ప్రత్యేక తెలంగాణ : మావోకు అపవాదు

"తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం'': మావోకు అపవాదు భారత మావోయిస్టులు!

- ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

 

 

ఒక దేశంలో విప్లవం జయప్రదం కావడానికి ఎన్నో పరిస్థితులు అందుకు సానుకూలం కావలసి ఉంటుంది. సుదీర్ఘ పోరాటదశల ద్వారా విప్లవోద్యమాలు జయప్రదమై సామాజిక రాజకీయ, ఆర్థికవ్యవస్థలను సమూలంగా మార్చుకున్న ప్రథమ సోషలిస్టు సోవియట్ లో గానీ, ఆ తరవాత దాని ప్రభావంలో తూర్పు యూరప్ లోనూ, ఆసియాఖండంలోని చైనా, వియత్నాంలలోనూ వ్యవసాయక విప్లవాల్ని జయప్రదంగా నిర్వహించుకున్న చోట్లగానీ - ఆయాదేశాలలోని భాషా రాష్ట్రాలను ఆయా రాష్ట్రాల ప్రజలనూ విప్లవోద్యమనాయకులు చీల్చి, విడగొట్టిన ఉదాహరణలు లేవు! చైనా విప్లవాన్ని మహోధృతంగా నడిపించి, యుద్ధప్రభువుల, భూస్వామ్య, ధనికవర్గాల పెత్తనానికి, ఆ పెత్తనానికి వత్తాసుగా నిలిచిన పరాయి, దేశీయ నిరంకుశపాలనా శక్తులను మట్టికరిపించి సోషలిస్టు వ్యవస్థ నిర్మాణానికి బలమైన పునాదులు వేసినవాడు మావోసీటుంగ్. నేడు భారతదేశంలో కూడా అటువంటి వ్యవసాయ విప్లవాన్ని జయప్రదం చేయడానికి, భూస్వామ్య, దేశీయ, విదేశీ గుత్తపెట్టుబడిదారీ వర్గాల పెత్తనం నుంచి దేశప్రజల్ని విమోచనపథం వైపు నడిపించాలని మావో పేరిటనే కంకణం కట్టుకుని భారత మావోయిస్టు పార్టీగా అవతరించినవారు విప్లవకారులు. అంతవరకూ బాగానే ఉంది.

 

అలాగే, చైనా విప్లవోద్యమంలో స్వదేశీ, విదేశీ బానిసత్వంనుంచి చైనాను విముక్తి చేయడంకోసం గ్రామసీమలు ఆధారంగా, గుహనివాసాలు ఆసరాగా అజ్ఞాతజీవితంలో ఉంటూ భారీ ఎత్తున కాలక్రమంలో బ్రహ్మాండమైన రెడార్మీని నిర్మించుకుని, క్రమంగా ప్రత్యేకస్థావరాలు కేంద్రాలుగా చైనాను ప్రపంచచరిత్రలో ఏ సైనికనిరహాలూ చేయని "లాంగ్ మార్చ్'' ద్వారా గ్రామాలను విమోచనం చేసుకున్నవాళ్ళు చైనీస్ మావోయిస్టులు. అలాగే, చైనాలోని "హాన్'' మెజారిటీజాతి దురహంకారాన్ని, దాష్టికాన్నీ చైనా విప్లవకారులు మావోనాయకత్వంలో నిత్యం వ్యతిరేకించి, అదుపుచేసి, చైనీస్ మైనారిటీ జాతులకు భరోసాగా నిలిచి ఆదుకున్నవాళ్ళు చైనా విప్లవకారులయిన మావోయిస్టులు. అంతేగాని, అంతటి సుదీర్ఘకాలపు "లాంగ్ మార్చ్'' సందర్భంగాగానీ, విమోచనానంతరంగానీ అక్కడి మావోయిస్టులు ఒక్కటిగా ఉన్న రాష్ట్రాలనుగానీ, కౌంటీలుగానీ, అక్కడి ప్రజలనుగానీ విభజించి, చీలుబాటలు పట్టించిన ఘటన ఇంతవరకూ చరిత్రకు తెలియదు! ఒక మహావిప్లవాన్ని నిర్వహించడానికి దానికి వెన్నుదన్నుగా విమోచన ప్రాంతం ఉండవలసిందే, సందేహంలేదు. అందుకోసం అక్కడి రాష్ట్ర/కౌంటీప్రజల మధ్య పరస్పరం ఘర్షణలకు, తగాదాలకూ దారితీసే విధంగా ప్రజలమధ్య మైత్రీసంబంధాలను, లేదా భవబంధాలనూ, ఆత్మీయానురాగాలను దెబ్బతీసే విధానాన్ని చైనీస్ కమ్యూనిస్టు (మావోయిస్టు)పార్టీ అనుసరించిన దాఖలాలు లేవు!


కాని దురదృష్టవశాత్తూ భారత మావోయిస్టుపార్టీ నేతలు కొందరు ఉద్యమ రక్షితప్రాంతాల ఏర్పాటుకోసమని ఒకేభాష, ఒకేజాతిగా భాషాప్రయుక్త రాష్ట్రాలుగా భారతదేశంలో సుమారు 60 సంవత్సరాల నాడు ఏర్పడిన కొన్ని రాష్ట్రాలను విప్లవానికి వెనుక తట్టు రక్షణకేంద్రాలుగా ఏర్పరచడం కోసం ఆ రాష్ట్ర భాషాప్రజల ఐక్యతకు పెట్టుబడిదారీ వర్గాల మాదిరే మావోయిస్టులు కూడా చిచ్చుపెట్టడానికి సిద్ధం కావడం అత్యంత విచారకరం. "ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు బూర్జువా పార్టీల నాయకత్వంలో ఏర్పడదు'' కాబట్టి, "ప్రత్యేక తెలంగాణా కోసం సాయుధపోరులోకి దిగండి, ఆయుధాలు మేమిస్తాం'' అని ఒక స్థానిక పత్రికకు అజ్ఞాత కేంద్రం నుంచి భారత మావోయిస్టుపార్టీకి చెందిన ఒక నాయకుడు పిలుపు యిచ్చారు. ఈ ప్రకటన, దేశంలో విప్లవోద్యమాన్ని విస్తృతం చేసే వ్యూహంలో ఒక భాగమైతేకావచ్చు కాని ప్రజలమధ్య మైత్రిపూర్వకమైన వైరుధ్యాలను, శత్రువైరుధ్యాలుగా పరిగణించి, చరిత్రలో జరిగిన తప్పిదాలను కమ్యూనిస్టుపార్టీ చేయకూడదని మావో "ప్రజల మధ్య వైరుధ్యాల పరిష్కారం'' గురించి చేసిన హెచ్చరికను కొందరు మావోయిస్టు నాయక సోదరులు విస్మరించటం ఘోరం!


