నేను వజ్రాన్ని.. పారిపోలేదు ! పుట్టా మధు రియాక్షన్
posted on Feb 20, 2021 @ 3:16PM
తెలంగాణలో సంచలనం స్పష్టించిన, రాజకీయ దుమారం రేపుతున్న న్యాయవాదుల హత్య కేసులో
ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు నోరు విప్పారు. లాయర్ వామనరావు దంపతుల హత్యపై స్పందించారు. తాను ఎక్కడికి వెళ్లలేదని, ముఖం చాటేయలేదని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ మీడియా చేయాలా? పోలీసులు చేయాలో ఆలోచించుకోవాలని మధు అన్నారు. ఇన్వెస్టిగేషన్ కానివ్వరా, ఎంక్వైరీ జరగనివ్వారా ఎవరు తప్పు చేస్తే వాళ్లు లోపలకు పోరా అని అడిగారు. ఎందుకింత దౌర్జన్యం చేస్తున్నారు నాపై, మీ బ్రేకింగ్ల కోసం, మీ ప్రచారం కోసం గరీబ్ బిడ్డను బద్నాం చేస్తున్నారని మధు అన్నారు. ఒక బీసీ జెడ్పీ చైర్మన్ కావడాన్ని జీర్ణించుకోలేక విష ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. పోలీసులను విచారణ చేయనిస్తారా.. లేక శ్రీధర్బాబు చేస్తారా? అని పుట్ట మధు ప్రశ్నించారు.విచారణ పూర్తయ్యాక హైదరాబాద్లో ప్రెస్మీట్ పెడుతానని ప్రకటించారు పుట్టా మధు.
మంథని నియోజకవర్గంలో టీఆర్ఎస్ సభ్యత్వ సేకరణ కార్యక్రమంలో పుట్టా మధు మట్లాడారు. మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పుట్ట మధును లోపల వేస్తరా అని కొన్ని టీవీల్లో, పత్రికల్లో రాస్తున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఉన్న రిపోర్టర్లకు సంబంధం లేకుండా హైదరాబాద్ లో ఉన్న వాళ్లు ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారని ధ్వజమెత్తారు. కొన్ని సంస్థలు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు అమ్ముడుపోయి బీసీ బిడ్డనైన తనను టార్గెట్ చేశాయని పుట్ట మధు ఆరోపించారు. త్వరలో హైదరాబాద్ లో మీటింగ్ ఏర్పాటు చేసి మీడియా బండారం అంతా బయటపెడతానని స్పష్టం చేశారు.
70 ఏళ్లలో ఓ బీసీ వాడు ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ కావడం ఏందీ? దీనిని మేం సహిస్తలేం? అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీడియాను చూస్తే ఒక ఆలోచన కలగాలి, ఒక ధైర్యం కలగాలన్నారు. కానీ నేడు మీడియాను చూస్తే అసహ్యం వేస్తోందని, ఎందుకు నాపై ఇంత కుట్ర, ఎందుకు నాపై ఇంత పగ అంటూ పుట్ట మధు ప్రశ్నించారు.నేను వజ్రాన్ని.., మోసగాన్ని కాదని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పోరాటం ఆగేది లేదని, నా ప్రజల కోసం మాత్రమే ఉంటా మోసగాళ్ల కోసం ఉండనన్నారు. నా పిల్లలు స్థిరపడ్డారు ప్రజలు, టీఆర్ఎస్ కోసం నేను, నాభార్య జీవితం అంకితమని అన్నారు.తాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దగ్గరికి వెళ్లలేదని, వారిని అపాయింట్మెంట్ అడగలేదని తెలిపారు.