ఒక పార్టీ గుర్తుకు బదులు మరో పార్టీ గుర్తు.. ఓల్డ్ మలక్ పేటలో నిలిచిన పోలింగ్
posted on Dec 1, 2020 @ 11:02AM
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అసలే ఓటింగ్ శాతం మందకొడిగా నమోదవుతున్న వేళ.. అధికారులు చేసిన తప్పిదానికి ఓల్డ్ మలక్ పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది.
ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో సీపీఐ ఎన్నికల గుర్తు అయినటువంటి కంకి కొడవలికి బదులుగా, సీపీఎం ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి బ్యాలెట్ పేపర్ పై ముద్రితమైంది. సీపీఐ తరఫున ఈ డివిజన్ నుంచి పోటీ పడుతున్న ఫాతిమా.. తన పేరు పక్కన సీపీఎం గుర్తును చూసి అవాక్కై ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు జరపాల్సిందేనని ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల నేతలు పట్టుబట్టినా, ఎన్నికల సంఘం మాత్రం డివిజన్ మొత్తం పోలింగ్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. వీలైతే రేపే ఇక్కడ రీపోలింగ్ ను జరిపిస్తామని స్పష్టం చేసింది. కాగా, పార్టీ గుర్తులు మారిపోయిన విషయం దాదాపు 5 శాతం పోలింగ్ జరిగిన తరువాత వెలుగులోకి రావడం గమనార్హం.