దిగ్విజయ్: తెలంగాణ తేలికైన విషయం కాదు?


డా. ఎబికె. ప్రసాద్
(సీనియర్ సంపాదకులు)

 

 


 

 

"చల్లకోసం వచ్చి ముంత దాచటం" సాధ్యం కాదన్న సామెతకు చాలా అర్థం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎంత క్లిష్టమైనదో తెలిసి ఉండి కూడా, అందులోనూ ఏక భాషా సంస్కృతులు ఆధారంగా ఒక జాతిని రెండు రకాల పరాయి పాలకుల మధ్య (బ్రిటిష్, మొగలాయీ పాలకుల కింద), వాళ్ళ సామ్రాజ్య ప్రయోజనాల మధ్య పరాయి ప్రాంతాల్లో పుట్టకొకరు, చెట్టుకొకరుగా చెల్లా చెదరై ఉన్న తెలుగువారందరినీ భాషా ప్రయుక్త, రాష్ట్ర ప్రాతిపదికపైన ఒక్క గొడుగు కిందకు చేరుకోవటానికి అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ అవతరణ మౌలిక లక్ష్యానికే చేటు తెచ్చే విభజన వాదన వల్ల మొత్తం తెలుగు జాతి ఉనికికే రాగల నష్టమెంతో తెలిసి ఉండి కూడా - కేవలం ఎన్నికల్లో ఓట్లు, సీట్ల కోసం జాతీయ కాంగ్రెస్ నాయకత్వం 'రెండు ఆవుల దూడలా', రెండు నాల్కలతో తప్పుడు రాజకీయాలకు తెరలేపి కూర్చుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానంలో ఒక ముఖ్యుడు, నిన్నమొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాలు చూస్తూ వచ్చిన కేంద్ర మంత్రి అజాద్ స్థానంలో, అంతకు ముందు కొన్నాళ్ళు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు చూసి చాలించుకున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దౌత్య సంప్రదింపుల్లో మంచి లౌకికం ప్రదర్శించగల నేర్పుగల దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారకర్తగా నియమితులయిన తరువాత రాష్ట్రానికి వచ్చి, "రాష్ట్ర విభజన సమస్యపై" స్థానిక ప్రజల అవకాశవాద నాయకుల అభిప్రాయాలు తెలుసుకుని తిరిగి డిల్లీ వెళ్లారు. కాని ఏ "సమస్య" పరిష్కారం పేరుతో కేంద్రం తరపున (యు.పి.ఎ) దిగ్విజయ్ వచ్చారో, ఏ రకమైన తాత్కాలిక "మాండేట్"తో వచ్చారో, ఆ మాండేట్ లక్ష్యమేమిటో చెప్పకుండానే మళ్ళీ తిరుగు ప్రయాణం కట్టారు. అందరి మాటలూ వినడమైతే విన్నారు. విభజనకు అనుకూల ప్రతికూల వర్గాల కబుర్లు విన్నారు; ప్రాంతాల్లోని అవకాశవాదుల మాటలు విన్నారు; అధికారంలో ఉన్నా ఊడినా కూడా నిత్యం కొట్లాడుకునే ఏకైక జాతీయ రాజకీయ పక్షంగా కొన్ని దశాబ్దాలుగా మనుగడసాగించుకుంటున్న కాంగ్రేస్‌లోని రాష్ట్ర శాఖీయుల మధ్య కుమ్ములాటలూ చూశారు. కొందరి దృష్టిలో ‘సిద్దడు వేమారం వెళ్లనూ వెళ్లాడు, తిరిగి రానూ వచ్చాడ’న్న సామెత ప్రకారం దిగ్విజయ్‌ కనిపించవచ్చు! కాని, అసహజమైన రాష్ట్ర విభజన ప్రతిపాదనపైన ఈనాడు కాదు ముప్పయ్యేళ్లనాడే (1972లో) నాటి ప్రధానమంత్రి దివంగతురాలు కాకముందు ఇందిరాగాంధి భారత పార్లమెంటు నిండు పేరోలగంలో నిష్కర్షగా నీజాయితీతో చేసిన విస్పష్టమైన ప్రకటనకు విరుద్ధంగా వెళ్ళడం సాధ్యపడదన్న అవగాహన ఉన్న అగ్రనాయకుల్లో దిగ్విజయ్‌ ఒకరు. నేడు ఇందిరాగాంధీ సజీవురాలై ఉండి ఉంటే 1972 నాటి ప్రకటనకు విర్ధుంగా వెళ్ళదు. సోనియా మౌనం వీడితేగాని విషయాలు మరింత సుబోధికం కావు!



