సిక్కోలులో వైసీపీ సీన్ సితారే!.. తెలుగుదేశం, జనసేన కూటమి క్లీన్ స్వీప్ ఖరారే!

ఉమ్మ‌డి శ్రీ‌కాకుళం జిల్లాలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీకి గ‌ట్టి షాకిచ్చేందుకు ప్ర‌జ‌లు రెడీ అయిపోయారు. జిల్లాలో మొత్తం 10 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.  గ‌త ఎన్నిక‌ల్లో రెండు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే నాలుగున్న‌రేళ్ల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జావ్య‌తిరేక‌ పాల‌న‌పై ఉమ్మడి సిక్కోలు జిల్లా ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ఉద్దండులు ఉన్నారు. త‌మ్మినేని సీతారాం, ధ‌ర్మాన సోద‌రుల‌తో పాటు తెలుగుదేశం ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు వంటి బ‌డా రాజ‌కీయ నేత‌లు ఉన్నారు. వైసీపీ నుంచి సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నేత‌లు విజ‌యం సాధించినా జిల్లాలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వైసీపీ హ‌యాంలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌లు భూక‌బ్జాలకు పాల్ప‌డంతోపాటు, దౌర్జ‌న్యాల‌కు దిగినట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో కుటుంబ స‌భ్యుల పెత్త‌నం.. ఇలా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నూ  వైసీపీపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని పెల్లుబుకుతోంది. నాలుగున్న‌రేళ్ల వైసీపీ పాల‌న‌పై ఆగ్ర‌హంతో ఉన్న ప్ర‌జ‌లు తెలుగుదేశంకు మ‌ద్ద‌తుగా నిలుస్తామని బాహాటంగానే చెబుతున్నారు. అంతే కాకుండా టీతెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతుండ‌టంతో ఉమ్మ‌డి శ్రీ‌కాకుళం జిల్లాలో ఈ కూట‌మి క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఎలా ఉందంటే.. 

ఇచ్ఛాపురం: 

ఇచ్ఛాపురం నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంనుంచి తెలుగుదేశం  అభ్యర్థిగా  2014, 2019 ఎన్నిక‌ల్లో బెందాళం అశోక్ విజ‌యం సాధించారు. రానున్న ఎన్నికలలో కూడా ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా అశోక్ మ‌రోసారి బ‌రిలోకి దిగుతున్నారు. 2024 ఎన్నిక‌ల్లో అశోక్ ను ఓడించాల‌ని వైసీపీ అధిష్టానం ప‌ట్టుద‌ల‌తో ఉంది.  ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా పిరియా సాయిరాజ్ పోటీచేసి ఓడిపోయారు.  వైసీపీ అధిష్టానం సాయిరాజ్ ను త‌ప్పించి ఈసారి ఎన్నిక‌ల్లో ఆయ‌న స‌తీమ‌ణి పిరియ విజ‌య‌ను బరిలోకి దింపింది. అయితే  నియోజ‌క‌వ‌ర్గం వైసీపీలో అంత‌ర్గ‌త విభేదాల‌కు తోడు, జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక‌ పాల‌న‌పై  ప్ర‌జ‌ల్లో తీవ్ర‌వ్య‌తిరేక‌త ఆ పార్టీ విజయానికి అవరోధాలుగా మారియి. ఇచ్ఛాపురం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. దీనికి తోడు  జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త కలిసి  బెందాళం అశోక్ హ్యాట్రిక్ విజ‌యం సాధించడం ఖాయ‌మ‌న్న భావన స్థానికంగా బలంగా వ్యక్తమౌతోంది. 

పలాస:

ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి  తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి విజ‌యం ఖాయంగా క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా సీదిరి అప్ప‌ల‌రాజు బ‌రిలో నిలిచి టీడీపీ అబ్య‌ర్థి గౌతు శిరీష‌పై విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం అప్ప‌ల‌రాజుపై నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తమ‌వుతోంది. నాలుగున్న‌రేళ్ల కాలంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ఆయ‌న పూర్తిగా విఫలమయ్యారు.  దీనికితోడు భూక‌బ్జాల ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వైసీపీలోనూ అప్ప‌ల‌రాజుపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. గౌతు శిరీష గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ.. నాలుగున్న‌రేళ్లుగా ప్ర‌జ‌ల్లోనే ఉంటూ,  నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో కీల‌క భూమిక పోషిస్తున్నారు. మ‌రోవైపు తెలుగుదేశం శ్రేణుల‌కు అండ‌గా ఉంటూ వస్తున్నారు. ఆమెపై నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో సానుభూతి ఉండ‌టంతోపాటు ఆమెను గెలిపిస్తే నియోజ‌క‌వ‌ర్గం  అబివృద్ధి జ‌రుగుతుంద‌ని   భావిస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గౌతు శిరీష్ తెలుగుదేశం, జ‌న‌సేన కూటమిఅభ్య‌ర్థిగా బ‌రిలో నిలిస్తే విజయం నల్లేరు మీద బండినడకేనంటున్నారు. 

