టీఆర్ఎస్ రాములు హత్య: నయీం ముఠా అరెస్ట్
posted on May 21, 2014 @ 12:25PM
ఈనెల 11న నల్లగొండ పట్టణంలోని ఎంఏ బేగ్ ఫంక్షన్హాల్లో జరిగిన టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కోనపురి రాములు హత్య కేసులో నిందుతులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కేరళ లాడ్జిలో తలదాచుకున్న నయీం ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 1.5 లక్షల నగదును, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డవారిలో జనశక్తి మాజీ సభ్యుడు, వరంగల్ జిల్లా దేవరుప్పల మండలానికి చెందిన సోమయ్య, నల్లగొండ జిల్లా నారాయణపురం మండలం వాసి సురేష్, కుమారస్వామి, రవి, రమేష్, ఎల్లేష్లు ఉన్నారు. వీరిలో సురేష్.. మాజీ మావోయిస్టు సాంబశివుడి హత్య కేసులో నిందితుడు కాగా, సోమయ్య గతంలో రాములుపై దాడి చేయడానికి వచ్చినవారిలో ఒకడు. వీరి అరెస్టు తర్వాత కేరళ పోలీసులకు మరిన్ని వివరాలు అందజేసేందుకు నిందితులతో పాటు నయీం ఫొటోలను రాష్ట్ర పోలీసులు అక్కడికి పంపారు.