జోగిపేటలో వెయ్యేళ్ల నాటి శిల్పాలు!
posted on Mar 8, 2024 @ 2:46PM
వాటిని కాపాడుకోవాలి
పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి
ఆందోలు పెద్ద చెరువు ఒడ్డున గల నాగుల కట్టపైనున్న శిల్పాలు వెయ్యేళ్లనాటివని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ దామోదరం రాజనర్సింహ సూచన మేరకు శుక్రవారం (మార్చి8) ఆయన ఆ శిల్పాలను పరిశీలించారు.
రంగనాథ స్వామి గోపురం ముందు రాష్ట్ర కూటుల, కళ్యాణి చాళుక్యుల కాలం (క్రీ.శ. 9-10 శతాబ్దాలు), నాటి మహిషాసురమర్ధిని శిల్పాలు, నాగులకట్ట పైనున్న కళ్యాణి చాళుక్య, కాకతీయుల కాలంనాటి (క్రీ.శ. 11-13 శతాబ్దాల నాటి) చెన్నకేశవ, జనార్ధన, నాగదేవతల శిల్పాలు, అలనాటి అద్భుత శిల్పకళా కౌశలానికి అద్దం పడుతున్నాయన్నారు.
కేశవ విగ్రహం చుట్టూ గల మకరతోరణం, శ్రీదేవి, భూదేవి, దశావతార శిల్పాలు చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొన్నాయని, పట్టణంలో ఒక ప్రదర్శనశాల ఏర్పాటు చేసి ప్రదర్శిస్తే, ఆందోలు పర్యాటక కేంద్రం అవుతుందని శివనాగిరెడ్డి అన్నారు.