టెక్కలి: 

టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గం కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటేనని చెప్పాలి. రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ అంటూ  2014, 2019 ఎన్నిక‌ల్లో ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ఈ నియోజకవర్గం నుంచి విజ‌యం సాధించారు. మ‌రోసారి అచ్చెన్నాయుడు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక వైసీపీ నుంచి  దువ్వాడ శ్రీ‌నివాస్ రావు బ‌రిలో దిగుతున్నారు.  వైసీపీ అధిష్టానం ఆయ‌న్ను నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఇంచార్జిగా నియ‌మించింది.  దువ్వాడ‌కు మాస్ లీడ‌ర్‌గా పేరున్న‌ప్ప‌టికీ, వైసీపీలో  ఒక బలమైన వర్గానికి ఆయన పొడగిట్టదు.   ఆయ‌న స‌తీమ‌ణి దువ్వాడ వాణి నియోజ‌క‌వ‌ర్గ  వైసీపీలో కీల‌క నేత‌గా ఉన్నారు. ఆమెతోనూ దువ్వాడ శ్రీ‌నివాస్ కు విబేధాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. దీనికితోడు జ‌గ‌న్ పాల‌న‌పై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఏ విధంగా చూసినా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి విజయం తథ్యమని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదని స్థానికులే బాహాటంగా చెబుతున్నారు. 

పాతపట్నం:

పాత‌ప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నికల్లో వైసీపీ అభ్య‌ర్థిగా రెడ్డి శాంతి విజ‌యం సాధించారు. అయితే  ఆమెకు ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో ఎదురుగాలి వీస్తోంది. వైసీపీలో వ‌ర్గ విబేధాల‌కు తోడు, నాన్ లోక‌ల్ ముద్ర కారణంగా ఈసారి ఆమె ఎన్నిక‌ల బ‌రిలో నిలిస్తే ఓట‌మి ఖాయ‌మ‌ని వైసీపీ నేత‌లే బాహాటంగా చెబుతున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆమెను మార్చి కొత్త వారికి అవ‌కాశం ఇస్తుందన్న ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. ఇక తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్యర్థిగా  కలమట వెంకటరమణ మూర్తి బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది.  ప్ర‌స్తుతం ఆయ‌న నియోజకవర్గ తెలుగుదేశం   ఇంచార్జిగా ఉన్నారు.  పొత్తులో భాగంగా పాతపట్నం నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తే ఏమో కానీ, లేకుంటే తెలుగుదేశం అభ్యర్థిగా  కలమట వెంకటరమణ మూర్తి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డం ఖాయంగా క‌నిపిస్తున్నది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా ఎవ‌రు పోటీలోకి దిగినా విజ‌యం న‌ల్లేరుపై బండినడకేనని అంటున్నారు. 

శ్రీకాకుళం: 

శ్రీ‌కాకుళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. మ‌రోసారి వైసీపీ నుంచి ఆయ‌నే పోటీచేయ‌నున్నారు. అయితే, ఈసారి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఓట‌మి ఖాయ‌మ‌న్న వాద‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల నుంచే బలంగా వినిపిస్తోంది. ప్ర‌భుత్వ వ్యతిరేకతకు తోడు ధ‌ర్మాన గ్రాఫ్ కూడా రోజురోజుకు ప‌డిపోతుండటం స్పష్టంగా తెలుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో అ భివృద్ధి అన్నదే లేకపోవడం, ధర్మాన నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకపోవడంతో ప్రజాగ్రహం తీవ్రంగా ఉంది.  దీనికి తోడు వైసీపీలోని వ‌ర్గ‌ విభేదాలులు ధ‌ర్మాన‌కు మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.  ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన కూటమి అభ్య‌ర్థిగా గుండ ల‌క్ష్మీదేవి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. ఆమెపై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో సానుభూతి ఉంది. పొత్తులో భాగంగా జ‌న‌సేన ఓట్లు కూడా బ‌దిలీ అయితే ఆమె విజయం సునాయాసమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.     