దేశంలో భూస్వామ్య-పెట్టుబడిదారీ వ్యవస్థ రూపుమాసిపోనంత కాలం, లేదా దాన్ని రూపుమాపనంత కాలం, రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల మధ్య, ప్రాంతాలలోని వివిధ మండలాల మధ్య రాజకీయ సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగవుగాక తొలగవు; అది అసమ ఆర్థికవ్యవస్థలో విధానాల ఫలితం. ఆ వ్యవస్థనుంచి దేశం విమోచన పొందనంతకాలం తమతమ వ్యత్యాసాలతో ప్రాంతాల మధ్య, వివిధ వర్గాల ప్రజాబాహుళ్యం మధ్య దోపిడీవ్యవస్థ పర్యవసానంగా అసమ సంబంధాలు ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటాయి. అందుకని, ఆ కారణం మీదనే ప్రజలమధ్య ఏకభాషాజాతి ఐక్యమత్యాన్ని ఒక సుదీర్ఘ పోరాట లక్ష్యంకోసం, ఆ పోరుబాట తక్షణ విమోచన లక్ష్యసాధనకు చేరువలో లేనప్పుడు - ఆ ఐక్యతను విద్వేష ప్రచారం ద్వారా విచ్చిన్నం చేయడానికి ఎవరూ, ముఖ్యంగా విప్లవకారులు పూనుకోరాదు. విభజించి-పాలించడం వలస సామ్రాజ్యవాదులకే కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థలో పాలకస్థానంలో ఉన్న రాజకీయ శక్తులకు కూడా "వెన్నతో పెట్టిన విద్య''గానే కొనసాగుతూంటుంది. ముఖ్యంగా రాజకీయ నిరుద్యోగులు పదవీ స్వార్థప్రయోజనాల కోసం ఒకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలమధ్యనే తగవులు పెట్టడంద్వారా, వాటి ఆధారంగా "ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాలు''నడపటం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక "కూసు''. ఈ 'విద్యా' రహస్యాన్ని బద్దలుకొట్టి ప్రజల్ని చైతన్యవంతులను చేయడంద్వారా దేశీయంగా సాగవలసిన సుదీర్ఘ పోరాటానికి నాయకత్వం వహించదలచినవారు పెట్టుబడిదారీవర్గ వ్యవస్థ సాగించే చిల్లరపనులకు, చిట్కాలకూ దిగకూడదు!


రష్యన్ అక్టోబర్ విప్లవంగానీ, చైనీస్ విప్లవంగానీ నేర్పుతున్న గుణపాఠాలివే. చైనాలో మెజారిటీ జాతిగా ఉన్న "హాన్''జాతి దురహంకారాన్ని అదుపుచేసి, చైనీస్ మైనారిటీ జాతులన్నింటికీ రక్షణ కల్పించిన శక్తి చైనీస్ కమ్యూనిస్టుపార్టీ, దాని నిర్మాత మావో-సె.టుంగ్: అలాంటి సమన్వయపూర్వక, మిలిటెంట్ విధానాన్ని పార్టీ చేతికి అందించగలిగినందుననే యావత్తు జాతీయ మైనారిటీలూ అక్కడి పార్టీకి అండదండలుగా నిలిచాయి! అందుకే మావో "హాన్ జాతీయులకు, జాతీయ మైనారిటీలకు మధ్య సంబంధాలు'' అన్న రచనలో యిలా పేర్కొనవలసి వచ్చింది:


"ఈ సమస్యపైన మన (చైనీస్ పార్టీ) విధానం ఎలాంటి తొట్రుబాటు లేకుండా స్పష్టంగా ఉంది. హాన్ మెజారిటీ దురహంకారాన్ని వ్యతిరేకించడమే మన విధానం. స్థానిక జాతీయవాదం అంటారూ, దాని స్థానం దానిదే. ఇక్కడ కీలకమైన సమస్య స్థానిక జాతీయవాదం కాదు. హాన్ మెజారిటీ దురహంకారాన్ని ఎదిరించడమే ప్రధాన సమస్య. జనాభారీత్యా హాన్ జాతీయులు చైనాలో మెజారిటీ ప్రజలు. కాని వీరు దురహంకారాన్ని విడనాడకపొతే, జాతీయ మైనారిటీలను గౌరవించకపోతే అది చెడు ఫలితాలకు దారితీస్తుంది. అందుకని చైతన్యంతో చేయవలసిన పనల్లా - హాన్ జాతీయుల మధ్యకు వెళ్ళి శ్రామిక జనావళితో కూడిన జాతులలో విస్తృతస్థాయిలో విద్యావ్యాప్తికి నడుంకట్టడమే. అదే సమయంలో, జాతీయ మైనారిటీలు, నివసిస్తున్న ప్రాంతాలలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు అనుసరిస్తున్న పద్ధతుల్ని గురించి సరైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. జాతీయ మైనారిటీ ప్రాంతాలు దేశంలో విస్తారంగా ఉన్నాయి, ప్రకృతివనరులు అపారంగా ఉన్నాయి. జనాభారీత్యా హాన్ జాతి పెద్దజాతి కావొచ్చు. కాని, జాతీయ మైనారిటీలకు చెందిన ప్రాంతాలు సంపద్వంతమైనవి. వాటికి చెందిన సంపన్నవనరులున్న భూములు సోషలిజం నిర్మాణానికి ఎంతో అవసరం. కనుక దేశంలో సాగే సోషలిస్టు ఆర్థికవ్యవస్థ, సంస్కృతీ నిర్మాణాన్ని పూర్తిచేయడానికి హాన్ జాతి, మైనారిటీ జాతులకు చురుగ్గా చేదోడువాదోడు కావాలి. వివిధ జాతులమధ్య సంబంధాలను మెరుగుపరిచి, అన్ని శక్తులనూ [మానవవనరులను, భౌతికవనరులనూ] కూడదీసుకుని ముందుకుసాగాలి. ఈ సమైక్యత సోషలిస్టువ్యవస్థ నిర్మాణానికి ఎంతో ప్రయోజనకరం'' అన్నాడు మావో ["ఆన్ ది టెన్ గ్రేటోరిలేషన్ షిప్స్'':1956 ఏప్రిల్25]!

