ఏపీ, మహారాష్ట్ర కు వెళ్లొద్దు! మళ్లీ సరిహద్దులు మూసివేసిన తెలంగాణ!
posted on May 1, 2020 @ 10:41AM
తెలంగాణ ప్రజలెవరూ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు వెళ్లకుండా తెలంగాణ సర్కార్ బ్యాన్ విధించింది. కరోనా వ్యాధి తీవ్రత నేపథ్యంలో జిల్లా సరిహద్దులను మూసివేశారు. సరిహద్దు జిల్లాలలో నివసిస్తున్న పౌరులకు ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఏపీ, మహారాష్ట్ర రాష్ట్రాలలో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నందున తెలంగాణా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వైద్యం, అత్యవసర పనులకు కూడా ఏపీ, మహారాష్ట్రల్లోకి వెళ్లడానికి వీలు లేదని సరిహద్దుల్లోని ప్రాంతాల ప్రజలను ఆదేశించింది. నిర్ణయ అమలుకు పోలీసు బలగాలను పెంచింది. భద్రతను కట్టుదిట్టం చేసింది.
కర్నూలులో మొత్తం 386 కరోనా బారిన పడ్డారు. 9 మంది మరణించారు. కర్నూలులో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం.. తెలంగాణలోని గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల ప్రజలు అక్కడికి వెళుతున్న నేపథ్యంలో రాకపోకలను నిషేధించింది.
గుంటూరు జిల్లాలో మొత్తం 287 కేసులు నమోదు అయ్యాయి. 8 మంది మరణించారు. కృష్ణ జిల్లాలో మొత్తం 246 పాజిటివ్ కేసులొచ్చాయి. 8 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం, నల్గొండ జిల్లాల వాళ్లు కూడా విజయవాడ, గుంటూరు వైపు వెళ్లడానికి వీలు లేకుండా ప్రభుత్వం భద్రతను పెంచింది.