ఫిబ్రవరి నుంచి దుర్గ గుడి విద్యుత్ బిల్లులు చెల్లించలేదని విద్యుత్‌ శాఖ తెలిపింది. ఈ  బకాయిలపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో హెచ్‌టీ లైన్‌ నుంచి విద్యుత్‌ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యపై దేవస్థానం భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ సరఫరాన పునరుద్ధరించాల్సిందిగా కోరింది.  అలాగే  అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్‌ సేవలకు అంతరాయం లేకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అలాగే విద్యుత్ శాఖ బకాయిల గురించి చెబుతున్నది వాస్తవం కాదని దుర్గగుడి దేవస్థానం పేర్కొంది.  తమ సోలార్‌ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను వినియోగిస్తున్నామని పేర్కొంటూ, నెట్‌ మీటరింగ్‌ కోసం విద్యుత్‌ శాఖను పలుమార్లు కోరినప్పటికీ సాంకేతిక కారణాలంటూ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను  ఏపీసీపీడీసీఎల్‌  నమోదు చేయలేదని దేవస్థానం ఆరోపించింది.  

రకుల్ సోదరుడి డ్రగ్స్ వ్యవహారం: పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు కొరడా ఝళిపిస్తూ ఉండడంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమర్ సింగ్ డ్రగ్స్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించినట్టు పోలీసుల విచారణలో తేలింది. నెల రోజుల వ్యవధిలోనే  అతడు అరడజను సార్లు  డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయని వెస్ట్ జోన్ పోలీసులు వెల్లడిం చారు. ట్రూప్ బజార్‌కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి నుంచి నటి రకుల్ ప్రీత్ సింగ్  సోదరుడు అమర్ సింగ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అతడు డ్రగ్స్ కొనుగోలు చేసిన ప్రతిసారీ ఆన్‌లైన్  ద్వారానే నగదు బదిలీ చేశాడన్న ఆధారాలు లభ్యమయ్యాయి. అతడి  బ్యాంక్ లావాదేవీల వివరాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సింఘానియా సోదరుల మొబైల్ ఫోన్లలోని వాట్స్అప్ చాట్లను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపగా, అందులో అమర్ సింగ్‌కు సంబంధించిన కీలక సమాచారం ఉన్నట్లు  పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ డిమాండ్, డెలివరీ సమయం, చెల్లిం పుల వివరాలకు సంబం ధించిన సందేశాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు వాట్స్అప్ చాట్లు ప్రధాన ఆధారాలుగా మారాయి. డ్రగ్స్ కొనుగోళ్ల లో అమర్ సింగ్ ఒంటరిగా కాకుండా యష్, ధరమ్ తేజ్ అనే వ్యక్తులతో కలిసి పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరంతా కలిసి డ్రగ్స్ వినియోగించినట్టు, అవసరమైనప్పుడు ఒకరికొకరు సమకూర్చుకున్నట్టు సమా చారం. నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్విలు అమర్ సింగ్‌కు డ్రగ్స్ డెలివరీ చేస్తున్న సమయంలోనే నిఘా పెట్టి పట్టుకున్నట్టు  వెస్ట్ జోన్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో కేసు మరింత బలపడిందని అధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ సర ఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై పోలీసులు లోతైన విచారణ కొనసాగిస్తున్నారు.అసలు సింఘానియా సోదరుల నుంచి అమర్ సింగ్ పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎందుకు కొనుగోలు చేస్తున్నాడనే అంశంపై పోలీసులు ప్రత్యేకంగా ఆరా తీస్తు న్నారు. డ్రగ్స్‌ను స్వయంగా వినియోగించడానికేనా? లేక ఇతరులకు సరఫరా చేస్తున్నాడా? అన్న కోణాల్లో విచారణ సాగుతోంది. అమర్‌ సింగ్ కు డ్రగ్స్ పార్టీలను నిర్వహించే అలవాటు ఉందని ప్రాథమికంగా తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ పార్టీలకు హాజరైన వారిపై కూడా విచారణ చేపట్టే అవకాశముందంటున్నారు.ఈ కేసు ద్వారా డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్న మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. 