ఆ మౌనాన్ని చేదించడానికే దిగ్విజయ్‌ యాత్ర. ఆ పూర్వా పరాలేగాదు, ఒక పెద్ద రాష్ట్ర (మధ్యప్రదేశ్‌) ముఖ్యమంత్రిగా విభజన వాదం వల్ల తన రాష్ట్రానికి కలిగిన కష్ట, నష్టాలన్నీ ఎలాంటివో కూడా ఆయనకు తెలుసు. అందుకనే తాజాగా మన రాష్ట్ర పర్యటన సందర్భంగా దిగ్విజయ్‌ అవకాశవాద రాజకీయాలకు పలు రకాల ప్రశ్నలను గుచ్చి గుచ్చి అడుగుతూ వచ్చారు. వాటిలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న, ఆదాయ వ్యయాలకు సంబంధించిన ప్రశ్న (వినతి పత్రాలను పక్కన పెట్టించి) ‘ప్రస్తుతం రాజధాని హైదరాబాద్‌ నగరం నుంచే ర్ఱాష్ట బొక్కసానికి అత్యధికంగా ఆదాయం వస్తోందని లెక్కలు సృష్టంగా నిరూపిస్తున్నాయి. హైదరాబాద్‌ నగరం ఏ ఒక్కరిదో కాదు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారూ, ఇతర రాష్ట్రాలకు చెందినవారూ, అనేక పరిశ్రమలు, కంపెనీలు ఇక్కడ స్థిరపడిపోయి ఉన్నందున అది అందరికీ చెందిన రాజధాని అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడం ఎలాగో ఎవరైన ఆలోచించారా’’ అని దిగ్విజయ్‌ ప్రశ్నించారని పత్రికా వార్తలు! ఈ ప్రశ్నకు పదవీకాంక్షలో ఉన్న రాజకీయ నిరుద్యోగులెవ్వరూ సరైన సమాధానంయివ్వలేకపోయారు. ఎందుకంటే ‘ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు ఒకవైపు నుంచి తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం కారణం కాగా మరొకవైపు నుంచి ఆంధ్ర, హైదరాబాద్‌ స్టేట్‌ శాసనసభలు మెజారిటీ సభ్యుల సంయుక్త తీర్మానాలు కారణమయ్యాయన్న సత్యాన్ని మరవరాదు. కనుకనే దిగ్విజయ్‌ కూడా రాష్ట్రంలోనూ, దేశంలోనూ నెలకొని ఉన్న పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మాత్రమే రాష్ట్ర విభజన సమస్యపైన కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.


అంతకు ముందు శ్రీకృష్ణ కమిటీ నివేదిక తన ప్రాధాన్యం సమైక్య రాష్ట్రమే ననీ, తెలుగు ప్రజల భావి భాగ్యోదయానికి అదే శ్రీరామరక్ష అని అభిప్రాయం ప్రకటిస్తూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ (కోస్తా, రాయలసీమ, తెలంగాణా) అన్నింటి కంటే ఎక్కువగా వెనుకబడి ఉన్నది ఒక్క రాయలసీమ ప్రాంతమేననీ, అభివృద్ధికి సంబంధించి ఏ అంశాన్ని తీసుకున్నా రాయలసీమ వెనుకబాటు తనానికి లెక్కలన్నీ దాఖలాలుగా నిలిచాయనీ సృష్టం చేసినప్పుడు ‘మాకు లెక్కలతో, వాదనలతో పనిలేదు. మా (తెలంగాణా) రాష్ట్రం మాకిచ్చేయండి’’ అని రాజకీయ నిరుద్యోగ నాయకులు ఎదురు వాదించడం జరిగింది!  కాని అప్పుడు ‘మాకు లెక్కలతో, వాదనలతో’ నిమిత్తం లేదన్నవీరు, ‘రేపు ఏర్పడే రెండు రాష్ట్రాల రాజధానుల్లో ప్రభుత్వాలకు ఆధాయ వనరులు ఒకే విధంగా ఉంటాయనీ, ఆధాయ పంపిణీ విషయంలో విభజన ఇబ్బందీలేమీ ఉండవనీ’ ఏభరోసాతో, ఏలెక్కమీద, ఏ గణాంకాల మీద ఆధారపడి చెబుతున్నారో కనీసం ‘కాకిలెక్కల్ని’ అయినా చూపి దిగ్విజయ్‌ ముందు నిరూపించలేకపోయారు! అదే సమయంలో వీరు, తోటి తెలుగువారిపై విద్వేష ప్రభావాన్ని (వాళ్ల ఆస్తులన్నీ మనం ఆక్రమించవచ్చు, వాళ్లను హైదరాబాద్‌ నుంచి, తెలంగాణా నుంచి తరిమివేస్తే, వాల్ల ఇళ్లూ, భుమూలూ సర్వస్వం ఆక్రమించుకోవచ్చు, ఫలితంగా ఉద్యోగాలన్నీ తెలంగాణా యువతకే దక్కుతాయ’న్న ప్రచారం) ముమ్మరం చేసి, ఒక భయ కంపిత వాతావరణాన్ని సృష్టించడం ద్వారా కల్పించిన ఆశలు నెరవేరకపోయేసరికి, తెలంగాణా బిడ్డల్ని ఆత్మహత్యలవైపునకు రాజకీయ నిరుద్యోగులైన నాయకులు బలవంతంగా నెట్టారు. ఈ తమ నేరస్త మనస్తత్వాన్ని తోటి తెలుగు ప్రజలపైకి నెడుతూ ఇప్పుడు ‘కేంద్రం నుంచి తెలంగాణా ఏర్పాటు నిర్ణయం రావడం ఆలస్యమవుతున్న కారణంగా ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయ’ని కేంద్రంపైకి నిందను నెట్టడానికి కూడా జంకలేదు!

