సినిమాల‌పైనా ట్రంప‌పు కోత‌!

ఇక‌పై మీరు అమెరికాలో కూర్చుని ఓజీ త‌ర‌హా అచ్చ తెలుగు సినిమా చూడాలంటే.. చాలా చాలా క‌ష్టం. ఆ టికెట్ రేట్లు కూడా మీ వాలెట్ కి చిల్లు పెట్ట‌డం ఖాయం. ఎందుకంటే మ‌న ట్రంప్ మామ‌.. ఇక్కడా త‌న ప్రతాపం చూపించేశారు. వంద శాతం సుంకాల‌తో విరుచుకుప‌డ్డారు. బాహుబ‌లి ముంద‌రి వ‌ర‌కూ టాలీవుడ్ సినిమాల ప‌రిస్థితి ఏంటంటే.. హాలీవుడ్ సినిమాల ముందు మ‌న సినిమాలు తేలిపోయేవి. దీంతో బడ్జెట్ ఎక్కువైనా ప‌ర్లేదు.. క్వాలిటీ త‌గ్గ‌కుండా పీరియాడిక్స్ ని వ‌ద‌ల‌కుండా వ‌రుస వెంబ‌డి సినిమాలు చేస్తూ వ‌స్తోంది తెలుగు చిత్ర‌సీమ‌. 

స‌రిగ్గా ఇదే విష‌యాన్ని చిరంజీవి నాటి సీఎం జ‌గ‌న్ ని క‌లిసిన‌పుడు అన్నారు కూడా. ఎందుకంటే మ‌న ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌ను వెతుక్కుంటూ రావాలంటే ఆ మాత్రం పెట్టుబ‌డి పెట్ట‌క త‌ప్ప‌డం లేద‌న్నారు. దీంతో మ‌న సినిమాలు హాలీవుడ్ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఇర‌గ‌దీయ‌డం మొద‌లు పెట్టాయి. మ‌న బాహుబ‌లి, దేవ‌ర వంటి సినిమాలు చైనా, జ‌పాన్ లో కూడా ఆడ్డం మాత్ర‌మే కాదు.. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించ‌డం మొద‌లు పెట్టాయి.

దీంతో లోబడ్జెట్- హై ఎండ్ ఎంట‌ర్ టైన్మెంట్ కి కేరాఫ్ గా నిలుస్తున్నాయి మ‌న చిత్రాలు. ఇక మేన‌రిజమ్స్ సంగ‌తి స‌రే స‌రి. త‌గ్గేదే ల్యే.. అనేది ఇప్పుడు హాలీవుడ్ లెవ‌ల్ ట్రెండింగ్. ఆ మాట‌కొస్తే మ‌న పుష్ప పుష్ప పుష్ప సాంగ్ కి టైం స్క్వైర్ సెంట‌ర్లోనూ విదేశీయులు డ్యాన్సులు  ఆడారంటే ప‌రిస్థితేంటో అర్ధం చేసుకోవ‌చ్చు.  ఇప్ప‌టికే మ‌న ఇస్రో హాలీవుడ్ చిత్ర సీమ‌ను వెక్కిరిస్తోంది. కార‌ణం.. హాలీవుడ్ చిత్రాల బ‌డ్జెట్ లోప‌లే మ‌నం రాకెట్లు నింగిలోకి వ‌దిలేస్తున్నాం. దీంతో ఇదొక క‌డుపు మంట‌.