అంతేగాదు, "వర్గపోరాటం సమాజ పురోభివృద్ధికి చోదకశక్తి'' అని చాటిన మావో ఒకే భాష ప్రాతిపదికపై ఉన్న ఒకే జాతిని విడగొట్టడానికి 'వర్గపోరాటాన్ని' ఏనాడూ ఆశ్రయించలేదు. అలాగే, "మనం చెప్పే మాటలుగాని, మన చేతలుగానీ ప్రజలను ఐక్యపరిచేవిగా ఉండాలేగాని ప్రజల్ని విడగొట్టేవిగా ఉండకూదన్నా''డు మావో [సెలెక్టెడ్ వర్క్స్: వాల్యూమ్ 5]. అంతేగాదు, విప్లవకారులన్న వాళ్ళు ప్రజలమధ్య "కలతల్ని, అశాంతిని అనుమతించరాదు. ఎందుకంటే ప్రజలమధ్య తలెత్తే వైరుధ్యాలను ఐకమత్యం - విమర్శ - తిరిగి ఐక్యత'' అనే సూత్రం ఆధారంగానే పరిష్కరించుకోవచ్చునని కూడా మావో పేర్కొన్నాడు! "విప్లవకారులు తప్పులు చేయకుండా ఉండటం కష్టం కావొచ్చుగాని, ఆ తప్పుల్ని చిత్తశుద్ధితో సవరించుకోవటం అవసరమ''నీ అన్నాడు [1967 ఆగస్టు 21]; అన్నింటికీమించి "దేశం ఆస్తిని రక్షించడం విప్లవకారుల బాధ్యత'' అన్నాడు [1967 జనవరి 26]!


నిజానికి భారత మావోయిస్టుపార్టీ ఆదివాసీ ప్రజలకు అటవీచట్టాలకింద హక్కు భుక్తమైన వారి సహజవనరులను, భూమినీ కాపాడడంకోసం వారికి రక్షణగా ఉండి పోరాడుతూ ఉండటం ప్రశంసనీయం. అందువల్ల నేడు తెలంగాణలో కొందరు రాజకీయ నిరుద్యోగులు ప్రారంభించిన వేర్పాటువాద ఉద్యమం పాతదొరలు, భూస్వామ్యవర్గాలు [కొండా వెంకట రంగారెడ్డి, దొరలూ] తమ స్వార్థప్రయోజనాల కోసం తప్ప మరొకటికాదు. తెలుగుప్రజల మధ్య విపరీతమైన విద్వేషభావానికి మాసాల తరబడిగా బీజాలు నాటుతూ వచ్చారు. "ప్రజలే మోతుబరులు, దోపిడీదారులు, స్వార్థపరులైనట్టు''గా చిత్రించడం ద్వారా ఒకనాటి తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం తన్నితగలేసిన దోపిడీవర్గాలనే తెలంగాణలో అధికారపగ్గాలు కట్టబెట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వలసదొర (బొబ్బిలిదొర) నాయకత్వాన ప్రారంభమైన స్వార్థపూరిత ఉద్యమాన్ని మావోయిస్టుసోదరులు తమ ఉద్యమంగా భుజాన వేసుకోరాదు; తెలుగుజాతి ఐక్యతను రాష్ట్రం మొక్కట్లను చెదరగొట్టరాదు. మావోయిస్టుపార్టీ దేశం ఎదుర్కొంటున్న సమస్యలనుంచి దేశాన్ని బయట పడవేయడానికి నయా వలస - పెట్టుబడిదారీ వర్గాల పెత్తనంనుంచి దేశానికి విముక్తి సాధించడానికి చేస్తున్న కృషిలో ప్రజలను సమైక్యంగా సమీకరించవలసిన సందర్భంలో తెలుగుజాతినే విభజించడం ద్వారా తమ ఉద్యమానికి బలం చేకూరుతోందని భావించడం వొట్టి తెలివితక్కువతనం లేదా దుడుకుతనమని చెప్పక తప్పదు.


