ఓడినా నెల్లూరు ఓటర్ల మదిలో నిలుస్తున్న టిఎస్సార్‌?

ఉప ఎన్నికల్లో ఓటమి పాలైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో తిక్కవరపు సుబ్బరామిరెడ్డి గెలిచారు. ఆయన పేరు నెల్లూరు జిల్లాలో మారుమ్రోగుతోంది. ఎప్పుడో నెల్లూరు వదిలేసి విశాఖలో స్థిరపడిన ఆయన జన్మభూమి రుణం తీర్చుకోవాలని సంకల్పించటం నెల్లూరు జిల్లాలో పెద్ద చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు నెల్లూరు ఎంపీ టిక్కెట్టు ఇవ్వటం యాధృచ్ఛికం. అయితే ఎన్నికల ప్రచారం ప్రారంభంలోనే తన జన్మభూమి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్నారు. పార్టీ తనకు టిక్కెట్టు ఇచ్చి ఓ గొప్పఅదృష్టాన్ని కల్పించిందని టిఎస్సార్‌ మనస్ఫూర్తిగా చెప్పుకున్నారు. రాజకీయనాయకులందరూ ఇలానే మాట్లాడతారని నెల్లూరు ప్రజలు ఆయన్ని నమ్మలేదు. తాను హృదయపూర్వకమైన సేవనే నమ్ముతానని అంటూ నియోజకవర్గంలో ప్రజలందరూ తనకు బంధువులని అంటూ ఆయన అభిమానంగా పలకరించారు. టిఎస్సార్‌ నెగ్గితేనే సేవ చేస్తారని, ఓడిపోతే ఇచ్చిన మాట కూడా మరిచిపోతారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేసింది. అప్పట్లోనే టిఎస్సార్‌ తాను ఆచరించగలిగినదే చెబుతానని అన్నారే తప్ప వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారానికి సమాధానం మాత్రం చెప్పలేదు. నియోజకవర్గంలో ప్రచారం చేసేటప్పుడు తన నోటితో చెప్పిన ప్రతీహామీని ఒక పద్దతి ప్రకారం రాసుకున్నారు. ఏ చిన్న హామీనీ మరిచిపోకుండా రికార్డు చేసుకున్న సుబ్బరామిరెడ్డి ఎన్నికల ఫలితాలు ప్రకటించిన పదోనిమషమే నియోజకవర్గాన్ని వదిలేశారు. అలా నెల్లూరు వదిలేసిన ఆయన అక్కడ పరిచయమైన వారిని మాత్రం పలకరిస్తూనే వచ్చారు. ఢల్లీ చేరిన వెంటనే తనకున్న రాజ్యసభ సభ్యత్వం అధికారాన్ని, పలుకుబడిని ఇచ్చిన హామీల పరిష్కారానికి ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు.

 

 