ఆమదాలవలస: 

ఆముదాల వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో త‌మ్మినేని సీతారాం వైసీపీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించారు. ఆయ‌న ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ గా కొన‌సాగుతున్నారు. అయితే, నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌నపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. అభివృద్ధిని గాలికొదిలేశాన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీనికితోడు నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న కుటుంబ స‌భ్యుల జోక్యం ఎక్కువైంద‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. అలాగే త‌మ్మినేని తీరుప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీ నేత‌లు సైతం తీవ్ర ఆగ్రహంతో  ఉన్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా ఇక్కడ నుంచి కూన ర‌వికుమార్  మ‌రోసారి బ‌రిలోకి దిగుతున్నారు. త‌మ్మినేని ప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్న వ్య‌తిరేక‌త కూన ర‌వికుమార్ విజ‌యానికి దోహ‌దం కానుంది.  వైసీపీ ప్ర‌భుత్వంపైనా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికితోడు తెలుగుదేశం, జ‌న‌సేన పొత్తు రవికుమార్ విజయాన్ని ఖాయం చేసేసిందని పరిశీలకులు అంటున్నారు. 

ఎచ్చెర్ల:

ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా గొర్లె కిరణ్ కుమార్ పోటీ చేసి విజ‌యం సాధించారు. టీడీపీ అభ్య‌ర్థి కిమిడి కళా వెంకటరావు ఓట‌మి పాల‌య్యారు. ప్ర‌స్తుతం వైసీపీపై నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. జ‌గ‌న్ ప్ర‌జావ్య‌తిరేక‌త విధానాల‌కుతోడు స్థానిక ఎమ్మెల్యే తీరుపైనా ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.  నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ఆనవాలే లేకపోవడం,  వైసీపీలో వ‌ర్గ విభేదాలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి ఓట‌మికి కార‌ణాలుగా మార‌నున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సానుకూలత ఉంది. అయితే  టీడీపీ అభ్య‌ర్థిగా కిమిడి క‌ళా వెంక‌ట‌రావు బ‌రిలోకి దిగుతారా లేదా పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం ఈ సారి జనసేనకు కేయాయిస్తారా అన్న విషయంలో స్పష్టత లేదు. అయితే తెలుగుదేశం, జ‌న‌సేన కూటమి అభ్య‌ర్థిగా ఎవ‌రు బ‌రిలో నిలిచినా విజ‌యం త‌ధ్య‌మ‌న్నభావన నియోజకవర్గ ప్రజలలో వ్యక్తం అవుతోంది. 

నరసన్నపేట:

న‌ర‌స‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ  సిట్టింగ్ ఎమ్మెల్యేగా ధ‌ర్మాన కృష్ణ దాస్ ఉన్నారు. మ‌రోసారి ఆయ‌నే వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌బోతున్నారు. అయితే, వైసీపీ ప్ర‌భుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత ఆయన విజయానికి పెద్ద అవరోధంగా మారనుంది. అలాగే నియోజకవర్గంలో వైసీపీలోని గ్రూపు తగాదాలు కూడా ధర్మాన కృష్ణదాస్ కు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మ్మెల్యేగా  ధ‌ర్మాన కృష్ణదాస్ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్న ఆగ్రహం కూడా జనంలో వ్యక్తం అవుతున్నది.  నరసన్న పేట నుంచి గత ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా బగ్గు రమణ మూర్తి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఇక్కడ నుంచి  రామ్మోహ‌న్ నాయుడు బ‌రిలోకి దిగుతార‌న్న చ‌ర్చ జ‌రుగుతున్నది. తెలుగుదేశం, జనసేనల నుంచి  అభ్య‌ర్థిగా ఎవ‌రు బ‌రిలోకి దిగినా విజ‌యం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. 

రాజాం:

రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి కంబాల జోగులు విజ‌యం సాధించారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో రెండుసార్లు వైసీపీ అభ్య‌ర్థిగా ఆయ‌నే విజ‌యం సాధించారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో ఆయనకు ఎదురుగాలి వీస్తున్నది. ఎమ్మెల్యే పని తీరు పట్ల నియోజకవర్గ ప్రజలలో  తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో జగన్ కంబాల జోగులును తప్పించి  డాక్టర్ తాలె రాజేష్ ను అభ్యర్థిగా బరిలోకి దింపుతోంది.  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీకి  బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. రాజం నుంచి  కొండ్రు ముర‌ళి లేదా మాజీ స్పీకర్ ప్ర‌తిభాభార‌తి కుమార్తె గీష్మ‌ పోటీలో నిలిచే అవకాశం ఉంది. వీరిద్దరిలో ఎవరు అభ్యర్థిగా నిలిచినా విజయం నల్లేరు మీద బండినడకేనంటున్నారు.  

పాలకొండ:

పాల‌కొండ నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో వైసీపీ పట్ల తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. విశ్వ‌స‌రాయి వైసీపీ అభ్య‌ర్థిగా మ‌రోసారి బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. అయితే  ఆమె హ‌యాంలో నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికితోడు వైసీపీలో ఆమె వ‌ర్గ‌ పోరును ఎదుర్కొంటున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ  అభ్య‌ర్థిగా నిమ్మక జయకృష్ణ మ‌రోసారి బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది.   జ‌న‌సేన బ‌లంకూడా తోడుకానుండ‌టంతో నిమ్మక జయకృష్ణ విజ‌యం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.

కాకినాడ జిల్లాలో పవన్ పర్యటన.. పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం (జనవరి 8) నుంచి మూడు రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయ నున్నారు.  అలాగే  ప్రజాసమస్యలపై  అధికారులతో చర్చిస్తారు.  క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో  శుక్రవారం జరగనున్న  సంక్రాంతి సంబరాల్లో  పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.   అనంతరం  నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పవన్ కల్యాణ్ ప్రారంభిస్తారు. పిఠాపురం ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకుంటారు.  ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష, రంగరాయ మెడికల్ కాలేజీలో పలు శంకుస్థాపనల కార్యక్రమంలో  కూడా పాల్గొంటారు. 

కేంద్ర కేబినెట్ లోకి మరో తెలుగు మంత్రి.. ఎవరంటే?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాని మోడీ సమాయత్తమౌతున్నారన్న వార్తలు వినవస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చంద్రబాబు  అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి  పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా  కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.  ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు చొప్పున ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అయితే మరో పదవి కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ బెర్త్ టీడీపీకి దక్కే ఛాన్సు లభిస్తుండటంతో.. ఆ అదృష్టవంతుడు ఎవరన్న కోణంలో  ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చ నడుస్తోంది. కొన్ని కొన్ని ఈక్వేషన్ల ప్రకారం  రెడ్డి సామాజిక వర్గానికి ఈ బెర్త్ కేటాయించాలన్న డిమాండ్  బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగా  నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదలా ఉంటే.. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో  టీడీపీకి చెందిన వారు ఇద్దరు, బీజేపీ ఎంపీ ఒకరు ఉండగా, జనసేన మాకేం తక్కువ అంటూ కేంద్ర కేబినెట్ బెర్త్ కోసం డిమాండ్ చేస్తున్నదంటున్నారు.  జనసేన ఎంపీలిద్దరిలో  మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్ కాబట్టి ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్‌  కోరుతున్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి కేంద్ర కేబినెట్ బెర్త్ ఎవరికి లభిస్తుందో? 

జవాబుదారీతనం ఎవరికి ఉండాలి?

సమాజహితమే లక్ష్యంగా దశాబ్దాలుగా తమ రంగంలో కృషి చేస్తున్న తెలుగువన్, జమీన్ రైతు పత్రిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వాస్తవ వేదిక’.. నాయకులను ప్రశ్నిస్తూ, ప్రజలను మేల్కొలుపుతూ చరిత్రలో నిలిచిపోయే ప్రస్థానానికి నాంది పలికింది. తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.  జవాబుదారీ తనం ఎవరికి ఉండాలి? ప్రజలకా? పాలకులకా? అధికారులకా? ఎగ్జిక్యుటివ్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? తమ మేధాశక్తిని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు  ఎలా వాడుతున్నారు? పాలకుల తప్పులు కప్పడానికా; ప్రజల బాగు కోసమా? ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులు ఎవరు?  ఇత్యాది సూటి ప్రశ్నలను సంధించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగుతున్నవాస్తవ వేదిక గురువారం (జనవరి 8)న తెలుగువన్  యూట్యూబ్ చానల్ లో తప్పక వీక్షించండి. https://www.youtube.com/watch?v=dD8qZdp3WHU

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

రంగారెడ్డి జిల్లా  మీర్జాగూడ  సమీపంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత  చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.  మృతి చెందిన  విద్యార్థులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్‌లుగా పోలీసులు గుర్తించారు. కోకాపేట్‌లో బర్త్‌డే పార్టీలో పాల్గొని, తిరిగి వెడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.   కారులో మొత్తం ఐదుగురు ఐసీఎఫ్ ఏఐ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. వీరిలో నలుగురు మరణించగా, తీవ్రంగా గాయపడిన విద్యార్థిని నక్షత్ర తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.   

టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్

  ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశం అధ్యక్షులు గాడు అప్పలనాయుడు కుటుంబాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ మేరకు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలోని వారి నివాసానికి మంత్రి వెళ్లారు. ఈ సందర్భంగా గాడు అప్పలనాయుడు చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం గాడు అప్పలనాయుడు సతీమణి, జీవీఎంసీ రెండో వార్డు కార్పోరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన  గాడు చిన్ని కుమారి లక్ష్మితో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. భవిష్యత్ లో కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.   

క.వి.త అంటే?

క.  క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి చెందిన క‌విత‌.. ప్రొఫైల్  చూస్తే ఆమె త‌న‌కు తాను చెప్పే మాట‌.. కేసీఆర్, ప్రొ. జ‌య‌శంక‌ర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వ‌చ్చి.. అటు పిమ్మ‌ట జాగృతి అనే  క సంస్థ ఏర్పాటు చేశాన‌నీ, అప్ప‌టి వ‌ర‌కూ అనాథ‌గా ఉన్న బ‌తుక‌మ్మ‌ను త‌న నెత్తికి ఎత్తుకుని దేశ విదేశాల్లో ఫేమ‌స్ చేశాన‌ని అంటారు క‌విత‌.  ఇక ఉద్య‌మ కాలంలో ఆమె జాగృతి పేరిట బాగా పాపుల‌ర్ అయ్యారు. ఏది ఏమైనా క‌ల్వ‌కుంట్ల క‌విత‌గా స్థిర‌ప‌డ్డారు. ఉద్య‌మ య‌త్నం ఫ‌లించి.. తండ్రి ముఖ్య‌మంత్రిగా ఉండటంతో.. తాను కూడా ఎంపీగా ప్ర‌మోట్ అయ్యారు. ప్ర‌మోష‌న్ ల‌భించిన త‌ర్వాత క‌విత‌.. ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు. దీంతో ఆమెను ఎమ్మెల్సీని చేసింది పార్టీ. త‌న సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంపీ క‌విత నుంచి ఎమ్మెల్సీ క‌విత‌గా మారారు. ఇంత‌లో పార్టీ 2023 ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓడిపోవ‌డం.. కాంగ్రెస్ ఇక్క‌డ అధికారంలోకి రావ‌డంతో.. అతి ప్ర‌ధాన‌మైన ఘ‌ట్టం ముగిసిన‌ట్ట‌య్యింది ఆమె రాజ‌కీయ జీవితంలో. దీంతో త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతూ తండ్రికి లేఖ రాశారు క‌విత. ఇది బ‌య‌ట ప‌డ్డంతో మొత్తం గేమ్ ఛేంజ‌ర్ గా మారిపోయింది. ఈ వివాదం త‌ర్వాత పార్టీకి, ప‌ద‌వుల‌కు రాజీనామా ఇచ్చి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. త‌న త‌ట్టా బుట్టా స‌ర్దేసుకుని.. ఇక‌పై తాను బీఆర్ఎస్ క‌విత కాదు.. జాగృతి క‌విత అంటూ స్వ‌యం ప్ర‌క‌ట‌న‌లు చేశారు. వి.   