ఆలస్యంగా అయినా అనుకున్నదే జరిగింది..
posted on Jan 2, 2023 @ 2:54PM
అనుకున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ళ క్రితం, 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం ప్రటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పై సోమవారం (జనవరి2) సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. అయిదుగురు సభ్యులు ఉన్న ధర్మాసనం సుదీర్ఘ విచారణ తరువాత పెద్ద నోట్ల రద్దు పైన తీర్పును వెలువరించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జస్టిస్ గవాయి సమర్ధించారు. నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8న కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ సరైనదేనని జస్టిస్ గవాయి తీర్పులో పేర్కొనారు. జస్టిస్ గవాయితో సహా నలుగురు న్యాయమూర్తులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు. కానీ, మరో న్యాయమూర్తి నాగరత్న జస్టిస్ గవాయ్ తీర్పుతో విభేదించారు.
2016 నవంబర్ 8న దేశ వ్యాప్తంగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని ప్రకటన చేశారు.ఇందుకు సంబంధించి ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు ఈ నిర్ణయంతో బ్యాంకుల ముందు బారులు తీరారు. దీని పైన రాజకీయంగానూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 58 పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత మాజీ ఆర్దిక మంత్రి చిదంబరం పిటిషనర్ల తరపు వాదనలు వినిపించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంలోని విధాన పరమైన లోపాలను ప్రస్తావించారు. ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దులో సరైన విధానం అనుసరించలేదంటూ సుప్రీం ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు.
ఇక, కేంద్రం సుప్రీం ధర్మానసం ముందు తన నిర్ణయాన్ని సమర్దించుకుంది. అపోహలతో కూడిన వాదనలను పిటిషనర్లు చేస్తున్నారంటూ అటార్నీ జనరల్ కోర్టుకు నివేదించారు. దీంతో అటు పిటిషనర్లు..ఇటు ప్రభుత్వ వాదనలు విన్న సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం 2016లో కేంద్ర పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన రికార్డులను తమకు సమర్పించాలంటూ గత డిసెంబర్ 8న కేంద్రం, ఆర్బీఐని ఆదేశించింది. నోట్ల రద్దు సమయంలో ఆర్బీఐకి కేంద్రం రాసిన లేఖలు.. ఆర్బీఐ నిర్ణయాలతో పాటుగా నోట్ల రద్దు ప్రకటనలకు సంబంధించి పైళ్లను సమర్పించాలని ఆదేశించింది. అనంతరం తీర్పును 2023 జనవరి 2 (సోమవారం)కు రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించి అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఒకే రకమైన తీర్పు ఇస్తుందా.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతాయా అనే ఉత్కంఠ కొనసాగింది.
అయితే, ఉత్కంఠకు తెరదించుతూ సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన 58 పిటిషన్లను కొట్టి వేసింది. డీమానిటైజేషన్పై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య సంప్రదింపుల తర్వాతే నోట్ల రద్దు నిర్ణయం వెలువడిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగ ధర్మాసనంలోని నలుగురు సభ్యులు పెద్ద నోట్ల రద్దును సమర్థించారు. జస్టిస్ నాగరత్న కేంద్రం నిర్ణయంతో విభేదించారు. పెద్ద నోట్ల రద్దు చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ చట్టబద్ధమైనదేనని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ నోటిఫికేషన్ విడుదల చేసే ముందు తగిన చర్యలు తీసుకున్నారని చెప్పింది. అలాగే రద్దు చేసిన నోట్ల బదిలీ కోసం ఇచ్చిన గడువు హేతుబద్ధం కాదని చెప్పలేమని పేర్కొంది.
అయితే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆశించిన లక్ష్యాలను సాధించిందా? అంటే, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ సహా కొందరు ప్రముఖ ఆర్థిక వేత్తలు ఇప్పటికీ, పెద్ద నోట్ల రద్దు ప్రకటిత లక్ష్యాలు నెరవేర లేదు సరికదా, అప్రకటిత అనర్ధాలు ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీశాయని అంటున్నారు. రాజకీయంగానూ పెద్దనోట్ల రద్దు ఇప్పటికీ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇప్పటికీ మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయి పోయిందని ఆరోపిస్తున్నారు. అయితే, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అయితే నేమి, అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలలో అయితేనేమీ ప్రజలు పెద్ద నోట్ల రద్దుకు ఆమోదం తెలిపారు. విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ, చేసిన వ్యతిరేక ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోలేదు.
నిజానికి 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద నోట్ల రద్దును ప్రధాన ఎన్నికల అస్త్రంగా చేసుకుంది, అయినా ఆ ఎన్నికల్లో బీజేపీ బలం మరింతగా పెరిగిందే కానీ, తరగలేదు. అంటే ఒక విదంగా పెద్ద నోట్ల రద్దుకు ప్రజాకోర్టులో అప్పుడే ప్రజామోదం లభించింది. ఇప్పడు న్యాయస్థానం ఆమోదం కూడా లభించింది. అయితే, అంత మాత్రం చేత పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నేరవేరినట్లేనా, పెద్దనోట్ల రద్దు వలన తలెత్తిన సమస్యలు సమస్యల కాకుండా పోయాయా ? రాజకీయ దుమారం ఇంతటితో అయినా సర్దు మనుగుతుందా అంటే, లేదనే అంటున్నారు.