Read more!

పార్టీల కళ్ళల్లో నిప్పులు!

 

 

 

భారతీయ జనతాపార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య ఎన్నికల పొత్తు కుదరబోతోందన్న వార్తలు కాంగ్రెస్ దగ్గర్నుంచి సీపీఐ వరకూ అన్ని పార్టీల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేలా చేస్తున్నాయి. ఈ పొత్తు కుదరకూడదు దేవుడా అని దేవుణ్ణి నమ్మని కమ్యూనిస్టులు కూడా దణ్ణాలు పెట్టేసుకుంటున్నారు. పొత్తు చెడగొట్టడానికి తమకు సాధ్యమైనట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

 

బీజేపీ, టీడీపీ మధ్య పొత్తులు, సర్దుబాట్లు,  సీట్ల సంఖ్య విషయంలో కొద్దిగా ప్రతిష్టంభన ఏర్పడటంతో ఇక పొత్తు కుదరనట్టే అని వైపీసీ ఇంటి పత్రిక, ఛానెల్ పనికట్టుకుని ప్రచారం మొదలుపెట్టేసింది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా వుండాలని సైంధవుడిలా శాయశక్తులా కృషి చేస్తున్న కిషన్‌రెడ్డి బిహేవియర్ కూడా పొత్తును ఇష్టపడని పార్టీలకు ఆయుధంలాగా దొరికింది. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదరకుండా దేవుడు కూడా ఆపలేడని స్పష్టం కావడంతో ఇప్పుడు సదరు పార్టీలన్నీ ఏడుపు మొదలుపెట్టాయి.

కాంగ్రెస్ నాయకులయితే టీడీపీ, బీజేపీ పొత్తు ఏదో ఘోరమన్నట్టుగా మాట్లాడుతున్నాయి. జగన్ మీడియా ఇప్పటికీ తనవంతు కృషి చేస్తూనే వుంది. ఇక తాజాగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐ కూడా అల్లాడిపోతోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారాయణ అయితే బోలెడంత వెటకారంగా మాట్లాడుతున్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దంటూ తెలుగుదేశం పార్టీకి ఒక విజ్ఞప్తి కూడా చేసేశాడు. టీడీపీ, బీజేపీ పొత్తు ఈ పార్టీల బొచ్చెలో రాయి వేసే అవకాశాలున్నాయి. అందుకే ఇంతలా ఏడుస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.