అందుకే సేవకు గెలుపు ఒక్కటే అర్హత కాదని నమ్మిన టిఎస్సార్‌  ముందుగా కేంద్రస్థాయిలో అయ్యే పనులను పూర్తి చేయదలుచుకున్నారు. దానిలో భాగంగానే శ్రీకాళహస్తి`నడికుడి రైల్వేలైన్‌ మంజూరు చేయాలని ఆయన కేంద్ర రైల్వే మంత్రిని కోరారు. ఈ రైల్వేలైను వల్ల కలిగే ప్రయోజనాలు, ఆదాయం వంటి పలు అంశాలను ఆయన విశదీకరించారు. వీలైనంత త్వరగా బడ్జెట్‌లో పెడతానని రైల్వే మంత్రి హామీ ఇచ్చేంత వరకూ తన విలువైన సమయాన్నీ అక్కడ వెచ్చించారు. దీని తరువాత  మెట్టవాసులకు సాగు,తాగునీరు సమస్యను పరిష్కరిస్తానని సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. దాని ప్రకారం సోమశిల జలాలు తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. ఈ జలాలు తరలిస్తే ఎన్ని ఎకరాలు సస్యశ్యామలం అవుతాయో  మ్యాప్‌పాయింట్ల సహితంగా వివరిస్తూ ముఖ్యమంత్రిని ఆకట్టుకున్నారు.  అలానే నెల్లూరులో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీకి ప్రతిపాదనలు రూపొందించాల్సిన అవసరాన్నీ సిఎంకు వివరించారు. దీని వల్ల రోడ్ల మాలిన్యం తగ్గటమే కాకుండా మురికినీటిపారుదల వ్యవస్థ మెరుగవుతుందని స్పష్టం చేశారు. పైగా, వ్యాపారకేంద్రమైన నెల్లూరులో ప్రతీసెంటరులోనూ చెత్త కాలువల్లో చేరి వర్షాకాలం రోడ్లు మడుగులవుతున్నాయని తెలిపారు. దుర్గంధం ప్రబలి ప్రధానసెంటర్లలో నిమషం నిలబడలేని పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపారు. దీంతో సిఎం ఈ రెండు ప్రతిపాదనలకు సుముఖత వ్యక్తం చేశారు. వైద్యకళాశాల లేకపోవటం వల్ల నెల్లూరు జిల్లా నుంచి వైద్యవిద్యకు ఇతర జిల్లాలకు వెళుతున్న విద్యార్థుల ఇబ్బందినీ ఆయన సవివరంగా తెలియజేశారు. ఈ వైద్యకళాశాల కట్టించాలని గతంలో పలువురు చేసిన ప్రయత్నాలనూ, అక్కడ ఉన్న న్యాయవిద్యాకళాశాల, ఇంజనీరింగు కళాశాల పరిస్థితులనూ తెలిపారు. వైద్యకళాశాల  మంజూరు చేస్తే స్థానికంగా ఉండే వైద్యుల సంఖ్య పెరిగి రోగులకు సేవలు ఎలా అందుతాయో ఆయన వివరించిన తీరు కూడా ఆకట్టుకుంది. దీని విషయంలో కూడా సహకరిస్తామని టిఎస్సార్‌ హామీని తీసుకున్నారు. తానిచ్చిన మాట ప్రకారం సొంత డబ్బుతో కళాకారుల కోసం పది కోట్ల రూపాయల విలువైన ఓపెన్‌ ఆడిటోరియం నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. పెద్దాసుపత్రిలో రోగులకు షెడ్లు కట్టించి ఇచ్చేందుకు టిఎస్సార్‌ రూ.2.50కోట్లు కేటాయించారు. త్వరలో షెడ్ల నిర్మాణం కోసం భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తరుచుగా ప్రమాదాలను ఎదుర్కొంటున్న మత్స్యకారులకు సమాచారం అందించేందుకు  ప్రత్యేకంగా ఎఫ్‌ఎం స్టేషన్‌ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ నెరవేర్చుకునేందుకు ఆయన  కేంద్ర సమాచార శాఖా మంత్రి అంబికాసోనీ నుంచి అనుమతి కోరారు.  ఇచ్చిన హామీలు నెరవేర్చటం ద్వారా నెల్లూరు ప్రజల హృదయాలను టిఎస్సార్‌ గెలుచుకున్నారు. తరువాత ఎప్పుడు(2014) ఎన్నికలు జరిగినా ఈయన వేసుకున్న గట్టిపునాది విజయలక్ష్మిని వరించి పెడుతుందని నెల్లూరు ప్రజలే చెబుతున్నారు.

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

  సుబ్రతో రాయ్ అరెస్ట్ ... సహారా సంస్థ అధినేత సుబ్రతో రాయ్ ను నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా సంస్థ సేకరించిన డబ్బుల విషయంలో కోర్టు సుబ్రతో రాయ్ కు గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చింది. సహారా నుంచి స్పందన లేకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో ఇంతకుముందు వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు తమ ముందు హాజారు కావాలని సుబ్రతా రాయ్‌ని ఆదేశించింది. అయితే సుబ్రతా రాయ్ కోర్టు ఎదుట హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. సుబ్రతా రాయ్‌ని అరెస్ట్ చేసి తమ ముందు మార్చి 4లోగా హాజరుపర్చాలని సుప్రీం కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, తన తల్లి (95)కి ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఇంతకుముందు సుబ్రతా రాయ్ కోర్టును కోరారు. అయితే కోర్టు అతని వినతిని తిరస్కరించింది. సుబ్రతో రాయ్ ను శుక్రవారం లక్నోలో అరెస్ట్ చేశారని సుబ్రతో రాయ్ సీనియర్ అడ్వకేట్ రామ్ జట్మలాని సుప్రీం కోర్టుకు తెలిపారు.

