గ్యాంగ్ స్టర్ నయీం కేసులో మరో సంచలనం
posted on Oct 3, 2020 @ 4:08PM
గ్యాంగ్ స్టర్ నయీం కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. నయీం కేసులో 25 మంది పోలీసులకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్చిట్ ఇచ్చింది. నయీంతో సంబంధాలున్నట్లు 25 మంది పోలీసులు ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ 25 మంది పోలీసులపై ల్యాండ్ సెటిల్మెంట్లు, బెదిరింపుల ఆరోపణలున్నాయి. అయితే, 25 మంది పోలీస్ అధికారులపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించని కారణంగా వారందరికీ సిట్ అధికారులు క్లీన్చిట్ ఇచ్చారు. ఈ మేరకు 25 పోలీసు అధికారుల పాత్రపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాసిన లేఖకు సిట్ చీఫ్ నాగిరెడ్డి శనివారం సమాధానమిచ్చారు.
కాగా, నయీం కేసులో సిట్ 175కి పైగా చార్జ్షీట్లు దాఖలు చేసింది. ఇందులో 130కి పైగా కేసుల్లో పోలీసులతో పాటు 8మంది ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉన్నట్టు పేర్కొంది. ఇందులో ఇద్దరు అడిషనల్ ఎస్పీలతో పాటు ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. తాజాగా వీరందరికి సిట్ క్లీన్చిట్ ఇచ్చింది.
మరోవైపు నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గవర్నర్ కు లేఖ రాసింది. ఈ కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నయీం ఇంట్లో దొరికిన డైరీలో ఉన్న వివరాలను ఇప్పటివరకు ఇవ్వలేదని, నాలుగేళ్లుగా కేసును సిట్ దర్యాప్తు చేస్తున్నా బాధితులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నేరస్తులకు శిక్ష పడాలంటే ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది.