సిక్కోలులో వైసీపీ సీన్ సితారే!.. తెలుగుదేశం, జనసేన కూటమి క్లీన్ స్వీప్ ఖరారే!

ఉమ్మ‌డి శ్రీ‌కాకుళం జిల్లాలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీకి గ‌ట్టి షాకిచ్చేందుకు ప్ర‌జ‌లు రెడీ అయిపోయారు. జిల్లాలో మొత్తం 10 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.  గ‌త ఎన్నిక‌ల్లో రెండు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే నాలుగున్న‌రేళ్ల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జావ్య‌తిరేక‌ పాల‌న‌పై ఉమ్మడి సిక్కోలు జిల్లా ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ఉద్దండులు ఉన్నారు. త‌మ్మినేని సీతారాం, ధ‌ర్మాన సోద‌రుల‌తో పాటు తెలుగుదేశం ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు వంటి బ‌డా రాజ‌కీయ నేత‌లు ఉన్నారు. వైసీపీ నుంచి సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నేత‌లు విజ‌యం సాధించినా జిల్లాలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వైసీపీ హ‌యాంలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌లు భూక‌బ్జాలకు పాల్ప‌డంతోపాటు, దౌర్జ‌న్యాల‌కు దిగినట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో కుటుంబ స‌భ్యుల పెత్త‌నం.. ఇలా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నూ  వైసీపీపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని పెల్లుబుకుతోంది. నాలుగున్న‌రేళ్ల వైసీపీ పాల‌న‌పై ఆగ్ర‌హంతో ఉన్న ప్ర‌జ‌లు తెలుగుదేశంకు మ‌ద్ద‌తుగా నిలుస్తామని బాహాటంగానే చెబుతున్నారు. అంతే కాకుండా టీతెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతుండ‌టంతో ఉమ్మ‌డి శ్రీ‌కాకుళం జిల్లాలో ఈ కూట‌మి క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఎలా ఉందంటే.. 

ఇచ్ఛాపురం: 

ఇచ్ఛాపురం నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంనుంచి తెలుగుదేశం  అభ్యర్థిగా  2014, 2019 ఎన్నిక‌ల్లో బెందాళం అశోక్ విజ‌యం సాధించారు. రానున్న ఎన్నికలలో కూడా ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా అశోక్ మ‌రోసారి బ‌రిలోకి దిగుతున్నారు. 2024 ఎన్నిక‌ల్లో అశోక్ ను ఓడించాల‌ని వైసీపీ అధిష్టానం ప‌ట్టుద‌ల‌తో ఉంది.  ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా పిరియా సాయిరాజ్ పోటీచేసి ఓడిపోయారు.  వైసీపీ అధిష్టానం సాయిరాజ్ ను త‌ప్పించి ఈసారి ఎన్నిక‌ల్లో ఆయ‌న స‌తీమ‌ణి పిరియ విజ‌య‌ను బరిలోకి దింపింది. అయితే  నియోజ‌క‌వ‌ర్గం వైసీపీలో అంత‌ర్గ‌త విభేదాల‌కు తోడు, జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక‌ పాల‌న‌పై  ప్ర‌జ‌ల్లో తీవ్ర‌వ్య‌తిరేక‌త ఆ పార్టీ విజయానికి అవరోధాలుగా మారియి. ఇచ్ఛాపురం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. దీనికి తోడు  జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త కలిసి  బెందాళం అశోక్ హ్యాట్రిక్ విజ‌యం సాధించడం ఖాయ‌మ‌న్న భావన స్థానికంగా బలంగా వ్యక్తమౌతోంది. 

పలాస:

ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి  తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి విజ‌యం ఖాయంగా క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా సీదిరి అప్ప‌ల‌రాజు బ‌రిలో నిలిచి టీడీపీ అబ్య‌ర్థి గౌతు శిరీష‌పై విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం అప్ప‌ల‌రాజుపై నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తమ‌వుతోంది. నాలుగున్న‌రేళ్ల కాలంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ఆయ‌న పూర్తిగా విఫలమయ్యారు.  దీనికితోడు భూక‌బ్జాల ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వైసీపీలోనూ అప్ప‌ల‌రాజుపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. గౌతు శిరీష గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ.. నాలుగున్న‌రేళ్లుగా ప్ర‌జ‌ల్లోనే ఉంటూ,  నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో కీల‌క భూమిక పోషిస్తున్నారు. మ‌రోవైపు తెలుగుదేశం శ్రేణుల‌కు అండ‌గా ఉంటూ వస్తున్నారు. ఆమెపై నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో సానుభూతి ఉండ‌టంతోపాటు ఆమెను గెలిపిస్తే నియోజ‌క‌వ‌ర్గం  అబివృద్ధి జ‌రుగుతుంద‌ని   భావిస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గౌతు శిరీష్ తెలుగుదేశం, జ‌న‌సేన కూటమిఅభ్య‌ర్థిగా బ‌రిలో నిలిస్తే విజయం నల్లేరు మీద బండినడకేనంటున్నారు. 

టెక్కలి: 

టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గం కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటేనని చెప్పాలి. రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ అంటూ  2014, 2019 ఎన్నిక‌ల్లో ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ఈ నియోజకవర్గం నుంచి విజ‌యం సాధించారు. మ‌రోసారి అచ్చెన్నాయుడు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక వైసీపీ నుంచి  దువ్వాడ శ్రీ‌నివాస్ రావు బ‌రిలో దిగుతున్నారు.  వైసీపీ అధిష్టానం ఆయ‌న్ను నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఇంచార్జిగా నియ‌మించింది.  దువ్వాడ‌కు మాస్ లీడ‌ర్‌గా పేరున్న‌ప్ప‌టికీ, వైసీపీలో  ఒక బలమైన వర్గానికి ఆయన పొడగిట్టదు.   ఆయ‌న స‌తీమ‌ణి దువ్వాడ వాణి నియోజ‌క‌వ‌ర్గ  వైసీపీలో కీల‌క నేత‌గా ఉన్నారు. ఆమెతోనూ దువ్వాడ శ్రీ‌నివాస్ కు విబేధాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. దీనికితోడు జ‌గ‌న్ పాల‌న‌పై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఏ విధంగా చూసినా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి విజయం తథ్యమని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదని స్థానికులే బాహాటంగా చెబుతున్నారు. 

పాతపట్నం:

పాత‌ప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నికల్లో వైసీపీ అభ్య‌ర్థిగా రెడ్డి శాంతి విజ‌యం సాధించారు. అయితే  ఆమెకు ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో ఎదురుగాలి వీస్తోంది. వైసీపీలో వ‌ర్గ విబేధాల‌కు తోడు, నాన్ లోక‌ల్ ముద్ర కారణంగా ఈసారి ఆమె ఎన్నిక‌ల బ‌రిలో నిలిస్తే ఓట‌మి ఖాయ‌మ‌ని వైసీపీ నేత‌లే బాహాటంగా చెబుతున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆమెను మార్చి కొత్త వారికి అవ‌కాశం ఇస్తుందన్న ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. ఇక తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్యర్థిగా  కలమట వెంకటరమణ మూర్తి బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది.  ప్ర‌స్తుతం ఆయ‌న నియోజకవర్గ తెలుగుదేశం   ఇంచార్జిగా ఉన్నారు.  పొత్తులో భాగంగా పాతపట్నం నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తే ఏమో కానీ, లేకుంటే తెలుగుదేశం అభ్యర్థిగా  కలమట వెంకటరమణ మూర్తి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డం ఖాయంగా క‌నిపిస్తున్నది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా ఎవ‌రు పోటీలోకి దిగినా విజ‌యం న‌ల్లేరుపై బండినడకేనని అంటున్నారు. 

శ్రీకాకుళం: 

శ్రీ‌కాకుళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. మ‌రోసారి వైసీపీ నుంచి ఆయ‌నే పోటీచేయ‌నున్నారు. అయితే, ఈసారి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఓట‌మి ఖాయ‌మ‌న్న వాద‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల నుంచే బలంగా వినిపిస్తోంది. ప్ర‌భుత్వ వ్యతిరేకతకు తోడు ధ‌ర్మాన గ్రాఫ్ కూడా రోజురోజుకు ప‌డిపోతుండటం స్పష్టంగా తెలుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో అ భివృద్ధి అన్నదే లేకపోవడం, ధర్మాన నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకపోవడంతో ప్రజాగ్రహం తీవ్రంగా ఉంది.  దీనికి తోడు వైసీపీలోని వ‌ర్గ‌ విభేదాలులు ధ‌ర్మాన‌కు మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.  ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన కూటమి అభ్య‌ర్థిగా గుండ ల‌క్ష్మీదేవి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. ఆమెపై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో సానుభూతి ఉంది. పొత్తులో భాగంగా జ‌న‌సేన ఓట్లు కూడా బ‌దిలీ అయితే ఆమె విజయం సునాయాసమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.     

ఆమదాలవలస: 

ఆముదాల వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో త‌మ్మినేని సీతారాం వైసీపీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించారు. ఆయ‌న ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ గా కొన‌సాగుతున్నారు. అయితే, నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌నపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. అభివృద్ధిని గాలికొదిలేశాన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీనికితోడు నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న కుటుంబ స‌భ్యుల జోక్యం ఎక్కువైంద‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. అలాగే త‌మ్మినేని తీరుప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీ నేత‌లు సైతం తీవ్ర ఆగ్రహంతో  ఉన్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా ఇక్కడ నుంచి కూన ర‌వికుమార్  మ‌రోసారి బ‌రిలోకి దిగుతున్నారు. త‌మ్మినేని ప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్న వ్య‌తిరేక‌త కూన ర‌వికుమార్ విజ‌యానికి దోహ‌దం కానుంది.  వైసీపీ ప్ర‌భుత్వంపైనా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికితోడు తెలుగుదేశం, జ‌న‌సేన పొత్తు రవికుమార్ విజయాన్ని ఖాయం చేసేసిందని పరిశీలకులు అంటున్నారు. 

ఎచ్చెర్ల:

ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా గొర్లె కిరణ్ కుమార్ పోటీ చేసి విజ‌యం సాధించారు. టీడీపీ అభ్య‌ర్థి కిమిడి కళా వెంకటరావు ఓట‌మి పాల‌య్యారు. ప్ర‌స్తుతం వైసీపీపై నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. జ‌గ‌న్ ప్ర‌జావ్య‌తిరేక‌త విధానాల‌కుతోడు స్థానిక ఎమ్మెల్యే తీరుపైనా ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.  నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ఆనవాలే లేకపోవడం,  వైసీపీలో వ‌ర్గ విభేదాలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి ఓట‌మికి కార‌ణాలుగా మార‌నున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సానుకూలత ఉంది. అయితే  టీడీపీ అభ్య‌ర్థిగా కిమిడి క‌ళా వెంక‌ట‌రావు బ‌రిలోకి దిగుతారా లేదా పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం ఈ సారి జనసేనకు కేయాయిస్తారా అన్న విషయంలో స్పష్టత లేదు. అయితే తెలుగుదేశం, జ‌న‌సేన కూటమి అభ్య‌ర్థిగా ఎవ‌రు బ‌రిలో నిలిచినా విజ‌యం త‌ధ్య‌మ‌న్నభావన నియోజకవర్గ ప్రజలలో వ్యక్తం అవుతోంది. 

నరసన్నపేట:

న‌ర‌స‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ  సిట్టింగ్ ఎమ్మెల్యేగా ధ‌ర్మాన కృష్ణ దాస్ ఉన్నారు. మ‌రోసారి ఆయ‌నే వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌బోతున్నారు. అయితే, వైసీపీ ప్ర‌భుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత ఆయన విజయానికి పెద్ద అవరోధంగా మారనుంది. అలాగే నియోజకవర్గంలో వైసీపీలోని గ్రూపు తగాదాలు కూడా ధర్మాన కృష్ణదాస్ కు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మ్మెల్యేగా  ధ‌ర్మాన కృష్ణదాస్ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్న ఆగ్రహం కూడా జనంలో వ్యక్తం అవుతున్నది.  నరసన్న పేట నుంచి గత ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా బగ్గు రమణ మూర్తి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఇక్కడ నుంచి  రామ్మోహ‌న్ నాయుడు బ‌రిలోకి దిగుతార‌న్న చ‌ర్చ జ‌రుగుతున్నది. తెలుగుదేశం, జనసేనల నుంచి  అభ్య‌ర్థిగా ఎవ‌రు బ‌రిలోకి దిగినా విజ‌యం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. 

రాజాం:

రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి కంబాల జోగులు విజ‌యం సాధించారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో రెండుసార్లు వైసీపీ అభ్య‌ర్థిగా ఆయ‌నే విజ‌యం సాధించారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో ఆయనకు ఎదురుగాలి వీస్తున్నది. ఎమ్మెల్యే పని తీరు పట్ల నియోజకవర్గ ప్రజలలో  తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో జగన్ కంబాల జోగులును తప్పించి  డాక్టర్ తాలె రాజేష్ ను అభ్యర్థిగా బరిలోకి దింపుతోంది.  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీకి  బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. రాజం నుంచి  కొండ్రు ముర‌ళి లేదా మాజీ స్పీకర్ ప్ర‌తిభాభార‌తి కుమార్తె గీష్మ‌ పోటీలో నిలిచే అవకాశం ఉంది. వీరిద్దరిలో ఎవరు అభ్యర్థిగా నిలిచినా విజయం నల్లేరు మీద బండినడకేనంటున్నారు.  

పాలకొండ:

పాల‌కొండ నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో వైసీపీ పట్ల తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. విశ్వ‌స‌రాయి వైసీపీ అభ్య‌ర్థిగా మ‌రోసారి బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. అయితే  ఆమె హ‌యాంలో నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికితోడు వైసీపీలో ఆమె వ‌ర్గ‌ పోరును ఎదుర్కొంటున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ  అభ్య‌ర్థిగా నిమ్మక జయకృష్ణ మ‌రోసారి బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది.   జ‌న‌సేన బ‌లంకూడా తోడుకానుండ‌టంతో నిమ్మక జయకృష్ణ విజ‌యం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.

హరీష్‌రావు ఓ గుంట నక్క....కవిత హాట్ కామెంట్స్

  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. వ్యక్తిగతంగా హరీష్ రావును ఒక్క మాట అంటే సభని బైకాట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ అంశంపై వాకౌట్ చేస్తే.. తరువాత సభకు రావొచ్చు కదా? అని అన్నారు. ఆదివారం నాడు సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన కవిత.. అసెంబ్లీ జరిగిన తీరుపైనా.. హరీష్ రావుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్‌రావు గుంటనక్కగా పేర్కొంటూ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బిల్లులపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఉండొద్దా? అని ప్రశ్నించారామె. సభ నుంచి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీష్ రావుదేనా? అని ప్రశ్నించారు కవిత.  బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక గుంపును తయారు చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ బయట సభలు పెట్టడం కంటే.. చట్ట సభల్లో మాట్లాడటం మంచిదని.. ఈ అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదని కవిత అభిప్రాయపడ్డారు. గుంటనక్క హరీష్ రావు వ్యవహారం.. తోక కుక్కను ఊపినట్లుగా ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కవిత. కృష్ణా పంపకాలల్లో హక్కులు తగ్గించి హరీష్ సంతకం ఎందుకు పెట్టాడో చెప్పి.. పీపీటీ చేయాలని కవిత డిమాండ్ చేశారు.  హరీష్ రావు ధన దాహం కోసమే జూరాలా నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. హరీష్ రావు నిర్ణయాలతోనే సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. హరీష్‌రావును ముఖ్యమంత్రిని  వ్యక్తిగతంగా విమర్శిస్తే అసెంబ్లీని  బాయ్‌కాట్ చేస్తారా? మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టినప్పుడు ఎందుకు బహిష్కరించలేదు? ప్రతిపక్షం అంటే పార్టీ కాదు.. పబ్లిక్ వాయిస్ అని అన్నారు.

2026.. పొలిటికల్ హీట్ మామూలుగా ఉండదుగా?

 2025కు గుడ్ బై చెప్పేసి.. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టి మూడు రోజులు అయ్యింది. గత నాలుగైదు రోజులుగా కొత్త సంవత్సర వేడుకల సన్నాహాలు, వేడుకలతో అంతా బిజీబిజీగా గడిచిపోయింది. ఇప్పుడు ఇక కొత్త సంవత్సరం ఎలా గడవబోతోంది అన్న విషయంపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది.  అది పక్కన పెడితే రాజకీయ పార్టీలకు మాత్రం కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి.  పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు  2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాలతో పాటు  అసోం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా 72 రాజ్యసభ స్థానాలకూ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 2026ను పరిశీలకులు ఎన్నికల నామ సంవత్సరంగా అభివర్ణిస్తున్నారు.  ముందుగా తమిళనాడు విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమి అధికారంలో  ఉంది.  ఈ రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వచ్చే ఏప్రిల్‌లో అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. ఏప్రిల్ కు ముందే తమిళనాడులో ఎన్నికలు జరగుతాయి.  ఇప్పటి వరకూ ఉనికి మాత్రంగానే రాష్ట్ర రాజకీయాలలో ఉన్న బీజేపీ ఈ సారి తమిళనాడుపై భారీ అశలే పెట్టుకుంది. అందుకే ఆ రాష్ట్రానికి చెందిన ఓబీసీ నాయకుడు సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతిని చేసి ఆ రాష్ట్ర ప్రజల గుడ్ లుక్స్ లో నిలవడానికి ప్రయత్నించింది. తమిళనాడులో మరో ప్రాంతీయ పార్టీ అన్నాడీఎంకే జయలలిత మరణానంతరం నామావశిష్ఠంగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. ఇక కొత్తగా తమిళ రాజకీయాలలోకి తమిళ వెట్రి కజగం (టివికే) అనే పార్టీ అడుగు పెట్టింది. తమిళ నాట అశేష్ అభిమానులు ఉన్న హీరో విజయ్ నేతృత్వంలోని ఈ పార్టీ ప్రభావం ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.   ఆ తరువాత ఈ ఏడు ఎన్నికలు జరగనున్న మరో కీలక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కాలపరిమితి ఈ ఏడాది మేతో ముగియనుంది. ఈ రాష్ట్రంలో మొత్తం మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.ఇక్కడ గత మూడు దఫాలుగా  మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది. ఈ  సారి ఇక్కడ ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో కమలం పార్టీ ఉంది.   బంగ్లాదేశ్ నుంచి చొరబాటు దారుల కారణంగా  పశ్చిమ బెంగాల్ లో స్థానికులకు ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న కమలనాథులు, అదే సమయంలో చొరబాట్లకు తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలుస్తున్నారన్న విమర్శతో ఇప్పడ ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టేశారు.   ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మరో కీలక రాష్ట్రం కేరళ. ఇక్కడ వామపక్షాలు అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.  ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలొ తమకు అవకాశాలున్నాయనడానికి నిదర్శనంగా బీజేపీ భావిస్తోంది.  ఇలా ఉండగా బీజేపీ ఇంత వరకూ తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళలో ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. ఆ ట్రెండ్ ను బ్రేక్ చేసి ఈ రాష్ట్రాలలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో కమలనాథులు వ్యూహాలు పన్నుతున్నారు. కేంద్ర పాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ + బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది.  ఇక్కడ కూడా ఈ ఏడాది ఏప్రిల్‌తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది.   అలాగూ అసోం అసెంబ్లీ గడువు కూడా ఈ ఏడాది మేతో ముగియనుంది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది.  వచ్చే మేతో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఇక్కడ తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించగా,  మరోవైపు కాంగ్రెస్ కూటమి కూడా బలంగానే ప్రయత్నాలు చేస్తున్నది.  ఏది ఏమైనా 2026 ఏడాది మొత్తం పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో కొనసాగేలా కనిపించడం ఖాయం. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. 

అందెశ్రీ కుటుంబానికి అండ!

ప్రముఖ కవి అందెశ్రీ కుటుంబానికి అండగా నిలిచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా అందెశ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి వీలుగా 1994 ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, వేతన నిర్మాణ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర శాసన సభలో శనివారం (జనవరి 3) ప్రవేశపెట్టింది.  తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం  అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపె ట్టామన్నారు. 1994 చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం 7991 మంది తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని తెలిపారు. అందులో కొందరు ఉద్యోగులు కోర్టుకు వెళ్లి గతం నుంచి రెగ్యులరైజ్ చేయాలని ఆర్డర్ తెచ్చారని ప్రస్తావించారు మల్లు భట్టి విక్రమార్క. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు 573/225, 1.1.1995కి ఇది విరుద్ధమని చెప్పుకొచ్చారు. వెనుక తేదీ నుంచి రెగ్యులరైజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై రూ.20వేల కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు. ఏపీలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ప్రాస్పెక్టివ్‌గా చట్ట సవరణ చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం 25.11.2025న ప్రాస్పెక్టివ్ రెగ్యులరైజేషన్ కోసం ఆర్డినెన్స్ 88 తెచ్చిందని తెలిపారు. ఈ ఆర్డినెన్సును బిల్ నంబర్ 7ద్వారా సభ ఆమోదం కోరుతున్నామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

బంగ్లా తరహా ఉద్యమాలతోనే మోడీని సాగనంపగలం

ఇటీవలి కాలంలో తరచుగా రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పెనుదుమారానికి కారణమౌతున్నాయి. సమాజంలో హింసా, ద్వేషాలను రగిల్చే విధంగా ఉంటున్నాయి. ప్రాంతీయ వైషమ్యాలు, మత విద్వేషాలకు తావిచ్చేలా నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసనలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ)ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ) జాతీయ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా చేసిన వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారానికి తెరలేపాయి. దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు. ఆయా దేశాలలో ప్రభుత్వాలను గద్దె దించడానికి హింసాత్మక ఆందోళనలు జరిగాయనీ, అటువంటివే భారత్ లో కూడా జరిగితే తప్ప.. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించలేమని అభయ్ సింగ్ చౌతాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశంలో.. శ్రీలంకలో, బంగ్లాదేశ్‌లో యువత ప్రభుత్వాన్ని ఎలా తరిమి కొట్టారో, అదే తరహా పద్ధతులను భారత్‌లోనూ అమలు చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై  బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, చౌతాలా వ్యాఖ్యలు భారత రాజ్యాంగ వ్యవస్థకు, ప్రజాస్వామ్య నియమాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇది విపక్ష నేతల  దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక  వైఖరికి నిదర్శనమన్నారు.   రాజకీయ లబ్ధి కోసమే దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. విపక్షాలకు  దేశ ప్రయోజనాల కంటే రాజకీయ లబ్ధికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.  మొత్తం మీద అభయ్ సింగ్ చౌతాలా వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించేలా, దేశంలో హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