విఫలమైన 'టి' కాంగ్రెస్

  విఫలమైన 'టి' కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పట్టుబట్టి మరీ విభజనను సాధించింది. అయితే ఈ విజయాన్ని తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ నియోజకవర్గాలలో విస్తృత ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. అయితే అటు ప్రెస్ మీట్ లు ఇటు రోడ్ షోలు నిర్వహిస్తూ సోనియా వల్లే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు తప్ప తమ తమ నియోజకవర్గాలలో పర్యటించలేదు. అలాగే జంపింగ్ జపాంగ్ లు కూడా ఎక్కువ అవుతుండటం కూడా కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్రలో ఎలాగూ గెలిచే అవకాశాలు లేకపోవడంతో తెలంగాణాలోనైనా కొన్ని సీట్లు రాబట్టుకోవాలని చూసింది. టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కెసిఆర్ మీద ఆశలు పెట్టుకుని విలీనానికి పట్టుబట్టింది. కానీ ఇప్పటికీ కెసిఆర్ ఎటూ తేల్చకుండా ఇంకా నాన్చుడుధోరణిలో ఉన్నారు. ఎలెక్షన్లు దగ్గరపడుతుండటంతో తాము అధికారంలోకి రావాలో, రాహుల్ గాంధీని పిఎం సీట్లో ఎలా కూర్చోపెట్టాలో తెలియక తలపట్టుకుంటుంది.

31న చంద్రబాబు పాదయాత్ర పునఃప్రారంభ౦

        చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు. వైద్యుల సూచన మేరకు చంద్రబాబు పాదయాత్రకు విరామం ప్రకటించారని వారు తెలిపారు. ఈ నెల 31 సాయంత్రం చంద్రబాబు యాత్రను పునఃప్రారంభిస్తారని వివరించారు. అలాగే ఇకపై పాదయాత్ర దూరం విషయంలోకూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇకపై రోజువారీ దూరాన్ని కూడా తగ్గించనున్నారు. ఇప్పటి వరకూ బాబు పాదయాత్ర 117 రోజులు పూర్తీ చేసుకుంది.

కాంగ్రెస్ ఎంపీలు భేటి: రాజీనామాలతో నేడు సోనియాకు లేఖ

      తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు. నిన్న పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎం.పి.లు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  స్పీకర్ ఫార్మట్‌లో ఈ రాజీనామాలను పార్టీ అధిష్ఠానానికి పంపించనున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. పదవులు తమకు ముఖ్యమం కాదని వారు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణకోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని వారు పేర్కొన్నారు. పదవులు చిత్తుకాగితంతో సమానమని ఎం.పి. మధుయాష్కి పేర్కొన్నారు.