ఆపై మ‌న అరిటాకు భోజ‌నాలు, క‌ట్టు బొట్టు తీరు తెన్నుకు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. మొన్న‌టి కుంభ‌మేళాకు ఎంద‌రో విదేశీ ప్ర‌ముఖులు రావ‌డం మాత్ర‌మే కాకుండా.. వారంతా ఇక్క‌డి దేవ‌త‌ల నామ‌స్మ‌ర‌ణ చేసి కాషాయం క‌ట్టి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అంతే కాదు మ‌న మంత్ర తంత్రాలు, ఆయుర్వేదం, శిల్ప‌క‌ళా చాతుర్యం.. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఒక మానియా క్రియేట్ చేస్తోంది. మొన్న‌టి వ‌ర‌కూ మ‌న వాళ్లు విదేశీ అల‌వాట్ల‌తో ఎక్క‌డ చెడిపోతారో అన్న భ‌యం నుంచి ప‌శ్చిమ నాగ‌రిక‌త క్ర‌మంగా అంత‌రించి పోయి.. ప్ర‌పంచ‌మంతా భార‌తీయ‌త ప‌రుచుకుపోతుందా అన్న దృశ్యం క‌నిపిస్తోంది. అంత‌గా మ‌న సంస్కృతీ సంప్ర‌దాయాలు ప్ర‌పంచ వ్యాప్త‌మై పోతున్నాయి.

వీట‌న్నిటీకీ వాహ‌కంగా మారుతోంది మ‌న భార‌తీయ సినిమా. మ‌న సంస్కృతీ సంప్ర‌దాయాల‌ను మోసుకెళ్ల‌డంలో ఇవి ముందుంటున్నాయి. దానికి తోడు ఏ హాలీవుడ్ సినిమాలో ఉండ‌ని న‌వ‌ర‌సాలు మ‌న సినిమాల్లో క‌నిపిస్తాయ్. దీంతో హండ్రెడ్ ప‌ర్సెంట్ ఎంట‌ర్టైన్మెంట్ ప‌క్కా. అలాంటి సినిమాల‌కు భాషా బేధం లేకుండా విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌టంతో క‌న్ను కుట్టిన ట్రంపాసురుడు వీటిపై కూడా త‌న టారీఫుల‌తో విరుచుకుప‌డుతున్నాడు. త‌మ హాలీవుడ్ సినిమాల నాణ్య‌తా ప్ర‌మాణాలు కూడా మ‌న భార‌తీయ సినీ నైపుణ్యం ముందు ఎక్క‌డ కొట్టుకుపోతాయో అన్న భ‌యం కొద్దీ ట్రంప్ ఈ దిశ‌గా వంద శాతం సుంకాల మోత మోగిస్తున్న‌ట్టు తెలుస్తోంది.  ఈ ట్రంప్ ఇంకా ఎన్నేసి చిత్రాలు న‌మోదు చేస్తారో చూడాల్సి ఉంది. గ‌తంలో కొందరు పాల‌కులు జుట్టు ప‌న్ను వంటివి కూడా వేసేవారు. అలా ట్రంప్ త‌మ దేశంలో గాలి పీల్చే వారిపైనా ప‌న్ను విధించినా ఆశ్చ‌ర్యం లేదంటున్నారు కొంద‌రు. ఇప్ప‌టికే త‌మ త‌మ ఇంటికి డ‌బ్బు పంపే వారిపైనా క‌న్నేసి బిగ్ బిల్  తీసుకొచ్చిన ట్రంప్ ఇంకెన్ని అరాచ‌కాలు సృష్టిస్తాడో అన్న ఆందోళ‌న మొద‌లైంది.. ఎన్నారై వ‌ర్గాల్లో.

ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుత రేవంత్ సర్కార్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్  సీఎంకు ఇంటెలిజెన్స్ సమాచారం వస్తుందనీ, ఈ పద్థతి నెహ్రూ హయాం నుంచీ ఉన్నదేననీ అన్నారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ లో నిఘా వ్యవస్థ లేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అన్నారు. దీనిపై అధికారులు ఎందుకు మీడియా సమావేశాలు పెట్టడం లేదని నిలదీశారు. ప్రస్తుత డీజీపీ కూడా ఒకప్పుడు అధికారేనన్న కేటీఆర్ ఆయనకు కూడా నిఘా వ్యవస్థ గురించి అన్ని తెలుసన్నారు. నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న విషయం అధికారులు ముఖ్యమంత్రికి చెప్పరన్న ఆయన  అలాగే నిబంధనల మేరకు, వారికి సమాచారం ఏలా వస్తుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి కూడా అడగరని అన్నారు.  ఫోన్ ట్యాపింగ్, సిట్ దర్యాప్తు వంటి డ్రామాలతో  ప్రజల దృష్టిని సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.  

సైబర్ వలకు చిక్కిన పోలీసు అధికారులు

ప్రభుత్వం ఎంతగా అప్రమత్తం చేస్తున్నా.. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి మోసపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సామాన్యులు మాత్రమే కాదు, విద్యావంతులు, సైబర్ నేరాలను అదుపు చేయాల్సిన పోలీసు అధికారులు కూడా సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి ఆర్థికంగా భారీగా నష్టపోతున్నారు. తాజాగా  హైదరాబాద్ కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు సైబర్ మోసారికి గురై భారీగా నష్టపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో  పని చేసే ఒక ఇన్ స్పెక్టర్ ను సైబర్ నేరగాళ్లు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు ఇప్పిస్తామంటూ భారీ మోసానికి పాల్పడ్డారు.   దర్శనం టికెట్లు, ప్రత్యేక అనుమతులు అంటూ ఆ ఇన్ స్పెక్టర్ నుంచి దశలవారీగా దాదాపు నాలుగు లక్షల రూపాయలు దోచుకున్నారు. అదే విధంగా అదే కమిషనరేట్ లో పని చేస్తున్న మరో ఇన్ స్పెక్టర్ న స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల పేరుతో బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు దాదాపు 39 లక్షల రూపాయల మేర మోసం చేశారు.   సోషల్ మీడియా ద్వారా స్టాక్ ట్రేడింగ్ గ్రూప్‌లో  తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. మొదట చిన్న మొత్తాలతో లాభాలు వచ్చినట్లు చూపించి నమ్మకం కలిగించిన మోసగాళ్లు, ఆపై పెద్ద మొత్తాల పెట్టుబడులకు ప్రోత్సహించారు. ఈ ప్రక్రియలో ఆ ఇన్స్పెక్టర్ నుంచి సుమారు రూ.39 లక్షలు వసూలు చేశారు.  అయితే ఆ తరువాత  అకస్మాత్తుగా గ్రూప్ అడ్మిన్లు కనిపించకుండా పోవడంతో జరిగిన మోసాన్ని గ్రహించిన సదరు పోలీస్ ఇన్ స్పెక్టర్ లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇ  సైబర్ మోసానికి గురైన ఈ ఇద్దరు ఇన్ స్పెక్టర్లూ కూడా సైబర్ క్రైమ్ విభాగంలో పని చేస్తున్న వారు కావడమే ఇక్కడ విశేషం.  సైబర్ నేరాలపై అవగాహన ఉన్న అధికారులే ఇలా మోసపోవడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. జరిగిన మోసంపై ఈ ఇరువురు పోలీసు అధికారులూ కూడా సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేశారు.   ఈ కేసులపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ లావాదేవీలు, ఐపీ అడ్రెసులు, సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా మోసగాళ్లను గుర్తించే ప్రయత్నాలు కొనసాగు తున్నాయి.  