 చైనా విప్లవంలో భాగమైన "లాంగ్ మార్చ్''లో గ్రామాల విమోచన జరిగిందిగాని, గ్రామాలనూ, ప్రజలను చీల్చడంవల్ల జరగలేదు; కలుపుకొని రావడం వల్లనే విమోచన సాధ్యమయిందని గుర్తించాలి. "ధనికవర్గ (బూర్జువా) పార్టీలతో ఒకవేళ ప్రత్యేక తెలంగాణా ఏర్పడినా అది చూడ్డానికి భౌగోళిక తెలంగాణాగానే ఉంటుందేగాని తెలంగాణాప్రజల వకాలిక సమస్యలు మాత్రం పరిష్కారం కావ''ని సక్రమంగా విశ్లేషించగలగిన భారత మావోయిస్టు నాయకత్వం "సంప్రతింపుల పేరిట కాంగ్రెస్ తెలంగాణాప్రజల్ని మోసగిస్తోం''దని విమర్శించగల మావోయిస్టులు ఒకటిగా ఉన్న తెలుగుజాతిని చీల్చడానికి వెనుదీయకపోవటం కూడా వారి సంకుచిత దృష్టికి తార్కాణంగా మిగిలిపోతుంది! "ఆత్మహత్యల''ద్వారా ప్రత్యేకరాష్ట్రాన్ని సాధించలేరని యువతకు మంచి సలహా ఇవ్వగలిగిన మావోయిస్టులు, ఆ ఆత్మహత్యలను స్వార్థపూరిత ఉద్యమనాయకుల ప్రోత్సాహంతో అక్కరకురాని ఆశల మీద, అబద్దాల మీద అల్లిన ప్రచారం ఫలితమని మావోయిస్టులు గుర్తించడంలో విఫలమయ్యారు.


 అబద్ధాలను పదిసార్లు వల్లించమన్న నాజీ హిట్లర్ ప్రచార యంత్రాంగానికి మించిన తంత్రాంగాన్ని నిర్మించుకున్న ఒక స్వార్థపూరిత "రాష్ట్రసమితి''కి నాయకుడైన కె.సి.ఆర్. అనే 'వలసదొర' వల్లనే ఈ ఆత్మహత్యల్ని మావోయిస్టులు గుర్తించలేకపోవడం పెద్ద బలహీనతగా భావించాలి. పైగా "ఉమ్మడిరాష్ట్రమే ఉగ్రవాదానికి అడ్డా'' అని చాటిన ఒక జె.ఎ.సి. నాయకుడైన ఒక ప్రొఫెసర్ అన్నమాటలు మావోయిస్టులకు కూడా అన్యాపదేశంగా తగులుతాయని గుర్తించాలి! "జాతిపోరాటాన్ని వర్గపోరాటంలో భాగంగా''నే  తాము చూస్తామని చెప్పిన మావోయిస్టు నేతలు, తాము ప్రస్తావిస్తున్న "జాతిపోరాటం''కి తెలుగుజాతిలోని ఒక భాగానికే పరిమితమా, లేక మొత్తం తెలుగుజాతికి వర్తిస్తుందా? "జాతిపోరాటం''మొత్తం తెలుగుజాతికి వర్తించే పక్షంలో తెలుగుజాతిని చీల్చడంద్వారా అది వర్గపోరాటంలో భాగం ఎలా అవుతుంది? వారే చెప్పాలి! ఇంతకూ ఆంధ్రప్రదేశ్ లోని ఆదివాసీ నివాసప్రాంతాలన్నీ కలిపి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని కోరుతున్న ఆదివాసీ సంఘాల ఉమ్మడి ప్రతిపాదనపట్ల మావోయిస్టుల వైఖరి ఏమిటి? దోపిడీవ్యవస్థనూ, దోపిడీదారులనూ, యావత్తు పెట్టుబడిదారీ వ్యవస్థనే సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు ప్రత్యేకించి "సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాలను, కార్యకలాపాలను'' మాత్రమే స్తంభింపచేయాలని కోరుతూ తెలంగాణలో బలిసిన పెట్టుబడి, భూస్వామ్యవర్గాల [వీరూ భారీ పెట్టుబడులతో ప్రయివేట్ రంగంలో పత్రికలు పెట్టే స్థితికి ఎదిగారు] ప్రయోజనాలను మాత్రం కాపాడాలన్న వైఖరిని మావోయిస్టులు తీసుకోవడంలో అర్థం ఏమిటి?


మావో సీటుంగ్ చైనా అంతర్యుద్ధ కాలంలో హునాన్-కియాంగ్సీ సరిహద్దు ప్రాంతాల్లో స్వతంత్రస్థావరాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో [1928 నవంబర్ 25] విప్లవ కార్యకర్తలకు యిచ్చిన సందేశాన్ని మావోయిస్టు సోదరులు ఇప్పటికయినా పరిశీలించాలని మనవి. కార్మికులు-రైతాంగ ప్రజలతో కూడిన ఒక స్వతంత్రమైన సాయుధ ప్రభుత్వం బతికి బట్టకట్టాలంటే అయిదు షరతులు నెరవేరాలని మావో చెప్పాడు.
(1) చెక్కుచెదరని ప్రజాపునాది
(2) పటిష్టమైన పార్టీయంత్రాంగం
(3) గణనీయమైన శక్తివంతమైన ఎర్రసైన్యం
(4) సైనికచర్యలకు అనుకూలమైన భూభాగం
(5) విప్లవోద్యమం బతకడానికి తగినన్ని ఆర్థికవనరులూ
ఇన్ని షరతులు విధించిన మావో ఒక్క షరతు విధించడంలో విఫలమయ్యాడు - విప్లవోద్యమం బలపడాలంటే ప్రజలమధ్య గండికొట్టి ఒకేజాతిగా ఉన్న జాతిని చీల్చమని, లేదా విభజించి పాలించమనీ ఆదేశించలేకపోయాడు! విప్లవకారులకు దృష్టి అనుభవంమీద విశాలం మరింతగా విశాలంకావాలే గాని, సంకుచితమవుతూ పోకూడదు! మార్క్స్ ప్రపంచానికి కావలసింది భాష్యాలు చెప్పడంకాదు, దాన్ని మార్చడం అన్నాడేగాని జాతిసమైక్యతను విచ్చిన్నం చేయమనలేదు.