 

అంతే కాదు, ‘‘2009 డిసెంర్‌ 9’’ ప్రకటన గురించి ప్రస్తావించినప్పుడు కూడా దిగ్విజయ్‌ సింగ్‌ సమాధానమిస్తూ ‘‘ఆ ప్రస్తావనలో చర్చ ప్రక్రియ ప్రారంభమైనదని చెప్పడంతో పాటు ఆ ప్రకటనలో సమస్యను రాష్ట్రా అసెంబ్లీ నివేదించి, అక్కడ తీర్మానం చేయాలని కూడా ఉందని’’ గుర్తుచేశారు! అంటే, ఇన్నాళ్లూ ఏర్పాటు వాదులయిన రాజకీయ నిరుద్యోగులు ‘అసెంబ్లీ తీర్మానం’ అవసరమని ‘‘2009 డిసెంబర్‌ 9’’ ప్రకటనలో ఉన్న షరతును కావాలనే మభ్యపెడుతూ వచ్చారని గమనించాల్సి ఉంది! అంతేగాదు, గతంలో బిజెపి వారి వేర్పాటు రాజకీయంతో ఎన్‌.డి.ఎ` బిజెపి సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రాలను చీల్చి ఏర్పాటు చేసిన ఛత్తీస్‌ఘడ్‌, ఉత్తారాఖండ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలను సహితం అసెంబ్లీ తీర్మానాల ద్వారా ఏర్పాటయినవేనని దిగ్విజయ్‌ గుర్తు చేయాల్సి వచ్చింది. అలాగే తాను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలోని బిజెపి సంకీర్ణ ప్రభుత్వం మధ్యప్రదేశ్‌ను విచ్చిన్నంచేసి ఛత్తీస్‌ఖడ్‌ను ఏర్పరచడం వల్ల తామెన్ని కష్ట, నష్టాలకు, వేదనకు గురి అయ్యామో ఆయన మన రాష్ట్రంలోని మందమతులకు పదవీ కాంక్షపరులకూ గుర్తు చేయాల్సి వచ్చిందని మరచిపోరాదు, అందుకే ‘విభజన’ అనేది ‘అతిక్లిష్టం, బాధాకరం’ అని ఆయన పాఠం చెప్పాల్సి వచ్చింది! అందుకే దిగ్విజయ్‌ మరొక హెచ్చరిక కూడా ఈ పర్యటనలో చేయాల్సి వచ్చింది. కేంద్రం ఇంతకూ ‘ఏ నిర్ణయం’ తీసుకోబోతోందన్న విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఇలా హెచ్చరించారు.

 

‘రాష్ట్ర విభజన సమస్యపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన వ్యక్తులతో (కోర్‌కమిటీ) కూడిన  సంఘం ప్రత్యేకంగా సమావేశమవుతుంది. అన్నీ ఆలోచించాకనే కమిటీ ఒక నిర్ణయానికి వస్తుంది. రాష్ట్రాన్ని విభజించినా, యధాతథంగా సమైక్యరాష్ట్రంగానే కొనసాగించినా అందుకు రాష్ట్ర నాయకులంతా కట్టుబడి ఉండాల్సిందే, ఆ తరువాత జరగబోయే పరిణామాలను ధైర్యంగా ముందుండి ఎదుర్కొవడానికి కూడా మీరంతా సిద్ధంగా ఉండాలని’’ ఆయన హెచ్చరించారు! ఎందుకంతగా దిగ్విజయ్‌ ముందస్తుగా హెచ్చరించాల్సి వచ్చింది? అందుకూ ఆయన స్వయానుభవంతో యిలా స్వష్టం చేయాల్సి వచ్చింది.

 

'రాష్ట్ర విభజన అనేది చాలా క్లిష్టమైనది, బాధాకరమైనదీ, ఆ బాధేమిటో నేను స్వయంగా అనుభవించాను. నేను మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్ర విభజన జరిగి ఛత్తీస్‌గఢ్‌ ఏర్పడిరది. అప్పట్లో చాలా ఇబ్బందులు కళ్ళారా చూశాను. అందువల్ల రాష్ట్రాన్ని విభజించడం ఆషామాషీ వ్యవహారం కాదు. బల్లలు, కుర్చీలు మొదలుకుని నీళ్లు, విద్యుచ్చక్తి, అప్పులు, ఆదాయాల దాకా ఎన్నెనో పంపిణీ చేయాల్సి ఉంటుంది. సమస్యలు కూడా చాలా ఉంటాయి. మధ్యప్రదేవ్‌ విభజన జరిగినప్పుడు విద్యుత్‌ ప్రాజెక్టులన్నీ ఛత్తీస్‌ఖడ్‌లో ఉంటే వాడకందార్లందరూ మధ్యప్రదేశ్‌లో ఉండి పోయారు. అలాగే పంజాబ్‌ను వీడగొట్టినప్పుడూ ఈ బాధలనే ప్రజలు చావి చూడాల్సి వచ్చింది!   

 


ఇదే (పంజాచ్‌ విభజన) సమస్యను ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ పర్యటన సందర్భంగాను ప్రసిద్ధ పాత్రికేయులు, ఇంగ్లాండ్‌లో భారత మాజీ హైకమిషనర్‌ అయిన కులేదీప్‌నయ్యార్‌ కూడా పంజాబ్‌ విభజనవల్ల హర్యానా, పంజాబ్ పూచిరువురూ ఎలా దెబ్బతిన్నావో వివరించి, ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి పరిస్థితిని కోరికోరి కొని తెచ్చుకోవద్దని హెచ్చరించి పోయాడని మరవరాదు! ఇదే స్ఫూర్తితో బహుశా దిగ్విజయ్‌సింగ్‌ కూడా స్వీయానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్ర పర్యటనలో ప్రాంతీయ రాజకీయ నిరుద్యోగుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ‘సమస్యను పరిశీలించబోమని’ ప్రత్యక్షంగా అనకుండా పరోక్షంగా విభజనవల్ల రాబోయే పరిణామాల గురించి పరోక్షంగా చెప్పక చెప్పక చెప్పాడు.