వైసీపీ బాటలోనే బీఆర్ఎస్?.. అసెంబ్లీ బహిష్కరణకు నిర్ణయం

పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఒక్క ఓటమితో కుదేలైపోయిందా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కోలేక పలాయన మంత్రం పఠిస్తోందా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. ఆ పార్టీ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం అందులో భాగమేనని అంటున్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే అసెంబ్లీని బహిష్కరించి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇప్పుడు పార్టీ సభ్యులు కూడా అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  దీంతో రాజకీయ వర్గాలలో బీఆర్ఎస్  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అడుగుజాడలలో నడుస్తోందని అంటున్నారు. ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంంది.   సోమవారం (జనవరి 4)న సభకు హాజరై.. మంగళవారం (జనవరి 5) నుంచి అంటే సభలో కృష్ణ, గోదావరి జలాలపై చర్చ జరిగే సమయానికి అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పరిశీలకులు మాత్రం సభలో కాంగ్రెస్ ను దీటుగా ఎదుర్కోనేందుకు సభాపక్ష ఉప నేతల నియామకం తరువాత బీఆర్ఎస్ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం ఏమిటన్న ప్రశ్నకు ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి రేవంత్ రెడ్డికి క్రెడిట్ దక్కే చాన్స్ ఇవ్వవద్దన్య వ్యూహంతోనే బీఆర్ఎస్ ఈ బాయ్ కాట్ నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా అసెంబ్లీలో నదీ జలాలపై చర్చను బీఆర్ఎస్ బాయ్ కాట్ చేయడమంటే.. పలాయన మంత్రం పఠించడమేనని పరిశీలకులు భావిస్తున్నారు.   అయితే నిన్న మొన్నటి వరకూ నదీ జలాల అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎండగడతాం అంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ ఇంత హఠాత్తుగా బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక వేళ కేసీఆర్ సభకు హాజరైతే.. జల వివాదాలకు ఆయనే సమాధానం చెబుతారు. అయితే కేసీఆర్ గైర్హాజరౌతున్న నేపథ్యంలో ఇటీవల శాసనసభాపక్ష ఉప నేతగా నియమితులైన హరీష్ రావు సభలో బీఆర్ఎస్ తరఫున ప్రసంగించాల్సి ఉంది. అదే జరిగితే సభ సీఎం రేవంత్ వర్సెస్ హరీష్ రావు అన్నట్లుగా మారిపోతుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ డమ్మీ అయిపోతారు. ఇప్పటికే శాసనసభాపక్ష ఉప నేతగా హరీష్ రావు నియామకం కేటీఆర్ ను ఒకింత తక్కువ చేసినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఇక జలవివాదాలపై హరీష్ రావు గట్టిగా గళం విప్పితే కేటీఆర్ పరిస్థితి పార్టీలో మరింత దిగజారుతుందన్న భావనతోనే బీఆర్ఎస్ ఆకస్మికంగా అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి సీఎం రేవంత్, హరీష్ మధ్య కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయనీ, వారిరువురి మధ్యా అరగంట భేటీ జరిగిందనీ బీఆర్ఎస్ అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించిన గంటల వ్యవధిలో బీఆర్ఎస్ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో సంక్షోభం ముదిరేలా చేసుకోవడం కంటే.. జనం పలాయనం అనుకున్నా అసెంబ్లీ బాయ్ కాటే మేలని బీఆర్ఎస్ నిర్ణయించుకునట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విశేషమేంటంటే  పార్టీ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయాన్నిస్వయంగా హరీష్ రావే ప్రకటించడం విశేషం.

కేసీఆర్ తోనూ ఢీ అంటే ఢీ.. కవిత మాటల అర్ధం అదేనా?

తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని ఖతమేనా? ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు కవిత ఇదే విషయాన్ని ఒకింత నర్మగర్బంగా చెప్పారా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఆరంభం సందర్భంగా సభకు వచ్చి ఓ ఐదారు నిముషాలు సభలో కూర్చున్న బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు కల్వకుంట్ల కేసీఆర్..  ఆ తరువాత  సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. అయితే.. ఆ రోజు సభలో ఏ విషయంపైనా చర్చ జరిగే అవకాశం లేనందున ఆయన సభనుంచి వెళ్లిపోయారనీ, కొత్త సంవత్సరం రెండో తేదీ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రేవంత్ సర్కార్ ను అడుగడుగునా ఇరుకున పెట్టి తన విశ్వ రూపాన్ని చూపిస్తారనీ బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు గట్టిగా చెప్పారు. అదే నమ్మారు. అయితే కేసీఆర్ మాత్రం సభలో పార్టీ గొంతు గళంగా వినిపించేందుకు ఉప నాయకులను నియమించడంతో.. ఆయన ఈ శీతాకాల సమావేశాలలో ఇక సభలో కనిపించరని పరిశీలకులు ఆ రోజే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు.  ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవిష్యత్ పై తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సభకు కేసీఆర్ డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఇక ఖతమే అని అన్నారు.  శుక్రవారం (ఫిబ్రవరి 2) శాసనమండలి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో  చిట్ చాట్ చేసిన ఆమె.. తన తండ్రి కేసీఆర్ కే  సవాల్ విసిరారు. ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. తప్పు చేయకుంటే కేసీఆర్ సభకు రావాలని సవాల్ విసిరారు.   అధినాయకుడు అసెంబ్లీకి రాకుండా..  పిల్ల కాకులకు సభాసమయాన్ని వదలడం సరికాదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కు ప్యాకేజీలు, అమ్ముకోవడం తప్ప ఏం తెలియదని ఎద్దేవా చేశారు.   హరీష్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య బాండ్ ఉందని ఆరోపించిన ఆమె హరీష్ సీఎం చాంబర్ లో అరగంట సేపు ముచ్చటించడం నిజం కాదా అని ప్రశ్నించారు.   అసెంబ్లీలో  మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించిన ఆమె..  రేవంత్ వర్సెస్ హరీష్ అన్నట్లుగా అసెంబ్లీ చాలా ప్రమాదకరమన్నారు.  కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ పై నేరుగా అటాక్ చేయడం ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ తో తాను మాట్లాడి నాలుగు నెలలు పైనే అయ్యిందన్నారు.  కేటీఆర్, హరీష్ లకు పార్టీని వదిలేయడంపై ఆమె ఈ సందర్భంగా కేసీఆర్ ను తప్పుపట్టారు.  ఇలా మాట్లాడడం ద్వారా ఆమె తాను కేసీఆర్ తో డీ అంటే ఢీ అనడానికి రెడీ అన్న సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత తన శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. శుక్రవారం (జనవరి 2) కూడా ఆమె శాసనమండలి స్పీకర్ ను తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. 

