చింతమనేని అరెస్ట్.. కరోనాని కూడా వేధింపుల కోసం వాడుకుంటున్న జగన్
posted on Jun 13, 2020 @ 12:31PM
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలపర్రు చెక్ పోస్ట్ వద్ద టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా ధర్నా చేసేందుకు చింతమనేని ప్రభాకర్ ప్రయత్నించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలించారంటూ ఐపీసీ సెక్షన్ 353తో పాటు మొత్తం ఆరు సెక్షన్ల కింద చింతమనేనిపై కేసు నమోదు చేశారు.
చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ ను టీడీపీ నేత నారా లోకేష్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ఆఖరికి కరోనా ని కూడా వైఎస్ జగన్ వేధింపుల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు.
"టిడిపి నాయకుడు చింతమనేని అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాను. కోవిడ్ నిబంధనలు ఒక్క టిడిపి నాయకులకేనా. చింతమనేని ఎక్కడా గుంపులుగా తిరగలేదు, వెంట అనుచరులు లేరు. ఒంటరిగా వెళుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసారు." అని లోకేష్ పేర్కొన్నారు.
"ఆఖరికి కరోనా ని కూడా వేధింపుల కోసం వాడుకుంటున్న వైఎస్ జగన్ గారి మానసిక స్థితిని చూసి జాలేస్తుంది. వైకాపా నాయకులు కోవిడియట్స్ గా మారారు అని జాతీయ మీడియా సైతం ఉతికి ఆరేసింది. గుంపులుగా తిరిగి,ర్యాలీలు నిర్వహించి కరోనా వ్యాప్తి కి కారణమైన వైకాపా నేతల పై కేసులు ఉండవా?" అంటూ లోకేష్ జగన్ సర్కార్ ని నిలదీశారు.