 

ఇంతకూ విచారకరమైన అసలు విషయం ` విజయాన్ని గాకుండా విషాన్ని పంచే విభజన సూత్రానికి 1969`71మధ్య కాలంలో తెలంగాణాలో భుస్వామ్య, జాగిర్దారీ దాష్టికాలతో పేద, మధ్యతరగతి ప్రజాబాహుళ్యాన్ని దోచుకు తినడంలో నిజాం ప్రభువుల కనుసన్నల్లో కీలకమైన పాత్రవహించిన కె.వి.రంగారెడ్డి కుటుంబీకుడు తెలంగాణా కాంగ్రెస్‌ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ చెన్నారెడ్డి కాగా ఈసారి ప్రాంతీయ రాజకీయ నిరుద్యోగులుగా కోస్తాంధ్ర నుంచి వలసవచ్చిన ‘బొబ్బిలి దొర’ కె.సి.ఆర్‌ కుటుంబం మచిలీపట్నం పూర్వ రంగంగా తెలంగాణాలో తిష్టవేసిన కె.కే. (కేశవరావ్‌) ఉద్యమ శల్య సారధులు కావటం!
 

‘ఛత్తీస్‌గడ్‌, ఉదాహరణ ‘వేరట, తెలంగాణా ‘సమస్య’ వేరట! కెసిఆర్‌ స్థానిక పార్టీతో పడని ‘తెలంగాణా సంయుక్త కార్యాచరణ సంఘం’ (టి.జె.ఎ.సి)లో మళ్లీ లుకలుకలు, ఆ రెండిరటికీ పడకపోగా, పరస్పరం అలకలు, ఖండన మండనలతో కాలక్షేపం చేస్తూ ఉస్మానియా విశ్వవిధ్యాలయ ఆచార్య పదవికి సెలవుపెట్టి, ఇన్నాళ్లుగానూ నెలవారీ జీతం సజావుగానే పొందుతూ మాత్రం ఢోకా లేకుండా పొందుతూ ‘టి’ జాక్‌ ఉద్యమానికి మాత్రం నాయకత్వం వహిస్తున్న కోదండరామరెడ్డితో దళిత, బహుజన వర్గాల నాయకులకు పడకపోవడం మరో ‘ఫార్సు’, ‘సామాజిక తెలంగాణా’ వాదులలో పెక్కుమందికి కెసిఆర్‌, కోదండరామ్‌ విభాగాల పొడగిట్టదు. అందుకని రాజకీయ ‘దుకాణాలు’ మారిపోతున్నాయి! వందలకోట్ల రూపాయలను కెసిఆర్‌ ‘ఉద్యమం’ పేరిట వసూళ్లు చేసుకుని కుటుంబాన్ని మల్టీనేషనల్‌ కంపెనీగా మార్చాడని దళిత వర్గ నాయకురాలు గజ్జెల కాంతం దండోరా వేస్తుండగా, కె.సి.ఆర్‌ ‘సకల జనుల సమ్మె’ను రూ.50 కోట్లకు అమ్మేశాడని స్వయాన కె.సి.ఆర్‌. సోదరుడి కూతురు రమ్య చాటుతోంది!
 

ఇక కోదండరామ్‌ తరపున వెలువడుతున్న విచిత్ర ప్రకటనల్లో తాజా వార్త - వాళ్లూ వీళ్లూ కాదు సరాసరి సోనియాగాంధీ నుంచే కోదండరామ్‌కు పిలుపు రానున్నదన్న ప్రచారం. ఇది ప్రధానంగా స్థానిక బడా పెట్టుబడిదారుడైన రాజాం నేతృత్వంలో నడుస్తున్న పత్రికలో తప్ప ఇతర పత్రికల్లో రాలేదు. ‘తెలంగాణా రాష్ట్రం’ ఏర్పాటుకోసం ఉద్యమాన్నిమోపుచేసే పేరిట ప్రస్తుతం కోదండరామ్‌ ఢిల్లీలో విభజన ప్రేమికులయిన కొన్నిచిల్లర పార్టీల నాయకులతో ఓ రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిపారు. ఇది ఇలా ఉండగానే లోకసభ మాజీ స్వీకర్‌ సంగ్మా రెండవ ఎస్‌.ఆర్‌.సి. (రాష్ట్రాల పునర్విభజన పరిశీలనా సంఘం)ని ఏర్పాటు చేయడం ఉత్తమమని ప్రతిపాదించారు. అయితే చరిత్ర తెలియని కొందరు ప్రాంతీయ రాజకీయ నిరుద్యోగనాయకులు పూర్వపు తెలంగాణా రాష్ట్రమే తమకు అభిలషణీయమని దిగ్విజయ్‌కు ఒక నివేదిక అందజేశారు! చారిత్రక అజ్ఞానానికి హద్దులుండవు. ఎందుకంటే తెలంగాణా ఏనాడూ రాష్ట్రంగా లేదు. అది హైదరాబాద్‌ సంస్థానపు పరాయి పాలకుల (మోగలాయిల`బహమనీల`నిజాముల)పాలనలో నలిగిపోయిన ప్రాంతాలలో ఒక భాగం మాత్రమే! ఈ విషయం కోదండరామ్‌ ప్రభృతులకు తెలియక పోవచ్చునేమోగాని, తెలంగాణా సాయుధపోరాటానికి నాయకత్వం వహించిన అగ్రశ్రేణి తెలంగాణా నాయకులయిన దేవులపల్లి వెంకటేశ్వరరావు, రావి నారాయణరెడ్డి ఎట్టి అనుమానాలకు తావులేకుండా స్పష్టం చేశారు.


