పేపర్ లీక్ లో కెటిఆర్ను బర్తరఫ్ చేయాల్సిందే.. రేవంత్
posted on Apr 27, 2023 @ 12:04PM
బీఆర్ఎస్, బీజేపీలవి కుమ్మక్కు రాజకీయాలని రేంవంత్ విమర్శించారు. బీఆర్ఎస్ సర్కార్ పై తన విమర్శల తీవ్రతను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పెంచారు. పేపర్ లీక్ ఘటనలో కేటీఆర్ ను బర్తరఫ్ చేయడంతో పాటు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న డిమాండ్ ను పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరికి లక్షా 60 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. ఆదిలాబాద్లో నిరుద్యోగ నిరసన ర్యాలీలో ఆయన బీఆర్ఎస్ హయాంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాలు బజార్లో అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు.
ప్రజలలో టీఎస్పీఎస్సీపై విశ్వాసం లేకుండా పోయిందన్నారు. తెలంగాణకు పట్టిన కొరివి దయ్యం కేసీఆర్ అన్న రేవంత్ ఆయనను రాష్ట్ర పొలిమెరల వరకు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం వచ్చినప్పుడు లక్షా 7 వేల ఉద్యోగ ఖాళీలు ఉంటే.. ఆ సంఖ్య ఇప్పుడు 2 లక్షలకు పైగా ఉందన్నారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి కానీ.. కష్టపడి చదివిన పేద విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్ప ప్రజలు బాగుపడలేదన్నారు. ఆదిలాబాద్ కు జోగు రామన్న చేసిందేమి లేదన్న రేవంత్ ఆయనను కూడా రాజయ్య తరహాలోనే బర్తరఫ్ చేయాలన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. అప్పుడు కాంగ్రెస్ ఆదిలాబాద్ను దత్తత తీసుకుంటుందని హావిూ ఇచ్చారు.
ప్రశ్నాపత్రాలు అమ్ముకున్న బండి సంజయ్ ఒక్క రోజులోనే జైలు నుంచి బయటకు ఎలా వచ్చారని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షా వ్యాఖ్యలపై ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆదిలాబాద్ లో 10 స్థానాలు గెలిపిస్తే..రాష్ట్రంలో 90 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.