సొంత ఇంటి పంచాయతీ పరిష్కరించలేక చేతులెత్తేశారు.. కేసీఆర్ పై రఘునందన్ విమర్శలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున ఆయనపై బీజేపీ ఎంపీ రఘునందనరావు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తీరు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్న చందంలా ఉందన్నట్లుగా ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఇతరుల పంచాయతీలను పరిష్కరించడంలో గొప్ప ఉత్సాహం చూపిస్తారనీ, అయితే సొంత ఇంటి పంచాయతీల పరిష్కాం విషయంలో మాత్రం చేతులెత్తేశారనీ అన్నారు. గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.  ఇక కల్వకుంట్ల కవిత సొంత దారి చూసుకున్నారనీ, నేడో, రేపో ఆమె కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమనీ జోస్యం చెప్పారు.  అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహన అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డిలు లేచి నిలబడకపోవడం వారి విచక్షణకు సంబంధించిన విషయమన్న రఘునందనరావు.. కేటీఆర్ కు ముఖ్యమంత్రి కావాలన్న యాంబిషన్ ఉందనీ, అయితే అది సాకారం అవ్వాలంటే ఉండాల్సిన మద్దతు కేటీఆర్ కు సొంత పార్టీ నుంచే కరవైందన్నారు.  పార్టీ దాకా ఎందుకు ఆయనకు సొంత కుటుంబంలోనే మద్దతు లేదని చెప్పారు.  ఈ పరిణామాలన్నిటినీ నిశబ్దంగా గమనిస్తున్న హరీష్ రావు సమయం కోసం వేచి చూస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న రఘునందనరావు.. కావాలంటే ఈ విషయాన్ని తాను రాతపూర్వకంగా కూడా చెబుతానన్నారు.  ఇక రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలపై స్పందిస్తూ.. ఏ పార్టీలోనైనా అభిప్రాయబేధాలు సహజమని కొట్టి పారేశారు.  దశాబ్ద కాలం బీఆర్ఎస్ పాలనను.. రెండేళ్ల కాంగ్రెస్ పాలననూ చూసిన తెలంగాణం ఇప్పడు బీజేపీకి పట్టం గట్టాలని ఉవ్విళ్లూరుతున్నారన్నారు.  

బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డిపై కాల్పులు

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై కర్నాటకలోని బళ్లారిలో హత్యాయత్నం జరిగింది. ఆయనపై స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు కాల్పులు జరిపి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీవిషయంలో  తలెత్తిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.   ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి  గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో  కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. అలాగే తొలుత కాల్పులు జరిపిన సతీష్ రెడ్డి గాయపడ్డాడు.   స్థానిక ఎమ్మెల్యే భరరత్ రెడ్డి, గాలి జనార్థన్ రెడ్డిల మధ్య దీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉన్న సంగతి విదితమే.  భరత్ రెడ్డి వర్గం వారు గాలి జనార్ధన్ రెడ్డి నివాసం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఘర్షణకు దారి తీసింది.  కాగా ఈ కాల్పుల ఘటన నేపథ్యంలో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొడంతో  పోలీసులు 144వ సెక్షన్ విధించారు. బళ్లారిలో ప్రధాన నాయకులు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు.  

కొత్త సంవత్సరంలో కవిత వార్ కొత్త పుంతలేనా?