దేవులపల్లి వెంకటేశ్వరరావు ‘తెలంగాణా ఒక రాష్ట్రంగా ఏనాడూ లేదు. తెలంగాణా ఆంధ్రప్రదేశంలో ఒక భాగం. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడేదాకా తెలంగాణా జిల్లాలు హైదరాబాద్‌ సంస్థానంలో ఉన్నాయి. భారతదేశంలో బ్రిటీష్‌ పాలన ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ సంస్థానం ఎన్నడూ స్వతంత్ర రాజ్యంగా లేదనేది ఒక వాస్తవ విషయం. (అంతేగాదు) తెలంగాణా ప్రజలు ఆంధ్రజాతిలో ఒక భాగమే కాని, ప్రత్యేక జాతి కాదు. కనుక స్వయం నిర్ణయహక్కు ఉండేది ఆంధ్రజాతికే గాని, తెలంగాణా ప్రజలకు కాదు. పాలక వర్గాలలో తెలంగాణాకు చెందిన ఒక బలమైన భుస్వామ్య వర్గం, వర్తక వ్యాపారాలలో ఒక భాగం, ఉద్యోగస్తులు అంతా ఆంధ్రప్రజదేశ్‌ ఏర్పడడాన్ని వ్యతిరేకించారు. ప్రత్యేక తెలంగాణా కామ్‌, యిలాంటి చిన్న రాష్ట్రాల నిర్మాణానికేమీ నేటి పాలక వర్గాలు వ్యతిరేకమనే భావం తప్ప. తమ స్థానాన్ని బలపర్చుకోవటానికి ఒకే భాషా ప్రాంతాన్ని కూడా విడదీసి చిన్న రాష్ట్రాలు ఏర్పరచడానికి వారు ఎప్పుడూ వెనుకాడరు. ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక రాయలసీమ నినాదాలను కూడా మరికొన్ని పాలక వర్గ ముఠాలు లేవనెత్తుతున్నారనేది గమనించాలి. బడా బూర్జారా వర్గం, విదేశీ పెట్టుబడి, భుస్వామ్య వర్గాల పాలనే సమస్యలన్నింటికీ మూలకారణమనేది స్పష్టం. దేశ సమస్యల నుంచి ఆంధ్రప్రదేశ్‌ సమస్యలను విడదీసి చూడటం అవాస్తవికమవుతుంది. అశాంతి, అలజడులకు ప్రాంతీయ అసమానతలు, నిరుద్యోగం మూల కారణాలు. ఈ సమస్యలు అటు ప్రత్యేక రాష్ట్రంలోగాని, ఇటు సమైక్య రాష్ట్రంలో గానీ పరిష్కరింపబడజాలవు. (‘జాతీయ సమస్య’ డాక్యుమెంటు నుంచి)!



ఈ వివరణలకు తాజాగా ఇటీవల కాలంలో గులామ్‌నబీ అజాద్‌ అధికార హూదాలో చేసిన ఒక ప్రకటనలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఓటములన్నవి ‘విభజన’పైన ఆధారపడి వుండబోవని గుర్తు చేస్తూ లడక్‌ ప్రాంత అనుభవాన్ని ఇలా పూసగుచ్చి చెప్పారు.‘లడఖ్‌ ప్రాంతాన్ని మూడు జిల్లాలుగా విభజించాలని నాలుగు దశాబ్ధాలుగా డిమాండ్‌ ఉండేది. కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని నేను ముఖ్యమంత్రిగా ఉండగా వాటిని ఏర్పాటు చేయించాను తీరా ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌కు ఒక్కటంటే ఒక్క సీటూ రాలేదు’’! అనుభవం అమృతం లాంటిదంటారు! అందుకేనేమో!

కేసీఆర్ హాజరు సంతకం అనే లాంఛనం కోసమేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య రాజకీయ స్నేహం గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇరువురూ ఒకరి ప్రయోజనాల పరిరక్షణ కోసం మరొకరు అన్నట్లుగా నిలబడ్డారన్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.  ఈ నేపథ్యంలో  తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సభకు హాజరయ్యారు. ఇందుకు నేపథ్యం ఏమిటని చూస్తే.. గత కొన్ని రోజులుగా  సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ కేసీఆర్ చాటడంతో ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఆయన సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఆయన సవాల్ చేసినట్లుగా అసెంబ్లీలో ఆయన గళమెత్తలేదు. సభలో ఐదారు నిముషాల పాటు.. అదీ సంతాప తీర్మానాల ఆమోదం వరకూ మాత్రమే సభలో ఉన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లిపోయారు. సభలో బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడలేదు.  ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగింది.  దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యింది కేవలం అనర్హత వేటు పడకుండా ఉండేందుకు సభలో అటెండెన్స్ వేయించుకోవడానికేనన్న చర్చ మొదలైంది. సభకు హాజరై ఒక సంతకం చేసేసి మౌనంగా ఆయన సభ నుంచి నిష్క్రమించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే వారు కేసీఆర్ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుతో పోలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా ఒకే ఒక సారి అసెంబ్లీకి హాజరై రిజిస్టర్ లో సంతకం చేసి, ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారు. అసలు అసెంబ్లీ అవసరమేమిటి? ప్రజా సమస్యలపై ప్రెస్ మీట్లలో మాట్లాడితే సరిపోదా అన్న తీరులో ఆయన వ్యవహార శైలి ఉంది. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా సరిగ్గా అలానే వ్యవహరించనున్నారా అన్న అనుమానాలు అత్యధికుల్లో వ్యక్తం అవుతున్నాయి.   మొత్తం మీద శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి హాజరు వేయించుకునే లాంఛనాన్ని కేసీఆర్ పూర్తి చేసి.. తాను తన రాజకీయ మిత్రుడు, వైసీపీ అధినేత జగన్ నే ఫాలో అవుతున్నానని చాటినట్లైందని అంటున్నారు.  