జ‌గ‌న్ కార్య‌క‌ర్త‌ల చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు

రప్పారప్పా అన్న వారిని రఫ్పాడిస్తున్న పోలీసులు వైసీపీ కార్యకర్తల మెడకు రప్పారప్పా కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. ఇష్టారీతిగా రప్పరప్పా అంటూ దౌర్జన్యాలకు పాల్పడతామంటూ హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా, రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆ ఫ్లెక్సీలకు మూగజావాలను బలి ఇచ్చి రక్తాభిషేకాలు రెచ్చిపోయిన కార్యకర్తలు, జగన్ అభిమానులు ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు.   ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు  సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు. ఇప్పుడు ఆ విషయంలోనే వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  ఔను ఎక్కడెక్కడ ఎక్క‌డ ర‌ప్పా ర‌ప్పా అంటూ  ఈ జంతు బ‌లులు ఇచ్చారో అక్కడక్కడ అలా రక్తతర్పఫాలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు, కార్యర్తలపై కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే జ‌గ‌న్ కార‌ణంగా జైళ్ల‌కు పోయి వ‌చ్చిన లీడ‌ర్ల‌ సంఖ్య విప‌రీతంగా ఉంటే ఇప్పుడది కార్యకర్తల వరకూ పాకింది.  అంటే జ‌గ‌న్ ప్రాపకం కోసం కార్యకర్తలు చేసిన అతి వారిని కేసుల్లో ఇరుక్కునేలా చేసింది. అయినా రప్పారప్పా పోస్టర్లను, జంతు బలులను, రక్తాభిషూకాలు, రక్తతర్పణాలను అడ్డుకుని, అందుకు పాల్పడిన వారిని మందలించాల్సింది పోయి, జగన్ వారిని ప్రోత్సహించడం వల్లే పరిస్థితి ఇంత వరకూ వచ్చిందని ఇప్పుడు వైసీపీ క్యాడరే తలలు పట్టుకుంటున్న పరిస్థితి. జగన్ తన కార్యకర్తలను కూడా క్రిమినల్స్ గానే తీర్చిదిద్దాలన్న భావనలో ఉన్నారు కనుకనే  ఎంతగా రెచ్చిపోతే అంతగా ప్రోత్సాహం అన్నట్లుగా వారిని రెచ్చగొడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   జ‌గ‌న్  పై కేసులు ఉన్నాయి.. అయితే ఆయన లీగల్ టీమ్ ను కోట్లు చెల్లించి మరీ పోషిస్తున్నారు. అయితే.. సామాన్య కార్యకర్తకు ఆ వెసులుబాటు ఉండదు. కేసుల్లో ఇరుక్కుంటే పార్టీ నుంచి ఇసుమంతైనా సాయం అందదు. దీంతో వారు జైళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయం తెలిసి కూడా జగన్  కార్యకర్తలను క్రిమినల్ కార్యకలాపాలవైపు ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఇంతకీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేంటంటే..  జ‌గ‌న్ త‌న హయాంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో  కార్యకర్తలను పట్టించుకున్న పానాన పోలేదు. ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుని వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కోసం ఇంత చేస్తే తమకు జైళ్లు, కేసులూ బహుమతా అంటూ ఫ్రస్ట్రేషన్ కు గురౌతున్న పరిస్థితి.   

అజ్ణాతంలో వల్లభనేని వంశీ .. గాలిస్తున్న పోలీసులు?

చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదంటారు. చేసిన పాపం ఊరికే పోదని కూడా నానుడి. ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 204 వరకూ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నాడు చేసిన తప్పులన్నీ ఇప్పుడు కేసుల రూపంలో వెంటాడుతున్నాయి. ఒకరు ఇద్దరే అని కాదు గత వైసీపీ హయాంలో అధికారం అండ చూసుకుని చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు. కొందరు అరెస్టై జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మరి కొందరు అరెస్టై ఆ తరువాత బెయిలుపై విడుదలయ్యారు. ఇంకా కొందరు అరెస్టు అవుతామన్న భయంతో వణికి పోతున్నారు. కొందరైతే అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. అలాంటి నేతలలో వల్లభనేని వంశీ ఒకరు.  వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ చేసిన తప్పిదాలకు సంబంధించి పలు కేసులు ఉన్నాయి. వివిధ కేసుల్లో నమోదైన అభియోగాలపై ఆయన ఇప్పటికే అరెస్టై.. నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉన్న వల్ల భనేని వంశీ కొద్ది కాలం కిందట బెయిలుపై విడుదలయ్యారు.  బెయిలుపై విడుదలైనా ఆయన రాజకీయాలకు దూరంగా దాదాపుగా ఏకాంత వాసం అనుభవిస్తున్నట్లుగా మెలుగుతున్నారు.  అయితే తాజాగా ఇప్పుడు ఆయన అజ్ణాతంలోకి వెళ్లిపోయినట్లు మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి.  కొత్తగా తనపై నమోదైన కేసులో అరెస్టు భయంతోనే ఆయన అజ్ణాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. సునీల్ అనే వ్యక్తిపై హత్యాయత్నం కేసులో విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో వంశీపై తాజాగా కొత్త కేసు నమోదైంది.  జూన్ 2024లో  వంశీ తన అనుచరులతో సునీల్ ను హత్య చేయడానికి కుట్రపన్నారన్నది ఆ కేసు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ వంశీ  హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు వంశీ ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే విచారణకు రావాల్సిందిగా పోలీసులు వంశీకి నోటీసులు అందించడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అరెస్టు భయంతో ఆయన అజ్ణాతంలోకి వెళ్లారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వంశీ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  ఇప్పటికే వల్లభనేని వంధీ కిడ్నాప్, బెదరింపులు, ఎస్సీఎస్టీ అట్రాసిటీస్, తెలుగుదేశం గన్నవరం కార్యాలపంపై దాడి తదితర కేసులను ఎదుర్కొంటున్నారు. ఆ కేసులలో అరెస్టై బెయిలపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా కేసులో అరెస్టు భయంతో  వల్లభనేని వంశీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