ప్రధాని నోట నరసాపురం లేస్ క్రాఫ్ట్

ప్రధాని నరేంద్రమోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో మరో సారి ఆంధ్రప్రదేశ్ హస్తకళల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా నరసాపురంలోని లేస్ క్రాఫ్ట్ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన నరసాపురం లేస్ క్రాఫ్ దేశ వ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పారు.  2000లో నరసాపురం లేస్‌ పార్క్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పిన ఆయన ఈ కళను సంరక్షించేందుకు, ప్రోత్సహించేందు చొరవ తీసుకున్న డీఆర్‌డీఏ  భారతదేశంలోనే తొలి లేస్‌ పార్క్‌ను నరసాపురంలో అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు.  విశేషమేంటంటే ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో  ఏపీలోని నరసాపురంలో ఆదివారం పర్యటించిన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.  నరసాపురం మండలంలోని పేదవారి లంక గ్రామాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. తాను దత్తత తీసుకున్న గ్రామంలో  ఆమె ఆదివారం పర్యటించారు.  ఈ సందర్భంగా   మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమె  రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిసి పాల్గొన్నారు. ఆ సందర్భంగా కేంద్రమంత్రి నరసాపురం లేస్ క్రాష్ట్ గురించి ప్రస్తావించి, ప్రశంసించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  కాగా తాను దత్తత తీసుకున్న పేదవారి లంక గ్రామంలో పర్యటించిన నిర్మలాసీతారామన్ గ్రామస్థులనుద్దేశించి చేసిన ప్రసంగంలో.. తాను రాష్ట్రానికి కోడలినైనా.. పేదవారి లంక గ్రామానికి మాత్రం కూతురినని చెప్పారు.  ఒకప్పుడు  ఎలాంటి గుర్తింపూ లేని మారుమూల గ్రామమైన పేదవారి లంక ఈ రోజు  దేశంలోనే గ్లోబల్‌ శిక్షణ కేంద్రంగా గుర్తింపు పొందిందనీ, ముందు ముందు ఏఐ శిక్షణలో దేశంలోనే ఆగ్రగామిగా నిలవనుందని ఆమె అన్నారు.  మహిళ ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా గ్రామంలో నిర్మించిన చిన్న భవనం ఇప్పుడు  పీఎం విశ్వకర్మ యోజన కింద చేపట్టిన ఉపాధి శిక్షణలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు.  మహిళలు అన్ని రంగాల్లో  రాణించాలని పిలుపునిచ్చారు.  గ్రామంలో  13కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సముద్ర కోత అడ్డుకట్ట పనుల్ని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పరిశీలించారు.  

టాటా- ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లో మంటలు..ఒకరు సజీవదహనం

టాటా- ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లో ఆదివారం అర్ధరాత్రి అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవదహనమయ్యారు. విశాఖ నుంచి ఎర్నాకుళం వెడుతున్న ఈ రైలులో ఎలమంచలి సమీపంలో మంటలు చెలరేగాయి.  వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు ఎలమంచిలి స్టేషన్‌లో రైలును నిలిపివేసే లోపే ఆ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు, దట్టమైన పొగతో బోగీలలోని ప్రయాణీకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.   అగ్నిమాపక యం త్రాలు వచ్చేసరికే రెండు బోగీలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. బీ1 బోగీలో ప్రయాణిస్తున్న 70 ఏళ్ల వృద్ధుడు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయి మరణించాడు. మృతుడిని విశాఖపట్నానికి చెందిన చంద్రశేఖర్ సుందర్‌గా గుర్తించారు.

న్యూ ఇయర్ వేడుకలు...పబ్‌లపై ఈగల్ టీమ్ దాడులు

  మరో రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా, హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పార్టీ నిర్వాహకులు, పబ్బులు యువతను ఆకర్షించేలా ప్రత్యేక వేడుకలను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంపై ఈగల్ టీమ్ ప్రత్యేక నిఘా పెట్టింది. కొండాపూర్‌లోని క్వేక్ ఎరీనా పబ్‌లో దాడులు చేశారు.  14 మందికి  డ్రగ్ టెస్ట్ చేయగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఐదుగురు యువకులు,  ముగ్గురు యువతులు ఉన్నారు. కాగా గత 10 రోజులుగా ఈగల్ టీమ్స్ తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 27 మంది కస్టమర్స్, ఐదుగురు నైజీరియన్స్ మహిళలను అరెస్ట్ చేశారు.న్యూ ఇయర్ వేడుకల వేళ ఈగల్ టీమ్ చేపడుతున్న తనిఖీలు నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.  