అసెంబ్లీలో సుహృద్భావ వాతావరణం.. కేటీఆర్ తీరు పంటి కింద రాయి తీరు!

చట్ట సభలు అంటే ఒకప్పుడు ప్రజాస్వామ్య దేవాలయాలుగా భాసిల్లేవి. అసెంబ్లీ, లోక్ సభలో జరిగే చర్చలు బాధ్యతాయుతంగా, అర్ధవంతంగా సాగేవి. సభలో సభ్యుల మధ్య అంశాలవారీగానే విభేదాలు తలెత్తేవి తప్ప.. ఎన్నడూ వ్యక్తిగత స్థాయికి దిగజారేవి కాదు. అయితే రాను రాను ఆ పరిస్థితి మారిపోయింది. సభ వేదికగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు అన్నవి సర్వసాధారణమన్నట్లుగా మారిపోయాయి. సభలో ప్రజా సమస్యలపై చర్చ అన్నదే మృగ్యమైపోయిన పరిస్థితి ఏర్పడింది.  తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన  మార్పు కానవచ్చింది.  సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.  ఆ వాతావరణం తాజాగా సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. నిప్పుల తూటాలలాంటి విమర్శలతో ఇటీవల ఒకరిపై ఒకరు విరుచుకుపడిన రేవంత్, కేసీఆర్ లు సభలో పరస్పరం పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సీఎం రేవంత్ ఆప్యాయంగా, కలుపుగోరు తనంగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ అసెంబ్లీలో ఎన్నడూ కనబడని అరుదైన దృశ్యంగా ఇది చాలా కాలం యాదుండి పోతుందనడంలో సందేహం లేదు. ఈ సుహృద్భావ పూరిత వాతావరణం ఏర్పడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. అసెంబ్లీలోకి అడుగుపెడుతూనే రేవంత్ రెడ్డి ముందుగా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్థానం వద్దకు వెళ్లారు. ఆయనను మర్యాదగా పలకరించి, ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆ తరువాత ఆప్యాయంగా షేక్ హ్యాండిచ్చి మరీ తన స్థానానికి వెళ్లారు. పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుసరించి కేసీఆర్ ను పలుకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది అసెంబ్లీలో సభా మర్యాదలు ఎలా ఉండాలన్నదానికి అద్దంపట్టింది. అ యితే ఇంత జరిగినా పంటి కింద రాయిలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు వ్యవహరించారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా విపక్షాల వద్దకు వచ్చిన సమయంలో  కేసీఆర్ సహా అక్కడ అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడినా కేటీఆర్, కౌషిక్ రెడ్డిలు మాత్రం  తన స్థానం నుంచి లేవకుండా మౌనంగా కూర్చుండిపోవడం సభలో వాతావరణం సమూలంగా మారలేదనడానికి తార్కానంగా నిలిచింది. రేవంత్ చూపిన స్ఫూర్తికి విఘాతంగా కేటీఆర్ తీరు ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయిన పనులేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పరాజయానికి ప్రధాన కారణం తన హయాంలో జరిగిన మేలు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం కావడమేనని తరచూ చెబుతుంటారు. తన ఓటమికి కారణం ఆ చెప్పుకోలేకపోవడమేనని నమ్ముతుంటారు.  ఇంతకీ ఆయన హయాంలో చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటి?  అంత చేసీ ఎందుకు చెప్పుకోలేకపోయారు అన్న విషయంపై సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో డిబేట్ జరుగుతోంది. వాస్తవానికి ఆయన అరకొరగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు అంతకు వందింతల ప్రచారం చేసుకున్నారు.   జ‌గ‌న్ చేసిన సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌చారానికి ప్రత్యేకంగా ఒక నెట్ వర్కే  ఉండేది.  ఏపీడీసీ వంటి  సంస్థ‌లు కూడా ఆ నెట్ వర్కక లో ఉండేది. ఏపీసీసీని జగన్ ఆంధ్రప్రదేశ్  డిజిట‌ల్ కార్పొరేష‌న్ (ఏపీడీసీ)గా పేరు మార్చి దానికి భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించారు.   ఒక నిమిషానికి రెండున్న‌ర వేలు ఇవ్వాల్సింది కాస్తా  ప‌ది ప‌న్నెండు వేలుగా ఇచ్చి.. మ‌రీ వీడియోల రూప‌క‌ల్ప‌న చేశారు. ఇదిలా ఉంటే సంక్షేమ ప‌థ‌కాల బ‌ట‌న్ నొక్కుడు కార్య‌క్ర‌మాల‌కు సిద్దం  సభ‌ల‌క‌న్నా మించిన స‌భ‌లు ఏర్పాటు చేసి... వాటి ద్వారా జ‌నాన్ని పోగేసి సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కూడా జగన్ హయాంలో ప్రభుత్వ సంక్షేమాన్ని గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించారు.   ఇందుకు ఒక ఎమ్మెల్సీ తన సిబ్బందితో ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించ‌గా.. వాటిని నాటి మంత్రి పెద్ది రెడ్డి సూప‌ర్వైజ్ చేసేవారు. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చేసేవారు. ఇక్కడ చెప్పుకోవల సిందేమిటంటే..  ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు. వారి శోధనలో జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటంటే..  ఎలుక‌లు ప‌ట్ట‌డానికి  కేటాయించిన రూ. 1. 6 కోట్లు, తాడేప‌ల్లి ప్యాలెస్ చుట్టూ కంచె కోసం ఖర్చు చేసిన రూ. 12. 5 కోట్లు, ఎగ్ ప‌ఫ్ ల కోసం రూ. 3. 6 కోట్లు, పాస్ పుస్త‌కాల‌పై తన ఫోటోల కోసం రూ. 13 కోట్లు,  వైయ‌స్ విగ్ర‌హాల ఖ‌ర్చు రూ. 18 కోట్లు, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడానికి ఖర్చు చేసిన రూ.150 కోట్లు.  తన పర్యటనల కోసం విమానాలు, హెలికాప్టర్ల కోసం ఖర్చు చేసిన  రూ. 222 కోట్లు. వీటి గురించే జగన్ చెప్పుకోలేకపోయారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేనా  రుషికొండ ప్యాలెస్ కి రూ. 600 కోట్లు, బియ్యం సంచులు మోయ‌డానికి  రూ. 700 కోట్లు, స‌రిహ‌ద్దు రాళ్ల‌పై ఫోటోల‌కు ఇంకో రూ. 700 కోట్లు కూడా జగన్ ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. ఆ ఖర్చుల గురించి కూడా జగన్ జనాలకు చెప్పుకోలేకపోయారట. ఆ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నది జగన్ భావన అని నెటిజనులు తేల్చారు. అవి చెప్పుకోలేకపోవడం వల్లనే కనీసం 11 స్థానాలైనా వచ్చాయనీ, వాటి గురించి కూడా ఘనంగా చెప్పుకుని ఉంటే, అవి కూడా వచ్చేవి కావని సామాజిక మాధ్యమంలో జగన్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. 

కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్

నిప్పూ ఉప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకునే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఆసెంబ్లీలో ఆప్యాయంగా పలకరించుకున్న సన్నివేశం అందరినీ అలరించింది. సర్వత్రా ఆసక్తి కలిగించింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తరువాత కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సంఘటన అధికార ప్రతిపక్ష సభ్యులను విస్మయానికి గురి చేసింది. సభా మర్యాదలంటే అలా ఉండాలన్న చర్చ అధికార ప్రతిపక్షాలలో జరిగింది.   అదలా ఉంటే.. రేవంత్ కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు కూడా కేసీఆర్ ను పలుకరించి ఆయనతో కరచాలనం చేశారు.  ఇక ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  ‎

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్  భేటీలో రాష్ట్ర అభివృద్ధి,  పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా   కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే  కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో.. రూ.103.96 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేయనుంది.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఇకపోతే..  రాజధాని అమరావతి అభివృద్ధి పనుల వేగవంతంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో  సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.   ఇంకా వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే  అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  109 కోట్ల రూపాయల కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.   అమరావతి పరిధిలోని శాఖమూరు లో 23 ఎకరాలలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల  నిర్మాణానికీ, అలాగే తాళ్లూరులో  6 ఎకరాలో  హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం  నిధుల కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  