కేసీఆర్ హాజరు సంతకం అనే లాంఛనం కోసమేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య రాజకీయ స్నేహం గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇరువురూ ఒకరి ప్రయోజనాల పరిరక్షణ కోసం మరొకరు అన్నట్లుగా నిలబడ్డారన్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.  ఈ నేపథ్యంలో  తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సభకు హాజరయ్యారు. ఇందుకు నేపథ్యం ఏమిటని చూస్తే.. గత కొన్ని రోజులుగా  సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ కేసీఆర్ చాటడంతో ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఆయన సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఆయన సవాల్ చేసినట్లుగా అసెంబ్లీలో ఆయన గళమెత్తలేదు. సభలో ఐదారు నిముషాల పాటు.. అదీ సంతాప తీర్మానాల ఆమోదం వరకూ మాత్రమే సభలో ఉన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లిపోయారు. సభలో బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడలేదు.  ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగింది.  దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యింది కేవలం అనర్హత వేటు పడకుండా ఉండేందుకు సభలో అటెండెన్స్ వేయించుకోవడానికేనన్న చర్చ మొదలైంది. సభకు హాజరై ఒక సంతకం చేసేసి మౌనంగా ఆయన సభ నుంచి నిష్క్రమించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే వారు కేసీఆర్ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుతో పోలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా ఒకే ఒక సారి అసెంబ్లీకి హాజరై రిజిస్టర్ లో సంతకం చేసి, ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారు. అసలు అసెంబ్లీ అవసరమేమిటి? ప్రజా సమస్యలపై ప్రెస్ మీట్లలో మాట్లాడితే సరిపోదా అన్న తీరులో ఆయన వ్యవహార శైలి ఉంది. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా సరిగ్గా అలానే వ్యవహరించనున్నారా అన్న అనుమానాలు అత్యధికుల్లో వ్యక్తం అవుతున్నాయి.   మొత్తం మీద శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి హాజరు వేయించుకునే లాంఛనాన్ని కేసీఆర్ పూర్తి చేసి.. తాను తన రాజకీయ మిత్రుడు, వైసీపీ అధినేత జగన్ నే ఫాలో అవుతున్నానని చాటినట్లైందని అంటున్నారు.  

అసెంబ్లీలో సుహృద్భావ వాతావరణం.. కేటీఆర్ తీరు పంటి కింద రాయి తీరు!

