తెలంగాణ ఆర్టీఐ ఖాళీ.. ఒకే రోజు ఐదుగురు కమిషనర్లు పదవీ విరమణ
posted on Feb 25, 2023 @ 2:32PM
తెలంగాణ ఆర్టీఐ ఖాళీ అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ లో ఐదుగురు కమిషనర్లు కట్టా శేఖర్ రెడ్డి, మైదా నారాయణ రెడ్డి, సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమిర్ హుస్సేన్, గుగులోతు శంకర్ నాయక్ లు శుక్రవారం పదవీ విరమణ చేశారు. దీంతో ఇప్పుడు సమాచార హక్కు కమిషన్ లో కేవలం సిబ్బంది మాత్రమే మిగిలారు.
రాష్ట్రప్రభుత్వ నేతృత్వంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ 2017లో బుద్దా మురళిని సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్ గా ఎంపిక చేసింది. ఆ తరువాత సీనియర్ జర్లలిస్టులు కట్టా శేఖర్ రెడ్డి, మైదా నారాయణ రెడ్డి, న్యాయవాదులు సయ్యద్ ఖలీలుల్గా, సయ్యద్ అమిర్ హుస్సేన్, గిరిజన విద్యార్థి శంకర్ నాయక్ లను కమిషనర్లుగా ఎంపిక చేసింది. వీరి నియామకానికి అప్పటి గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేయడంతో అందరూ ఓకే సారి ప్రమాణ స్వీకారం చేశారు.
గడువు ముగియడంతో అందరూ ఒకేసారి పదవీ విరమణ చేశారు. ప్రధాన కమిషనర్ బుద్ధా మురళి అయితే ఈ ఏడాది జనవరిలోనే పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచీ ప్రధాన కమిషనర్ నియామకం జరగలేదు. ఇప్పుడు కమిషనర్లు కూడా పదవీ విరమణ చేయడంతో ఆర్టీఐ ఖాళీ అయిపోయింది.
ప్రభుత్వం కమిషనర్ల నియామక ప్రక్రియ ఇంకా ఆరంభించలేదు. ఎప్పడు ఆరంభిస్తుందన్న క్లారిటీ కూడా లేదు. దీంతో ఆర్టీఐ నామమాత్రంగా మిగిలిపోయినట్లు అయ్యింది. సమాచార హక్కు చట్టం లక్ష్యం నీరుగారుతున్న పరిస్థితి ఏర్పడింది.