సినిమాలకు తమిళ హీరో విజయ్ గుడ్ బై.. రాజకీయాలకే పూర్తి సమయం

రాజకీయ నాయకుడిగా మారిన తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించిన సంఘటనతో ఆయన తొలి అడుగులు ఒకింత తడబడ్డాయి.  దాని నుంచి తేరుకుని ముందుకు సాగడానికి ఒకింత సమయం తీసుకున్న విజయ్ ఇప్పుడ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే  సినిమాల‌కు గుడ్ బై చెప్పారు విజ‌య్.  ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం. వచ్చే ఏడాది త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నికలకు విజయ్ సర్వసన్నద్ధం అవుతున్నారు.  ఏ పార్టీలతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టనున్నట్లు  ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో విజయ్  టీవీకే పార్టీకి ఉన్న విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీవీకే విజయం కంటే ఎన్డీయే కూటమికి భారీ నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలింది.  టీవీకే పోటీ వల్ల బీజేపీ, అన్నాడీఎంకే  కూటమి ఓట్లు భారీగా చీలుతాయని పేర్కొంది. అంటే విజయ్ పార్టీ పోటీ వల్ల లాభపడేది అధికార డీఎంకే అన్నది సీఓటర్ సర్వే సారాశంం.   ఇక సైద్ధాంతికంగా బీజేపీతో, రాజ‌కీయంగా డీఎంకేతోనే త‌మ  పోటీ అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. విజయ్ స్వయంగా మధురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.  విజయ్ ది చెన్నై. అయితే ఆయ‌న మ‌ధురైని త‌న సొంత  నియోజ‌క‌వ‌ర్గం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. స్టార్ హీరో కావడంతో విజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాన్య జనంలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో మధురైలో ఆయన స్థానికేతరుడు అన్న సమస్య తలెత్తే అవకాశం ఉండదన్నది పరిశీలకులు అంచనా.    ఇక పోతే విజ‌య్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆ పార్టీలో విజయ్ వినా పెద్దగా  ఫెమిలియ‌ర్ ఫేస్ మరొకటి లేదు. ఒక వేళ విజ‌య్ పార్టీలోకి రావడానికి డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ వంటి  పార్టీలు ఆసక్తి చూపుతున్నా.. వారికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోని ఆహ్వానించడానికి విజయ్ పెద్దగా సుముఖత చూపడం లేదు.  ఆయ‌న వారిని ఏమంత‌గా  తీసుకోవ‌డం లేదు.  ఏపీ నుంచి న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం త‌న భ‌ర్త ఇన్ ఫ్లూయెన్స్ వాడి విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకేలో చేరాల‌ని ప్రయత్నించినా, ఆమెకు అక్కడ నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. దీంతో పార్టీలో పెద్దగా పాపులర్ అండ్ ఫేమస్ నేతలు లేకపోవడం విజయ్ టీవీకే పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   ఒక తమిళ రాజకీయాలలో ప్రస్తుత పరిస్థితిని ఒక సారి గమనిస్తే.. రాష్ట్రంలో  బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొత్తులో భాగంగా ఒకటి రెండు స్థానాలు దక్కితే అదే చాలనుకునే పరిస్థితిలో  బీజేపీ ఉంది.  దీంతో ప్రధాన పోటీ  డీఎంకే- టీవీకే మ‌ధ్యే ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.    ఇక విజ‌య్ టీవీకే పార్టీ నుంచి అత్యధికంగా ఆయన అభిమాన సంఘాల నాయకులకే టికెట్ లు లభించే అవకాశం కనిపిస్తోంది. అంటే టీవీకే తరఫున పోటీ చేసే అభ్యర్థులలో అత్యథికులు ఆ పార్టీ నేత విజయ్ తో కలిసి రాజకీయాలకు కొత్తవారే అవుతారు. ఇది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద  డీఎంకే,  టీవీకే మ‌ధ్య  ముఖాముఖీ అన్నట్లుగా జరగనున్న   త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందనడంలో సందేహం లేదు.  

అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్.. హీట్ మామూలుగా ఉండదుగా?

తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమి తమయ్యారు. అయితే ఆ పాత్రలో ఆయన ఎంత మాత్రం క్రియాశీలంగా లేరు. ఓటమి తరువాత ఆయన పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన  ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.   అయితే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత, ఆయన అనివార్యంగా రాజకీయాలలో క్రీయాశీలం కావలసిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికీ, పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ స్వయంగా నడుంబిగించకుంటే లాభం లేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా బలోపేతం అవుతోంది. దీంతో తన పొలిటికల్ అజ్ణాత వాసానికి ఫుల్ స్టాప్ పెట్టి జనంలోకి రావడానికి సిద్ధమైపోయారు. తాజాగా ఇటీవల ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఇక నుంచీ తాను పొలిటికల్ గా క్రియాశీలమౌతాననీ,  అదే సమయంలో అసెంబ్లీలో పార్టీ తరఫున బలమైన గొంతు వినిపించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. ఈ మాటలే ఆయన ఈ సారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు అవుతారని తేటతెల్లం చేసింది. అయినా ఎక్కడో ఏదో అనుమానం.  గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో కూడా ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనీ, అధికార పక్షాన్ని తన ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిర చేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను సభ సాక్షిగా ఎండగడతారనీ బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా నమ్మాయి. అయితే  అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. గొంతు విప్పలేదు. ఫామ్ హౌస్ గడప దాటలేదు. మరి ఇప్పుడైనా అసెంబ్లీకి వస్తారా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే కాదు, పార్టీ శ్రేణులనుంచి కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ హాజరౌతున్నారు. సోమవారం (డిసెంబర్ 29) ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.  ఇక ఇప్పుడు ఆయన అసెంబ్లీలో గొంతు విప్పి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెడతారా? స్పీకర్ ఆయనకు కోరినంత సమయం మైక్ ఇస్తారా? లేకుంటే? అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్  తలపడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మొత్తం మీద కేసీఆర్ హాజరుతో ఈ శీతాకాల సమావేశాలు రోహిణీ కార్తెను మించిన హీట్ తో సాగుతాయనడంలో ఎలాంటి సందేహాలు లేవంటున్నారు. 

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామ్ తో చంద్రబాబు భేటీ.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ  అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి   సహకారం, బడ్జెట్ లో ప్రాధాన్యత వంటి అంశాలను చంద్రబాబు ఆమెతో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కృష్ణా జిల్లా  పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కంభంపాటి తల్లి వెంకటనరసమ్మ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కంభంపాటి రామ్మోహనరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.   వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

దేశం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధికి కారణం ఇందిరా, రాజీవ్‌లే : టీపీసీసీ చీఫ్

  శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గాంధీ, పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపింది పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.  కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్. కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.

ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు కాంగ్రెస్ నిరసనలు

  జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు (28న) గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు మహాత్మాగాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాయని ఆయన తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాత్మా ఉపాధి హామీ పథక అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తోందని, పేదలు, గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దీనికి నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని సూచించారు.రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.