ఏపీలో టీడీపీ.. తెలంగాణలో హస్తానికి అధికారం ! తెలుగు రాష్ట్రాల్లో సర్వే సంచలనం..
posted on Aug 20, 2021 @ 8:05PM
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారిపోతున్నాయి. తమకు ఎదురు లేదని భావించిన రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీల పరిస్థితి క్షేత్రస్థాయిలో దారుణంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అధికార పార్టీలపై రోజురోజుకు వ్యతిరేకత పెరిగిపోతుండగా... విపక్షాల గ్రాఫ్ దూసుకుపోతోంది. ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వం పాలనపై ఓ రేంజ్ లో ప్రజా వ్యతిరేకత కనిపిస్తుండగా.. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇటీవల జాతీయ స్థాయిలో ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్, స్టేట్స్ సర్వేల్లోనూ ఇదే ఫలితం వచ్చింది. జగన్ రెడ్డి పాలన బాగుందని కేవలం ఆరు శాతం ప్రజలు మాత్రమే చెప్పారంటే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఇక తెలంగాణలోనూ కేసీఆర్ ది అదే పరిస్థితి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఓ లోకల్ సంస్థ నిర్వహించిన సర్వేలోనూ సంచలన ఫలితాలు వచ్చాయి. అధికార పార్టీలపై తీవ్రమైన వ్యతిరేకత జనాల్లో కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు భంగపాటు తప్పదని తేలింది. ఏపీలో రెండు పార్టీల మధ్యే పోటీ కనిపించగా... తెలంగాణలో మాత్రం త్రిముఖ పోరు సాగనుందని సర్వే ఫలితాలను బట్టి అర్ధమవుతోంది. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ వెనుకబడిపోగా.. తెలంగాణలో అయితే ప్రస్తుతం పవర్ లో ఉన్న పార్టీ ఏకంగా మూడో స్థానానికి పడిపోవడం సంచలనంగా కనిపిస్తోంది.
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికార వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 151 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ అధికార పార్టీ భారీ ఆధిక్యాన్ని కనపరిచింది. తిరుపతి ఉప ఎన్నికలో దిమ్మతిరిగే మెజార్టీ సొంతం చేసుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాస్త డీలా పడిన ప్రతిపక్ష టీడీపీ.. ప్రస్తుతం ఫుల్ యాక్టివ్ అయింది. నిత్యం ఏదో అంశంలో జగన్ సర్కార్ ను ఇరకాటంలో పెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఏపీలో సమస్యలు కూడా అలానే ఉన్నాయి. జగన్ పాలన అస్తవ్యస్థంగా ఉందనే చర్చ సాగుతోంది. దీంతో ప్రజా సమస్యలపై పోరాడుతున్న టీడీపీ ఇమేజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. లోకల్ యాప్ సర్వేలోనూ ఇదే స్పష్టమైంది.
రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రశ్నకు టీడీపీకే ఎక్కువ ఓట్లు వేశారు ఏపీ జనాలు. టీడీపీ అధికారంలోకి వస్తుందని 44 శాతం మంది తమ అభిప్రాయం చెప్పగా.. వైసీపీ అధికారంలోకి వస్తుందని 43 శాతం మంది చెప్పారు. బీజేపీ-జనసేన అధికారంలోకి వస్తుందని 13.05 శాతం మంది యూజర్ల అభిప్రాయం వ్యక్తం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 50 శాతానికి పైగా ఓట్లు రాగా టీడీపీ కేవలం 37 శాతం ఓట్లు వచ్చాయి. లోకల్ యాప్ సర్వేలో టీడీపీకి గతంలో కంటే ఏడు శాతం ఓట్లు పెరగగా.. వైసీపీకి ఏడు శాతం ఓట్లు తగ్గిపోయాయి. రానున్న రోజుల్లో వైసీపీ ఓట్ల శాతం మరింతగా తగ్గవచ్చని సర్వే నిర్వహించిన ప్రతినిధులు అంచనా వేశారు. ఈ లెక్కన వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నది లోకల్ యాప్ సర్వే ద్వారా స్పష్టమవుతోంది.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం చేజిక్కించుకుంది. వరుసగా రెండో సారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు దక్కించుకుంది గులాబీ పార్టీ. కాంగ్రెస్ 18 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల తర్వాత సీన్ మరింతగా మారిపోయింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. దీంతో 119 సభ్యులన్న తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి కేవలం ఆరుగురు సభ్యులే మిగిలారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కారు పార్టీనే దూసుకుపోయింది. అయితే కొన్ని రోజులుగా మాత్రం సమీకరణలు మారిపోయాయి. కేసీఆర్ పాలనపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అందుకే విపక్షాలు ఎక్కడ ఆందోళన కార్యక్రమం చేసినా.. సభ పెట్టినా ప్రజలు పోటెత్తుతున్నారు.
లోకల్ యాప్ సర్వేలోనూ కేసీఆర్ సర్కార్ పరిస్థితి దారుణంగా ఉందని స్పష్టమైంది. అధికార పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రశ్నకు తెలంగాణ ఓటర్లు సంచలన తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దాదాపు 40 శాతం మంది ఓటేయగా.. అనూహ్యంగా రెండో స్థానంలో బీజేపీ నిలిచింది. బీజేపీ అధికారంలోకి వస్తుందని 34 శాతం మంది తమ అభిప్రాయం చెప్పారు. ఇక అధికార టీఆర్ఎస్ కు కేవలం 26 శాతం ఓటర్ల మద్దతు మాత్రమే వచ్చింది. ఇదే ఇప్పుడు గులాబీ నేతల్లో గుబులు రేపుతోంది. టీఆర్ఎస్ కు మూడో స్థానం రావడం రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోందని, కేసీఆర్ వ్యతిరేకులంతా ఆయనతో ర్యాలీ అవుతున్నారని సర్వేలో తేలింది. ఇదే ట్రెండ్ కొనసాగితే కాంగ్రెస్ ఆధిక్యం మరింతగా పెరుగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.