ఆ ఇద్దరు కీ ఇస్తే ఆడే బొమ్మ ఈ హోంమంత్రి!
posted on Mar 1, 2021 @ 4:47PM
ఏపీ హోంమంత్రి సుచరిత పై టీడీపీ నేత, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సుచరిత కేవలం కీ ఇస్తే ఆడే ఒక బొమ్మ మాత్రమేనని, ఆ బొమ్మకు సీఎం జగన్ లేదా సజ్జల రామకృష్ణారెడ్డి కీ ఇస్తేనే ఆడుతుందని ఆమె విమర్శించారు. 20 నెలల రాజారెడ్డి రాజ్యాంగంలో రాష్ట్రంలో ఒక్క ఆడపిల్లను కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని అనిత విమర్శించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన అనూషను హత్య చేసిన ప్రేమోన్మాది విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
నిందితుడి పేరు పక్కన రెడ్డి అని ఉంటే.. చర్యలు తీసుకోవడానికి పోలీసులు కూడా భయపడుతున్నారని అనిత ఎద్దేవా చేశారు. తమపేరులో రెడ్డి అని తోక ఉంటే రాష్ట్రంలో ఎంతటి అరాచకమైనా చేయవచ్చా అని అనిత ప్రశ్నించారు. ఇంకోపక్క జగన్ స్వంత పత్రిక సాక్షిలో నిందితుడు విష్ణువర్ధన్ రెడ్డి పేరులో రెడ్డిని తీసేసి మరీ వార్త ప్రచురించారని ఆమె విమర్శించారు. దిశా చట్టం ఒక దిక్కుమాలిన చట్టమని... ఒక చట్టాన్ని సక్రమంగా తయారు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉందని అనిత విమర్శించారు.
ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కన్నా ముందే జగన్ వస్తాడని మంత్రులు, వైసిపి నేతలు, ఊదరగొట్టారని, మరి నరసరావుపేట అనూష కేసుపై సీఎం జగన్ ఎందుకు స్పందించలేదని అనిత ప్రశ్నించారు. అనూష కేసులో 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడితే సీఎం జగన్కు తాము సలాం చేస్తామన్నారు. మరోపక్క ఒక విద్యార్థిని దారుణ హత్యకు గురైతే స్థానిక వైసిపి ఎమ్మెల్యే అయిన అంబటి రాంబాబు కనీసం స్పందించడా అని అనిత నిలదీశారు.