బీఆర్ఎస్ వర్సెస్ కవిత వార్ కొత్త సంవత్సరంలో కొత్త పుంతలు తొక్కబోతున్నది. ఇప్పటి వరకూ ఘాటుగా విమర్శలు చేస్తున్నా కవిత తన విమర్శలను ఒకింత సున్నితంగా చిన్నపాటి సూదిమొన గుచ్చినట్లుగా చేస్తు వచ్చారు. అయితే ఇక ముందు అంటే కొత్త సంవత్సరంలో తాను ఇంకెంత మాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగుతానని.. ఈ ఏడాది చివరి రోజున కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఆయన ఈ సారి కేటీఆర్ లక్ష్యంగా కూడా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.  కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరితే.. తాను మాత్రం   2006 లో  సొంతంగా తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశాననీ, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ అన్న విషయానికి తెలంగాణ సాధన ఉద్యమంలో అగ్రస్థానం కలిగేలా చేశాననీ చెప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ తాను ఇండిపెండెంట్ గానే పాల్గొన్నా నన్నారు.  తెలంగాణ ఆవిర్భవించి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ తీరులో మార్పు వచ్చిందని కవిత అన్నారు.  అప్పుడే తన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం తనకు కలిగిందన్న కవిత..  తన ఫోన్ ను తన భర్త పోన్ ను ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను అప్పుడే పార్టీ దృష్టికి తీసుకువచ్చినా తేలికగా తీసుకున్నారని కవిత చెప్పారు. అదే కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేయిస్తే తేలికగా తీసుకుంటారా అని ప్రశ్నించిన ఆమె,  మా ఇంట్లో పని చేస్తున్న ఒకరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో  సిట్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడే తన ఫోన్, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న విషయం అర్ధమైందన్నారు.  మహిళలకు అవకాశం ఇచ్చే విషయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సరిగా వ్యవహరించలేదని తండ్రి నిర్ణయాలను సైతం తప్పుపట్టిన కవిత.. కేసీఆర్ హయాంలో 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తే.. వారిలో కనీసం ఒక్క మహిళ కూడా లేని విషయాన్ని ఎత్తి చూపారు. ఆ నాడే తాను తన తండ్రిని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు.  ఇక హరీష్ రావుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. హరీష్ రావును తెలంగాణ చంద్రబాబుగా అభివర్ణించారు. ఏడాది ముగుస్తున్న సమయంలో ఆమె పాడ్ కాస్ట్ లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వచ్చే సంవత్సరం కవిత బీఆర్ఎస్ పై ఇప్పటి వరకూ చేస్తున్న యుద్ధం కొత్త పుంతలు తొక్కబోతోందన్న విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఇప్పటి వరకూ తన సోదరుడిని హరీష్ ముంచేస్తారు, తన తండ్రిని తప్పుదోవపట్టిస్తారు అంటూ వచ్చిన కవిత.. ఇప్పుడు మొత్తంగా పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా మొత్తం అందరిపైనా యుద్ధం ప్రకటించేసినట్లైంది. 

మెగా ఫ్యాన్స్ వర్సెస్ నాగబాబు.. జనసైనికులు ఎటువైపు?

జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబు కొద్ది కాలంగా ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు, వినిపించడం లేదు. అటువంటి నాగబాబు.. నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన కామెంట్లకు కౌంటర్ ఇవ్వడం ద్వారా ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. జనసేన ఎమ్మెల్సీగా.. ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు పని చేసుకుంటూ పోతున్న నాగబాబు.. శివాజీ కామెంట్లకు కౌంటర్ ఇచ్చి, మెగా ఫ్యాన్స్ కు టార్గెట్ గా మారారు. శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు  కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.   వాస్తవానికి మెగా కాంపౌడ్ అంత పటిష్ఠంగా ఉండటానికి నాగబాబే కారణమని అంటుంటారు, ఆయన నాగ‌బాబు లేకుండా మెగా కాంపౌండ్ ఇంత స్ట్రాంగా నిల‌బ‌డే ఛాన్స్ లేదనే వారు కూడా చాలా మంది ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి అయినా, మెగాపవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అయినా.. తాము మాట్లాడితే ఇబ్బంది అనుకునే విషయాలను నాగబాబు నోట పలికిస్తారని వారిని దగ్గరా తెలిసన వారు చెబుతుంటారు.   ఇందుకు ఉదాహరణగా అల్లు అర్జున్ గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసిన సందర్భంలో కానీ,  ఇండస్ట్రీలో చిరుకు మద్దతుగా గళం విప్పే అంశంలో కానీ నాగబాబు ఎలాంటి శషబిషలూ లేకుండా ముందుకు వచ్చిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ఇక తన స్వంత కుమార్తె నీహారిక విషయంలో ఆమె పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అండగా నిలబడిన ఉదంతాన్నీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నాగబాబును జనసేన నుంచి సస్పెండ్ చేయాలంటూ చేస్తున్న డిమాండ్ ను జనసైనికులు కొట్టి పారేస్తున్నారు. మహాళల వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో నాగబాబు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని ఆయనకు అండగా నిలబడుతున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ అనవసర అంశాన్ని ఇంకా పొడిగించకుండా కామైపోవడం మంచిదని హితవు చెబుతున్నారు.