చట్ట సభలు అంటే ఒకప్పుడు ప్రజాస్వామ్య దేవాలయాలుగా భాసిల్లేవి. అసెంబ్లీ, లోక్ సభలో జరిగే చర్చలు బాధ్యతాయుతంగా, అర్ధవంతంగా సాగేవి. సభలో సభ్యుల మధ్య అంశాలవారీగానే విభేదాలు తలెత్తేవి తప్ప.. ఎన్నడూ వ్యక్తిగత స్థాయికి దిగజారేవి కాదు. అయితే రాను రాను ఆ పరిస్థితి మారిపోయింది. సభ వేదికగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు అన్నవి సర్వసాధారణమన్నట్లుగా మారిపోయాయి. సభలో ప్రజా సమస్యలపై చర్చ అన్నదే మృగ్యమైపోయిన పరిస్థితి ఏర్పడింది.  తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన  మార్పు కానవచ్చింది.  సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.  ఆ వాతావరణం తాజాగా సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. నిప్పుల తూటాలలాంటి విమర్శలతో ఇటీవల ఒకరిపై ఒకరు విరుచుకుపడిన రేవంత్, కేసీఆర్ లు సభలో పరస్పరం పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సీఎం రేవంత్ ఆప్యాయంగా, కలుపుగోరు తనంగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ అసెంబ్లీలో ఎన్నడూ కనబడని అరుదైన దృశ్యంగా ఇది చాలా కాలం యాదుండి పోతుందనడంలో సందేహం లేదు. ఈ సుహృద్భావ పూరిత వాతావరణం ఏర్పడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. అసెంబ్లీలోకి అడుగుపెడుతూనే రేవంత్ రెడ్డి ముందుగా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్థానం వద్దకు వెళ్లారు. ఆయనను మర్యాదగా పలకరించి, ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆ తరువాత ఆప్యాయంగా షేక్ హ్యాండిచ్చి మరీ తన స్థానానికి వెళ్లారు. పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుసరించి కేసీఆర్ ను పలుకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది అసెంబ్లీలో సభా మర్యాదలు ఎలా ఉండాలన్నదానికి అద్దంపట్టింది. అ యితే ఇంత జరిగినా పంటి కింద రాయిలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు వ్యవహరించారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా విపక్షాల వద్దకు వచ్చిన సమయంలో  కేసీఆర్ సహా అక్కడ అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడినా కేటీఆర్, కౌషిక్ రెడ్డిలు మాత్రం  తన స్థానం నుంచి లేవకుండా మౌనంగా కూర్చుండిపోవడం సభలో వాతావరణం సమూలంగా మారలేదనడానికి తార్కానంగా నిలిచింది. రేవంత్ చూపిన స్ఫూర్తికి విఘాతంగా కేటీఆర్ తీరు ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయిన పనులేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పరాజయానికి ప్రధాన కారణం తన హయాంలో జరిగిన మేలు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం కావడమేనని తరచూ చెబుతుంటారు. తన ఓటమికి కారణం ఆ చెప్పుకోలేకపోవడమేనని నమ్ముతుంటారు.  ఇంతకీ ఆయన హయాంలో చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటి?  అంత చేసీ ఎందుకు చెప్పుకోలేకపోయారు అన్న విషయంపై సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో డిబేట్ జరుగుతోంది. వాస్తవానికి ఆయన అరకొరగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు అంతకు వందింతల ప్రచారం చేసుకున్నారు.   జ‌గ‌న్ చేసిన సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌చారానికి ప్రత్యేకంగా ఒక నెట్ వర్కే  ఉండేది.  ఏపీడీసీ వంటి  సంస్థ‌లు కూడా ఆ నెట్ వర్కక లో ఉండేది. ఏపీసీసీని జగన్ ఆంధ్రప్రదేశ్  డిజిట‌ల్ కార్పొరేష‌న్ (ఏపీడీసీ)గా పేరు మార్చి దానికి భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించారు.   ఒక నిమిషానికి రెండున్న‌ర వేలు ఇవ్వాల్సింది కాస్తా  ప‌ది ప‌న్నెండు వేలుగా ఇచ్చి.. మ‌రీ వీడియోల రూప‌క‌ల్ప‌న చేశారు. ఇదిలా ఉంటే సంక్షేమ ప‌థ‌కాల బ‌ట‌న్ నొక్కుడు కార్య‌క్ర‌మాల‌కు సిద్దం  సభ‌ల‌క‌న్నా మించిన స‌భ‌లు ఏర్పాటు చేసి... వాటి ద్వారా జ‌నాన్ని పోగేసి సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కూడా జగన్ హయాంలో ప్రభుత్వ సంక్షేమాన్ని గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించారు.   ఇందుకు ఒక ఎమ్మెల్సీ తన సిబ్బందితో ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించ‌గా.. వాటిని నాటి మంత్రి పెద్ది రెడ్డి సూప‌ర్వైజ్ చేసేవారు. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చేసేవారు. ఇక్కడ చెప్పుకోవల సిందేమిటంటే..  ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు. వారి శోధనలో జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటంటే..  ఎలుక‌లు ప‌ట్ట‌డానికి  కేటాయించిన రూ. 1. 6 కోట్లు, తాడేప‌ల్లి ప్యాలెస్ చుట్టూ కంచె కోసం ఖర్చు చేసిన రూ. 12. 5 కోట్లు, ఎగ్ ప‌ఫ్ ల కోసం రూ. 3. 6 కోట్లు, పాస్ పుస్త‌కాల‌పై తన ఫోటోల కోసం రూ. 13 కోట్లు,  వైయ‌స్ విగ్ర‌హాల ఖ‌ర్చు రూ. 18 కోట్లు, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడానికి ఖర్చు చేసిన రూ.150 కోట్లు.  తన పర్యటనల కోసం విమానాలు, హెలికాప్టర్ల కోసం ఖర్చు చేసిన  రూ. 222 కోట్లు. వీటి గురించే జగన్ చెప్పుకోలేకపోయారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేనా  రుషికొండ ప్యాలెస్ కి రూ. 600 కోట్లు, బియ్యం సంచులు మోయ‌డానికి  రూ. 700 కోట్లు, స‌రిహ‌ద్దు రాళ్ల‌పై ఫోటోల‌కు ఇంకో రూ. 700 కోట్లు కూడా జగన్ ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. ఆ ఖర్చుల గురించి కూడా జగన్ జనాలకు చెప్పుకోలేకపోయారట. ఆ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నది జగన్ భావన అని నెటిజనులు తేల్చారు. అవి చెప్పుకోలేకపోవడం వల్లనే కనీసం 11 స్థానాలైనా వచ్చాయనీ, వాటి గురించి కూడా ఘనంగా చెప్పుకుని ఉంటే, అవి కూడా వచ్చేవి కావని సామాజిక మాధ్యమంలో జగన్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. 

కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్

నిప్పూ ఉప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకునే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఆసెంబ్లీలో ఆప్యాయంగా పలకరించుకున్న సన్నివేశం అందరినీ అలరించింది. సర్వత్రా ఆసక్తి కలిగించింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తరువాత కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సంఘటన అధికార ప్రతిపక్ష సభ్యులను విస్మయానికి గురి చేసింది. సభా మర్యాదలంటే అలా ఉండాలన్న చర్చ అధికార ప్రతిపక్షాలలో జరిగింది.   అదలా ఉంటే.. రేవంత్ కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు కూడా కేసీఆర్ ను పలుకరించి ఆయనతో కరచాలనం చేశారు.  ఇక ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  ‎

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్  భేటీలో రాష్ట్ర అభివృద్ధి,  పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా   కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే  కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో.. రూ.103.96 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేయనుంది.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఇకపోతే..  రాజధాని అమరావతి అభివృద్ధి పనుల వేగవంతంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో  సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.   ఇంకా వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే  అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  109 కోట్ల రూపాయల కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.   అమరావతి పరిధిలోని శాఖమూరు లో 23 ఎకరాలలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల  నిర్మాణానికీ, అలాగే తాళ్లూరులో  6 ఎకరాలో  హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం  నిధుల కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  