అంటే విడిపోవ‌డం. క‌ల్వ‌కుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోవ‌డం. క‌విత జీవితంలో ఇది అత్యంత కీల‌క‌మైన మ‌లుపు. ఎప్పుడైతే ఆమె పార్టీ నుంచి బ‌య‌ట‌కొచ్చారో అప్ప‌టి నుంచీ కాంగ్రెస్ క‌న్నా మించి బీఆర్ఎస్ పై విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కు పెట్టారు. మ‌రీ ముఖ్యంగా త‌న బావ హ‌రీష్ ని చెడుగుడు ఆడుకున్నారు.  పార్టీలో ట్ర‌బుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హ‌రీష్ ని బ‌బుల్ షూటర్ అంటూ   అవ‌హేళ‌న చేశారు. హ‌రీష్ రాజ‌కీయ గిమ్మిక్కుల‌న్నిటినీ ఎండ‌గ‌ట్టారు. పార్టీకి అతి పెద్ద అడ్డంకి హ‌రీష్ రావ్ అంటూ తూర్పార బ‌ట్టారు. ఇక కాళేశ్వ‌రం అవినీతి మొత్తం హ‌రీష్ రావు పాప‌మే అంటూ దుయ్య‌బ‌ట్టారు. అంతేనా ఇటు సోద‌రుడు  కేటీఆర్, ఇంకో బావ సంతోష్ వంటి వారిని కూడా వ‌ద‌ల‌కుండా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వీటితో పాటు.. బీఆర్ఎస్ లోని ఎంద‌రో ఎమ్మెల్యేలపై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు చేసి వివాదాస్ప‌దం అయ్యారు. జాగృతి జ‌నం బాట అంటూ తెలంగాణ వ్యాప్తంగా యాత్ర‌లు చేసి.. బీఆర్ఎస్ లీడ‌ర్ల‌పై, మ‌రీ ముఖ్యంగా హ‌రీష్ పై   విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక స‌మ‌యంలో కాంగ్రెస్ లీడ‌ర్లు చేయాల్సిన ప‌ని క‌విత చేస్తున్నారా అన్న అనుమానం కలిగేలా ఆమె తీరు ఉంది.  కాంగ్రెస్ లీడ‌ర్లు కూడా క‌విత ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌మంటూ హ‌రీష్‌, కేటీఆర్ ల‌కు స‌వాల్ విసిరారంటే.. ఆమె విమర్శల ధాటి ఎంతగా ఉందో అర్ధమౌతుంది.  అయితే త‌న‌ది ఆస్తి కోసం పోరాటం కాద‌ని ఆత్మ‌గౌర‌వ‌ పోరాట‌మ‌నీ.. మండ‌లిలో క‌న్నీటి ప‌ర్యంత‌మై క‌విత‌..   ఎమోష‌న‌ల్ హైడ్రామాకు తెర‌లేపారు. త‌న ఎమ్మెల్సీ రాజీనామాను ఆమోదించ‌మ‌ని కోరారు. అన్న‌ట్టుగానే క‌విత రాజీనామా ఆమోదం పొందింది. త‌.    త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డ్డానికి కొత్త‌గా పార్టీ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు క‌విత‌. ఒక టైంలో గాంధీ భ‌వ‌న్ వైపు ఆమె అడుగులు ప‌డుతున్నాయ‌న్న మాట వినిపించినా.. 2028 ఎన్నిక‌ల్లో తన పార్టీ అయితే ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డం ఖాయమని చాటారు క‌విత‌. త‌న‌ది ఆత్మ‌గౌర‌వ పోరాట‌మంటోన్న క‌విత‌.. కాంగ్రెస్- బీజేపీ- బీఆర్ఎస్ వంటి హేమా హేమీల ముందు రాజ‌కీయంగా ఎంత మేర‌కు రాణించ‌గ‌ల‌రు? ఆమె చిర‌కాల వాంఛ సీఎం కావ‌డం  సాధ్య‌మ‌య్యే ప‌నేనా?  లేక  ష‌ర్మిళ‌లా ఆమె కూడా తేలిపోతారా? అన్న‌ది  క‌విత‌ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఆమె వెన‌క న‌డిచే నాయ‌క‌త్వాన్ని బ‌ట్టి  భవిష్య‌త్ రూపు దిద్ద‌కుంటుంది.

ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్

    ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. వీరిలో ధనియాల రాథ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి ఉన్నారు. మరో ఐదుగురు కార్పొటర్లు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వంగా కలిశారు.  మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటన రోజే కాంగ్రెస్ పార్టీలో చేరటంతో  రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను కేటీఆర్‌ సన్మానించారు.  

ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ల కొట్టివేత

ఐబొమ్మ రవి బెయిలు పిటిషన్లన నాంపల్లి కోర్టు కొట్టివేసింది. సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిపై ఐదు కేసులు నమోదైన సంగతి తెలిసిదే.  ఈ క్రమంలోనే ఈ కేసులలో ఐబొమ్మ రవిని పోలీసులు దఫాల వారీగా కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.  పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబం ధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. కేసుల విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో అతడికి బెయిలు లభిస్తే, దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.  అంతేకాకుండా ఐ బొమ్మ రవి విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని, ఇటువంటి సమయంలో రవికి బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశాలు  ఉన్నాయని, అదే జరిగితే  కేసు విచారణ   దెబ్బతింటుందని పోలీసులు పేర్కొన్నారు. రవి భారతదేశం లోనే అందుబాటులో ఉండేలా కస్టడీలో ఉంచడం అత్యవసరమని పోలీసుల తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం నాంపల్లి కోర్టు పోలీసుల వాదనలను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు రవి పై నమోదైన ఐదు కేసులకు సంబంధించి దాఖలైన అన్ని బెయిల్ పిటీషన్లను  కొట్టి వేసింది.  

భోగాపురం క్రెడిట్ వార్.. లైన్ లోకి విజయసాయి?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య జరుగుతున్న క్రెడిట్ వార్ లోకి వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి ఎంటరయ్యారు. అయితే ఆయన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ క్రెడిట్ లో తనకూ కొంత భాగం ఉందని మాత్రమే చెప్పారు. అలా చెప్పడంలో ఆయన వైసీపీనీ, ఆ పార్టీ అధినేత జగన్ ను పూర్తిగా విస్మరించారు. భోగాపురం విమానాశ్రయంలో ఫస్ట్ టెస్ట్ ఫ్లయిట్ ను స్వాగతిస్తూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు.  ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు. విజయసాయి ఈ వైఖరి పట్ల వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  పలువురు వైసీపీ మద్దతుదారులు విజయసాయిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీకి క్రెడిట్ దక్కకుండా అడ్డుపడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు.  సరే అది పక్కన పెడితే.. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ పరిస్థితి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ చందంగా అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ ఎంపీగా నాడు సభలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం గళమెత్తిన విజయసాయి.. ఇప్పుడు పార్టీ ప్రస్తావన కూడా లేకుండా తాను వ్యక్తిగత స్థాయిలోనే భోగాపురం కోసం మాట్లాడానన్నట్లుగా సోషల్ మీడియాలో పేర్కొనడం.. వైసీపీ విమర్శకులకు కొత్త శక్తిని ఇచ్చినట్లైంది. ఈ నేపథ్యంలోనే  నాడు విపక్ష నేతగా భోగాపురం వద్దంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. విమానాశ్రయాన్ని అడ్డుకోవడానికి చేయగలిగినంతా చేసి ఇప్పుడు తగుదునమ్మా అని క్రెడిట్ కోసం పాకులాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.  

ఉగాదికి కవిత కొత్త పార్టీ

  తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది. ఉగాదికి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పేరుతో పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాల ఇన్‌ఛార్జ్‌లు, కార్యదర్శులతో కవిత సమావేశమయ్యారు. జనం బాట కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ తెలుసుకున్నారు. పార్టీ పెడితే ప్రజల్లోకి బలంగా వెళ్లగలమా? లేదా? అన్న సలహాలు, సూచనలు కార్యకర్తలు, నాయకుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నూతన పార్టీతోనే పోటీ చేయనున్నట్లు కవిత వెల్లడించిన సంగతి తెలిసిందే.  శాసనమండలిలో భావోద్వేగంతో మాట్లాడిన కవిత పలు సంచలన విషయాలు వెల్లడించారు. అయితే  కవిత తన జిల్లాల పర్యటనలను వాయిదా వేసుకున్నారు. వాస్తవంగా  ఇవాళ నుంచి సిరిసిల్ల జిల్లాలో పర్యటించాల్సి ఉంది. తన అన్న కేటీఆర్ ​ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కవిత పర్యటన నేపథ్యంలో ఆసక్తి నెలకొంది.  జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే పార్టీ నాయకులందరు డిమాండ్​ చేస్తున్నారు.