నారీ నారీ నడుమ జగన్మోహనుడు

  తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది. ఇంట గెలవలేని జయప్రద, సమాజ్ వాది పార్టీ తరపున పోటీ చేసి తనకు బొత్తిగా పరిచయమేలేని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయి రచ్చ గెలిచింది. అయితే, అక్కడ ఈ మద్యనే పరిస్థితులు వికటించడంతో, మళ్ళీ మూటా ముల్లె సర్దుకొని రాష్ట్రానికి వచ్చేయడానికి నిర్నయించుకొన్నట్లు గత కొంత కాలంగా ప్రకటిస్తూన్నాకూడా, మన రాజకీయ పార్టీల నుండి ఆమెకు కనీస స్పందన కరువయింది. ఇక ఇలాగయితే లాభం లేదనుకొన్నఆమె తానే స్వయంగా ఏదో ఒక పార్టీని ఎంచుకొని తన రాజకీయ జీవితంలో ‘మరో ప్రస్తానం’ మొదలుపెట్టాలని నిర్ణయించుకొంది.   తెలుగుదేశం పార్టీకి ఎన్ని సిగ్నల్స్ పంపినా స్పందించకపోవడంతో, ఇటీవలే పత్రికలవారితో మాట్లాడుతూ ఇక్కడా అక్కడ సైకిలు పార్టీలు తనవంటి సినిమా తారలను పులిహోరలో కరివేపాకులా వాడుకొని వదిలేసాయని అటువంటి పార్టీలకు తానూ దూరంగా ఉండాలనుకొంటున్నట్లు ప్రకటించేసి తెలుగుదేశం పార్టీతో డిల్లీ నుండే తెగతెంపులు చేసేసుకొంది.   అయితే, ఇక మిగిలినవి తల్లీ పిల్ల కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణా సమస్యతో పుట్టెడు కష్టాల్లో ఉన్న తల్లి కాంగ్రెస్ ను నమ్ముకొంటే తనకీ అదేగతి పడుతుందని భావించిన ఆమె, రాష్ట్రంలో ప్రజాదారణ ఉన్న పార్టీలోనే తానూ జేరాలనుకొంటునట్లు ప్రకటించేసింది. అంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతం అందించినట్లే భావించవచ్చును. అక్కడ అయితే వయ్యారి గడుసు రోజమ్మ తనకు తోడుగా ఉంటుందని ఆమె భావించినా, ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయలేదా అనేది ఆమె ఆలోచించినట్లు లేదు. ఆమె కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే ఇక అప్పుడు 'నారీ నారీ నడుమ జగన్మోహనుడు' అని టైటిల్ వేసేసుకోవచ్చును. త్వరలో ఆమె చంచల్ గూడా జైలు నుండి తన రాజకీయ జీవితంలో మరో ప్రస్థానం జయప్రదంగా మొదలుపెట్టవచ్చునని సమాచారం.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా?: కేసిఆర్ ఫైర్

      జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు. చీము , నెత్తురు ఉన్న తెలంగాణ మంత్రులు , ఎమ్.పిలు , కిందిస్థాయి వరకు ఉన్న కాంగ్రెస్ వారంతా పార్టీని వదలాలని ” అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు మరిన్ని సంప్రతింపులు జరపాల్సి ఉందని  కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటన చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణపై చర్చలు ఒక నాటకం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నామనడం ఒక బూటకం అని అన్నారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటించినా కేంద్రం అనుకుంటే తెలంగాణ ఇవ్వవచ్చని అన్నారు.

కోటి సంతకాల కధకి సంజాయిషీలు

    వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది. సాధారణంగా విమర్శలు ఎదుర్కొన్న ఏ రాజకీయపార్టీ అయినా తనను తానూ రక్షించుకొనే ప్రయత్నంలో వెంటనే ఆ విమర్శలను ఖండించడమో లేక తనను సమర్దించుకోవడమో లేక దానికి ప్రతి విమర్శలు చేసి ఎదుర్కోవడమో చేస్తుంది. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ ఇదివరకు ఒకసారి కోటి సంతకాల సేకరణపై వచ్చిన విమర్శలకు స్పందించినప్పటికీ ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చినట్లు సమర్ధంగా లేదు. పార్టీకి సరయిన దశ దిశానిర్దేశం చేసే నాయకుడు లేక పోవడం వల్లనే ఈ జాప్యం అని చెప్పక తప్పదు. ఎట్టకేలకు, ఆ పార్టీకి చెందిన లీగల్ సెల్ కన్వీనర్ ఈ విధంగా స్పందించారు.   “సీబీఐను అడ్డంపెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు. ఈ విషయంపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. తనకు జరిగే అన్యాయాన్ని, అక్రమాలను రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి చెప్పుకునే హక్కు, అర్హత దేశంలోని ప్రతీ పౌరుడికి ఉన్నాయని.. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.”