అలిపిరి మెట్ల మార్గంలో ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌‌ను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్

  తిరుమల అలిపిరి మెట్లమార్గంలోని 7వ మైలు వద్ద నూతన ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. కాలినడకన వచ్చే భక్తులు ఆరోగ్య భద్రత కోసం, అత్యవసర సమయాల్లో త్వరితగతిన వైద్య సేవలు  అందించేందుకు దీనిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మెట్లమార్గంలో అనారోగ్యానికి గురయ్యే భక్తులు ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని బీఆర్ నాయుడు సూచించారు.  టీటీడీ, అపోలో వైద్యులతో పాటు శిక్షణ పొందిన పారామెడికల్ బృందం సేవలందిస్తుందని బీఆర్‌ నాయుడు తెలిపారు. ఈసీజీ యంత్రం, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌, నెబ్యులైజర్‌తో పాటు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో వెంకయ్యచౌదరీ తదితరులు పాల్గొన్నారు.

అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు  అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాలరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం మొత్తం కలియతిరిటగి అక్కడ శిల్పకళను తిలకించారు. "ఈరోజు అయోధ్యలోని దివ్యమైన, అద్భుతమైన శ్రీరామ జన్మభూమి మందిరంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేసుకునే భాగ్యం కలిగింది.  మరోసారి ఇక్కడికి రావడం ఎంతో శాంతియుతంగా, ఆధ్యాత్మికంగా అనిపించింది. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు మనందరికీ శాశ్వతమైన పాఠాలు. అవి మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ, స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను" అని చంద్రబాబు ఎక్స్ ద్వారా తెలిపారు. అంతకుముందు, బాలరాముడి దర్శనార్థం అయోధ్య చేరుకున్న చంద్రబాబుకు దేవాలయ అధికారులు, యూపీ ఎన్డీఏ నాయకులు ఘన స్వాగతం పలికారు.

సర్పంచ్‌గా గెలిచాడు...హామీలు నెరవేర్చారు

  సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఇచ్చిన హామీలు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గ్రామం లో ఆడ బిడ్డ జన్మిస్తే బంగారు తల్లి అనే పథకం కింద 5116/- ఇస్తానని, ఓ సర్పంచ్ అభ్యర్థి హామీ ఇచ్చాడు. ఇచ్చిన మాట ను తుచా తప్పకుండ, హాస్పిటల్ కి వెళ్లి మరి హామీ నెరవేర్చిన సన్నివేశం మహబూబాబాద్ జిల్లా లో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రి మిట్ట శివారు బందలగడ్డ కు చెందిన బానోతు గణేష్ భార్య సింధు ఆడ శిశువుకు జన్మనివ్వగా రూ. 5116 కానుక ఇచ్చి సర్పంచ్ పున్నమి చందర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఆడబిడ్డ జన్మిస్తే రూ. 5116 ఇస్తానని హామీ ఇచ్చిన పున్నం చందర్ మర్రిమిట్ట గ్రామ పరిధిలోని బందల గడ్డ తండాకు చెందిన బానోతు సింధు బంగారు తల్లి జన్మించినట్లు తెలుసుకున్న సర్పంచ్ మానుకోటలోని ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి చిట్టి తల్లికి రూ. 5116 చేతికి అందించారు. గ్రామం లో ఎవరైనా చనిపోతే టెంట్, కుర్చీలు అంటూ ఖర్చు కాకుండా... వాటి ఖర్చు కూడా సర్పంచ్ గా గెలిచాక... తానే భరిస్తా అన్నారు. ఇటీవల గ్రామం లో ఒకరు మరణించగా... ఇచ్చిన హామీ ప్రకారం టెంట్, కుర్చీలు కూడా ఉచితంగా ఏర్పాటు చేశారు. మేనిఫెస్టో లో 10 హామీలు... రెండు అమలు * ​గ్రామ పంచాయితీ పరిధిలోని ఏ కుటుంబంలోనైనా జరిగే (ఆడ, మగ) పెళ్ళికి డి.జె. ఉచితంగా పెడతాను...... * ​గ్రామ పంచాయితీ పరిధిలో ఏ కుటుంబంలోనైనా బంగారు తల్లి (ఆడపిల్ల) జన్మిస్తే 5000/- రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాను. * ​గ్రామ పంచాయితీ పరిధిలో ఏ కుటుంబంలోనైనా చావుకు కుర్చీలు మరియు టెంట్ ఉచితంగా పెడతాను. * ​గెలిచిన నెల లోపు గ్రామ పంచాయితీలో గ్రామానికి సంబంధించిన గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తాను. * ​గ్రామ పంచాయితీ పరిధిలో బస్తీ దవాఖానా మరియు గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తాను....... * ​గ్రామ పంచాయితీ పరిధిలో అండర్ డ్రైనేజీలతో కూడిన సి.సి రోడ్లు పూర్తి చేసి స్వచ్ఛ గ్రామంగా ఏర్పాటు చేస్తాను........ * ​గ్రామ పంచాయితీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పిస్తాను. * ​గ్రామ పంచాయితీ పరిధిలో ప్రతి ఒక్కరికి లేబర్ కార్డ్స్ చేపిస్తాను. * ​మన గ్రామపంచాయితీ (బందాలగడ్డ, మర్రిమిట్ట, దస్రుతండ) ఇంటిపన్ను బిల్లులను మాఫీ చేస్తానని హామీ ఇస్తున్నాను. * ​మన మర్రిమిట్ట గ్రామపంచాయితీ శ్మశానవాటికకు కరెంటు మరియు నీళ్ళ సరఫరా చేయించగలనని హామీ ఇస్తున్నాను పున్నం చందర్ సర్పంచ్ మర్రిమిట్ట తెలిపారు.

