సాయి ట్రస్టు ప్రభుత్వపరం కానుందా?
posted on Apr 6, 2011 @ 2:12PM
అనంతపురం: సత్యసాయిబాబా ఆరోగ్యం కోసం వేలాది మంది భక్తులు పూజలు, హోమాలు చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. సత్యసాయి ట్రస్టును తన స్వాధీనంలోకి తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ట్రస్టు సభ్యుల్లో సత్య సాయి సోదరుడు జానకీరామ్ కుమారుడు రత్నాకర్ మాత్రమే ఉన్నారు. సత్య సాయి బాబా తన వారసుడిని కూడా ప్రకటించలేదు. ఈ స్థితిలో పుట్టపర్తికి రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని మంగళవారం సాయంత్రమే పంపింది. ఈ బృందం సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వ్యవహారాలను అధ్యయనం చేస్తోంది. ఈ బృందం సత్యసాయి బాబా ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంతో పాటు ట్రస్టు ఆర్థిక వ్యవహారాలపై కూడా దృష్టి పెడుతుందని అంటున్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా కార్యక్రమాలను కొ నసాగించడానికి ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయనే విషయాన్ని ట్రస్టు సభ్యులతో మాట్లాడి సభ్యులు పరిశీలిస్తున్నారు. సత్య సాయి సెంట్రల్ ట్రస్టు స్వాధీనంలో పుట్టపర్తిలో విశ్వవిద్యాలయ సముదాయం, స్పెషాలిటీ ఆస్పత్రి, ప్రపంచ మత సంబంధం మ్యూజియం చైతన్య జ్యోతి, ప్లానిటోరియం, రైల్వే స్టేషన్, హిల్ వ్యూ స్టేడియం, సంగీత కళాశాల, పాలనా భవనం, విమానాశ్రయం, ఇండోర్ స్టేడియం, క్రీడాప్రాంగణం ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో 1,200 సత్య సాయిబాబా కేంద్రాలున్నాయి. ఇవి పాఠశాలలను, ఆరోగ్య, సాంస్కృతిక కేంద్రాలను నడుపుతున్నాయి. కాగా, ఆదాయం పన్ను శాఖ అంచనాల ప్రకారం సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 40 వేల కోట్ల విలువ చేస్తుంది. ట్రస్టుకు వచ్చే విరాళాలపై పూర్తిగా పన్ను రాయితీ ఉంది. విదేశాల నుంచి ట్రస్టుకు ఏటా వందలాది కోట్ల రూపాయల విరాళాలు వస్తాయి. జమాఖర్చుల వ్యవహారాలకు సంబంధించిన సరైన యంత్రాంగం ఉందా, లేదా అనే విషయంతో పాటు ట్రస్టును స్వాధీనంలోకి తీసుకునే విషయంపై కూడా సుబ్రహ్మణ్యం దృష్టి పెడతారని అంటున్నారు.