దువ్వాడ ఆరోపణలపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు

  వైసీపీ బహిష్కృత నేత , ఎమ్మెల్సీ  దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఆరోపణలను మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తప్పుబట్టారు. తాను దువ్వాడ జోలికి వెళ్లడం లేదని స్ఫష్టం చేశారు. తన గురించి దువ్వాడ ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. తనకు దువ్వాడతో ఎటువంటి విభేధాలు లేవన్నారు.  దువ్వాడ  నిరాధారమైన ఆరోపణలు  చేస్తుండంతో తన అనుచరులు స్పందిస్తున్నారని కృష్ణదాస్ తెలిపారు కింజారపు అప్పన్నతో తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తనకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో ఎటువంటి విబేధాలు లేని ధర్మాన క్లారీటీ ఇచ్చారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతు హైదరాబాద్ నుంచి టెక్కలి వెళ్తున్న సమయంలో ధర్మాన కృష్ణదాస్ కుట్ర పన్నారంటూ ఆరోపించారు. అర్థరాత్రి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వద్ద హైవేపై కారు ఆపి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.  తాను భయపడే వ్యక్తి కాదన్నారు. అయితే ఈ ఆరోపణలను కృష్ణదాస్ ఖండించారు. ఈ క్రమంలో మాధురి, కింజరాపు అప్పన్నల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఆడియోలోని మాటలు వాస్తవమేనని కృష్ణదాస్ చెప్పడంతో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.  

సంక్రాంతి సెలవులు.. ఏకంగా 9 రోజులు!

సంక్రాంతి పండుగ ఈ సారి విద్యార్థులకు మరింత జోష్ ను మోసుకువచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి సెలవులు ఏకంగా 9 రోజులు ఉండనున్నాయి. ఇందుకు సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ అధికారికంగా ప్రకటన జారీ చేయకపోయినప్పటికీ.. అదే ఖాయం అన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా సంస్థలకు జనవరి 11 నుంచి 15 వరకూ సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అయితే జనవరి 10 రెండో శనివారం  కావడం, భోగి పండుగ, జనవరి 14, సంక్రాంతి పండుగ జనవరి 15, కనుమ పండుగ జనవరి 16గా అధికారిక ప్రకటన వెలువడిన నేపథ్యంలో.. సంక్రాంతి సెలవుల తేదీలను సవరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభమౌతాయి. ఇక జనవరి 17 శనివారం కావడంతో ఆ రోజును కూడా సెలవుగా ప్రకటించి సంక్రాంతి సెలవులను జనవరి 18  వరకూ పొడిగించి, విద్యాసంస్థల పున: ప్రారంభం జనవరి 19 గా ప్రకటించే యోచనలో తెలంగాణ సర్కార్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి. దీంతో ఈ ఏడు సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి జనవరి 18 వరకూ అంటే 9 రోజులు ఖాయంగా కనిపిస్తోంది.  

ఆ మూడు రోజులూ సర్వదర్శనాలు రద్దు.. తిరుమల తిరుపతి దేవస్థానం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 30 నుంచి వచ్చే నెల2వ తేదీ వరకూ సామాన్య భక్తులకు సర్వదర్శనాలను నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. గోవింద మాల ధరించిన భక్తులకు కూడా ఆ మూడు రోజులూ  సర్వదర్శనాలకు అవకాశం లేదని పేర్కొంది. జనవరి 3 నుంచి మళ్లీ యధాప్రకారం సర్వదర్శనాలకు అనుమతిస్తామని పేర్కొంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది.  ఆ మూడు రోజుల్లో కేవలం ఆన్‌లైన్‌లో లక్కీడిప్ ద్వారా ఎంపికైన వారిని మాత్రమే సర్వదర్శనానికి అనుమతి ఉంటుందని పేర్కొంది. లక్కీ డిప్‌ టికెట్‌ లేని భక్తులు ఈ మూడు రోజులు తిరుమల దర్శనానికి రావద్దని టీటీడీ సూచించింది. ఈ మేరకు మీడియా, సోషల్ మీడియాలో టీటీడీవిస్తృత స్థాయిలో  ప్రకటనలు జారీ చేసింది.  అయితే టీటీడీ నిర్ణయం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది టీటీడీ ఏకపక్షంగా సర్వదర్శనాలు రద్దు చేసి.. వైకుంఠ ఏకాదశి రోజు సామాన్యులకు స్వామి వారి దర్శనాన్ని దూరం చేస్తున్నదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

శివాజీదే తప్పు.. నాగబాబు

మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇటు టాలీవుడ్ అటు సోషల్ మీడియాలో పెను చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. శివాజీ వ్యాఖ్యలకు అనుకూలంగా, వ్యతిరేకంగా పలువురు నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. మరో వైపు శివాజీ వ్యాఖ్యలపై నటి,  యాంకర్ అనసూయ,  సహా పలువురు సెలబ్రిటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శివాజీ కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ వ్యంగ్యంగా స్పందించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో  తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. ఒక వర్గం శివాజీ మాటల్లోని ఉద్దేశాన్ని సమర్థిస్తే, మరో వర్గం మహిళలపై మోరల్ పోలీసింగ్‌ను తీవ్రంగా ఖండిస్తోంది.శివాజీ వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో నటుడు, జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు.  శివాజీ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదన్నారు.  మహిళలు ఎలా ఉండాలి, ఏ దుస్తులు ధరించాలి అనేది నిర్ణయించే హక్కు ఎవరికీ లేదన్న నాగబాబు ఇది మోరల్ పొలీసింగ్ కిందకే వస్తుందన్నారు.  