సిగాచీ పరిశ్రమ సీఈఓ అరెస్ట్

  సిగాచీ పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్‌చెరు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో 58 మంది కార్మికులు మృతి చెందటంతో పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.సిగాచీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రభుత్వం నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ ఇటీవల నివేదికలో స్పష్టం చేసింది.  అయితే ఈ కేసులో ఇప్పటికీ బాధ్యులను గుర్తించకపోవడంపై గత నెలలో తెలంగాణ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులను ఎందుకు గుర్తించలేకపోయారని మండిపడిన కోర్టు, దీనిపై ఏఏజీ పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. మరోవైపు, న్యాయం కోసం బాధిత కుటుంబాలు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇప్పటివరకు తమకు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు పదోన్నతి

  ఏపీలో పనిచేస్తున్న ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారులకు ప్రభుత్వ కార్యదర్శి హోదాకు సమానమైన సూపర్ టైమ్ స్కేల్ (పే మ్యాట్రిక్స్ లెవల్–14) మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గెజిట్ విడుదల చేశారు. ఈ పదోన్నతులు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతి పొందిన అధికారుల్లో చదలవాడ నాగరాణి, డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఆమ్రపాలి కాట, జె. నివాస్, గంధం చంద్రుడు ఉన్నారు. పరిపాలనలో భాగంగా జరిగే సాధారణ ప్రక్రియలోనే ఈ పదోన్నతులు కల్పించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పదోన్నతి పొందినప్పటికీ కొందరు అధికారులు తమ ప్రస్తుత పోస్టుల్లోనే కొనసాగనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా చదలవాడ నాగరాణి, అలాగే ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీగా ఆమ్రపాలి కాట తమ ప్రస్తుత బాధ్యతల్లో కొనసాగుతారు.  డాక్టర్ నారాయణ భరత్ గుప్తాను కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్‌గా పునర్వ్యవస్థీకరించారు. గంధం చంద్రుడికి కార్మిక శాఖ కమిషనర్‌గా కొత్త బాధ్యతలు అప్పగించగా, ఇప్పటివరకు ఆ పోస్టులో పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.వి. శేషగిరి బాబు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. జె. నివాస్‌కు సూపర్ టైమ్ స్కేల్ పదోన్నతి కల్పించగా, ఆయనకు సంబంధించిన పోస్టింగ్‌పై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.అవసరమైన చోట పోస్టుల అప్‌గ్రేడేషన్, కేడర్ సమానత్వం కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎస్ విజయానంద్ తెలిపారు.