సినిమాలకు తమిళ హీరో విజయ్ గుడ్ బై.. రాజకీయాలకే పూర్తి సమయం

రాజకీయ నాయకుడిగా మారిన తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించిన సంఘటనతో ఆయన తొలి అడుగులు ఒకింత తడబడ్డాయి.  దాని నుంచి తేరుకుని ముందుకు సాగడానికి ఒకింత సమయం తీసుకున్న విజయ్ ఇప్పుడ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే  సినిమాల‌కు గుడ్ బై చెప్పారు విజ‌య్.  ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం. వచ్చే ఏడాది త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నికలకు విజయ్ సర్వసన్నద్ధం అవుతున్నారు.  ఏ పార్టీలతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టనున్నట్లు  ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో విజయ్  టీవీకే పార్టీకి ఉన్న విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీవీకే విజయం కంటే ఎన్డీయే కూటమికి భారీ నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలింది.  టీవీకే పోటీ వల్ల బీజేపీ, అన్నాడీఎంకే  కూటమి ఓట్లు భారీగా చీలుతాయని పేర్కొంది. అంటే విజయ్ పార్టీ పోటీ వల్ల లాభపడేది అధికార డీఎంకే అన్నది సీఓటర్ సర్వే సారాశంం.   ఇక సైద్ధాంతికంగా బీజేపీతో, రాజ‌కీయంగా డీఎంకేతోనే త‌మ  పోటీ అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. విజయ్ స్వయంగా మధురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.  విజయ్ ది చెన్నై. అయితే ఆయ‌న మ‌ధురైని త‌న సొంత  నియోజ‌క‌వ‌ర్గం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. స్టార్ హీరో కావడంతో విజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాన్య జనంలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో మధురైలో ఆయన స్థానికేతరుడు అన్న సమస్య తలెత్తే అవకాశం ఉండదన్నది పరిశీలకులు అంచనా.    ఇక పోతే విజ‌య్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆ పార్టీలో విజయ్ వినా పెద్దగా  ఫెమిలియ‌ర్ ఫేస్ మరొకటి లేదు. ఒక వేళ విజ‌య్ పార్టీలోకి రావడానికి డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ వంటి  పార్టీలు ఆసక్తి చూపుతున్నా.. వారికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోని ఆహ్వానించడానికి విజయ్ పెద్దగా సుముఖత చూపడం లేదు.  ఆయ‌న వారిని ఏమంత‌గా  తీసుకోవ‌డం లేదు.  ఏపీ నుంచి న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం త‌న భ‌ర్త ఇన్ ఫ్లూయెన్స్ వాడి విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకేలో చేరాల‌ని ప్రయత్నించినా, ఆమెకు అక్కడ నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. దీంతో పార్టీలో పెద్దగా పాపులర్ అండ్ ఫేమస్ నేతలు లేకపోవడం విజయ్ టీవీకే పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   ఒక తమిళ రాజకీయాలలో ప్రస్తుత పరిస్థితిని ఒక సారి గమనిస్తే.. రాష్ట్రంలో  బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొత్తులో భాగంగా ఒకటి రెండు స్థానాలు దక్కితే అదే చాలనుకునే పరిస్థితిలో  బీజేపీ ఉంది.  దీంతో ప్రధాన పోటీ  డీఎంకే- టీవీకే మ‌ధ్యే ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.    ఇక విజ‌య్ టీవీకే పార్టీ నుంచి అత్యధికంగా ఆయన అభిమాన సంఘాల నాయకులకే టికెట్ లు లభించే అవకాశం కనిపిస్తోంది. అంటే టీవీకే తరఫున పోటీ చేసే అభ్యర్థులలో అత్యథికులు ఆ పార్టీ నేత విజయ్ తో కలిసి రాజకీయాలకు కొత్తవారే అవుతారు. ఇది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద  డీఎంకే,  టీవీకే మ‌ధ్య  ముఖాముఖీ అన్నట్లుగా జరగనున్న   త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందనడంలో సందేహం లేదు.  

అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్.. హీట్ మామూలుగా ఉండదుగా?

తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమి తమయ్యారు. అయితే ఆ పాత్రలో ఆయన ఎంత మాత్రం క్రియాశీలంగా లేరు. ఓటమి తరువాత ఆయన పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన  ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.   అయితే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత, ఆయన అనివార్యంగా రాజకీయాలలో క్రీయాశీలం కావలసిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికీ, పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ స్వయంగా నడుంబిగించకుంటే లాభం లేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా బలోపేతం అవుతోంది. దీంతో తన పొలిటికల్ అజ్ణాత వాసానికి ఫుల్ స్టాప్ పెట్టి జనంలోకి రావడానికి సిద్ధమైపోయారు. తాజాగా ఇటీవల ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఇక నుంచీ తాను పొలిటికల్ గా క్రియాశీలమౌతాననీ,  అదే సమయంలో అసెంబ్లీలో పార్టీ తరఫున బలమైన గొంతు వినిపించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. ఈ మాటలే ఆయన ఈ సారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు అవుతారని తేటతెల్లం చేసింది. అయినా ఎక్కడో ఏదో అనుమానం.  గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో కూడా ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనీ, అధికార పక్షాన్ని తన ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిర చేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను సభ సాక్షిగా ఎండగడతారనీ బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా నమ్మాయి. అయితే  అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. గొంతు విప్పలేదు. ఫామ్ హౌస్ గడప దాటలేదు. మరి ఇప్పుడైనా అసెంబ్లీకి వస్తారా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే కాదు, పార్టీ శ్రేణులనుంచి కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ హాజరౌతున్నారు. సోమవారం (డిసెంబర్ 29) ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.  ఇక ఇప్పుడు ఆయన అసెంబ్లీలో గొంతు విప్పి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెడతారా? స్పీకర్ ఆయనకు కోరినంత సమయం మైక్ ఇస్తారా? లేకుంటే? అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్  తలపడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మొత్తం మీద కేసీఆర్ హాజరుతో ఈ శీతాకాల సమావేశాలు రోహిణీ కార్తెను మించిన హీట్ తో సాగుతాయనడంలో ఎలాంటి సందేహాలు లేవంటున్నారు. 

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామ్ తో చంద్రబాబు భేటీ.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ  అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి   సహకారం, బడ్జెట్ లో ప్రాధాన్యత వంటి అంశాలను చంద్రబాబు ఆమెతో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కృష్ణా జిల్లా  పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కంభంపాటి తల్లి వెంకటనరసమ్మ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కంభంపాటి రామ్మోహనరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.   వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.