న్యూ ఇయర్ వేడుకల్లో జీరో డ్రగ్స్ విధానం..అధికారులకు సీపీ సజ్జనార్ ఆదేశం

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎటువంటి ఉదాశీనతా వలదని సీపీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా జీరో డ్రగ్స్ విధానమే లక్ష్యంగా ఆపరేషన్ చేపట్టాలన్నారు. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం (డిసెంబర్ 26)న  హెచ్-న్యూ, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, వెస్ట్ జోన్, సీసీఎస్ తదితర విభాగాల అధికారులతో సీపీ సజ్జనార్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.   ఈ సందర్భం గా నూతన సంవత్సర వేడుకల సమయంలో డ్రగ్స్ వినియోగించిన తరువాత దాడులు చేసి కేసులు నమోదు చేయడం కాదనీ, తక్షణమే అంటే ఇప్పటి నుంచే   హైదరాబాద్ నగరంలోని పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహించే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మోహరించి డ్రగ్స్ వినియోగానికి అవకాశం లేకుండా చేయాలన్నారు.  అలాగే  సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీలపై కూడా నిఘా పెట్టాల న్నారు. గత రెండేళ్లలో డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి కదలికలపై దృష్టి పెట్టి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. డ్రగ్స్ సరఫరాదారులు, డ్రగ్ ఎడిక్ట్స్ పై  నిఘా ఉంచాలని ఆదే శించారు.  నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంటకే మూసివేయాలని సీపీ ఆదేశించారు. సమయ నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. న్యూఇయర్ సందర్భంగా కీలకమైన ప్రాంతాలలో పటిష్టమైన చెక్‌పోస్టులు, బ్యారి కేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.   అదే సమయంలో  నిఘా పేరుతో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వేడు కలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.పోలీసులంతా సమన్వయంతో పనిచేసి నగర పోలీసు ప్రతిష్టను మరింత పెంచాలని హైదరాబాద్ సీపీ సజ్జనర్ సూచించారు.

డ్రగ్స్ కేసు.. పరారీలో హీరోయిన్ సోదరుడు

డ్రగ్స్ కేసులో తెలంగాణ యాంటీ నారోటిక్స్ బ్యూరోకు చెందిన ఈగల్  దర్యాప్తు ముమ్మరం చేసింది. డ్రగ్స్ క్రయవిక్రయాలు చేసే వారిపై కొరడా ఝళిపిస్తున్నది.ఈ క్రమంలోనే  ప్రముఖ నటి రకుల్ ప్రీతిసింగ్ సోదరుడు అమర్ ప్రీతి సింగ్ అజ్ఞాతంలోకి  వెళ్లాడు.  ఈగల్ బృందం, మాసబ్ ట్యాంక్ పోలీసులతో కలిసి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి అనే ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేసింది. వీరి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏ  డ్రగ్స్‌ను పోలీ సులు స్వాధీనం చేసుకు న్నారు. పట్టుబడ్డ ఇద్దరు వ్యాపారులు విచారణలో  తమ నుంచి తరచుగా డ్రగ్స్ కొనుగోలు చేసే నలుగురి పేర్లు వెల్లడించారు. ఆ నలుగురిలో ఒకరు ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడని తేలింది. అతడికి డ్రగ్స్ డెలివరీ ఇచ్చే సమయంలోనే ఈగల్ ఆపరేషన్ లో ఈ వ్యాపారులు అరెస్టయ్యారని తెలిసింది.  ఇలా ఉండగా  రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమర్ ప్రీతి సింగ్  గత ఏడాది కూడా డ్రగ్స్ వ్యవహారంలో సైబరాబాద్ పోలీసులకు దొరికాడు, ఆ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో అతడు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇద్దరు డ్రగ్స్ వ్యాపారుల అరెస్టుతో అతడి పేరు బయటకు వచ్చింది. వ్యాపారుల అరెస్టు విషయం తెలియగానే అమర్ ప్రీతి సింగ్ పారారయ్యాడని తెలుస్తోంది.   ఈగల్ బృందం అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

ఎన్టీఆర్ రాజు కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం (డిసెంబర్ 26) తిరుపతిలో పర్యటించారు. తిరుపతిలో భారతీయ వైజ్ణానిక సమ్మేళన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిం చారు. ఆ తరువాత ఆయన ఎన్టీఆర్ రాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం సీనియర్ నేత ఎన్టీఆర్ రాజు ఇటీవల తిరుపతిలో మరణించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రాజు కుమారుడు, తెలుగుదేశం మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ నివాసానికి వెళ్లిన చంద్రబాబు,  వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఎన్టీఆర్ రాజు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఎన్టీఆర్ రాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాలులర్పించారు.